Azadi Ka Amrit Mahotsav: బరక్‌పుర్‌ డబుల్‌ ధమాకా

ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం అనగానే అందరికీ 1857 నాటి పోరాటమే గుర్తుకొస్తుంది. కానీ, అంతకంటే ముందే 1824లోనే భారతీయ సిపాయిలు ఆంగ్లేయులపై తిరుగుబాటు చేశారని, బిందీ తివారీ దానికి సారథ్యం వహించారని చాలామందికి తెలియదు.

Updated : 30 Mar 2022 06:04 IST

ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం అనగానే అందరికీ 1857 నాటి పోరాటమే గుర్తుకొస్తుంది. కానీ, అంతకంటే ముందే 1824లోనే భారతీయ సిపాయిలు ఆంగ్లేయులపై తిరుగుబాటు చేశారని, బిందీ తివారీ దానికి సారథ్యం వహించారని చాలామందికి తెలియదు.

1824 నాటికి తొలి ఆంగ్లో-బర్మా యుద్ధం తీవ్రస్థాయిలో సాగుతోంది. ప్రస్తుత ఈశాన్య భారతంపై పట్టు కోసం ఈ యుద్ధం జరిగింది. మణిపుర్‌, అస్సాంలపై దాడి ద్వారా బ్రిటిష్‌ ఈస్ట్‌ ఇండియాతో బర్మా యుద్ధానికి దిగింది. తమ బెంగాల్‌ సైన్యాన్ని చిట్టగాంగ్‌లో యుద్ధానికి పంపించాలని ఈస్టిండియా కంపెనీ అధికారులు నిర్ణయించారు.

అప్పటి పలు సామాజిక కారణాలతో పాటు విదేశాల్లోనూ ఈస్టిండియా కంపెనీకి సేవలందించాలని ఉద్యోగ ఒప్పందంలో లేదు కాబట్టి తాము యుద్ధంలో పాల్గొనబోమని బెంగాల్‌ సైన్యంలోని మూడు రెజిమెంట్ల  సైనికులు తేల్చి చెప్పారు. నిజానికి ఈ కారణాల కంటే కూడా సైన్యం తరలింపులో ఆంగ్లేయుల వివక్ష భారతీయ సైనికులకు ఆగ్రహం తెప్పించింది. బ్రిటిష్‌ సైనికులను సకల సౌకర్యాలతో యుద్ధ భూమికి తరలించిన ఇంగ్లిష్‌ అధికారులు భారతీయ సిపాయిల వరకు వచ్చేసరికి ఎవరి ఏర్పాట్లు వాళ్లని చేసుకోమన్నారు. ఆయుధాలు, వంట సామగ్రి, వ్యక్తిగత లగేజీ అన్నింటినీ భుజాలపై మోసుకొని రావాలన్నారు. ఎడ్ల బండ్లు, గుర్రాలు, కంచర గాడిదలు ఇవ్వటానికి నిరాకరించారు. అప్పటికే మథుర నుంచి సుమారు 1,200 కిలోమీటర్లు నడిచి వచ్చిన సిపాయిలు బరక్‌పుర్‌ (ప్రస్తుత కోల్‌కతా శివారు సమీపం)లో ఆగిపోయి విశ్రాంతి తీసుకున్నారు.

సరైన సదుపాయాలు కల్పించడంతోపాటు విదేశంలో యుద్ధం కాబట్టి అదనపు భత్యం చెల్లించాలని కంపెనీకి షరతులు పెట్టారు. దీనికి ఆంగ్లేయ అధికారులు ససేమిరా అన్నారు. మోసే బరువు తగ్గాలంటే సరకులు తగ్గించుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. అంతే తప్ప సదుపాయాలు ఏర్పాటు చేసేది లేదన్నారు. ఈ అవమానం భారతీయ సిపాయిలను మరింతగా బాధించింది. బిందీ తివారీ అనే సైనికుడి సారథ్యంలో వీరంతా ఎదురుతిరగాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం తెలిసి మిగిలిన రెజిమెంట్లలోని భారతీయ సిపాయిలు కూడా అదే బాట పట్టడం మొదలుపెట్టారు. దీంతో ఆంగ్లేయ కమాండింగ్‌ ఆఫీసర్‌ జనరల్‌ డాల్‌ జెల్‌ కలకత్తాలోని కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ జనరల్‌ ఎడ్వర్డ్‌ పాగెట్‌ను సంప్రదించాడు.

ఆగ్రహంతో ఊగిపోయిన ఎడ్వర్డ్‌ పాగెట్‌  వెంటనే యూరోపియన్‌ బలగాలతో పాటు, గవర్నర్‌ జనరల్‌ వ్యక్తిగత బెటాలియన్‌ను సైతం రంగంలోకి దించాడు. బర్మాపై కాదు భారతీయ సిపాయులపై. 1824 నవంబరు 2న యూరోపియన్‌ సైన్యం.. బిందీ తివారీ బృందం బసచేసిన శిబిరం చుట్టూ రహస్యంగా మోహరించింది. పట్టువీడి లొంగి పోవాల్సిందిగా భారతీయ సిపాయిలకు ఎడ్వర్డ్‌ ఆదేశాలు జారీ చేశాడు. కానీ బిందీ తివారీ బృందం అందుకు అంగీకరించలేదు. చుట్టూ మోహరించిన ఆంగ్లేయ సైనికులు...  భారతీయ సిపాయిలపై ఎలాంటి హెచ్చరికలు లేకుండానే కాల్పులు ప్రారంభించారు. ఇది ఊహించని భారతీయ సిపాయిలు తేరుకునేలోపే చాలామంది నేలకొరిగారు. మరికొందరు ప్రాణాలు కాపాడుకోవడానికి  హుగ్లీ నదిలోకి దూకేశారు. మరికొంతమంది దగ్గర్లోని ఇళ్ల[్లలోకి వెళ్లి దాక్కున్నారు. కానీ ఆంగ్లేయ సైనికులు నిర్దాక్షిణ్యంగా వారందరినీ వెతికి వెంటాడి మరీ చంపేశారు. అంతేకాకుండా వారికి ఆశ్రయమిచ్చిన కుటుంబాల్లోని పిల్లలు, మహిళలను కూడా హతమార్చారు. వారి చేతిలో దాదాపు 180 మంది ప్రాణాలు కోల్పోయారు. తివారీతోపాటు పట్టుబడ్డ 11 మందికి ఉరిశిక్ష విధించారు. వీరిలో నాయకుడు తివారీని చంపి... ఊరి మధ్యలోని మర్రిచెట్టుకు వేలాడదీశారు. ఎంత దారుణంగా అంటే శవం కుళ్లిపోయే దాకా అలాగే ఉంచారు. తద్వారా మళ్లీ ఎన్నడూ ఎవ్వరూ తమకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే ఆలోచన కూడా చేయకుండా భయపెట్టేలా వ్యవహరించారు.


ఈ దుర్ఘటన తర్వాత చాలామంది భారతీయ సిపాయిలు ఆంగ్లేయ సైన్యాన్ని విడిచి పెట్టేశారు. బెంగాల్‌ నేటివ్‌ ఇన్‌ఫాంట్రీ 47వ బెటాలియన్‌ను రద్దు చేసింది కంపెనీ. భారతీయ సైనికాధికారులు, సిపాయిలని తొలగించారు. దీనిపై బ్రిటిష్‌ పార్లమెంట్‌లోనూ చర్చ జరిగింది. సమగ్ర విచారణకు ఆదేశించారు. కానీ సహజంగానే ఆంగ్లేయ అధికారులు తమ వాళ్లను సమర్థించుకున్నారు. ఆరు నెలల తర్వాత కొంతమంది సిపాయిలు ఊరిలోని మర్రిచెట్టు వద్ద తివారీ విగ్రహం ఏర్పాటు చేశారు. బరక్‌పుర్‌ కంటోన్మెంట్లో ఇప్పటికీ ఆ విగ్రహం ఉంది. దాన్ని బాబా బిందీ ఆలయంగా పిలుస్తారు. అలా ఆంగ్లేయులు అత్యంత క్రూరంగా తిరుగుబాటును అణచి వేసినప్పటికీ, ప్రజల్లో భయభ్రాంతులు నింపాలనుకున్నప్పటికీ... 1857లో మంగళ్‌ పాండే ద్వారా సిపాయిల తిరుగుబాటు రూపంలో ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం ఇదే బరక్‌పుర్‌ నుంచి మొదలవడం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని