మరో మహమ్మారికి నిరోధం: గబ్బిలాల వేట!

గబ్బిలాలను పట్టుకోండి..మరో ప్రపంచ మహమ్మారిని నివారించడంలో సహాయపడండంటూ బ్రెజిల్‌లో శాస్త్రవేత్తలు ఓ ప్రత్యేక మిషన్‌ చేపట్టారు. 

Published : 14 Dec 2020 20:17 IST

శాస్త్రవేత్తల ముమ్మర ప్రయోగాలు

రియో డి జనైరో: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారి‌ గబ్బిలాల నుంచే వచ్చినట్లు భావిస్తోన్న విషయం తెలిసిందే. అయితే, దీనిపై ఇప్పటివరకు కచ్చితమైన రుజువులు లేనప్పటికీ.. మరో మహమ్మారి సంక్రమణను అడ్డుకునేందుకు శాస్త్రవేత్తలు నడుం బిగించారు. ఇందుకోసం ‘గబ్బిలాలను పట్టుకోండి..మరో ప్రపంచ మహమ్మారిని నివారించడంలో సహాయపడండంటూ’ ఓ ప్రత్యేక మిషన్‌ చేపట్టారు. ఫియోక్రూజ్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు గబ్బిలాలను పట్టుకొని, వాటిపై అధ్యయనం చేసేందుకు వాటికోసం గాలింపు మొదలుపెట్టారు. గబ్బిలాల్లో ఇతర ప్రమాదకర వైరస్‌లు ఏమైనా ఉన్నాయా? అని కనుగొనే లక్ష్యంతో ప్రారంభించన తాజా అధ్యయనంతో మరో మహమ్మారి విజృంభించకుండా ముందుగానే గుర్తించవచ్చని భావిస్తున్నారు.

విశ్వవ్యాప్తంగా కరోనా సృష్టిస్తోన్న విలయం వల్ల ప్రపంచదేశాలు పాఠాలు నేర్చుకుంటున్నాయి. ఒక్కచోట ఇలాంటి వైరస్‌ బయటపడితే స్వల్ప కాలంలోనే యావత్‌ ప్రపంచం మొత్తం సోకుతుందని ఇప్పటికే నిరూపితమైంది. ఈ నేపథ్యంలో మానవులలో అత్యంత వేగంగా వ్యాప్తిచెందే ప్రాణాంతక ఇతర వైరస్‌లను గుర్తించడం, ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసే లక్ష్యంతో శాస్త్రవేత్తలు పలు పరిశోధనలు చేపట్టారు. ఇందులో భాగంగానే ప్రమాదకర వైరస్‌లకు కారణమయ్యే గబ్బిలాలపై బ్రెజిల్‌లో శాస్త్రవేత్తలు దృష్టిసారించారు.

అసాధారణ రోగనిరోధక శక్తి..
‘రహస్యమేమిటంటే.. గబ్బిలాలు అసాధారణ రోగనిరోధక శక్తి కలిగి ఉంటాయి. తద్వారా వాటికి ఎగిరే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది’ అని మోంటానా స్టేట్‌ యూనివర్సిటీకి చెందిన ఎపిడెమాలజిస్ట్‌ రైనా ప్లోరైట్‌ పేర్కొన్నారు. ఇలా ఎగరడం వల్ల వచ్చే ఒత్తిడిని తట్టుకునేందుకు వాటికి ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది. వీటితో పాటు ఆ సమయంలో వాటి జీవక్రియ రేటు కూడా పదహారు రెట్లు పెరుగుతుంది. ఇలాంటి అంశాలన్నీ వ్యాధికారకాల నుంచి గబ్బిలాలకు అదనపు రక్షణ కలిగిస్తాయని రైనా ప్లోరైట్‌ అభిప్రాయపడ్డారు. ఇలా వాటి రోగనిరోధక శక్తి రహస్యాలు, వాటిలో వైరస్‌ల నివాసం వంటి అంశాలను మరింత అర్ధం చేసుకునేందుకు తాజా పరిశోధన దోహదం చేస్తుందని కెనడా యూనివర్సిటీకి చెందిన వైరాలజిస్ట్‌ మెక్‌మాస్టర్‌ పేర్కొన్నారు. తద్వారా గబ్బిలాల నుంచి మానవులకు వైరస్‌ల సంక్రమణ, చికిత్సా విధానాల వ్యూహాల్లోనూ ఈ పరిశోధనా సమాచారం దోహదపడుతుందని తెలిపారు.

వైరస్‌లపై భారత్‌లోనూ పరిశోధనలు..
వైరస్‌లను ఎప్పటికప్పుడు గుర్తించి వాటిని పరిశోధనలు చేసేందుకు ప్రపంచ దేశాలు చాలాకాలంగా పరిశోధనలు చేపడుతున్నాయి. అయితే, వీటికి నిధులు కేటాయించడంలో అంతగా శ్రద్ధ చూపకపోవడం, అత్యవసరంగా పరిగణించకపోవడంతో ఇవి మరుగున పడిపోతున్నాయి. భారత్‌లోనూ దాదాపు 25 వైరస్‌ పర్యవేక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసే ఉద్దేశంతో కేంద్రం ఓ ప్రణాళికను రూపొందించింది. బయోడైవర్సిటీ హ్యూమన్‌ వెల్-‌బీయింగ్‌ పేరుతో 2018లో చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం ప్రస్తుతం పెండింగ్‌లో ఉండిపోయింది. అయితే, దీన్ని వచ్చే ఏడాది ప్రారంభించే అవకాశాలున్నాయి. ఇలాంటి పరిశోధనలు ముమ్మరంగా కొనసాగించడం వల్ల ప్రమాదకర వైరస్‌లను ఆదిలోనే గుర్తించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

సంక్రమణ తగ్గించాలంటే..?
గబ్బిలాల నుంచి మానవులకు వైరస్‌లు సోకుతున్నాయని వస్తోన్న వార్తల నేపథ్యంలో వాటిని చంపే ప్రక్రియ కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతోంది. అయితే, వీటిపై దాడి చేయడం వల్ల సమస్య పరిష్కారం కాదని, ఒక్కోసారి మనకే ఇబ్బందులు ఎదురౌతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. గబ్బిలాలపై అపోహల వల్లే ప్రజలు అలాంటి చర్యలకు పాల్పడుతున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పర్యావరణాన్ని కాపాడటంలో గబ్బిలాలు కూడా కీలకంగా వ్యవహరిస్తాయని స్పష్టంచేస్తున్నారు. పత్తి, మొక్కజొన్న వంటి మరికొన్ని రకాల పంటలను నాశనం చేసే కీటకాలను తినడానికి అడవిలోని గబ్బిలాలు ఎంతో అవసరమని అంటున్నారు. ఈ నేపథ్యంలో వీటినుంచి వచ్చే వ్యాధులను నిరోధించడానికి వాటికి మానవులు, పశువులకు వాటితో సంబంధాలను తక్కువగా ఏర్పరచుకోవడమే సరైన విధానమని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

ఇదిలాఉంటే, కరోనా వైరస్‌పై మూలాలపై ఇప్పటికే పరిశోధనలు కొనసాగుతున్నాయి. థాయ్‌లాండ్‌లోనూ ఇప్పటికే గబ్బిలాలపై పరిశోధనలు జరుపుతున్నారు. అయితే, కరోనా వైరస్‌ గబ్బిలాల నుంచి సోకినట్లు ఇంకా రుజువు కానప్పటికీ గబ్బిలాల నుంచి గుర్రాలకు అనంతరం మానవులకు వైరస్‌ సోకిన దాఖలాలు ఉన్నాయి. 1994 సంవత్సరంలో హండ్రా వైరస్‌ను తొలిసారిగా గుర్తించారు. ప్రాణాంతకమైన ఈ వైరస్‌ సోకిన వారిలో దాదాపు 60శాతం మంది ప్రాణాలు కోల్పోగా, వైరస్‌ బారిన పడ్డ 75శాతం గుర్రాలు కూడా మరణించాయని శాస్త్రవేత్తలు గుర్తుచేస్తున్నారు.

ఇవీ చదవండి..
గబ్బిలాల కోసం దేశమంతా వేట!
గబ్బిలం గుట్టు విప్పింది

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని