Ukraine Crisis: పుతిన్‌ చర్విత‘చరితం’!

ఉక్రెయిన్‌ చరిత్రకు తనదైన భాష్యం చెప్పిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌.. పాత వ్యూహాన్నే మరోసారి అమలు చేశారు. ఉక్రెయిన్‌ అనే దేశమే లేదని స్పష్టంచేశారు. ప్రపంచ దేశాల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ....

Updated : 23 Feb 2022 05:20 IST

చరిత్ర పేరుతో ప్రాంతాల విలీనం
ఉక్రెయిన్‌ విషయంలోనూ ఇదే వ్యూహం

ఉక్రెయిన్‌ చరిత్రకు తనదైన భాష్యం చెప్పిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌.. పాత వ్యూహాన్నే మరోసారి అమలు చేశారు. ఉక్రెయిన్‌ అనే దేశమే లేదని స్పష్టంచేశారు. ప్రపంచ దేశాల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఆయన ఇప్పుడు డాన్‌బాస్‌ ప్రాంతాన్ని రెండు స్వతంత్ర దేశాలుగా గుర్తించారు. పుతిన్‌ చర్యల వెనుక బలమైన వ్యూహం ఉంది.

రష్యా, ఉక్రెయిన్‌ వేర్వేరు ప్రాంతాలు కావని పుతిన్‌ చెబుతుంటారు. 9వ శతాబ్దంలో ‘రుస్‌’ అనే స్కాండినేవియన్‌ ప్రజల నుంచి మొదలైన చరిత్రను ఆయన గుర్తుచేస్తుంటారు. వీరు తొలిసారి కీవ్‌ను రాజధానిగా చేసుకొన్నారు. ఉక్రెయిన్‌లోని భాగాలను ఆక్రమించుకొన్న ప్రతిసారి పుతిన్‌ గత చరిత్రను గుర్తు చేస్తుంటారు. 1954లో సోవియెట్‌ పాలకుడు నికితా కృశ్చేవ్‌.. క్రిమియాను కూడా ఉక్రెయిన్‌కు బహుమతిగా ఇచ్చారు. వాస్తవానికి క్రిమియాలో రష్యా జాతీయులు అత్యధిక సంఖ్యలో ఉంటారు. ఆ ప్రాంతాన్ని 2014లో ఆక్రమించుకొన్న సమయంలో దానిని పునరేకీకరణగా పుతిన్‌ అభివర్ణించారు. తాజాగా డాన్‌బాస్‌ ప్రాంతం విషయంలో కూడా ఆయన ఇదే వ్యూహం అవలంబించారు. 2001లో జరిగిన జనాభా లెక్కల్లో క్రిమియా, తూర్పు ఉక్రెయిన్‌ ప్రాంతాల్లో సగం మందికిపైగా రష్యా మూలాలు ఉన్నవారు లేదా రష్యా భాష మాట్లాడే వారు ఉన్నారు. అదే సమయంలో ఉక్రెయిన్‌, రష్యాను కలిపి సుర్జిక్‌గా పిలిచే భాషను కూడా మాట్లాడేవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఇవన్ని పుతిన్‌కు కలిసొచ్చే అంశాలే. 

2014 నుంచి దృష్టి..

2014లో క్రిమియా ఆక్రమణ తర్వాత నుంచి డాన్‌బాస్‌ ప్రాంతంలో అశాంతి పెరిగిపోయింది. దొనెట్స్క్‌, లుహాన్స్క్‌ ప్రాంతాల్లో తిరుగుబాటుదారులు 6,500 చదరపు మైళ్లను ఆక్రమించారు. వీటిని దొనెట్స్క్‌ పీపుల్స్‌ రిపబ్లిక్‌, లుహాన్స్క్‌ పీపుల్స్‌ రిపబ్లిక్‌లుగా ప్రకటించుకొన్నారు. తిరుగుబాటుదారులు ఆక్రమించుకొన్న రెండు ప్రాంతాల్లో రష్యన్‌ భాష మాట్లాడేవారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. 2014 నుంచి జరుగుతున్న పోరాటంలో దాదాపు 14వేల మంది మరణించారు. 20 లక్షల మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇతర ప్రాంతాలకు తరలిపోయారు. 

మిన్స్క్‌ చర్చలు.. ఒప్పందాలు..

2015లో ఇక్కడ హింస తీవ్రం కావడంతో రష్యా, బెలారస్‌, ఉక్రెయిన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ అధినేతలు మిన్స్క్‌ నగరంలో భేటీ అయి శాంతి ఒప్పందం చేసుకొన్నారు. దీని ప్రకారం డాన్‌బాస్‌ ప్రాంతంలోని వాటికి ప్రత్యేక హోదా, స్వయం ప్రతిపత్తిని ఉక్రెయిన్‌ ఇవ్వాలి. దీనికి బదులుగా రష్యాతో సరిహద్దు నియంత్రణ అధికారాన్ని తిరుగుబాటుదారులు ఉక్రెయిన్‌కు బదలాయించాలి. కానీ, ఈ ఒప్పందాన్ని ఉక్రెయిన్‌ అమలు చేయలేదు. అది పుతిన్‌కు కలిసొచ్చింది. పుతిన్‌ తాజా నిర్ణయాలకు మిన్స్క్‌-2 ఒప్పందం అమలు చేయకపోవడమే కారణమని రష్యా వాదిస్తోంది.

అనుకూలంగా మలచుకొని..

నాటోలోని ఐరోపా దేశాలు గ్యాస్‌ కోసం రష్యాపై ఎక్కువగా ఆధారపడ్డాయి. ముఖ్యంగా జర్మనీ వీటిల్లో ముందు వరుసలో ఉంటుంది. అమెరికా ఆంక్షలు విధిస్తే రష్యా కంటే జర్మనీ, ఇతర ఐరోపా దేశాలు తీవ్రంగా ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది. మరోవైపు సంక్షోభం ముదిరితే చమురు ధరలు భారీగా పెరుగుతాయి. చమురు, ఆయుధ విక్రయాలపై ఆధారపడిన ఆర్థిక వ్యవస్థ కావడంతో రష్యాకు ఇది కలిసొచ్చే అంశమే. మరోపక్క రష్యా చమురు ఉత్పత్తిలో కోత విధిస్తే.. దానిని భర్తీ చేసి ధరలను స్థిరీకరించడానికి ‘ఒపెక్‌ ప్లస్‌ దేశాలు’ ఎంతవరకు ముందుకొస్తాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. అల్యూమినియం, గోధుమలు వంటివి రష్యా భారీగా ఎగుమతి చేస్తోంది.

ఆంక్షల ప్రభావం లేకుండా

అమెరికా ఆంక్షలతో విసిగిపోయిన రష్యా ముందుచూపుతో ఆర్థికంగా కూడా సిద్ధమైంది. సోవియట్‌ కుప్పకూలాక 1990ల్లో రష్యా కరెన్సీ ‘రూబుల్‌’ బాగా దెబ్బతింది. ఆ తర్వాత 2008లో మరోసారి కుంగింది. 2014లో ఆంక్షల కారణంగా పతనమైంది. దీని నుంచి పాఠాలు నేర్చుకొన్న పుతిన్‌.. దేశం కఠినమైన ఆర్థిక క్రమశిక్షణను పాటించేలా చేశారు. డాలర్లపై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గించారు. ఆర్థిక స్థిరత్వం సాధించారు. సోవియట్‌ పతనం తర్వాత తొలిసారి 2020లో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిదారుగా రష్యా నిలిచింది. కరోనా సమయంలో ఆర్థిక వ్యవస్థ గాడి తప్పకుండా చూసుకొంది. నిధుల మిగులు ఉండేలా జాగ్రత్త వహించింది. ఫలితంగా ఆంక్షల ప్రభావం పెద్దగా లేకుండా చూసుకుంది. ప్రస్తుతం రష్యా విదేశీ అప్పులు చాలా తక్కువ. 640 బిలియన్‌ డాలర్ల భారీ కరెన్సీ రిజర్వును సిద్ధం చేసుకొంది. వీటిల్లో డాలర్ల శాతం చాలా తక్కువగా ఉండేట్లు చూసుకొన్నారు. దేశ కార్పొరేట్‌ రుణాలను రూబుల్స్‌లో ఉండేలా మార్పులు చేశారు. అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీలు నిర్వహించే స్విఫ్ట్‌ నుంచి బహిష్కరిస్తే ఇబ్బంది లేకుండా సొంత నిర్వహణ ఏర్పాటు చేసుకొంది. దీంతోపాటు దిగుమతులను గణనీయంగా తగ్గించుకొని చాలా వాటిలో స్వయం సమృద్ధి సాధించింది.

- ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని