కశ్మీర్‌లోకి టర్కీ విషం..!

పాకిస్థాన్‌ కొత్త ఆప్త మిత్ర దేశం టర్కీ.. ఇప్పుడు కశ్మీర్‌లో నేరుగా తలదూర్చేందుకు ప్రయత్నాలు మొదలుపెడుతోంది. ఇప్పటికే పలు మార్లు ఈ అంశంపై వ్యాఖ్యలు చేసి భారత్‌ నుంచి హెచ్చరికలను అందుకొంది. తాజాగా సిరియా నుంచి కిరాయి ఉగ్రమూకను కశ్మీర్‌లోకి తరలించాలని కుట్రలు పన్నుతోంది.

Updated : 04 Dec 2020 15:35 IST

* బయటపెట్టిన గ్రీకు పత్రిక
* భారత్‌ దెబ్బకు నిస్సహాయ స్థితికి పాక్‌ ఉగ్రసంస్థలు 

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

పాకిస్థాన్‌ కొత్త ఆప్త మిత్ర దేశం టర్కీ.. ఇప్పుడు కశ్మీర్‌లో నేరుగా తలదూర్చేందుకు ప్రయత్నాలు మొదలుపెడుతోంది. ఇప్పటికే పలు మార్లు ఈ అంశంపై వ్యాఖ్యలు చేసి భారత్‌ నుంచి హెచ్చరికలను అందుకొంది. తాజాగా సిరియా నుంచి కిరాయి ఉగ్రమూకను కశ్మీర్‌లోకి తరలించాలని కుట్రలు పన్నుతోంది. ఈ విషయాన్ని గ్రీకు జర్నలిస్టు ఆండ్రెస్‌ మౌంటుజోర్లియస్‌ తన కథనంలో పేర్కొన్నాడు. పెంటపోస్టగ్మా అనే గ్రీకు పత్రిక ఈ మేరకు విస్తృత కథనాన్ని ప్రచురించింది. ఇది ఇప్పుడు సంచలనం రేపుతోంది. దక్షిణాసియాలో పరపతి పెంచుకొని సౌదీ అరేబియాను సవాల్‌ చేయాలన్నది టర్కీ పన్నాగంగా దీనిలో వెల్లడించారు. ఇందుకు కశ్మీర్‌ను పావుగా వాడుకోవడానికి సిద్ధమవుతోంది. కొన్నాళ్ల క్రితం అజర్‌ బైజన్‌- అర్మేనియా యుద్ధంలో పాల్గొనేందుకు కిరాయి మూకలను పాక్‌, టర్కీలు ఉసిగొల్పిన విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు. కశ్మీర్‌లో ఉగ్రవాదులను రాష్ట్రీయ రైఫిల్స్‌ ఏరివేయడం.. బీఎస్‌ఎఫ్‌ సరిహద్దులను బిగించడంతో పాక్‌ మూకలకు పాలుపోవడంలేదు.

సులేమానీ షా బ్రిగేడ్‌కు అప్పగింత..?

కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని పెంచే పనిని సులేమానీ షా బ్రిగేడ్‌కు అప్పగించినట్లు గ్రీకు పత్రిక పేర్కొంది. ఈ బ్రిగేడ్‌ సిరియన్‌ నేషనల్‌ ఆర్మీలో పనిచేసిందని వెల్లడించింది. దీని నాయకుడు అబూ ఎమ్సా ఐదు రోజుల క్రితమే ఆఫ్రిన్‌లో తన బృంద సభ్యులతో సమావేశమై కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని  పెంచాలనే టర్కీ లక్ష్యాన్ని వెల్లడించినట్లు ఈ పత్రిక పేర్కొంది. కిరాయి బృందంలో ఒక్కోరికి 2వేల డాలర్లు ఇస్తారని అబు వెల్లడించాడు. కశ్మీర్‌ కూడా కరభాకు వలే పర్వత ప్రాంతమని పేర్కొన్నాడు. అంతేకాదు.. కశ్మీర్‌ వెళ్లాలనుకునేవారి పేర్లను టర్కీ అధికారులు నమోదు చేసుకొన్నారని ఆ పత్రిక వెల్లడించింది. ఇలాంటి కార్యక్రమాలనే ఎజాజ్‌, గెరాబ్లుస్‌, బప్‌, అఫ్రిన్‌,ఇడ్లిబ్‌ ప్రాంతాల్లో నిర్వహించారని పేర్కొంది. ఈ కథనాన్ని దిల్లీలోని టర్కీ రాయబారి ఓజ్‌కాన్‌ ట్రోన్లర్‌ ఖండించారు. గ్రీకు పత్రిక ఆధార రహిత కథనం ప్రచురించిందని పేర్కొన్నారు. 

జైషేకు ‘సరుకు’ పంపిణీ కష్టమైంది..

కశ్మీర్‌ సరిహద్దులను పూర్తిగా మూసివేయడం.. సరిహద్దు వాణిజ్యాన్ని ఆపివేయడం.. సెన్సర్లు, కెమెరాలు ఇతర నిఘా సాధనాల వినియోగాన్ని బలగాలు గణనీయంగా పెంచాయి. దీంతో పాక్‌ నుంచి ఆయుధ సరఫరా కష్టంగా మారిపోయింది. ఇటీవల  జమ్ము నగ్రోటా టోల్‌ ప్లాజ వద్ద ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతం అయ్యారు. ఆ తర్వాత జైషే ఆపరేషనల్‌ కమాండర్‌ ముఫ్తీ రవూఫ్‌ అష్గర్‌ కశ్మీర్‌లోని తమ శ్రేణులకు పంపిన ఓ సందేశం బయటకు పొక్కింది. దీనిలో ‘వస్తువులు’ పంపడం కష్టంగా మారింది అని పేర్కొన్నాడు. జైషే చీఫ్‌ మసూద్‌ అజర్‌కు అష్గర్‌ చిన్నతమ్ముడు. మసూద్‌ చికిత్స చేయించుకుంటుండటంతో.. ఇప్పుడు జైషేకు అష్గర్‌ అనధికారిక చీఫ్‌గా వ్యవహరిస్తున్నాడు. 

చైనా డ్రోన్లు వినియోగం..

ఆయుధ రవాణాకు పాక్‌ డ్రోన్లను వినియోగించడం మొదలుపెట్టింది. చైనాలో తయారైన పెద్ద డ్రోన్లను వినియోగించడం ప్రారంభించింది. పంజాబ్‌, జమ్మూకశ్మీర్‌ ప్రాంతాల్లో వీటి సంచారం గణనీయంగా పెరిగినట్లు సమాచారం. కశ్మీర్‌లో పర్వత ప్రాంతాలు ఎక్కువగా ఉండటంతో ఆయుధాలను డ్రోన్ల ద్వారా పంజాబ్‌ ప్రాంతంలో జారవిడిచి.. అక్కడి నుంచి కశ్మీర్‌కు తరలిస్తున్నారు. డ్రోన్లతో దాడులు చేసే అంశాలను కూడా పాక్‌ ఐఎస్‌ఐ ఏప్రిల్‌లో లష్కరే , జైషే కమాండర్లతో చర్చించింది. అక్టోబర్‌లో ఇలాంటి డ్రోన్లను భారత్‌ కూల్చింది. 

సొరంగాలు తవ్వుకొని..

నవంబర్‌ 19న భారత్‌లో ప్రవేశించిన ఉగ్రవాదులు కంచెను తెంచుకొని రాలేదు. పకడ్బందీగా తవ్విన ఓ 200 మీటర్ల సొరంగంలో నుంచి భారత్‌లోకి అడుగు పెట్టారు. సరిహద్దుల వెంట సొరంగాలు కొత్తేమీ కాదు. కానీ.. ఇటీవల కాలంలో మాత్రం వీటి వినియోగం పెరిగిపోయింది. ఇటీవల ఎన్‌కౌంటర్‌ సమయంలో స్వాధీనం చేసుకొన్న 11 ఏకే7 తుపాకులను ఈ మార్గంలో తరలించారు. దీంతోపాటు ఎటువంటి కవ్వింపు చర్య లేకుండా పాక్‌ వైపు కాల్పులు మొదలయ్యాయంటే చొరబాట్లకు ప్రయత్నాలు జరుగుతున్నట్లే అన్న విషయం భద్రతా దళాలు గుర్తించాయి. ముజఫరాబాద్‌లో లష్కరే క్యాంపులు, ఖైబర్‌ కనుమల్లో హిజ్బుల్‌ ముజాహుద్దీన్‌  మూకలకు శిక్షణ ఇస్తున్నారు. దీంతో మరో ఉగ్రసంస్థ అల్‌ బదర్‌ మాత్రం బంగ్లాదేశ్‌ మార్గంలో భారత్‌లోకి చొరబడాలనే పన్నాగాలు పన్నుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని