CoronaVaccine: టీకా వ్యవధి తగ్గించాలి

డెల్టా రకం వైరస్‌ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని కొవిషీల్డ్‌ రెండో డోసు టీకా కాల పరిమితిని 12-16 వారాల నుంచి 8 వారాలకు తగ్గించడం మేలని ప్రముఖ వైద్యులు, పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు డాక్టర్‌ కె.శ్రీనాథ్‌రెడ్డి సూచించారు. బ్రిటన్‌లో గత డిసెంబరులో అప్పటి ఒరిజినల్‌ రకం వైరస్‌ను దృష్టిలో ఉంచుకొని కాల వ్యవధిని పెంచారని, ఆ తర్వాత డెల్టా వేరియంట్‌ ప్రాబల్యం పెరగడంతో టీకా వ్యవధిని తగ్గించారని గుర్తు చేశారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యాక్సిన్‌ విధానంలో ఇలా మార్పులు చేస్తూ పోవాలన్నారు. ప్రస్తుతం మన దేశంలో 50% డెల్టా రకం వైరస్‌ ఉన్నట్లు ప్రభుత్వ అధ్యయనాలే చెబుతున్నందున... కొవిషీల్డ్‌ రెండో డోసు కాల వ్యవధిని 8 వారాలకు తగ్గించి ముప్పు తీవ్రత ఎక్కువగా ఉన్న వారికి గరిష్ఠ రక్షణ కల్పించాలని ఆయన అభిప్రాయపడ్డారు.  ‘ఈనాడు’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో దేశంలోని ప్రస్తుత పరిస్థితులను, చేపట్టాల్సిన చర్యలను శ్రీనాథ్‌ రెడ్డి విశ్లేషించారు. 

Updated : 15 Jun 2021 07:44 IST

కొవిషీల్డ్‌ 8 వారాలకే ఇవ్వాలి
‘డెల్టా’ నేపథ్యంలో విధానం మారాలి
తొలిడోస్‌తో 33 శాతమే రక్షణ
గర్భిణులకూ కొవాగ్జిన్‌ను పరిశీలించాలి
పెద్దల విచ్చలవిడితనం వల్లే పిల్లలకు ప్రమాదం
‘ఈనాడు’ ఇంటర్వ్యూలో ‘పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌’ అధ్యక్షులు డాక్టర్‌ శ్రీనాథ్‌ రెడ్డి
చల్లా విజయభాస్కర్‌
ఈనాడు, దిల్లీ

మూడోదశ వచ్చేప్పటికి వయోజనుల్లో చాలామంది వ్యాక్సిన్‌ తీసుకొని ఉంటారు. అందువల్ల పెద్దవాళ్లలో రక్షణ పొందిన వారి సంఖ్య పెరుగుతుంది. అప్పటికి పిల్లలకు వ్యాక్సిన్‌ వచ్చి ఉండదు కాబట్టి ఎక్కువ మందికి సోకడానికి అవకాశాలు అధికంగా ఉంటాయి. అంతే తప్ప మూడో ఉద్ధృతిలో వైరస్‌ పిల్లల్నే వెతికి వేటాడుతుందనేది తప్పు భావన.

డెల్టా రకం వైరస్‌ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని కొవిషీల్డ్‌ రెండో డోసు టీకా కాల పరిమితిని 12-16 వారాల నుంచి 8 వారాలకు తగ్గించడం మేలని ప్రముఖ వైద్యులు, పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు డాక్టర్‌ కె.శ్రీనాథ్‌రెడ్డి సూచించారు. బ్రిటన్‌లో గత డిసెంబరులో అప్పటి ఒరిజినల్‌ రకం వైరస్‌ను దృష్టిలో ఉంచుకొని కాల వ్యవధిని పెంచారని, ఆ తర్వాత డెల్టా వేరియంట్‌ ప్రాబల్యం పెరగడంతో టీకా వ్యవధిని తగ్గించారని గుర్తు చేశారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యాక్సిన్‌ విధానంలో ఇలా మార్పులు చేస్తూ పోవాలన్నారు. ప్రస్తుతం మన దేశంలో 50% డెల్టా రకం వైరస్‌ ఉన్నట్లు ప్రభుత్వ అధ్యయనాలే చెబుతున్నందున... కొవిషీల్డ్‌ రెండో డోసు కాల వ్యవధిని 8 వారాలకు తగ్గించి ముప్పు తీవ్రత ఎక్కువగా ఉన్న వారికి గరిష్ఠ రక్షణ కల్పించాలని ఆయన అభిప్రాయపడ్డారు.  ‘ఈనాడు’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో దేశంలోని ప్రస్తుత పరిస్థితులను, చేపట్టాల్సిన చర్యలను శ్రీనాథ్‌ రెడ్డి విశ్లేషించారు.

వ్యాక్సిన్‌ కొరత వల్లే కొవిషీల్డ్‌ కాలపరిమితిని పెంచారా? లేక శాస్త్రీయ ఆధారాల ప్రకారమా?
అది ప్రభుత్వ విధానం కాబట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడదలచుకోలేదు. డెల్టా రకం వైరస్‌ను దృష్టిలో ఉంచుకొని మాత్రమే కొవిషీల్డ్‌ డోసుల మధ్య కాల వ్యవధిని తగ్గించాలని చెబుతున్నా! విదేశాల అనుభవాలు, మన దేశంలో జరిగిన అధ్యయనాల ప్రకారం డెల్టా రకంపై తొలి డోస్‌తోనే పూర్తిస్థాయి రక్షణ దొరకదు. తొలి డోస్‌తో కేవలం 33 శాతం రక్షణే అని బ్రిటన్‌ అనుభవం చెబుతోంది. రెండో డోసుతోనే రక్షణ ఉంటుంది కాబట్టి రెండు డోసుల మధ్య కాల వ్యవధిని తగ్గించాలని ఇప్పటివరకు ఉన్న అధ్యయనాలన్నీ చెబుతున్నాయి. మిగిలిన దేశాల్లో 8 వారాలకు తగ్గించారు. ఆ అనుభవాన్ని మనమూ గుర్తించాలి. మన దేశంలో డెల్టా వేరియంటే ప్రబలంగా ఉందంటున్నారు. ఐసీఎంఆర్‌తోపాటు పలు అధ్యయనాల్లో ఇదే తేలింది. కాబట్టి మనమిప్పుడు జనవరి నాటి పరిస్థితులను కాకుండా జూన్‌లో స్థితిని దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాలి. మార్చుకోవాలి.

కరోనా ఉద్ధృతి తిరోగమనంలో సాగుతున్నా వ్యవధి తగ్గించాలా?
గతం కంటే కేసులు తగ్గడం మంచిదే. ప్రస్తుతం చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్‌లో ఉన్నాయి. అది ఎత్తేసిన తర్వాత కూడా కేసులు తగ్గుతాయా? పెరుగుతాయా? అనేది తెలియదు. కేసులైతే ఎక్కడా సున్నాకు రాలేదు. వైరస్‌ వల్ల  ఇప్పటికీ కొంత మంది ప్రమాదాన్ని ఎదుర్కొంటూనే ఉన్నారు. బ్రిటన్‌ లాంటి దేశమే తాము లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తేయడం లేదని ప్రకటించింది. డెల్టా వేరియంట్‌ను దృష్టిలో ఉంచుకొని వాళ్లు జాగ్రత్త పడుతున్నారు. అమెరికా ఎఫ్‌డీఏ కమిషనర్‌ స్కాట్‌ గాట్‌లిబ్‌- తాజాగా తమ దేశంలోనూ డెల్టా వేరియంట్‌ వేగంగా వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అందువల్ల మనకు ముప్పు పూర్తిగా తొలగిపోయిందని అనుకోవడానికి వీల్లేదు. అందరికీ రక్షణ కల్పించాలన్న ఉద్దేశంతోనే మనం వ్యాక్సినేషన్‌ విధానం అవలంబిస్తున్నాం. అలాంటప్పుడు డెల్టా వేరియంట్‌ వల్ల వచ్చే ప్రమాదాన్ని పసిగట్టి టీకా విధానంలో మార్పులు తేవాలి.

ముప్పు ఎక్కువ ఉన్నవారికి రెండో డోసు కాల వ్యవధి తగ్గించి ఇస్తే చాలా..?
మన ప్రభుత్వం 45 ఏళ్ల పైబడిన వారందరికీ టీకాలకు ఇప్పటికే అనుమతి ఇచ్చింది. ఈ విధానాన్నే అనుసరిస్తే చాలు. వీరితో పాటు గర్భిణులకూ టీకాల్లో ప్రాధాన్యం ఇవ్వాలి. అంతర్జాతీయంగా గర్భిణులకు వ్యాక్సిన్లు వేస్తున్నారు. ఇప్పటికే అమెరికాలో ఫైజర్‌ టీకా ఇస్తున్నారు. ఆస్ట్రాజెనికాను యుక్తవయస్సు వారికి ఇవ్వకూడదని యూకే నిర్ణయించింది. అందువల్ల అది వద్దనుకుంటే భారత్‌లో కొవాగ్జిన్‌ అయినా గర్భిణులకు ఇవ్వొచ్చు. వీరిపై ట్రయల్స్‌ జరగలేదు కాబట్టి.. అనుభవాలను బట్టి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాక్సినేషన్‌ ప్రారంభమైన తర్వాత వచ్చిన అనుభవాల ఆధారంగానే అమెరికా, బ్రిటన్‌, యూరప్‌లలో గర్భిణులకు టీకాలివ్వొచ్చని నిర్ణయించారు. ఆ అనుభవాలను మనం గమనంలోకి తీసుకోవాలి. అందుబాటులో ఉన్న ఏ వ్యాక్సిన్‌ను వారికి ఇవ్వాలన్న దానిపై నిపుణులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి తప్పితే, వారికి ఏ వ్యాక్సిన్‌ కూడా ఇవ్వకూడదన్న ఆలోచన మాత్రం మంచిది కాదు.

వ్యాక్సినేషన్‌ తర్వాత కూడా వైరస్‌ సోకి ఆసుపత్రిలో చేరినట్లు అపోలో ఆసుపత్రుల జేఎండీ సంగీతారెడ్డి ప్రకటించారు! ప్రజల్లో వ్యాక్సిన్‌పై అనుమానాలు పెరిగే అవకాశం ఉండదా?
ఫైజర్‌తో పాటు ప్రపంచంలో అందుబాటులో ఉన్న ఏ వ్యాక్సిన్‌ ఇచ్చినా రోగం తీవ్రరూపం దాల్చకుండా 95% రక్షణ లభిస్తుంది. అంతేతప్ప అసలు వైరసే సోకకుండా ఏ వ్యాక్సినూ 100% రక్షణ కల్పించలేదు. ట్రయల్స్‌లో పరిశీలించింది కూడా మరణాల నుంచి టీకాలెంతమేరకు రక్షణ కల్పిస్తాయన్న దానిపైనే. వైరస్‌ శరీరంలోకి ప్రవేశించకుండా టీకాలు ఆపలేవు. కానీ ప్రవేశించిన తర్వాత లక్షణాలు లేకుండా, లేదంటే తేలికపాటిగా ఉండేట్లు చూస్తాయి. కొంతమందికి కొంత సీరియస్‌ కూడా కావొచ్చు. అయితే అత్యధిక మందికి మృత్యు భయం ఉండదు. అందువల్ల ఎవ్వరూ టీకా అనేది వైరస్‌ సోకకుండా ఆపుతుందనే అపోహలు పెట్టుకోకూడదు. ప్రస్తుతం ముక్కు ద్వారా పీల్చుకొనే వ్యాక్సిన్లపై ప్రయోగాలు జరుగుతున్నాయి. అవి వస్తే వైరస్‌ను అరికట్టడానికి వీలవుతుందేమో! ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్ల వల్ల ఐజీజీ, ఐజీఎం యాంటీబాడీస్‌ ఉత్పత్తి అయితే ముక్కు ద్వారా తీసుకొనే వ్యాక్సిన్‌తో ఐజీఏ యాంటీబాడీస్‌ కూడా తయారవుతాయి. వైరస్‌ ముక్కులోకి, గొంతులోకి ప్రవేశించినప్పుడు ఈ ఐజీఏ యాంటీబాడీలు ఊడ్చేసే అవకాశం ఉంది. కారులో పోతున్నప్పుడు సీటు బెల్టు వేసుకుంటే ప్రమాదం సంభవించినా చాలావరకు రక్షణ లభిస్తుంది. అయితే దెబ్బలు తగలకుండా బెల్ట్‌ ఆపలేదు. చిన్న దెబ్బలు తగలొచ్చు. వ్యాక్సిన్లు కూడా అలాగే పనిచేస్తాయి.

అహ్మదాబాద్‌ లాంటి నగరాల్లో సిరో సర్వే చేసినప్పుడు 70% మందిలో యాంటీబాడీలు కన్పించినట్లు చెబుతున్నారు. అలా అయితే దేశంలో హర్డ్‌ ఇమ్యూనిటీ వచ్చినట్లు అనుకోలేమా?
హర్డ్‌ ఇమ్యూనిటీ వ్యాక్సిన్‌ వల్ల వస్తుందేమో కానీ సహజంగా వైరస్‌ సంక్రమణం వల్ల రాదని రుజువైంది. బ్రెజిల్‌లో 76% మందిలో యాంటీ బాడీస్‌ కనిపించిన తర్వాత కూడా అక్కడ మహమ్మారి కొనసాగింది. ఆ దేశంలోనే సలానా అనే ప్రాంతంలో 50% మందికి వ్యాక్సిన్‌ అందిన వెంటనే 55% దాకా మరణాలు తగ్గిపోయాయి. 86% వైరస్‌ సోకడం తగ్గిపోయింది. సహజసిద్ధమైన ఇన్‌ఫెక్షన్‌ వల్ల హర్డ్‌ ఇమ్యూనిటీ వస్తుందనడానికి ఇంకా ఎలాంటి రుజువులూ దొరకలేదు. వ్యాక్సిన్‌ 60% దాటిన తర్వాత దాని ప్రభావం చాలా ఉంటుంది. బ్రిటన్‌లోనూ వ్యాక్సినేషన్‌ 50% దాటేప్పటికి మరణాలు సున్నాకు చేరాయి. హర్డ్‌ ఇమ్యూనిటీ అనేది వ్యక్తిగత రక్షణ కాదు. సామూహిక రక్షణ. ఆ సమూహంలో ఉన్నంతకాలం బాగానే రక్షణ ఉంటుంది. అక్కడినుంచి వేరే చోటికి వెళ్లినప్పుడు రక్షణ దొరకదు. హర్డ్‌ ఇమ్యూనిటీ మీద నమ్మకం పెట్టుకొని, దానివల్ల మనకు రక్షణ లభిస్తుందనుకోవడం అవివేకం. పదవిలో ఉన్న రాజకీయ నాయకుడికి చుట్టూ రక్షక భటులున్నప్పుడు రక్షణ ఉంటుంది. పదవి పోయిన తర్వాత ఆయనకు అంతకుముందున్న రక్షణ ఉండదు. అరువు తెచ్చుకున్న రక్షణ హర్డ్‌ ఇమ్యూనిటీ. దానిమీద ఆధారపడకుండా వ్యక్తిగతంగా మనమే రక్షణ పొందాలి. అందుకోసం వ్యాక్సిన్‌ తీసుకోవాలి.

థర్డ్‌ వేవ్‌ గురించి ఇప్పటినుంచే భయాలు   మొదలయ్యాయి. చిన్న పిల్లలకు ముప్పు ఎక్కువ ఉంటుందని చెబుతున్నారు! మీరేమంటారు?
ఇక్కడ మనం చూడాల్సింది.. పిల్లలకు ఇన్‌ఫెక్షన్‌ సోకుతుందా? పెద్దవాళ్ల కంటే ఎక్కువ వస్తుందా? పెద్దవాళ్ల కంటే రోగ తీవ్రత ఎక్కువ ఉంటుందా? అన్నదే. ఈ ప్రశ్నలకు భిన్నమైన సమాధానాలున్నాయి. పిల్లలు ఎక్కడైనా పాజిటివ్‌ రోగులకు తారసపడితే తప్పకుండా వారికి వైరస్‌ సోకుతుంది. మొదటి ఉద్ధృతిలో పిల్లలు బయటకు పోకుండా ఆపాం. రెండో ఉద్ధృతికి ముందు పిల్లలు చదువుకోవడానికి, మరిన్ని పనులమీద కొంతమేర బయటికెళ్లారు. థర్డ్‌ వేవ్‌ వచ్చేప్పటికి వయోజనుల్లో చాలామంది వ్యాక్సిన్‌ తీసుకొని ఉంటారు. అందువల్ల పెద్దవాళ్లలో రక్షణ పొందిన వారి సంఖ్య పెరుగుతుంది. అప్పటికి పిల్లలకు వ్యాక్సిన్‌ వచ్చి ఉండదు కాబట్టి ఎక్కువ మందికి సోకడానికి అవకాశాలు అధికంగా ఉంటాయి. అంతే తప్ప మూడో ఉద్ధృతిలో వైరస్‌ పిల్లల్నే వెతికి వేటాడుతుందనేది తప్పు భావన. వైరస్‌ సోకినా పిల్లల్లో రోగ తీవ్రత పెరుగుతుందని చెప్పలేం. ఎక్కువ మంది పిల్లలకు జబ్బు చేసినప్పుడు ఆ నిష్పత్తి ప్రకారం తీవ్రమైన లక్షణాలున్నవారి సంఖ్య కొంత పెరుగుతుంది కాబట్టి ఎక్కువ మంది తీవ్రమైన వైరస్‌కు గురైనట్లు అనిపించొచ్చు. ఎప్పుడైనా పిల్లల కంటే పెద్ద వారికే రోగ తీవ్రత ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. పిల్లలకు రక్షణ కల్పించాలంటే పెద్దవాళ్లు సరిగా ప్రవర్తించాలి. పెద్దవాళ్లు విచ్చలవిడిగా తిరిగి ఇంటికి వైరస్‌ తీసుకొస్తే పిల్లలకు తప్పకుండా ప్రమాదం ఉంటుంది.

కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ పనితీరుపై చర్చలు జరుగుతున్నాయి.  దీనిపై మీ స్పందనేంటి?

ఇప్పటివరకు జరిగింది చాలా చిన్న అధ్యయనం. యాంటీబాడీల ద్వారానే రక్షణ లభిస్తుందనుకోవడం తప్పు. టీసెల్స్‌ ఇమ్యూనిటీ కూడా చాలా ముఖ్యం. దానిపై ఇంకా ఎక్కువ అధ్యయనం జరగాలి. లేబొరేటరీలో కనిపించే యాంటీబాడీల కంటే రియల్‌ లైఫ్‌లో  రీ ఇన్‌ఫెక్షన్‌ రేటు ఎలా ఉందన్న దాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. తొందరపడి ఈ వ్యాక్సిన్‌ మేలు, ఆ వ్యాక్సిన్‌ కాదు అనుకోవడానికి బదులు రీ ఇన్‌ఫెక్షన్‌పై మనం సరిగా అధ్యయనం చేయాలి. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న ఏ వ్యాక్సినైనా రెండు డోసులు తీసుకోవడం మంచిదే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు