Methanol: మిథనాల్‌ కలిపితే పెట్రోల్‌ చౌక

పెట్రోలులో 15 శాతం మిథనాల్‌ కలిపితే.. ఇప్పుడున్న ధరను లీటరుకు రూ.6-7 వరకు తగ్గించవచ్చని ప్రముఖ శాస్త్రవేత్త, నీతిఆయోగ్‌ సభ్యుడు వి.కె.సారస్వత్‌ పేర్కొన్నారు. ఎల్‌పీజీలో 20 శాతం డీఎంఈని కలిపితే దాని ధర కూడా

Updated : 08 Nov 2021 05:32 IST

ఈశాన్య రాష్ట్రాల్లో ఈ ప్రక్రియను జనవరిలో ప్రారంభిస్తున్నాం
బొగ్గు నుంచి మిథనాల్‌ ఉత్పత్తికి ప్లాంట్లు
‘ఈనాడు’ ప్రత్యేక ఇంటర్వ్యూలో నీతిఆయోగ్‌ సభ్యుడు వీకే సారస్వత్‌
ఈనాడు, అమరావతి

పెట్రోలులో 15 శాతం మిథనాల్‌ కలిపితే.. ఇప్పుడున్న ధరను లీటరుకు రూ.6-7 వరకు తగ్గించవచ్చని ప్రముఖ శాస్త్రవేత్త, నీతిఆయోగ్‌ సభ్యుడు వి.కె.సారస్వత్‌ పేర్కొన్నారు. ఎల్‌పీజీలో 20 శాతం డీఎంఈని కలిపితే దాని ధర కూడా బాగా తగ్గుతుందన్నారు. అమరావతిలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ రీసెర్చ్‌ అడ్వైజరీ కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ‘ఈనాడు’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం చేపట్టిన హైడ్రోజన్‌, మిథనాల్‌ ఎకానమీ ప్రాజెక్టులతోపాటు, విద్యుత్‌ వాహనాల వినియోగం పెంపునకు కృషి, హైపర్‌లూప్‌ సహా వివిధ అంశాలపై మాట్లాడారు. ముఖ్యాంశాలివీ..

లీటరుకు కనీసం రూ.6 ఆదా

ప్రస్తుతం పెట్రోలులో 10 శాతం ఇథనాల్‌ కలుపుతున్నాం. 2030 నాటికి దాన్ని 20 శాతానికి పెంచాలన్నది లక్ష్యం. దానికి సమాంతరంగా మిథనాల్‌ను ప్రత్యామ్నాయ ఇంధనంగా ప్రోత్సహించేందుకు నీతిఆయోగ్‌ భారీ కార్యక్రమం చేపట్టింది. మిథనాల్‌ను 5 నుంచి 15 శాతం కలపొచ్చు. మిథనాల్‌ ధర కిలో రూ.25-30 ఉంటుంది. పెట్రోల్‌లో 15 శాతం మిథనాల్‌ కలిపితే.. లీటరు ధరలో కనీసం రూ.6 తగ్గుతుంది. పైగా కర్బన ఉద్గారాలు 35 శాతం తగ్గుతాయి. మిథనాల్‌ను డీహైడ్రేట్‌ చేస్తే డీఎంఈ అవుతుంది. దాన్ని కలిపి, ఎల్‌పీజీ ధరను తగ్గించొచ్చు.

ఈశాన్యంలో ఎం15 ప్రారంభం

ఎం15 పేరుతో పెట్రోల్‌లో మిథనాల్‌ కలిపే ప్రాజెక్టును వచ్చే జనవరిలో ఈశాన్య రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టబోతున్నాం. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న సహజ వాయువు నుంచి మిథనాల్‌ ఉత్పత్తి చేసే ప్లాంట్లే దేశంలో ఉన్నాయి. మన దేశంలో విస్తారంగా దొరికే, బూడిద శాతం ఎక్కువగా ఉన్న బొగ్గు నుంచి మిథనాల్‌ ఉత్పత్తి చేసే విధానాన్ని హైదరాబాద్‌లోని బీహెచ్‌ఈఎల్‌ రూపొందించింది. అక్కడో పైలట్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేశారు. ఐఐసీటీ, ఐఐసీటీ దిల్లీ, థెర్మాక్స్‌ అనే ప్రైవేటు కంపెనీ కూడా దీనిపై పనిచేస్తున్నాయి. బొగ్గు నుంచి మిథనాల్‌ ఉత్పత్తి వచ్చే సంవత్సరం ప్రారంభమవుతుంది. కోల్‌ ఇండియా సంస్థ రోజుకు 3 వేల టన్నుల మిథనాల్‌ ఉత్పత్తి చేసే ప్లాంట్‌ నెలకొల్పేందుకు టెండర్లు పిలిచింది. మూడేళ్లలో ఇది సిద్ధమవుతుంది. వచ్చే ఐదు నుంచి ఏడేళ్లలో ఇలాంటి ప్లాంట్లు నాలుగు పెట్టాలన్నది లక్ష్యం. ఈశాన్య రాష్ట్రాల తర్వాత పుణె, బరోడా, ముంబయిల్లోనూ ఎం15 ప్రాజెక్టు ప్రారంభిస్తాం.  

ఆటోమేషన్‌తో ఉద్యోగాలు పోతాయన్నది అపోహే

ఇండస్ట్రీ 4.0 ప్రోగ్రాంలో భాగంగా.. పారిశ్రామికరంగంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, అగ్‌మెంటెడ్‌ రియాలిటీ, వర్చువల్‌ రియాలిటీ, డేటా మైనింగ్‌, ఆటోమేషన్‌ వంటి సాంకేతిక పరిజ్ఞానాల వినియోగాన్ని పెంచడంపై నీతిఆయోగ్‌ విశేష కృషి చేస్తోంది. ఆటోమేషన్‌ వల్ల ఉద్యోగాలు పోతాయన్న అపోహ చాలామందిలో ఉంది. ఇది వరకు శారీరక శ్రమ ఎక్కువగా ఉన్నచోట, ఇప్పుడు మేథతోనూ, సృజనతోనూ పని చేయాల్సి వస్తుందే తప్ప, నిరుద్యోగం పెరుగుతుందన్నది సరికాదు. కొత్త పరిజ్ఞానాలకు తగ్గట్టుగా నైపుణ్యాల్ని పెంచడంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది.

అన్నీ ఆలోచించే ప్రధాని ఆ మాటిచ్చారు

భారత్‌ను 2070 నాటికి నెట్‌ జీరో కార్బన్‌ దేశంగా మార్చుతామని, 2030 నాటికి పునరుత్పాదక ఇంధన వనరుల ఉత్పత్తిని 500 గిగావాట్లకు పెంచుతామని కాప్‌-26 సమావేశాల్లో ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. దీని వెనుక చాలా కసరత్తు జరిగింది. 2050 నాటికి దేశంలో శిలాజ ఇంధనాల వినియోగం గణనీయంగా తగ్గుతుంది. రాబోయే రోజుల్లో హైడ్రోజన్‌ ప్రధాన ఇంధన వాహకంగా మారుతుంది. మన గ్రిడ్‌లోకి కర్బనాన్ని వెలువరించే ఇంధనం ఏదీ రాకూడదన్నది లక్ష్యం. అలా జరగాలంటే దేశంలో ఉన్న థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టులు కార్బన్‌ డయాక్సైడ్‌, గ్రీన్‌హౌస్‌ గ్యాసెస్‌ని నియంత్రించేందుకు కార్బన్‌ క్యాప్చర్‌ యుటిలైజేషన్‌ అండ్‌ స్టోరేజ్‌ (సీసీయూ) టెక్నాలజీని ఏర్పాటు చేసుకోవాలి. దీని కోసం భారీ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం. సిమెంట్‌, ఉక్కు, ఎరువుల పరిశ్రమలు, రిఫైనరీల్లోనూ ఈ సాంకేతికతను వినియోగించాలి.


థర్మల్‌ పవర్‌ ప్లాంట్లు మూసేయం

దేశంలో ప్రస్తుతం 65-70 శాతం విద్యుత్‌ థర్మల్‌ ప్లాంట్లలోనే ఉత్పత్తవుతోంది. పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా 40 గిగావాట్లు మాత్రమే వస్తోంది. దీన్ని 175 గిగావాట్లకు చేర్చే లక్ష్యంతో పనిచేస్తున్నాం. కానీ మన అవసరాలకు 370- 380 గిగావాట్ల విద్యుత్‌ కావాలి. దేశం అభివృద్ధి చెందే కొద్దీ ఇంధన అవసరాలు మరింత పెరుగుతాయి. ప్రస్తుతం దేశంలో తలసరి విద్యుత్‌ వినియోగం 1200 యూనిట్లు ఉంది. అమెరికా, జపాన్‌ వంటి దేశాల్లో ఇది 5-6 వేలు ఉంది. కాబట్టి కాలుష్య నియంత్రణ చర్యలు చేపడుతూనే థర్మల్‌ ప్లాంట్లను కొనసాగిస్తాం. సబ్‌క్రిటికల్‌ ప్లాంట్లను సూపర్‌, అల్ట్రా క్రిటికల్‌ స్థాయికి ఆధునికీకరించాలి. నెలకొల్పి 25 ఏళ్లు దాటినా ఇంకా సమర్థంగా పనిచేస్తున్న ప్లాంట్లను కొనసాగించాలా, మూసేయాలా? అనే అంశంపై ఉన్నతస్థాయిలో చర్చ జరుగుతోంది. బాగా పనిచేసేవాటిని సీసీయూ సాంకేతికతను జోడించి, కొనసాగించేందుకే అవకాశం ఉంది.


లిథియం అయాన్‌ సెల్స్‌ ఉత్పత్తికి భారీ ప్రోత్సాహకాలు

దేశంలో విద్యుత్‌ వాహనాల వినియోగాన్ని గణనీయంగా పెంచేందుకు ఫేమ్‌-2 పేరుతో కేంద్ర ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలిస్తోంది. ప్రస్తుతం ఆ వాహనాల్లో వాడే పవర్‌ప్యాక్‌ల తయారీకి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం (పీఐఎల్‌ స్కీం) పెట్టింది. ప్రస్తుతం దేశంలోని సంస్థలు లిథియం అయాన్‌ సెల్స్‌ను విదేశాల నుంచి దిగుమతి చేసుకుని బ్యాటరీలు తయారుచేస్తున్నాయి. వాటి దిగుమతులు తగ్గించేందుకు కృషి జరుగుతోంది. దిగ్గజ కార్పొరేట్‌ సంస్థలు సోలార్‌, లిథియం అయాన్‌ ప్లాంటు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. ద్వి, త్రిచక్ర వాహనాల్లో బ్యాటరీలు చిన్నవిగా ఉంటాయి కాబట్టి బ్యాటరీ డౌన్‌ అయితే వాటిని మార్చి, కొత్తవి అమర్చుకోవడం చాలా తేలిక. వాటికి ఛార్జింగ్‌ స్టేషన్లు అవసరం లేదు. కియోస్క్‌లకు వెళ్లి ఆ బ్యాటరీ ఇచ్చేసి, రుసుము చెల్లించి, మరో బ్యాటరీ తీసుకుని వెళ్లిపోవచ్చు. అమరరాజా సంస్థ ఇప్పటికే కియోస్క్‌లు ప్రారంభించింది. కార్లు, వాణిజ్య వాహనాలకు అది సాధ్యం కాదు. అందుకే కేంద్ర ప్రభుత్వం భారీ సంఖ్యలో ఛార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు కృషి చేస్తోంది.

సెమీకండక్టర్ల దేశీయ ఉత్పత్తికి ఫౌండ్రీలు

ఆటోమొబైల్‌ రంగంలో సెమీకండక్టర్ల వాడకం గణనీయంగా పెరిగింది. వాటిని ప్రధానంగా అమెరికా, చైనా, తైవాన్‌, సింగపూర్‌ వంటి దేశాలు ఉత్పత్తి చేస్తున్నాయి. కొవిడ్‌ మహమ్మారి వల్ల ఉత్పత్తి తగ్గడంతో కొరత ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యను గుర్తించి దేశీయంగా సెమీకండక్టర్ల ఉత్పత్తికి ఫౌండ్రీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. చండీగఢ్‌లో ఇప్పటికే ఉన్న ఫౌండ్రీని ఆధునికీకరించనుంది. దీనిపై మూణ్నాలుగు నెలల్లో కీలక నిర్ణయం వస్తుంది. కొత్త ఫౌండ్రీ పెట్టాలంటే కనీసం 2-3 బిలియన్‌ డాలర్ల మూలధన పెట్టుబడి కావాలి. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతోనే అది సాధ్యం. విశాఖ, హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు, నోయిడా వంటి చోట్ల దీనికి అనువైన వాతావరణం ఉంది. మన దేశంలో ఫౌండ్రీలు ఏర్పాటయ్యేలోగా సమస్యను అధిగమించేందుకు ఇతర దేశాల్లోని ప్లాంట్లతో ఒప్పందాలేమైనా చేసుకోవాలా అనే దానిపై ఉన్నతస్థాయి కమిటీ పనిచేస్తోంది.

సొంతంగా హైపర్‌లూప్‌ టెక్నాలజీ అభివృద్ధి

‘హైపర్‌లూప్‌’ టెక్నాలజీ అభివృద్ధిపై నా ఆధ్వర్యంలో ఒక కమిటీ అధ్యయనం చేస్తోంది. వర్జిన్‌ హైపర్‌లూప్‌ అనే విదేశీ సంస్థ మహారాష్ట్ర, కర్ణాటకల్లో ప్రయోగాత్మకంగా ప్రాజెక్టు చేపడతామని ఆ రాష్ట్ర ప్రభుత్వాల్ని గతంలో సంప్రదించింది. వారి టెక్నాలజీని మా కమిటీ పరిశీలించింది. అదింకా అభివృద్ధి చేసే దశలోనే ఉంది. హైపర్‌లూప్‌ కచ్చితంగా సాధ్యమయ్యే ప్రాజెక్టే. కాకపోతే వ్యాక్యూమ్‌ ట్యూబ్‌లో గంటకు 800-900 కి.మీ.ల వేగంతో ప్రయాణించేటప్పుడు భద్రతాపరంగా చాలా అంశాలు చూసుకోవాలి. ఆ టెక్నాలజీ  భవిష్యత్తులో కచ్చితంగా అందుబాటులోకి వస్తోంది. హైపర్‌లూప్‌ సాంకేతికతలో మన దేశమే లీడర్‌గా ఉండాలన్నది లక్ష్యం. దీనిపై ఆర్‌డీఎస్‌ఓ, రూర్కీ యూనివర్సిటీలోని కాలేజ్‌ ఆఫ్‌ రైల్వేస్‌, మరికొన్ని యూనివర్సిటీలు కలిసి పనిచేస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని