మిస్డ్‌కాల్‌తో మింగేస్తుంది!

మీ ప్రమేయం లేకుండానే, మీరెలాంటి అనుమతి ఇవ్వకుండానే, కేవలం ఓ మిస్డ్‌కాల్‌తో మీ ఫోన్‌ను హ్యాక్‌ చేయటం  పెగాసస్‌ ప్రత్యేకత. ఆ కాల్‌కు మీరు స్పందించకున్నా ఫర్వాలేదు. మిస్డ్‌కాల్‌ వచ్చిందంటే చాలు మీ ఫోన్‌లో హ్యాకింగ్‌ వైరస్‌ చేరిపోతుంది. కొన్ని సందర్భాల్లో వైఫైలద్వారా, గేమ్స్‌, సినిమాల యాప్‌ల ద్వారా చేరుతుంది.

Updated : 20 Jul 2021 05:06 IST

ప్రమేయం లేకుండానే ఫోన్లో చొరబాటు
గుట్టుచప్పుడు కాకుండా డేటా తస్కరణ
పెగాసస్‌ పని తీరిదీ

ఎవరో వచ్చి కాలింగ్‌బెల్‌ నొక్కుతారు. మీరు తలుపు తెరవగానే దాడి చేసి లోపలికి చొరబడటం ఒకెత్తు.

కానీ తలుపు తెరవాల్సిన పనిలేకుండా, కేవలం కాలింగ్‌ బెల్‌ నొక్కటంతోనే మీ ఇంట్లోకి చొరబడితే?

చొరబడిన విషయం కూడా మీకు తెలియకుంటే?
ఇదేదో అదృశ్య శక్తిరూపంలో పాతకాలపు విఠలాచార్య సినిమాలో దృశ్యంలానో ఉందనిపిస్తోంది కదూ.
తాజాగా దుమారం రేపుతున్న ఇజ్రాయెల్‌    నిఘా సాఫ్ట్‌వేర్‌ పెగాసస్‌ అచ్చం అలాంటి  అదృశ్యశక్తిలాంటిదే.

మీ ప్రమేయం లేకుండానే, మీరెలాంటి అనుమతి ఇవ్వకుండానే, కేవలం ఓ మిస్డ్‌కాల్‌తో మీ ఫోన్‌ను హ్యాక్‌ చేయటం  పెగాసస్‌ ప్రత్యేకత. ఆ కాల్‌కు మీరు స్పందించకున్నా ఫర్వాలేదు. మిస్డ్‌కాల్‌ వచ్చిందంటే చాలు మీ ఫోన్‌లో హ్యాకింగ్‌ వైరస్‌ చేరిపోతుంది. కొన్ని సందర్భాల్లో వైఫైలద్వారా, గేమ్స్‌, సినిమాల యాప్‌ల ద్వారా చేరుతుంది. మీ మాటలు, సందేశాలు, ఫొటోలు, వీడియోలు, మీరెక్కడెక్కడ తిరుగుతోందీ... మీ కాల్‌ హిస్టరీ, నెట్‌వర్క్‌ వివరాలు, డివైస్‌ సెట్టింగ్‌లు, ఈ-మెయిల్స్‌, ఇలా అన్నీ ఆ నిఘా టెక్నాలజీని నియంత్రించే వారికి అందుబాటులోకి వచ్చేస్తాయి. ఈ పెగాసస్‌ మన ఫోన్లో చేరిందనే సంగతి గుర్తించటం కూడా కష్టం. ఆండ్రాయిడ్‌లే కాదు... అత్యంత సురక్షితమనుకున్న ఐఫోన్‌లలో కూడా చేరిపోయింది. ఈ పెగాసస్‌నే ఇలాంటి నిఘాలో అత్యంత ఆధునిక సాంకేతికగా భావిస్తున్నారు.


పాత పద్ధతిలోనే మొదలై...

మొదట్లో... చిన్న మెసేజో, మెయిలో పంపించాక... వాటిపై మనం క్లిక్‌ చేయగానే వైరస్‌ చొరబడటంలాంటి సర్వసాధారణ పద్ధతినే ఈ పెగాసస్‌ కూడా అనుసరించింది. కానీ వాటిని నిరోధించే పద్ధతులను ఫోన్ల కంపెనీలు, సర్వీస్‌ ప్రొవైడర్లు కనుక్కుంటుండటంతో... వారికంటే నాలుగడుగులు ముందుంటూ... ఇలా మిస్డ్‌కాల్‌ నిఘా వైరస్‌ టెక్నాలజీని కనుక్కొంది ఈ పెగాసస్‌ తయారీ కంపెనీ ఎన్‌ఎస్‌ఓ! తొలుత ఈ ఎన్‌ఎస్‌ఓ నకిలీ వాట్సప్‌ ఖాతాలు సృష్టించి, వాటితో వీడియో లేదా, వాయిస్‌ మిస్డ్‌కాల్‌ చేస్తుంది. ఫోన్‌ మోగగానే ఒక కోడ్‌, స్పైవేర్‌ రహస్యంగా చొరబడతాయి. ఎన్‌క్రిప్ట్‌ అయి... ఎంతో భద్రం అనుకున్న వాట్సప్‌ మెసేజ్‌లు, కాల్స్‌ సంభాషణలను కూడా ఈ పెగాసస్‌ పట్టేస్తుంది.


2016లోనే గుర్తించినా...

2016లోనే... యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని మానవ హక్కుల కార్యకర్త అహ్మద్‌ మన్సూర్‌ ఈ పెగాసస్‌ నిఘాను గుర్తించారు. తన ఐఫోన్‌ హ్యాకైనట్లు అనుమానం వచ్చి కంపెనీకి ఫిర్యాదు చేశారు. దీంతో యాపిల్‌ దాన్ని సరిచేసి ఇచ్చింది. వాట్సప్‌ మిస్డ్‌కాల్‌ వ్యవహారంతో ఇది చాలామటుకు వెలుగులోకి వచ్చింది. అప్పటిదాకా తమ వాయిస్‌కాల్‌/ వీడియోకాల్‌ల సాంకేతికతలో ఈ లోపం ఉన్నట్లు వాట్సప్‌ కూడా గుర్తించలేదు. ఆ లోపాన్ని (జీరో డే సెక్యూరిటీ లోపం అంటారు) ఎన్‌ఎస్‌ఓ పెగాసస్‌ విజయవంతంగా వినియోగించుకుంది. ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఫోన్లను లక్ష్యంగా చేసుకొని మిస్డ్‌కాల్స్‌ చేసి, వారి ఫోన్లలో చేరిపోయింది. దీనిపై కాలిఫోర్నియా కోర్టులో కేసు కూడా వాట్సప్‌ దాఖలు చేసింది. తన తదుపరి ఆండ్రాయిడ్‌ వర్షన్‌లలో లోపాన్ని సరిదిద్దుకుంది. ఈలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తాజాగా పెగాసస్‌ మరే రూపంలో వస్తుందో కూడా తెలియదు.


ఎక్కడిదీ ఎన్‌ఎస్‌ఓ?

నిఘా వ్యవస్థలకు పెట్టింది పేరైన ఇజ్రాయెల్‌లోని ఎన్‌ఎస్‌ఓ గ్రూప్‌ అనే సంస్థ తయారు చేసిందే ఈ పెగాసస్‌! ఎన్‌ఎస్‌ఓ గ్రూప్‌.. సైబర్‌ సెక్యూరిటీ కంపెనీ. నిఘా టెక్నాలజీ దీని ప్రత్యేకత. నేరాలు, ఉగ్రవాదాన్ని కట్టడి చేయటానికిగాను ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రభుత్వాలకు, చట్టబద్ధ సంస్థలకు సాయం చేస్తుంటామని ఈ ఎన్‌ఎస్‌ఓ చెబుతుంటుంది.


మరిప్పుడెలా తెలిసింది?

అనుమానం వచ్చిన ఫోన్లను అంతర్జాతీయ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో అత్యంత అధునాతన పద్ధతిలో పరిశీలిస్తే అవి హ్యాక్‌ అయ్యాయనే సంగతి బయటపడింది.


పెగాసస్‌ చేరితే ఎలా?

ఒక్కసారి ఈ పెగాసస్‌ నిఘా నేత్రం ఫోన్లో చేరిందంటే... దాన్ని ఏం చేసినా తొలగించలేరు. ఫోన్‌ మార్చుకొని, పాస్‌వర్డ్‌లన్నీ మార్చుకోవటం తప్ప చేసేదేం లేదన్నది నిపుణుల సలహా!


చట్టం ఏం చెబుతోంది?

ఎవరి ఫోన్లనైనా... ప్రైవేటు సమాచారాన్నైనా చట్టబద్ధంగా ట్యాప్‌ చేయటానికి ప్రభుత్వాలకు అధికారం ఉంటుంది. సంబంధిత చట్టబద్ధ ప్రక్రియను భారత టెలిగ్రాఫ్‌ చట్టం, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టం స్పష్టంగా నిర్దేశించాయి. అలాకాకుండా వ్యక్తిగతంగా, ప్రైవేటుగా, అధికారికంగా ఇలా రహస్య పద్ధతుల (స్పైవేర్‌ నిఘా) ద్వారా ఫోన్లను హ్యాక్‌ చేయటం మాత్రం ఐటీ చట్టం ప్రకారం నేరం.


- ఈనాడు ప్రత్యేక విభాగం; ఈనాడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని