Mystery: ఆ పాఠశాలలో చదువుకున్న 100 మందికి క్యాన్సర్‌..!

అమెరికాలోని ఓ పాఠశాలకు చెందిన 100 మంది పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు అరుదైన క్యాన్సర్‌ బారినపడడం సంచలనం రేపుతోంది.

Published : 16 Apr 2022 02:01 IST

మిస్టరీగా మారిన న్యూజెర్సీ ఉన్నత పాఠశాల

న్యూజెర్సీ: అదో ఉన్నత పాఠశాల. అక్కడ చదువుకున్న విద్యార్థులు, పనిచేసిన సిబ్బంది ప్రస్తుతం వేర్వేరు చోట్ల స్థిరపడ్డారు. కానీ, కాలం గడిచేకొద్దీ అనుహ్యంగా ఆ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు క్రమంగా క్యాన్సర్‌ బారినపడుతున్నట్లు తేలింది. ఇలా ఆ పాఠశాలకు చెందిన 100 మంది పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో ఈ అరుదైన క్యాన్సర్‌ గుర్తించడం సంచలనం రేపుతోంది. తనకు క్యాన్సర్‌ ఏవిధంగా సోకిందోనని ఓ పూర్వవిద్యార్థి చేసిన అన్వేషణలో ఈ విషయం బయటపడింది. అమెరికాలోని న్యూజెర్సీలో చోటుచేసుకున్న ఈ మిస్టరీ ఉదంతంపై అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు.

న్యూజెర్సీ వూడ్‌బ్రిడ్జ్‌లోని కలోనియా హైస్కూల్‌లో చదువుకున్న ఆల్‌ లుపియానోకు 20 ఏళ్ల క్రిందటే మెదడులో అరుదైన క్యాన్సర్‌ కణతిని గుర్తించారు. లుపియానోతో పాటు ఆయన సోదరి, భార్యలోనూ అటువంటి (Glioblastoma) ట్యూమర్‌ వెలుగు చూసింది. ఈ వ్యాధి నుంచి లుపియానో కోలుకున్నప్పటికీ.. దురదృష్టవశాత్తూ ఆయన సోదరి, భార్య ఇటీవలే కన్నుమూశారు. ఇలా ఒకే కుటుంబంలోని వారికి ఒకేవిధమైన క్యాన్సర్‌ సోకడం పట్ల అనుమానం వ్యక్తం చేసిన లుపియానో.. కారణాలను అన్వేషించే పనిలో పడ్డారు.

రేడియోధార్మికతపై అనుమానాలు..

క్యాన్సర్‌ కారణాలను వెతకడం మొదలుపెట్టిన లుపియానో తాను చదువుకున్న కలోనియా హైస్కూల్‌ పూర్వ విద్యార్థుల ఆరోగ్యంపై ఆరా తీశారు. 1975 నుంచి 2000 సంవత్సరం మధ్య కాలంలో అదే పాఠశాలలో చదువుకున్న 102 మంది ఇదేరకమైన బ్రెయిన్‌ క్యాన్సర్‌ బారినపడినట్లు గుర్తించారు. దీంతో ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇది కాస్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారడంతో అధికారులు రంగంలోకి దిగారు. ఈ అసాధారణ ఉదంతానికి గల కారణాలను అన్వేషించడంలో భాగంగా పాఠశాల గదుల్లోని రేడియోధార్మికతపై అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో అక్కడ గదుల్లోని ర్యాండన్ (Rn) మూలకంతోపాటు ఇతర నమూనాలను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

స్థానికుల్లో ఆందోళన..

ఒకే పాఠశాలకు చెందిన వంద మంది క్యాన్సర్‌ బారినపడిన విషయం బయటపడడంతో ఆ పాఠశాల ఉన్న స్థానికుల్లో ఆందోళన మొదలయ్యింది. ఈ విషయంపై స్పందించిన వూడ్‌బ్రిడ్జ్‌ మేయర్‌ జాన్‌ మెక్‌కార్మాక్‌.. ‘దీనిపై స్థానికులందరిలో ఆందోళన నెలకొంది. ఇది కచ్చితంగా అసాధారణమైన విషయమే. ఇందుకుగల కారణాలను తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు’ అని అన్నారు. మరోవైపు ఒకే పాఠశాలకు చెందిన ఇంతమంది బాధితులుగా మారడానికి సమాధానాలు లభించే వరకూ విశ్రాంతి తీసుకోనని 50ఏళ్ల లుపియానో స్పష్టం చేస్తున్నారు.

ఇదిలాఉంటే, గ్లియోబ్లాస్టోమా అనేది చాలా అరుదైన క్యాన్సర్‌. ప్రతి లక్ష జనాభాలో కేవలం 3.2 మందిలోనే ఇది బయటపడే అవకాశం ఉంటుందని అమెరికన్‌ అసోసియేషన్‌ సర్జన్స్‌ గణాంకాలు చెబుతున్నాయి. కలోనియా హైస్కూల్‌కు చెందిన పూర్వ విద్యార్థుల్లో వెలుగు చూసిన క్యాన్సర్‌ ఈ రకానికి సంబంధించినదే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు