Azadi Ka Amrit Mahotsav: తెల్ల బిచ్చగాళ్లు!

నాగరికులమని, ఆధునికులమని... భారతీయులను ఉద్ధరించడానికి వచ్చినవారమని డప్పు కొట్టుకున్న బ్రిటిష్‌ సర్కారు గాలిని వారి దేశస్థులే తీసేశారు. బలగాల్లో చేరడానికి భారత్‌కు తరలివచ్చిన అనేక మంది యూరోపియన్లు చివరకి...

Updated : 19 Apr 2022 06:33 IST

నాగరికులమని, ఆధునికులమని... భారతీయులను ఉద్ధరించడానికి వచ్చినవారమని డప్పు కొట్టుకున్న బ్రిటిష్‌ సర్కారు గాలిని వారి దేశస్థులే తీసేశారు. బలగాల్లో చేరడానికి భారత్‌కు తరలివచ్చిన అనేక మంది యూరోపియన్లు చివరకి... తెల్ల మనుషుల నల్ల మనసును ప్రపంచానికి చాటారు. భారత్‌లో భిక్షాటనపై నిషేధానికి కారణమయ్యారు.

బ్రిటిష్‌ వలస సామ్రాజ్యంలో మరే దేశానికీ వెళ్లనంత మంది తెల్లవారు భారత్‌కు వచ్చారు. బ్రిటన్‌ ముఖ్యంగా ఐరోపా నుంచి ఇండియాకు వలసలను ప్రోత్సహించింది. భారత్‌లో 1857లో ప్రథమ స్వాతంత్య్ర పోరాటానికి దారితీసిన పరిస్థితులు కూడా ఇందుకు దోహదం చేశాయి. సిపాయిల తిరుగుబాటుతో కంగుతిన్న ఆంగ్లేయులు సైన్యంలో తమ వారి సంఖ్యను పెంచాలనుకున్నారు. ఏకంగా 50 వేల మంది తెల్లవారితో ఆంగ్లేయ సైన్యాన్ని బలోపేతం చేశారు. తద్వారా భారత సైన్యంలో శ్వేతజాతీయుల సంఖ్య భారతీయ సిపాయిల కంటే పెరిగింది. ఏకంగా  2.20 లక్షల మందికి చేరింది. సిపాయిల తిరుగుబాటు తర్వాత ఈస్టిండియా కంపెనీ నుంచి పరిపాలన పగ్గాలను తమ చేతుల్లోకి తీసుకున్న బిట్రిష్‌ సర్కారు... తమ వాణిజ్య అవసరాల కోసం భారత్‌లో రైల్వే, ఇతరత్రా మౌలిక సదుపాయాల పనులను వేగవంతం చేసింది. అదే సమయంలో బ్రిటన్‌, ఐర్లాండ్‌లాంటి చోట్ల దుర్భిక్ష పరిస్థితులతో నిరుద్యోగ సమస్య తలెత్తింది. దీంతో యూరప్‌ నుంచి నిపుణులతోపాటు అనేక మందిని భారత్‌కు తరలించారు. ఇలా వచ్చిన వారిలో నేరగాళ్లు, నిరుపేదలు, దేశదిమ్మరులు, వ్యభిచారులు వేల మంది ఉన్నారు. కొందరిని సైన్యంలో, ఇతరత్రా పనుల్లో, గుర్రపుశాలల్లో పనికి కుదిర్చారు.

ఈస్టిండియా సైనికులకు షాక్‌

పనిరాని, చేయని వారంతా కొద్దికాలంలోనే ఆంగ్లేయ సర్కారుకు భారమై భారత్‌లో రోడ్లపై పడ్డారు. ఇది చాలదన్నట్లు బ్రిటిష్‌ సర్కారుకు మరో కొత్త సమస్య వచ్చి పడింది. 1857 దాకా కొనసాగిన ఈస్టిండియా సైన్యాన్ని తమ సొంత సైన్యంలో విలీనం చేసే క్రమంలో వేలమంది యూరోపియన్లను తొలగించారు. ఎలాంటి పింఛన్‌, మరే జీవనోపాధి లేక వారంతా రోడ్డున పడ్డారు. ఇలా వారంతా భారత్‌లో రోడ్లపై దేశదిమ్మరులుగా తిరుగుతూ, బిచ్చమెత్తుకోవడం ప్రారంభించారు.

పరువు పోతోందని మొర

తెల్లపేదల భిక్షాటన దేశంలో అధికారం చెలాయిస్తున్న దొరలకు పరువు సమస్యగా పరిణమించింది. కారణం... శ్వేతజాతీయులు ఉన్నతులనీ, పనిమంతులనీ, భారతీయులు అనాగరికులనీ. చేతగానివారనీ... వారు అప్పటిదాకా ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు తెల్లవాళ్లే రోడ్లపై అడుక్కోవడంతో వారికి తలతీసేసినట్లయింది. భారత్‌లో అప్పటి కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ మ్యాన్స్‌ఫీల్డ్‌ తన ఉన్నతాధికారులకు దీనిపై రాసిన ఓ లేఖ ఇందుకు నిదర్శనం. ‘‘మన సొంత వాళ్లే దేశదిమ్మరులై భారత్‌లో రోడ్లపై బిచ్చమెత్తుకొంటుంటే సిగ్గుతో బతుకుతున్నా. ఇది మన ప్రభుత్వానికే మచ్చ. ఇదిలాగే కొనసాగితే మన జాతి ప్రతిష్ఠ దెబ్బతింటుంది. భారతీయుల దృష్టిలో చులకనైపోతాం’’ అని మ్యాన్స్‌ఫీల్డ్‌ వాపోయాడు. అలాగని పేద తెల్లవారిని ఆదరంగా చూసేవారా అంటే అదీ లేదు. చాలామందిని తిరిగి స్వదేశానికి ఓడలెక్కించేశారు. ఒకవేళ తిరిగి వెళ్లకుండా ఏదైనా చిన్నాచితకా ఉద్యోగాలు చేసేవారుంటే వారిని తమతో సమానంగా చూసుకునే వారుకాదు. తమ శ్వేతజాతీయుల, డబ్బున్నవారి విందులకు, క్రిస్మస్‌, కొత్త సంవత్సరం వేడుకలకు భారతీయ సంపన్నులను ఆహ్వానించేవారు గాని... తమలోని పేదలను పిలిచేవారు కాదు. చివరికి భారత్‌లో ‘తెల్లపేదలు’ బిచ్చమెత్తకుండా నిషేధం విధిస్తూ 1869 ఆగస్టు 11న ఆంగ్లేయ సర్కారు యూరోపియన్‌ వాగ్రెన్సీ యాక్ట్‌ తీసుకొచ్చింది. దీని ప్రకారం యూరోపియన్లు భారత్‌లో బిచ్చమెత్తుకుంటే మొదటిసారి నెల, రెండోసారి రెండు నెలలు, మూడోసారి మూడునెలలు జైలు శిక్ష విధించేవారు. స్వాతంత్య్రం వచ్చాక మనదేశంలోని అనేక రాష్ట్రాల్లో ఇప్పటికీ బిచ్చమెత్తుకోవటంపై అమల్లో ఉన్న చట్టాలకు ఇదే ఆధారమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు