Azadi Ka Amrit Mahotsav: చెట్లే పూటకూళ్లమ్మలై..!

గాంధీజీ చూపిన అహింసా మార్గం ప్రజల్లోని సృజనను వెలికితీసింది. ఆంగ్లేయులు ఎన్ని ఆంక్షలు విధిస్తున్నా... వాటికి విరుగుడు కనుక్కోవడం ప్రారంభించారు. అందుకు ప్రత్యక్ష నిదర్శనం దక్షిణాదిన జరిగిన వేదారణ్యం సత్యాగ్రహం.

Updated : 17 Apr 2022 06:24 IST

గాంధీజీ చూపిన అహింసా మార్గం ప్రజల్లోని సృజనను వెలికితీసింది. ఆంగ్లేయులు ఎన్ని ఆంక్షలు విధిస్తున్నా... వాటికి విరుగుడు కనుక్కోవడం ప్రారంభించారు. అందుకు ప్రత్యక్ష నిదర్శనం దక్షిణాదిన జరిగిన వేదారణ్యం సత్యాగ్రహం.

దండియాత్ర స్ఫూర్తితో దేశవ్యాప్తంగా ఉప్పు చట్టం ఉల్లంఘన ఉవ్వెత్తున కొనసాగింది. గాంధీజీకి సన్నిహితుడైన సి.రాజగోపాలాచారి (రాజాజీ) తమిళనాడులో ఈ యాత్రను చేపట్టారు. దండిలో గాంధీజీ యాత్ర ముగిశాక 1930 ఏప్రిల్‌ 13న రాజాజీ ఈ సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. తిరుచిరాపల్లి నుంచి తంజావూరు జిల్లాలోని వేదారణ్యం అనే సముద్ర తీరప్రాంత గ్రామం దాకా 240 కిలోమీటర్ల పొడవున దీన్ని చేపట్టాలని ప్రణాళిక రచించారు. ఖాదీ ప్రాధాన్యం వివరిస్తూ, కులవివక్షకు వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యపరుస్తూ యాత్ర సాగింది. ఎంపిక చేసిన 150 మంది యువకులతో రాజాజీ ముందునడిచారు. పాద యాత్రికులెవ్వరూ కాఫీ తాగరాదని, పొగాకు, సిగరెట్లు ముట్టుకోవద్దని నిబంధన పెట్టారు. మరోవైపు మద్రాసులోని ఆంగ్లేయ సర్కారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సత్యాగ్రహాన్ని దెబ్బతీయాలని నిర్ణయించుకుంది. వేదారణ్యం యాత్రకు సహకరించినవారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. అందులో నడుస్తున్న వారికి ఆహారం ఇచ్చినా, వారికి వసతి కల్పించినా శిక్ష తప్పదని ప్రజలను కలెక్టర్లు హెచ్చరించారు. పిల్లలు పాల్గొనకుండా కట్టడి చేయాలని తల్లిదండ్రులకు స్పష్టంచేశారు. స్థానిక భాషలో కరపత్రాలు ముద్రించి మరీ పంపిణీ చేశారు. ఈ యాత్ర వార్తలు ప్రచురించకుండా పత్రికలపైనా ఆంక్షలు విధించారు.

తిండి పెడితే ఆరు నెలల జైలు

తంజావూరు చేరగానే... ఆ జిల్లా కలెక్టర్‌ జె.ఎ.థోర్న్‌ యాత్రను ఎలాగైనా భగ్నం చేయాలనే పట్టుదల ప్రదర్శించారు. రాజాజీ అనుచరులకు తిండి పెట్టిన వారికి, వసతి కల్పించిన వారికి ఆరు నెలల కఠిన కారాగార శిక్షతోపాటు జరిమానా విధిస్తామని ఊరూరా హెచ్చరించారు. కానీ... కుంభకోణంలో పంతులు అయ్యర్‌ అనే దేశభక్తుడు కలెక్టర్‌ ఆదేశాలను ఉల్లంఘించి వసతి కల్పించారు. వెంటనే ఆయన్ని అరెస్టు చేసి, జైలుకు పంపించారు. ఆయన బాటలోనే పయనించిన కొందరు ప్రభుత్వ ఉద్యోగులనూ కొలువుల నుంచి తొలగించారు. ఏప్రిల్‌ 25న యాత్ర తిరుత్తురాయ్‌పూండికి చేరగానే పోలీసుల ఆంక్షలు పెరిగాయి. దీనికితోడు అక్కడ వసతి కల్పించిన ప్రముఖ నాయకుడు రామచంద్ర నాయుడును కూడా అరెస్టు చేయడంతో స్థానికుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. దీంతో రామచంద్రం పిళ్లై అనే గాంధేయవాది బుర్రలో ఓ సరికొత్త ఆలోచన మెదిలింది. అరెస్టు కాకుండా, పోలీసులు ఏమీ అనడానికి అవకాశం ఇవ్వకుండా... వేదారణ్యం యాత్రికులకు కడుపు నిండేలా పథకం రచించారు. ప్రజలు నేరుగా ఆహారం అందిస్తే నేరం కాబట్టి... ఆహారాన్ని పొట్లాల్లో కట్టి, సంచుల్లో పెట్టి యాత్రికులు వెళుతున్న దారిలో చెట్లకు వేలాడదీశారు. ప్రతి ఊరిలో ఈ చెట్లే పూటకూళ్లమ్మలై సత్యాగ్రహుల ఆకలి తీర్చాయి. కావేరీ నది ఒడ్డున కొన్నిచోట్ల ఆహార పాత్రలను సైతం భద్రంగా పాతిపెట్టారు. అవి ఎక్కడున్నాయో పాదయాత్రికులకు తెలిసేలా సంకేతాలు ఏర్పాటు చేశారు. మరోవైపు యాత్రను దెబ్బతీయటానికి వచ్చిన ఆంగ్లేయ అధికారులు, పోలీసులకు... స్థానికులు సహాయ నిరాకరణ మొదలు పెట్టారు.

ఆజ్ఞల ఉల్లంఘన

అడ్డంకులను అధిగమిస్తూ ఏప్రిల్‌ 28న రాజాజీ బృందం వేదారణ్యం చేరుకుంది. 30న శాసనోల్లంఘన చేసి, ఉప్పు తయారు చేస్తామని ప్రకటించింది. దీన్ని కలెక్టర్‌ థోర్న్‌ సవాలుగా తీసుకున్నారు. వారిని ఎలాగైనా నిలువరించాలని ఆదేశించారు. 30న భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు. వారంతా ఉప్పు తయారీ కేంద్రం వద్దకు చేరుకోగానే రాజాజీ బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. లొంగిపోవాల్సిందిగా కోరారు. వినకపోవడంతో అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. రాజాజీకి ఆరు నెలల జైలు శిక్ష విధించారు. మరుసటి రోజు... ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. పోలీసుల అరెస్టులు, బెదిరింపులను ఎదిరిస్తూ... ఉప్పును చేతపట్టారు. అలా రాజాజీ లక్ష్యాన్ని ప్రజలంతా నెరవేర్చారు. తర్వాత వందల మందిని కలెక్టర్‌ అరెస్టు చేయించి, జైళ్లకు పంపించారు. చాలామందికి రెండేళ్ల జైలు శిక్ష పడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని