Road Accidents: ప్రాణాలకు డెత్స్పాట్..!
అక్కడ అనునిత్యం మృత్యువు కాపు కాస్తుంటుంది. ఎంత జాగ్రత్తగా ఉన్నా దురదృష్టవంతుల్ని ఆబగా కబళిస్తుంటుంది. అలాంటి ప్రాంతాల నుంచి క్షేమంగా బయటపడటమంటే పునర్జన్మ పొందినట్లే. ‘బ్లాక్స్పాట్లు’గా పిలుచుకునే ఇలాంటి మృత్యుమార్గాలు రాష్ట్రంలో కోకొల్లలు...
మృత్యువుకు చిరునామాగా పలు ప్రాంతాలు
రోడ్డు ప్రమాద మరణాల్లో 20-25 శాతం వీటిలోనే...
ఎన్హెచ్-65పై ‘ఈనాడు’ పరిశీలనలో వెలుగులోకి...
మల్యాల సత్యనారాయణ గౌడ్, ఈనాడు - హైదరాబాద్
అక్కడ అనునిత్యం మృత్యువు కాపు కాస్తుంటుంది. ఎంత జాగ్రత్తగా ఉన్నా దురదృష్టవంతుల్ని ఆబగా కబళిస్తుంటుంది. అలాంటి ప్రాంతాల నుంచి క్షేమంగా బయటపడటమంటే పునర్జన్మ పొందినట్లే. ‘బ్లాక్స్పాట్లు’గా పిలుచుకునే ఇలాంటి మృత్యుమార్గాలు రాష్ట్రంలో కోకొల్లలు. కొద్దిపాటి మార్పులతో వీటిని చక్కదిద్ది.. ప్రాణాలు కాపాడే వీలున్నా అధికార యంత్రాంగాన్ని ఆవహించిన నిర్లిప్తత అడుగు ముందుకు పడనీయడంలేదు. రాష్ట్రంలో మునుపెన్నడూ లేనిరీతిలో ఈఏడాది 7 వేలకుపైగా మరణాలు సంభవించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఈ క్రమంలో బ్లాక్స్పాట్లపై ‘ఈనాడు’ క్షేత్రస్థాయిలో పరిశీలించింది. 2020లో రాష్ట్రంలో గుర్తించిన 1057 బ్లాక్స్పాట్లలోనే 20-25 శాతం రోడ్డుప్రమాద మరణాలు సంభవిస్తున్నట్లు వెల్లడైంది.
రాష్ట్రవ్యాప్తంగా గత మూడేళ్లలో అత్యధిక రోడ్డుప్రమాద మరణాలు వరుసగా పటాన్చెరు ఠాణా పరిధిలోనే జరిగాయి. 2018లో 62, 2019లో 64, 2020లో 50 మంది చనిపోయారు. అక్కడి బ్లాక్స్పాట్లలో జరిపిన క్షేత్రస్థాయి పరిశీలనలో పలులోపాలు బట్టబయలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా బ్లాక్స్పాట్లపై అధ్యయనానికి కలెక్టర్ల అధ్యక్షతన 3-6 నెలలకోసారి జరిగే సమీక్షల్లో ఎప్పటికప్పుడు ప్రతిపాదనలు రూపొందించారు. వీటిని స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలుగా విభజించగా.. అవి కాగితాలకే పరిమితమవుతున్నాయి. ఉదాహరణకు హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై 21 బ్లాక్స్పాట్లలో సమస్యల పరిష్కారానికి ఎన్హెచ్ఏఐకి ప్రతిపాదనలు పంపారు. కట్టంగూరు-కుడుమర్తి, ఆకుపాముల బైపాస్, కోదాడ కటికమ్మగూడెంలలో సర్వీసురోడ్ల నిర్మాణం.. చౌటుప్పల్ ఆర్టీసీ బస్టాండ్, సూర్యాపేట టేకుమట్లల్లో వెహిక్యులర్ అండర్బ్రిడ్జిల నిర్మాణం వీటిల్లో కొన్ని.. అలాగే హైదరాబాద్-నాగ్పుర్ జాతీయ రహదారిపై మేడ్చల్ పట్టణంలో సర్వీస్రోడ్డుతో పాటు పటిష్ఠమైన డివైడర్ల ఏర్పాటు ప్రతిపాదనలూ ఉన్నాయి. ఇవి కార్యరూపం దాల్చడంలేదు. రాష్ట్రవ్యాప్తంగా బ్లాక్స్పాట్లలో ఇదే పరిస్థితి నెలకొంది.
ఏవి బ్లాక్స్పాట్లంటే..
* రహదారిలో 500 మీటర్ల పరిధిలోని స్ట్రెచ్లో ఏటా 5 లేదా అంతకంటే ఎక్కువ ప్రమాదాలు లేదా మరణాలు సంభవిస్తే బ్లాక్స్పాట్గా గుర్తిస్తున్నారు.
* ఏడాదిలో 20లేదా అంతకన్నా ఎక్కువ ప్రమాదాలు జరిగితే ‘ఎ’ కేటగిరీ, 10-19 ప్రమాదాలు జరిగితే ‘బి’ కేటగిరీ, 5-9 ప్రమాదాలు సంభవిస్తే ‘సి’ కేటగిరీ బ్లాక్స్పాట్గా పరిగణిస్తున్నారు.
ముత్తంగి కూడలి.. ఆక్రమణలే అడ్డంకి
ముత్తంగి కూడలిలో రోడ్డుకు ఇరువైపులా రద్దీ
ఓఆర్ఆర్ను ఆనుకొని ఉన్న ముత్తంగి కూడలి నిత్యం రద్దీగా ఉంటుంది. పలు రాష్ట్రాల నుంచి పటాన్చెరు, పాశమైలారం, జిన్నారం, ఖాజిపల్లి, జహీరాబాద్ నిమ్జ్ పారిశ్రామిక ప్రాంతాలకు నిత్యం వేలకొద్దీ భారీ వాహనాలు ఓఆర్ఆర్పై రాకపోకలు సాగిస్తాయి. అలాంటి కూడలిలోనే ఆక్రమణలు కళ్లకు కడుతున్నాయి. జాతీయ రహదారికి ఇటుపక్క ఒక లాడ్జి, మరోవైపు హోటల్ ఉన్నాయి. ఈ రెండింటి ఎదుట వాహనాలను రోడ్డుపైనే నిలిపి ఉంచుతుండటంతో ఓఆర్ఆర్పైకి రాకపోకలతో వాహనాల రాకపోకలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. మరోవైపు ఓఆర్ఆర్కు దారితీసే సర్వీస్రోడ్డు వెంబడే లారీలను నిలిపి ఉంచుతుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. మూడేళ్లలో 30 ప్రాణాంతక ప్రమాదాల్లో 20 మంది చనిపోయారు. గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ జహీరాబాద్ పర్యటన దృష్ట్యా పోలీసులు రహదారిపై వాహనాలను సరిదిద్దుతూ కనిపించారు.
అమ్మో.. ఇస్నాపూర్ చౌరస్తా
పటాన్చెరు పారిశ్రామికవాడ నుంచి జాతీయ రహదారిపైకి వచ్చే భారీ వాహనాలతో ఇస్నాపూర్ కూడలిలో రద్దీ
పటాన్చెరులో మరో రద్దీ కూడలి ఇస్నాపూర్ చౌరస్తా. ఈప్రాంతంలోని 2 వేలకు పైగా పరిశ్రమల్లో లక్ష మంది కార్మికులున్నారు. వీరితోపాటు వెయ్యికి పైగా భారీ వాహనాలన్నీ నిత్యం కూడలి నుంచే రాకపోకలు సాగిస్తున్నాయి. కూడలిలోని జాతీయ రహదారిపై నడక వంతెనను నిర్మించారు. పారిశ్రామికవాడ నుంచి వచ్చే వాహనాలు హైదరాబాద్ వైపు వెళ్లేందుకు కొంతదూరంలో యూటర్న్ అందుబాటులోకి తెచ్చారు. అయితే కూడలికి కొద్దిదూరంలోనే ఇది ఉండటంతో ట్రాఫిక్జామ్లు నిత్యకృత్యమయ్యాయి. రంబుల్స్టిక్స్, సైన్బోర్డులు, జీబ్రాక్రాసింగ్ లైన్ల ఏర్పాటు పనుల ఆమోదం కోసం ఎన్హెచ్ఏఐకు పంపిన ప్రతిపాదనలు రూపు దాల్చలేదు. ఈ ప్రాంతంలో మూడేళ్లలో 35 ప్రాణాంతక ప్రమాదాల్లో 17 మంది చనిపోయారు.
నమ్మండి.. ఇది జాతీయ రహదారే
లక్డారం గేట్ వద్ద దుమ్ములోనే వాహనాల రాకపోకలు
వాహనాలపై దుమ్ము కొట్టుకుపోయి కనిపిస్తున్నది సాక్షాత్తూ జాతీయ రహదారి-65. హైదారాబాద్-ముంబయి మార్గంలో పటాన్చెరు సమీపంలోని లక్డారంగేట్ వద్ద గురువారం కనిపించిన దృశ్యమిది. పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతంలో భారీ వాహనాలు వేగంగా ప్రయాణించే ఈమార్గంలో ఇలాంటి ధూళిమేఘాలు నిత్యకృత్యమయ్యాయి. లక్డారం ప్రాంతంలోని క్రషర్ల నుంచి జాతీయ రహదారిపైకి వస్తున్న లారీల కారణంగా కూడలిలో దుమ్ము రేగుతోంది. భద్రతాప్రమాణాల మేరకు ఇక్కడ రహదారిపై నీళ్లు చల్లడం లేదు. కంకరచిప్స్ను తరలిస్తున్న లారీలపై కనీసం టార్పాలిన్లనూ కప్పడంలేదు. దీనికితోడు కూడలిలోనే యూటర్న్ ఉండటంతో నిత్యం ట్రాఫిక్జామ్లతో రోడ్డుప్రమాదాలు సర్వసాధారణమయ్యాయి. ద్విచక్రవాహనం లారీ కింద పడిన దుర్ఘటనలో ఇటీవల ఇద్దరు యువకులు చనిపోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.