ఆన్‌లైన్‌ చదువులకు ఈ సంస్థల చేయూత! 

ఇప్పుడు ప్రపంచమంతా ఆన్‌లైన్‌లోనే చక్కర్లుకొడుతోంది. ఆన్‌లైన్‌ సేవలని అందిపుచ్చుకొని కొన్ని రంగాలు దూసుకుపోతుంటే.. మరికొన్ని రంగాలు సమస్యలతో సవాళ్లు ఎదుర్కుంటున్నాయి. అలా సవాళ్లతో కూడిన రంగాల్లో ఒకటి విద్యారంగం. కరోనారాకతో ఆన్‌లైన్‌ చదువులు అందుబాటులోకొచ్చాయి.

Published : 22 Feb 2021 09:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా ప్రభావంతో స్కూళ్లు తెరుచుకోవడం లేదు. ఆన్‌లైన్‌ చదువులు తప్పనిసరి అయ్యాయి. కానీ విద్యార్థులందరూ ఆ సేవలని వినియోగించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో నివసించే చిన్నారులు. అందుకే కొన్ని స్వచ్ఛంద సంస్థలు వారి చదువులకు చేయూతనిస్తున్నాయి. ఆన్‌లైన్‌ విద్యతో వారిలో ఆసక్తిని పెంచుతున్నాయ్‌. ఆ చిన్నారుల చదువుల్లో మీరూ భాగస్వామ్యం కావచ్చు. కాస్త బోధన అనుభవం ఉంటే చాలు ఓ వాలంటీర్‌గా చేరొచ్చు. 

చిన్నారుల విద్యాలోకం
ఇది ఈ-లెర్నింగ్‌ ప్లాట్‌ఫామ్‌. పేరు ‘విద్యాలోక’. దేశంలోని మారుమూల గ్రామాల్లో నివసిస్తున్న పిల్లలకు విద్యనందించడం ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం. గ్రామాల్లోని ప్రజలు, వాలంటీర్‌ ఉపాధ్యాయుల సహకారంతో మారుమూల గ్రామాల్లోని పిల్లలకు డిజిటల్ తరగతులను నిర్వహిస్తోందీ సంస్థ. 20దేశాల నుంచి సుమారు 1750మంది స్వచ్ఛంద ఉపాధ్యాయులు ఈ సంస్థ ద్వారా చిన్నారులకు బోధిస్తున్నారు. దేశంలోని పది రాష్ట్రాల్లో, తెలుగుతో సహా 7 ఇతర భాషల్లో సుమారు 20 వేల మంది ఈ సంస్థ సాయంతో విద్యను అభ్యసిస్తున్నారు.  
వెబ్‌సైట్‌: www.evidyaloka.org

వాలంటీర్లే నాయకులు
ఈ సంస్థ చేయూతతో వివిధ విశ్వవిద్యాలయాల నుంచి అనేక మంది విద్యార్థులు ‘టీచ్‌ ఫ్రం హోమ్‌’ కార్యక్రమాన్ని రూపొందించారు. దీని ద్వారా వెనకబడిన వర్గాల పిల్లలకు విద్యనందిస్తున్నారు. వెబ్‌ సైట్‌ పేరు ‘వరల్డ్‌ యూత్‌ కౌన్సిల్’‌. విద్యార్థులకు స్మార్ట్‌ఫోన్‌ సదుపాయం ఉంటే చాలు. వాట్సాప్‌ లేదా గూగుల్ మీట్‌ ద్వారా వర్చువల్‌ పాఠాలు బోధిస్తోంది. ఆన్‌లైన్‌లో శిక్షణనిస్తోంది. స్మార్ట్‌ఫోన్‌ సదుపాయం లేని చిన్నారులకు ఫోన్‌కాల్‌ ద్వారా గంటపాటు వివిధ అంశాలపై బోధన సౌకర్యం కల్పిస్తోంది.  వెబ్‌సైట్‌: www.worldyouthcouncil.org

విద్యతో పాటు విలువలు
పెద్ద స్వచ్ఛంద సంస్థలలో ఒకటి. పేరు భూమి. దేశవ్యాప్తంగా ఉన్న అనాథాశ్రమాలు, వసతి గృహాలు, మురికివాడలు, గ్రామ కమ్యూనిటీ కేంద్రాల్లోని చిన్నారులకి విద్యతో పాటు వారిలో నైతిక విలువలు బోధిస్తారు. సమాజంలో ఉన్నతంగా జీవించేలా వారికి చేయూతనందించడం ఈ సంస్థ ఉద్దేశం. ఈ సంస్థ ద్వారా చదువుకున్న యువత చిన్నారులకు పాఠాలు బోధించేందుకు ముందుకు రావొచ్చు. దేశంలోని అనేక గ్రామాల నుంచి సుమారు పదివేల మంది విద్యార్థులు ఈ సంస్థ ద్వారా శిక్షణ పొందుతున్నారు.
 వెబ్‌సైట్‌: www.bhumi.ngo

కొండప్రాంతాలకూ..
దేశంలోని మారుమూల, కొండ ప్రాంతాల్లోని పిల్లలకు సరైన విద్యావకాశాలు ఉండవు. ఇతర ప్రాంతాల వారితో పోలిస్తే అసమానతలెక్కువ. ఈ అంతరాన్ని తగ్గించడానికి ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలతో కలిసి పనిచేస్తోంది ‘ఇండియన్‌ ఫౌండేషన్‌ ఫర్‌ ఎడ్యుకేషనల్‌ ట్రాన్ఫర్‌మేషన్‌’. విద్య ద్వారా ఈశాన్య భారత మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న చిన్నారులను సామాజికంగా, ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తోంది. ప్రస్తుతం చాలా మంది వాలంటీర్‌లు ఇందులో భాగస్వామ్యులవుతున్నారు. పిల్లలు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో కలిసి పనిచేస్తున్నారు. 
వివరాలు: docs.google.com/forms/d/e/1FAIpQLSccgWrnKiqTuLaGX80dRjLDAHg3DzE5idgu8by5cZ8DzSp5pg/viewform

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు