Azadi Ka Amrit Mahotsav: ఫ్రాన్స్‌తో యుద్ధం... భారత్‌లో దోపిడీ

అది ఇంగ్లండ్‌లోని యార్క్‌షైర్‌. వస్త్ర పరిశ్రమలో కార్మికుడైన అతని పిల్లలు అర్ధాకలితో నిద్రపోతున్నారు. తినడానికి రేపటికి ఇంట్లో ఏమీలేవని భార్య వాపోతోంది. అతని ఉద్యోగం పోయి అప్పటికే నెలరోజులైంది. ఇక తప్పదు... నేను సైన్యంలో చేరిపోతా.

Updated : 18 Apr 2022 05:32 IST

ది ఇంగ్లండ్‌లోని యార్క్‌షైర్‌. వస్త్ర పరిశ్రమలో కార్మికుడైన అతని పిల్లలు అర్ధాకలితో నిద్రపోతున్నారు. తినడానికి రేపటికి ఇంట్లో ఏమీలేవని భార్య వాపోతోంది. అతని ఉద్యోగం పోయి అప్పటికే నెలరోజులైంది. ఇక తప్పదు... నేను సైన్యంలో చేరిపోతా. కొన్నిరోజుల వరకు మీ రొట్టెలను మీరే సంపాదించుకోండని ధైర్యం చెప్పాడు. దేశంలోని లక్షల కుటుంబాలది ఇదే పరిస్థితి. ఫ్రాన్స్‌తో ఇంగ్లండు చేస్తున్న యుద్ధాలే ఇందుకు కారణం. ఐరోపాకు ఎగుమతులు ఆగిపోయాయి. పరిశ్రమలు మూతపడ్డాయి. ధరలు ఆకాశాన్నంటాయి. పేదరికం పెరిగిపోయింది... ఇలా దాదాపు పతనం అంచుకు వెళ్లిపోయిన ఇంగ్లండ్‌ ఒక్కసారిగా పుంజుకుంది. ప్రపంచంపై ఆధిపత్యాన్ని చెలాయించింది. రెండు ప్రపంచ యుద్ధాలనూ అలవోకగా ఎదుర్కొంది. ఎలాగంటే...
భారత్‌ను గుప్పిట పెట్టుకున్న ఈస్టిండియా కంపెనీ వాటాదారుల డాబుసరిని చూసి ఇంగ్లండులోని వ్యాపారులకు కన్నుకుట్టేది. అదేసమయంలో 1803-15 మధ్య ఫ్రాన్స్‌తో జరిగిన యుద్ధాల కారణంగా బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. యుద్ధ ఖర్చుల కోసం పన్నులు పెంచాల్సి వచ్చింది. పైగా పరిశ్రమల్లో యాంత్రీకరణతో కార్మికులను తొలగించారు. ఈ పరిణామాలు ఇంగ్లండు ప్రజల్లో తీవ్ర అశాంతిని రేకెత్తించాయి. మరోవైపు ఈస్టిండియా కంపెనీకి ఇబ్బడిముబ్బడిగా లాభాలు పెరిగాయి. ఈ కంపెనీలో వాటాలు లేని ఆంగ్లేయ వ్యాపారులు ఆందోళన చేశారు. దాంతో భారత్‌లో వర్తకం చేసే హక్కును వారికి కూడా కల్పిస్తూ 1813లో ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.

అదేంటి... ఎవరూ కొనరేంటి...?

రకరకాల వస్తువులను ఓడల్లో వేసుకుని, పొలోమంటూ భారత్‌ వచ్చిన వర్తకులకు తీవ్ర ఆశాభంగం కలిగింది. బ్రిటన్‌ వస్తువులతో పోలిస్తే భారతీయ వస్తువులు నాణ్యంగా, ఆకర్షణీయంగా ఉండటం, పైగా 60% తక్కువ ధరలకే లభిస్తుండటంతో అవాక్కయ్యారు. దీంతో బ్రిటిష్‌ పార్లమెంటు... భారత్‌ నుంచి ఐరోపాకు ఎగుమతయ్యే అన్ని వస్తువులపై 80% సుంకం విధించింది. ఇంగ్లండ్‌ నుంచి భారత్‌కు వచ్చే దిగుమతులపై సుంకాలను పూర్తిగా ఎత్తేసింది. ఇంగ్లండ్‌లో పట్టువస్త్రాలు, కలంకారీ వస్త్రాల విక్రయాలను నిషేధించింది. ఫలితంగా... ధర్మవరం, పెద్దాపురం, శ్రీకాకుళం, బరంపురంలోని పట్టు వస్త్రాలకు గిరాకీ పడిపోయింది. మచిలీపట్నంలో కలంకారీ కళ ఆదరణ కోల్పోయింది. ఢాకా, ముర్షీదాబాద్‌లలో వస్త్రపరిశ్రమ కుదేలైంది. 1814లో ఇండియాలో దాదాపు 10 లక్షల మీటర్ల వస్త్రాలను విక్రయించిన ఆంగ్లేయ వ్యాపారులు... 1835కు వచ్చేసరికి ఏకంగా సుమారు 5కోట్ల మీటర్ల వస్త్రాన్ని విక్రయించారు. అదేసమయంలో 1814లో భారత్‌ నుంచి ఇంగ్లండ్‌కు సుమారు 12 లక్షల మీటర్ల వస్త్రాలు ఎగుమతవగా 1835 వచ్చేసరికి అది 60 వేల మీటర్లకు పడిపోవడం గమనార్హం.

వృత్తి పన్నుతో మోత  

సుంకాల కారణంగా భారత్‌ నుంచి ఇంగ్లండ్‌కు ఎగుమతులు తగ్గడంతో ఈస్టిండియా కంపెనీ ఆదాయం పడిపోయింది. దాన్ని పెంచుకోవడానికి భారతీయులను మోతర్పా(వృత్తి) పన్నుతో బాదారు. వ్యాపారాలపై మాత్రమే విధించే పన్నును తొలిసారి ఇళ్లలో సొంతంగా చిన్నచిన్న వృత్తిపనులు చేసుకునే వారి నుంచీ వసూలు చేశారు. కులవృత్తుల వారికి, రెండెడ్ల బండ్లున్న వారికి, ఇంటింటికీ తిరిగి కూరగాయలు విక్రయించే వారికి ఏడాదికి రూ.2 చొప్పున, గీత కార్మికులకు పది అణాల చొప్పున, వ్యాపారులకు రూ.6-12 చొప్పున విధించి... భారతీయులను పీల్చి పిప్పిచేశారు. తమ దేశానికి ప్రతి ఏడాదీ లక్షల రూపాయలను ఓడల్లో తరలించుకుపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని