కేంద్ర సంస్థలకిచ్చిన భూములపై నజర్‌!

రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన భూ వివరాలపై రెవెన్యూశాఖ సమగ్ర పరిశీలన చేపట్టింది.కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశ్రమలు, వివిధ సంస్థలు.. రాష్ట్రం పరిధిలోని శాఖలు, సంస్థలు సర్కారు నుంచి పొందిన భూములపై దృష్టి సారించింది. ఏ ప్రయోజనానికైతే

Updated : 26 Jun 2022 06:10 IST

13,000 ఎకరాలుంటాయని అంచనా

పంపిణీ చేసిన అన్నిరకాల భూములపై సర్కారు నిశిత పరిశీలన 

వినియోగం.. పడావుపై ఆరా!

ఈనాడు, హైదరాబాద్‌

రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన భూ వివరాలపై రెవెన్యూశాఖ సమగ్ర పరిశీలన చేపట్టింది.కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశ్రమలు, వివిధ సంస్థలు.. రాష్ట్రం పరిధిలోని శాఖలు, సంస్థలు సర్కారు నుంచి పొందిన భూములపై దృష్టి సారించింది. ఏ ప్రయోజనానికైతే ప్రభుత్వం నుంచి భూములు పొందారో.. ఆ మేరకు వాటిని వినియోగిస్తున్నారా లేదా అనే కోణంలో నిశిత పరిశీలన చేస్తున్నారు. వినియోగిస్తోంది ఎంత..పడావు ఎంత అనే లెక్కలు తీస్తున్నారు. ఈ నెల మొదటి వారంలో రెవెన్యూశాఖ ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వగా యంత్రాంగం పరిశీలన చేపట్టింది. కొన్ని జిల్లాల్లో సిబ్బంది క్షేత్రస్థాయి పరిస్థితిని కూడా నమోదు చేస్తున్నారు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఇచ్చిన భూముల్లో ఎంత మేరకు వినియోగంలో ఉన్నాయో చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయానికి పెడితే రాష్ట్రం నుంచి పొందిన భూములను వెనక్కు ఇవ్వాలని ఇటీవల పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఇప్పటి వరకు రాష్ట్ర సర్కారు పంపిణీ చేసిన, ప్రభుత్వశాఖల పరిధిలో 13.82 లక్షల ఎకరాల భూమి ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల వద్ద..

హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల పరిధిలో వేల ఎకరాల భూములు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల చెంత ఉన్నాయి. 1970 నుంచి అనేక పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం భూములు పంపిణీ చేసింది. ఎన్టీపీసీ వద్ద 7,768 ఎకరాలు, బీపీఎల్‌ 1,517, ఫెర్టిలైజర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా 1,399, ఐడీపీఎల్‌ 891, హెచ్‌ఎంటీ 888, హెచ్‌సీఎల్‌ వద్ద 324 ఎకరాల భూమి ఉంది. సర్వే ఆఫ్‌ ఇండియాతో పాటు పలు పరిశోధన సంస్థలకు కూడా వేల ఎకరాలు కేటాయించారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌, మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌ జిల్లాల్లోనూ పలు సంస్థలకు భారీగా భూములున్నాయి. కొన్ని సంస్థలు వీటిలో సగం భూమిని మాత్రమే వినియోగిస్తున్నట్లు రెవెన్యూ అధికారులు అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల పరిధిలో మొత్తం 13 వేల ఎకరాలుంటాయన్న అంచనాలున్నాయి.

సింగరేణి భూముల్లో దశలవారీగా హక్కులు

రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలకు పంపిణీ చేసిన భూముల గుర్తింపునకు ఇప్పటికే భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) కార్యాలయ సిబ్బందితో రెవెన్యూశాఖ ప్రత్యేకంగా కసరత్తు నిర్వహించింది. తాజాగా ఈ నెల మొదటి వారం నుంచి జిల్లాల్లో రెవెన్యూ సిబ్బంది సమాచారం సేకరించింది. సింగరేణి సంస్థ వద్ద వినియోగంలో లేని భూములను రెవెన్యూశాఖ దశల వారీగా స్వాధీనం చేసుకుని వాటిలో నివాసాలు ఏర్పాటు చేసుకున్న నిరుపేదలకు హక్కులు కల్పిస్తోంది. గనుల తవ్వకం పూర్తయిన భూములను కూడా ప్రభుత్వానికి అప్పగిస్తోంది. పరిశ్రమల కోసం ప్రభుత్వం నుంచి భూములు పొందిన అధీకృత యాజమాన్యాల పరిధిలో 58 వేల ఎకరాల వరకు ఉన్నాయి. భూదాన్‌, హౌసింగ్‌బోర్డులకు పలు జిల్లాల్లో భూములున్నాయి. కొన్ని చోట్ల మాత్రమే నివాసగృహాలు నిర్మించగా చాలా చోట్ల ఖాళీ స్థలం ఉన్నట్లు గుర్తించారు. మరోవైపు వివిధ శాఖలకు చెందిన భూముల్లో కబ్జాలు ఉన్నట్లు గుర్తించారు.

అభివృద్ధి-ఆదాయం అనే కోణంలో

ప్రభుత్వ భూముల ద్వారా ఆదాయం పొందాలనే యోచనలో ఉన్న సర్కారు హెచ్‌ఎండీఏ వంటి సంస్థల సహకారంతో లేఅవుట్లు, భూమి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది. నివాస ప్రాంతాలకు సమీపంలో సర్కారు భూములకుమౌలిక సౌకర్యాలు కల్పించి అమ్మనున్నారు. కాలుష్య కారక పరిశ్రమలను ఓఆర్‌ఆర్‌ వెలుపలికి తరలించేందుకు అనువైన ప్రాంతాలను పరిశీలిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని