Health News: మనం మారితేనే.. ఆరోగ్యం భద్రం

శారీరక శ్రమ, వ్యాయామం లేకపోవడం, జీవనశైలిలో లోపాలతో పాటు వాతావరణం- నీరు- ఆహార కాలుష్యాలు అనారోగ్యానికి కారణాలవుతున్నాయని వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు. సెల్‌ఫోన్‌తో ఎక్కువ సమయం గడపడం,

Updated : 04 Apr 2022 10:53 IST

వ్యాయామంతో పాటు పాజిటివ్‌గా ఆలోచించడంపై  సాధన అవసరం
ముప్పు కారణాలను గుర్తించి అప్రమత్తం కావాలి
‘ఈనాడు సుఖీభవ’ ప్రత్యేక వెబినార్‌లో  వైద్యనిపుణుల స్పష్టీకరణ

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: శారీరక శ్రమ, వ్యాయామం లేకపోవడం, జీవనశైలిలో లోపాలతో పాటు వాతావరణం- నీరు- ఆహార కాలుష్యాలు అనారోగ్యానికి కారణాలవుతున్నాయని వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు. సెల్‌ఫోన్‌తో ఎక్కువ సమయం గడపడం, అతిగా తినడం, మద్యం- పొగతాగడం వంటి అలవాట్లతో 25 ఏళ్ల పైబడినవారిలో మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని తెలిపారు. ‘ఈనాడు- సుఖీభవ’ ఆధ్వర్యంలో జీవనశైలి వ్యాధులపై ఆదివారం నిర్వహించిన ప్రత్యేక వెబినార్‌లో పలువురు వైద్య నిపుణులు ఆయా సమస్యలకు కారణాలు, పరిష్కార మార్గాలను సూచించారు.


మెడికల్‌ ప్రిస్క్రిప్షన్‌లా వ్యాయామం

పిల్లలు ఆటలకు దూరమై సెల్‌ఫోన్‌కు బానిస అవుతున్నారు. చాలామంది నిపుణుల సలహాలు తీసుకోకుండా నచ్చిన పద్ధతుల్లో వ్యాయామం చేయడం.. కీళ్లు,  కండరాల నొప్పులు వంటివి వస్తే.. చిన్న సమస్యే అని వదిలేయంతో దీర్ఘకాలంలో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. వ్యాయామం కూడా మెడికల్‌ ప్రిస్క్రిప్షన్‌ తరహాలో ఉండాలి. వ్యాయామంలో నొప్పులు వస్తుంటే.. ఫిజియోథెరపీ నిపుణులను సంప్రదించాలి.

- డా.ఎస్‌.రాజేశ్‌, ఫిజియోథెరపిస్ట్‌


తల్లిదండ్రులే జాగ్రత్తలు తీసుకోవాలి

దేళ్లలోపు చిన్నారుల్లో టైప్‌-1 డయాబెటిస్‌ ఉన్నవారికి ఇన్సులిన్‌ ఇంజెక్షన్లు ఇవ్వాల్సిందే. 10 నుంచి 20 ఏళ్ల మధ్య టైప్‌-2 డయాబెటిస్‌ వచ్చినవారిలో 30 శాతం మంది లావుగా ఉంటున్నారు. వీరు పీడియాట్రిక్‌ డయాబెటిస్‌తో బాధపడుతున్నట్లు గుర్తించారు. వీరికి త్వరగా చికిత్స అందించకపోతే రక్తపోటు, మూత్రపిండాల వ్యాధులు ఎక్కువవుతున్నాయి. వీరి విషయంలో తల్లిదండ్రులే జాగ్రత్తలు తీసుకోవాలి. 25 ఏళ్లు పైబడినవారిలో అధిక బరువు, శారీరక శ్రమ లేకపోవడం, మానసిక ఒత్తిడి వల్ల ఇటీవల టైప్‌-2 మధుమేహం సమస్య పెరుగుతోంది. దీంతో కాలేయ వ్యాధులూ ఉత్పన్నమవుతున్నాయి.

- డా.పి.వి.రావు, మధుమేహ పరిశోధకులు


50 సంవత్సరాల లోపే గుండె సమస్యలు  

త్తిడి, వాతావరణంలో మార్పులతో గుండె జబ్బులు పెరుగుతున్నాయి. బాధితుల్లో 50 సంవత్సరాల లోపువారే ఎక్కువగా ఉంటున్నారు.  వంద మరణాల్లో మూడోవంతు గుండె, రక్తనాళాలకు సంబంధించినవే ఉంటున్నాయి. గుండె సమస్యలు లేకపోయినా అందుకు దారితీసే రిస్క్‌ ఫ్యాక్టర్లను కనిపెట్టి నివారణ చర్యలు తీసుకోవాలి. కొలెస్ట్రాల్‌, బీపీ, బరువు ఎక్కువగా ఉండటం, ఒత్తిడి సమస్యలు ఉంటే.. ముందే గుర్తించి చికిత్స తీసుకోవాలి. 50 సంవత్సరాలు దాటినవారు సంవత్సరానికోసారి జనరల్‌ చెకప్‌ చేయించుకోవాలి. రోజుకు 30 నిమిషాల చొప్పున వారంలో 5 రోజులు వ్యాయామం చేయాలి. చిన్నారులకూ ఈ తరహా జీవనశైలిని అలవాటు చేయాలి.

- డా.రమేశ్‌ గూడపాటి, ప్రముఖ కార్డియాలజిస్ట్‌


పళ్లెంలో ఆ నాలుగు రకాలు ఉండాలి

తినే పళ్లెంలో రెండు భాగాలు పండ్లు, కూరగాయలు, ఒక భాగం గింజ ధాన్యాలు, నూనెలు, మరోభాగం మాంసకృత్తులు (పప్పు దినుసులు, చేప, గుడ్లు) ఉండాలి. అల్పాహారం తినకుండా మధ్యాహ్నం పూట ఎక్కువగా తినడం వల్ల స్థూలకాయం పెరిగిపోతోంది. 25 నుంచి 30 గ్రాముల పీచు తీసుకుంటే మలబద్ధకం రాదు. నీరు కూడా పోషకాహారం లెక్కలోకే వస్తుంది. శీతలపానీయాలకు దూరంగా ఉండాలి. రసాలకు బదులు పండ్లను తినాలి. కాఫీ, టీ వీలైనంత తగ్గించాలి.

- డా.సి.అంజలీదేవి, విశ్రాంత న్యూట్రిషన్‌ ప్రొఫెసర్‌


యోగా, ధ్యానంతో ఒత్తిడి దూరం

చికాకు, ఆకలి వేయకపోవడం, అలసిపోవడం, నిద్రపట్టకపోవడం, రక్తపోటు వంటివాటికి ఒత్తిడే కారణం. రుణాత్మక ఆలోచనలే ఒత్తిడిని తీసుకొస్తాయని అనుకోవడం పొరపాటే. ఉదాహరణకు విడాకులు ఎంత ఒత్తిడో.. పెళ్లి కూడా అంతే ఒత్తిడి. పదోన్నతి ఎంత ఒత్తిడో.. రాకపోవడమూ అంతే ఒత్తిడి. ఒక పరిస్థితికి అనుగుణంగా మనసు సర్దుబాటయ్యే సమయంలో ఒత్తిడి మొదలవుతుంది. యోగా, ధ్యానంతో వీటికి పరిష్కారం లభిస్తుంది. పాజిటివ్‌గా ఆలోచించడంపై సాధన అవసరం.

- డా.శ్రీలక్ష్మీ పింగళి, హెచ్‌వోడీ, ప్రభుత్వ వైద్య కళాశాల, సంగారెడ్డి


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని