కరోనా వారికి ఉపాధి కల్పించింది

కరోనా సృష్టించిన విలయానికి ప్రపంచమంతా అతలాకుతలమైంది. లక్షల మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. ఆర్థికవ్యవస్థ అస్తవ్యస్తమైంది. కానీ, బిహార్‌లోని రంతి గ్రామస్థులకు మాత్రం ఇది ఓ చక్కని ఉపాధిని కల్పించింది. అదేంటి అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమే. కరోనా విపత్తు సమయంలోనూ ఆ కుటుంబాలన్నీ సంతోషంగా...

Published : 07 Oct 2020 13:06 IST

పట్నా: కరోనా సృష్టించిన విలయానికి ప్రపంచమంతా అతలాకుతలమైంది. లక్షల మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. ఆర్థికవ్యవస్థ అస్తవ్యస్తమైంది. కానీ, బిహార్‌లోని రంతి గ్రామస్థులకు మాత్రం ఇది ఓ చక్కని ఉపాధిని కల్పించింది. అదేంటి అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమే. కరోనా విపత్తు సమయంలోనూ ఆ కుటుంబాలన్నీ సంతోషంగా ఉన్నాయి. కారణమేంటో తెలుసా?

రంతి.. మధుబాణి కళలకు ప్రసిద్ధి. ఇక్కడ చాలా మంది వస్త్రాలపై అల్లికలు వేస్తూ జీవనం సాగిస్తుంటారు. కరోనా మహమ్మారి ప్రభావం వీరిపైనా పడింది. ఆర్డర్లు లేకపోవడంతో కుటుంబాలను నెట్టుకొచ్చేందుకు చాలా అవస్థలు పడ్డారు. అయితే వీరు కల్పోయిన ఉపాధి మరో రూపంలో వెతుక్కొచ్చింది. అదే మాస్క్‌. ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా మాస్క్‌ ధరించడం తప్పని సరైపోయింది. ప్రతి ఒక్కరు రెండు మూడు తమ వద్దే ఉంచుకొని, అవసరాన్ని బట్టి వాడుకుంటున్నారు. తొలినాళ్లలో సర్జికల్‌ మాస్కులు, ఎన్‌95 మాస్కులు ధరించేవాళ్లు. క్రమేపీ కాటన్‌తో  చేసిన మాస్కులు మార్కెట్లోకి వచ్చాయి. చాలా మంది వాటినే వాడేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో వాటిలో కాస్తా వైవిధ్యంగా ఉండేవాటికి ప్రాధాన్యమిస్తున్నారు.

ఆ ప్రాధాన్యతే ఆ గ్రామస్థుల పాలిట వరంగా మారింది. మాస్కులపై చిన్నగా అల్లికలు, పెయింట్స్‌ వేసి దగ్గర్లోని పట్టణంలో అమ్మడం మొదలు పెట్టారు. విపరీతమైన గిరాకీ వచ్చింది. దీంతో దగ్గర్లోని వ్యాపారస్థులు వాళ్ల దగ్గర నుంచి  హోల్‌సేల్‌గా కొనడం ప్రారంభించారు. దీంతో వారందరికీ చేతినిండా పని దొరికినట్లయింది. స్థానిక దస్త్‌కారి చేనేత పరిశ్రమ మరింత ముందుకొచ్చి వీటికి ప్రచారం కల్పించడం కోసం ప్రముఖ ఆర్టిస్టులు తయారు చేసిన మాస్కుల చిత్రాలతో ఓ కెటలాగ్‌ తయారు చేయించింది. అంతేకాకుండా ఆయా పెయింటింగ్స్‌లో ప్రావీణ్యులైన వారితో ప్రత్యేకంగా మాస్కులు తయారు చేయించి అమ్మడం ప్రారంభించింది. అక్కడి నుంచి క్రమంగా ఈ మాస్కులు ఈశాన్య రాష్ట్రాలకూ విస్తరించాయి.

ఆయుర్వేద లక్షణాలతో మాస్కులు
కరోనా మహమ్మారి ఉద్ధృతి ఇప్పట్లో తగ్గే సూచనలు ఎలాగూ కనిపించడం లేదు. భవిష్యత్‌లోనూ మాస్కు వాడకం తప్పదేమో అనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బిహార్‌లోని మరికొన్ని టెక్స్‌టైల్ కంపెనీలు పర్యావరణ అనుకూలంగా ఆయుర్వేద లక్షణాలతో మాస్కులు తయారు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎర్ర చందనం, తులసి కలబంద, నిమ్మ తదితర 108 ఆయుర్వేద మూలికలతో తయారు చేసిన మిశ్రమంలో ఈ కాటన్‌ వస్త్రాన్ని డైయింగ్‌ చేసి దానితో మాస్కులు తయారు చేస్తారు. దీనివల్ల ఆ వస్త్రం నుంచి సువాసన రావడంతోపాటు ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని నెయిర్‌ టెక్స్‌టైల్‌ నిర్వాహకుడు శ్రీవాత్సవ చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని