Azadi Ka Amrit Mahotsav: ఉప్పును నిప్పు చేసిన అమెరికన్‌

గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం భారత్‌నే కాదు... యావత్‌ ప్రపంచాన్నీ కదిలించింది. భారత స్వాతంత్య్ర ఉద్యమ తీవ్రతను... ఆంగ్లేయుల దాష్టీకాలను ప్రపంచానికి బలంగా చాటి చెప్పింది. అందుకు

Updated : 18 May 2022 05:48 IST

గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం భారత్‌నే కాదు... యావత్‌ ప్రపంచాన్నీ కదిలించింది. భారత స్వాతంత్య్ర ఉద్యమ తీవ్రతను... ఆంగ్లేయుల దాష్టీకాలను ప్రపంచానికి బలంగా చాటి చెప్పింది. అందుకు సూత్రధారి... అమెరికా జర్నలిస్టు వెబ్‌ మిల్లర్‌.

ఆ కాలంలో స్వదేశీ మీడియాతోపాటు  కొంతమంది విదేశీ పాత్రికేయులు సైతం ఆంగ్లేయ సర్కారుకు బాకా ఊదేవారు. అంతర్జాతీయ మీడియాలో భారత జాతీయోద్యమ వార్తలు రాకుండా బ్రిటిష్‌ సర్కారు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది. శ్వేతజాతి, అమెరికా-బ్రిటన్‌ మధ్య మైత్రి కారణంగా... చాలామంది సహజంగానే బ్రిటన్‌కు అనుకూలంగా వ్యవహరించేవారు. తాము కూడా ఒకప్పుడు బ్రిటిష్‌ వలస పాలన కింద అష్టకష్టాలు పడ్డవారమేననే స్పృహలో ఉన్న అమెరికన్‌ పాత్రికేయులు తక్కువగా ఉండేవారు. వారిలో ఒకరు వెబ్‌ మిల్లర్‌!

అమెరికాలో 1891లో జన్మించిన మిల్లర్‌ తొలుత ఉపాధ్యాయుడిగా పనిచేసి, పాత్రికేయుడిగా మారారు. మొదటి ప్రపంచ యుద్ధం, స్పెయిన్‌ అంతర్యుద్ధం, ఇథియోపియాపై ఇటలీ దాడులను కవర్‌ చేసిన ఆయన... హిట్లర్‌, ముసోలినిలాంటి నియంతలనూ ఇంటర్వ్యూ చేశారు. పులిట్జర్‌ అవార్డు అందుకున్నారు. అమెరికాలోని యునైటెడ్‌ ప్రెస్‌ తరఫున 1930లో భారత్‌లో పరిస్థితులను కవర్‌ చేయటానికి వచ్చారు. ఆయన్ను అడ్డుకోవటానికి ఆంగ్లేయ సర్కారు ఎంత ప్రయత్నించినా కుదరలేదు. మిల్లర్‌ వచ్చే సమయానికి ఉప్పు సత్యాగ్రహం మొదలైంది. గాంధీజీని మే 5న అరెస్టు చేశారు. మే 21న ధరాసన్‌ (సూరత్‌ దగ్గర)లో సత్యాగ్రహం ఉందంటే... మండుటెండలో అక్కడికి పరుగెత్తుకు వెళ్లారు మిల్లర్‌!

సరోజినీదేవి సారథ్యంలో ఉప్పుడిపో వద్ద శాసనోల్లంఘనానికి భారీ ఎత్తున అహింసావాదులు తరలివచ్చారు. ఆంగ్లేయ పోలీసులు తుపాకులు, లాఠీలతో సిద్ధమయ్యారు. తడవకు కొంతమంది చొప్పున గాంధేయులు శాంతియుతంగా ఉప్పు డిపోవైపు కదలటం... వారిపై పోలీసులు నిర్దాక్షిణ్యంగా లాఠీలతో విరుచుకుపడటం... సత్యాగ్రహులు కిందపడటం... మళ్లీ ఇంకో బృందం ముందుకు నడవటం ... దెబ్బలతో కింద పడటం... ఇదో తంతులా సాగింది. ‘‘ఎలాంటి ఆయుధాల్లేకుండా... ప్రతిఘటించకుండా శాంతియుతంగా సాగుతున్న సత్యాగ్రహులను ఆంగ్లేయ పోలీసులు అత్యంత పైశాచికంగా ఇనుప లాఠీలతో బాదారు. తలలు పగిలి అంతా రక్తపు మడుగుల్లో విలవిల్లాడుతుంటే... వారిని మోసుకు వెళ్లటానికి కూడా సరైన ఏర్పాట్లు లేవు. కొంతమంది కార్యకర్తలు దుప్పట్లనే స్ట్రెచర్లుగా మార్చి... ఒక్కొక్కరినీ అక్కడి నుంచి ఆసుపత్రికి తరలిస్తుంటే... రక్తం ఏరులై పారింది. దుప్పట్లన్నీ రక్తంతో తడిసిముద్దయ్యాయి. ఆ తర్వాత ఆసుపత్రికి వెళ్లి చూస్తే... 350 మందికిపైగా గాయాలతో హృదయవిదారకంగా కొట్టుమిట్టాడుతున్నారు. నా 18 సంవత్సరాల పాత్రికేయ వృత్తిలో 22 దేశాలు తిరిగాను. ఎన్నో అంతర్యుద్ధాలను, ప్రపంచయుద్ధాన్ని, ఆందోళనలను, తిరుగుబాట్లను చూశాను. కానీ ఇవాళ ధరాసన్‌లో బ్రిటిష్‌ పోలీసుల దారుణ హింసను మాత్రం ఎన్నడూ చూడలేదు. అహింసావాదులపై ఇంత కర్కశంగా విరుచుకుపడటాన్ని తొలిసారి చూశా. చూడలేక కళ్లు మూసుకున్నా’’ అంటూ మిల్లర్‌ రాశారు.

తను చూసింది చూసినట్లు పంపించారు మిల్లర్‌! కానీ దానికి భారత్‌లోని ఆంగ్లేయ సర్కారు అడ్డుపుల్లలు వేసింది. అమెరికాకు చేరకుండా అడ్డుకుంది. ఆయన వార్తకు కోతలు పెట్టే ప్రయత్నం చేసింది. ‘‘మళ్లీ భారత్‌లోకి నన్ను అడుగు పెట్టనివ్వకున్నా సరే.... ఈ వార్తను పూర్తిగా పంపాల్సిందే. లేదంటే నేను వేరే దారిలో పంపిస్తా’’ అంటూ మిల్లర్‌ బెదిరించినంత పని చేశారు. ఆంగ్లేయ సర్కారు అసహాయస్థితిలో పడింది. మరుసటి రోజు... మిల్లర్‌ పంపిన యునైటెడ్‌ ప్రెస్‌ వార్తను ప్రపంచంలోని 1350 పత్రికలు ప్రచురించాయి. బ్రిటిష్‌ దాష్టీకంతో పాటు, గాంధీజీ అహింసా ఉద్యమం కూడా ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. ఉప్పు సత్యాగ్రహాన్ని... అమెరికా స్వాతంత్య్ర పోరాటంలోని బోస్టన్‌ టీ పార్టీ ఘటనతో పోల్చారు. ‘ఇన్నాళ్లూ మేం పడ్డ శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరైంది’ అంటూ చర్చిల్‌ చేసిన వ్యాఖ్యే మిల్లర్‌ ప్రభావానికి నిదర్శనం!

అది మొదలుగా... గాంధీజీ, భారత స్వాతంత్య్ర ఉద్యమం, అహింసా పద్ధతులకు అమెరికా, ప్రపంచ మీడియాలో ప్రాధాన్యం లభించసాగింది. 1920ల్లో గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమం తొలుత అమెరికా మీడియాలో ప్రచారమైనా... అంతగా ప్రాధాన్యం లభించలేదు. 1930 ఉప్పు సత్యాగ్రహంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గాంధీజీ రెండుసార్లు టైమ్‌ మేగజీన్‌ ముఖచిత్రమయ్యారు. మిల్లర్‌ కవరేజీ తర్వాత అమెరికా మీడియా భారత్‌పై దృష్టి కేంద్రీకరించింది. బ్రిటన్‌పై పరోక్షంగా ఒత్తిడి పెరగటానికి కారణమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని