Azadi Ka Amrit Mahotsav: వందెకరాల కన్నా వందేమాతరమే మిన్న

ఇంగ్లాండ్‌లో చదివొచ్చాడని... ఆంగ్లేయులు టీ ఎస్టేట్‌లో మేనేజర్‌ ఉద్యోగమిస్తే తిరస్కరించారు... కోరుకున్న చోట వందెకరాల భూమిని ఇస్తామంటే... వద్దన్నారు. ...మరి ఏం చేస్తావంటే... వందేమాతరం అంటూ ఎలుగెత్తారు! ఆయనే... దేశం కోసం సర్వం ధారపోసిన త్యాగశీలి కల్లూరి చంద్రమౌళి!

Updated : 28 May 2022 07:03 IST

ఇంగ్లాండ్‌లో చదివొచ్చాడని... ఆంగ్లేయులు టీ ఎస్టేట్‌లో మేనేజర్‌ ఉద్యోగమిస్తే తిరస్కరించారు... కోరుకున్న చోట వందెకరాల భూమిని ఇస్తామంటే... వద్దన్నారు. ...మరి ఏం చేస్తావంటే... వందేమాతరం అంటూ ఎలుగెత్తారు! ఆయనే... దేశం కోసం సర్వం ధారపోసిన త్యాగశీలి కల్లూరి చంద్రమౌళి!

గుంటూరు జిల్లా అమృతలూరు మండలం మోపర్రులో 1898 నవంబరు 15న జన్మించిన కల్లూరి చంద్రమౌళి ఉన్నత చదువుల కోసం ఇంగ్లాండ్‌ వెళ్లారు. ఎబర్డీన్‌ విశ్వవిద్యాలయం నుంచి వ్యవసాయశాస్త్రంలో పట్టా పొందారు. బ్రిటన్‌లో ఆంగ్లేయులు అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను, విద్య, ఆహార సౌకర్యాలను చూసిన ప్రతిసారీ ఆయన మదిలో భారత్‌లో పరతంత్రులైన, డొక్కలు ఎండిన ప్రజలే మెదిలేవారు. స్వీయపాలనలోనే భారత్‌ బాగుపడుతుందనే ఉద్దేశంతో... స్వదేశం వెళ్లి జాతీయోద్యమంలో దూకాలని నిర్ణయించుకున్నారు చంద్రమౌళి. 1924లో భారత్‌కు పయనమయ్యారు. ఇంగ్లాండ్‌లో చదువుకుని వస్తున్న ఆయనకు స్వాగతం పలికేందుకు స్నేహితులంతా రైల్వేస్టేషన్‌కు తరలివచ్చారు. సూటు, బూటు వేసుకుని దర్జాగా మొదటి తరగతి బోగీ నుంచి దిగుతాడనుకుంటే... తానేమో లాల్చీ, పైజామాలో సాధారణ బోగీ నుంచి దిగారు. తెల్లదొరల దర్పానికి సూచికలైన దుస్తులను ఓడలో ఉండగానే చంద్రమౌళి సముద్రంలోకి విసిరేశారని వారికప్పుడు తెలియదు.

రాటుదేల్చిన గాంధీజీ శిష్యరికం 

విదేశాల్లో చదువుకున్న యువకులను భారత స్వాతంత్య్ర పోరాటానికి దూరంగా ఉంచేందుకు ఆంగ్లేయులు ఉద్యోగాలు, భూములను ఎరవేసేవారు. వ్యవసాయ శాస్త్రంలో పట్టాతో చంద్రమౌళి లండన్‌ నుంచి తిరిగి రాగానే అస్సాంలోని టీ తోటల్లో ఆకర్షణీయమైన జీతంతో మేనేజర్‌ ఉద్యోగం ఇస్తూ బ్రిటిష్‌ ప్రభుత్వం ఉత్తరం పంపించింది. కోరుకున్న చోట వందెకరాల భూమినీ ఇస్తామంది. చంద్రమౌళి ఆలోచనలేమో జాతీయోద్యమం చుట్టూ తిరుగుతున్నాయి. సర్కారు కొలువు వదులుకోవద్దంటూ... బంధువులు, స్నేహితుల నుంచి ఒత్తిడి పెరిగింది. ఈ సంఘర్షణ తట్టుకోలేక చంద్రమౌళి... ఉత్తర భారత యాత్రకు వెళ్లి అక్కడి నుంచి గాంధీజీ ఆశ్రమానికి చేరుకున్నారు. 3 నెలలు గాంధీజీ వద్ద శిష్యరికం చేశారు. తన జీవిత గమ్యాన్ని నిర్దేశించుకున్నారు. ఇంటికి వచ్చి... ప్రజలను ఉద్యమంలో పాల్గొనేలా చేయడమే లక్ష్యంగా వందల గ్రామాల్లో పర్యటించారు. చేబ్రోలులో 1928లో సైమన్‌ కమిషన్‌కు వ్యతిరేకంగా ప్రదర్శన నిర్వహించి, లాఠీ దెబ్బలు తిన్నారు. 1929 మార్చిలో తెనాలిలో విదేశీ వస్త్రాలను దహనం చేయించారు. అదే ఏడాది ఏప్రిల్‌లో ఆంధ్రదేశ పర్యటనకు వచ్చిన గాంధీజీని మోపర్రుకు తీసుకొచ్చారు. గుంటూరులో 1930, 32లో రెండుసార్లు జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకెళ్లారు. మద్రాసు శాసనసభకు 1937లో జరిగిన ఎన్నికల్లో తెనాలి నుంచి చంద్రమౌళి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

క్విట్‌ ఇండియా పిలుపు ఇచ్చినందుకు గాంధీజీని అరెస్టు చేయగా... 1942 ఆగస్టు 12న తెనాలిలో చేపట్టిన నిరసన రక్తసిక్తమైంది.  కల్లూరిని రాజకీయ ఖైదీగా జైలుకు పంపించారు. అప్పట్లో ఆంగ్లేయులు కాంగ్రెస్‌పై నిషేధం విధించడంతో నాయకులంతా ఆంధ్రా కాంగ్రెస్‌ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. కల్లూరిని అధ్యక్షుడిగా, నీలం సంజీవరెడ్డిని కార్యదర్శిగా ఎన్నుకున్నారు.1947 మార్చిలో జరిగిన ఎన్నికల్లో మద్రాసు ప్రావిన్సు శాసనసభకు తెనాలి నుంచి మళ్లీ ఎమ్మెల్యేగా ఎన్నికైన కల్లూరి... స్థానిక స్వపరిపాలన, సహకార శాఖల మంత్రిగా అయిదేళ్లు పనిచేశారు. 20 వేల సహకార సంఘాలను ఏర్పాటు చేశారు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొం టూనే... 1933లో నానా దేశాల రాజ్యాంగాలు, రైతు రాజ్యాంగం అనే పుస్తకాలను రచించారు. దీంతో చంద్రమౌళిని భారత రాజ్యాంగ పరిషత్తు సభ్యుడిగా ఎన్నుకున్నారు. స్వాతంత్య్రం వచ్చాక దేశంలోనే తొలిసారిగా మద్రాసు పంచాయతీరాజ్‌ చట్టం(1950) తెచ్చిన ఘనత ఆయనదే.

రచనల్లో దార్శనికుడు 

భారతీయులు పాశ్చాత్యులకంటే సంస్కృతి, నాగరికతలో గొప్పవారని తెలియజేస్తూ ‘భారతీయ ప్రతిభ’ (1950), సీతారాముల గొప్పదనాన్ని భావితరాలకు అందించేందుకు ‘రామాయణ సుధాలహరి’(1952), భౌతిక శాస్త్రానికి మత ధర్మం లేకుంటే వినాశనానికి దారితీస్తుందని వివరిస్తూ ‘మతం-భౌతికశాస్త్రం’ (1962), శ్రీరంగం రంగధాముని వివాహమాడి, ఆయనలోనే లీనమైన గోదాదేవిని స్తుతిస్తూ ‘ఆండాళ్‌ వైభవం’(1964), ధర్మార్థ, కామమోక్షాల సాధన తీరును వివరిస్తూ ‘పురుషార్థములు’(1964)... కృత, త్రేత, ద్వాపర, కలి యుగాలలో భారతదేశ సంస్కృతి, నాగరికతల పరిణామక్రమాలను క్రీ.పూ.3102 నుంచి వివరిస్తూ ‘యుగ సమీక్ష’ (1971) వంటిఎన్నో అమూల్యమైన పుస్తకాలను రచించారు. సొంత ఆస్తులు, భారత ప్రభుత్వం ఇచ్చిన భూమితో సహా అన్నీ పేదల కోసం దానం చేసిన మహామనీషి కల్లూరి... 1992 జనవరి 21న పరమపదించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని