Telangana Elections: ఆఖరి వారం అగ్రనేతలంతా రాష్ట్రంలోనే

ఎన్నికల ప్రచారంలో ఆఖరి ఘట్టం అదిరిపోనుంది. వారం రోజులపాటు అగ్రనేతల ప్రచారంతో రాష్ట్రం హోరెత్తనుంది. ప్రధాని సహా జాతీయ నేతలు, రాష్ట్ర కీలక నాయకులు అంతా ప్రచారాన్ని తార స్థాయికి తీసుకెళ్లనున్నారు.

Updated : 21 Nov 2023 07:58 IST

24 నుంచి ప్రధాన పార్టీల జాతీయ నేతల ప్రచారం

ఈనాడు, హైదరాబాద్‌: ఎన్నికల ప్రచారంలో ఆఖరి ఘట్టం అదిరిపోనుంది. వారం రోజులపాటు అగ్రనేతల ప్రచారంతో రాష్ట్రం హోరెత్తనుంది. ప్రధాని సహా జాతీయ నేతలు, రాష్ట్ర కీలక నాయకులు అంతా ప్రచారాన్ని తార స్థాయికి తీసుకెళ్లనున్నారు. సభలు, సమావేశాలు, ర్యాలీల కోసం భాజపా, కాంగ్రెస్‌, భారాస, వామపక్షాలు రంగం సిద్ధం చేసుకున్నాయి. భాజపా అగ్రనేతలు నరేంద్రమోదీ, అమిత్‌షా, జె.పి.నడ్డా; కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, మల్లికార్జునఖర్గే; భారాస అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌, సీపీఎం అగ్రనేతలు సీతారాం ఏచూరి, బృందాకారాట్‌ సహా పలువురు ముఖ్యుల ప్రచారానికి పార్టీలు ఏర్పాట్లు చేసుకున్నాయి. గతంలో ఎన్నడూ లేనట్లుగా భాజపా, కాంగ్రెస్‌ జాతీయ నేతలు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నెల 23తో ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ముగియనుండటంతో వారు తెలంగాణకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒక్కో నేత పదుల సభల్లో పాల్గొంటారు. చివరి మూడు రోజులు రాజకీయ పార్టీలు హైదరాబాద్‌పై దృష్టి పెట్టాయి. బహిరంగసభలు, రోడ్‌షోలు, ర్యాలీలతో ప్రచారాన్ని ముగించేలా ఏర్పాట్లు చేసుకున్నాయి.

25 నుంచి 27 వరకు ప్రధాని మోదీ..

ప్రధానమంత్రి నరేంద్రమోదీ 25, 26, 27 తేదీల్లో మూడు రోజులు పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. 25న రాష్ట్రానికి వచ్చే ఆయన 27 వరకు ఇక్కడే ఉంటూ సభలు, ర్యాలీల్లో పాల్గొంటారు. 25న కామారెడ్డి, మహేశ్వరం; 26న తూప్రాన్‌, నిర్మల్‌లలో బహిరంగ సభలున్నాయి. 27న మహబూబాబాద్‌, కరీంనగర్‌ బహిరంగ సభలతో పాటు హైదరాబాద్‌ రోడ్‌షోలో పాల్గొని తన ఎన్నికల ప్రచారాన్ని ముగిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రచారం 24, 26, 28 తేదీల్లో ఉంటుంది. భాజపా జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా మూడు రోజులు వివిధ ప్రాంతాల్లో నిర్వహించే సభలలో పాల్గొంటారు. ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్‌, హిమంత్‌బిశ్వశర్మ, ప్రమోద్‌ సావంత్‌ కూడా రాష్ట్రానికి వస్తున్నారు.

24 నుంచి రాహుల్‌ ఇక్కడే

కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌, ప్రియాంక 24 నుంచి 28 వరకు ఇరవైకి పైగా సభల్లో పాల్గొంటారు. ప్రియాంక 24, 25, 27 తేదీల్లో పర్యటించే పది నియోజకవర్గాలను పార్టీ ఖరారు చేసింది. 24న పాలకుర్తి, హుస్నాబాద్‌, ధర్మపురి సభల్లో, 25న పాలేరు, ఖమ్మం, వైరా, మధిర, 27న మునుగోడు, దేవరకొండ, గద్వాల ప్రచార సభల్లో ప్రసంగిస్తారు. రాహుల్‌ 24 నుంచి రాష్ట్రంలోనే ఉండనున్నారు. కామారెడ్డిలో 26న సభలో పాల్గొంటారు. మూడు లేదా నాలుగు రోజులు సభలు, ర్యాలీల్లో పాల్గొనడంతో పాటు 28న రాష్ట్రంలో ప్రచారం ముగిస్తారు.

సీపీఎం జాతీయ నేతలు

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యులు బృందా కారాట్‌, సుభాషిణి అలీ, విజయరాఘవన్‌ ఇతర ముఖ్యనేతలు 25, 26, 27 తేదీల్లో పూర్వపు నల్గొండ, ఖమ్మం జిల్లాలతో పాటు హైదరాబాద్‌ సభల్లో పాల్గొంటారు.

గజ్వేల్‌ సభతో ప్రచారం ముగించనున్న సీఎం

ముఖ్యమంత్రి కేసీఆర్‌ 25న హైదరాబాద్‌ బహిరంగ సభలో పాల్గొంటారు. 28న వరంగల్‌, గజ్వేల్‌ బహిరంగసభల్లో పాల్గొని ఎన్నికల ప్రచారాన్ని ముగించనున్నారు.

జనసేన, భాజపా అభ్యర్థులకు మద్దతుగా పవన్‌కల్యాణ్‌

జనసేన, భాజపా అభ్యర్థులకు మద్దతుగా జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ బుధవారం నుంచి సభల్లో పాల్గొంటారు. ఆ సభల్లో వరంగల్‌ వెస్ట్‌, కొత్తగూడెం, సూర్యాపేట, దుబ్బాక, తాండూరు ఉన్నాయి. 26న కూకట్‌పల్లి నియోజకవర్గంలో అమిత్‌షాతో కలిసి రోడ్‌షోలో పాలుపంచుకుంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని