ఫైటర్‌ పైలట్‌ విలువ తెలుసా..?

భారత్‌ యుద్ధవిమనాలు.. హెలికాప్టర్లు.. రవాణ విమానాలు వరుసగా నేల కూలుతూనే ఉన్నాయి. దీంతో చాలా మంది పైలట్లు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. చాలా మంది అత్యంత విలువైన యుద్ధవిమానం కోల్పోయామని చూస్తారు.. కానీ, పైలట్‌ను కోల్పోవడం దేశానికి అంతకంటే పెద్ద నష్టం

Updated : 07 Dec 2020 18:00 IST

మిగ్‌-29కే కంటే పైలట్‌ మరణంతోనే అధిక నష్టం..!
వారి అనుభవానికి వెలకట్టలేము..!

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

భారత‌ యుద్ధవిమానాలు.. హెలికాప్టర్లు.. రవాణా విమానాలు వరుసగా నేల కూలుతూనే ఉన్నాయి. దీంతో చాలా మంది పైలట్లు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. చాలా మంది అత్యంత విలువైన యుద్ధవిమానం కోల్పోయామని అంటారు.. కానీ, పైలట్‌ను కోల్పోవడం దేశానికి అంతకంటే పెద్ద నష్టం. ప్రభుత్వాలు మారుతున్నా.. ఈ దుర్ఘటనలు మాత్రం ఆగటంలేదు. గత నెలాఖరులో గోవా సమీపంలో ఓ మిగ్‌-29కే శిక్షణ విమానం సముద్రంలో కుప్పకూలింది. ఒక శిక్షణా పైలట్‌ ప్రాణాలతో బయటపడి చికిత్స పొందుతుండగా.. మరో పైలట్‌ నిషాంత్‌ సింగ్‌ ఆచూకీ మాత్రం తెలియలేదు. గోవాలోని ఐఎన్‌ఎస్‌ హంస వైమానిక స్థావరానికి చెందిన మూడు మిగ్‌-29కెలు ఏడాది వ్యవధిలో కుప్పకూలడం ప్రమాద ఘంటికలను మోగిస్తోంది.

ఫైటర్‌ పైలట్‌ ట్రైనింగ్‌ అంత ఈజీ కాదు..

ఫైటర్‌ పైలట్‌ శిక్షణ అంత తేలిగ్గా ఉండదు. మూడు దశల్లో 285 గంటల కఠిన శిక్షణ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి అంశంలో 100శాతం ప్రదర్శన చేస్తేనే ముందుకు వెళతారు. పైలట్‌ శిక్షణ ఖర్చు బహిర్గతం చేయకపోయినా.. కోట్లల్లోనే ఉంటుంది. ఒక సారి శిక్షణ విమానం గాల్లోకి ఎగరాలంటే చాలా సపోర్టింగ్‌ టీమ్స్‌‌ పనిచేయాల్సి ఉంటుంది. రాడార్లు, వాటి నిర్వహణ, ఏటీసీ నిర్వహణ, అత్యంత నిపుణులైన శిక్షకులను ఏర్పాటు చేయడం, రన్‌వేను సిద్ధం చేయడం, లోకల్‌ ఫ్లైయింగ్‌ ఏరియా, సిమ్యూలేటర్లు ఇలా ప్రతి ఒక్కటి అత్యంత ఖర్చుతో కూడుకున్నవి. అన్ని టెక్నాలజీలను సొంతంగా తయారు చేసుకొనే అమెరికా వంటి దేశాల్లోనే ఎఫ్‌-22 రాప్టర్‌ పైలట్‌ శిక్షణ ఖర్చు 10.90 మిలియన్‌ డాలర్లు(ఫోర్బ్స్‌ లెక్కల ప్రకారం) సీ130జే రవాణా విమాన పైలట్‌ శిక్షణ ఖర్చు 2.47 మిలియన్‌ డాలర్లు. భారత్‌ సీ-130 రకం విమానాలను వినియోగిస్తుంది. ఎఫ్‌-16 ఫైటర్‌ జెట్‌ పైలట్‌ శిక్షణ ఖర్చు 5.62 మిలియన్‌ డాలర్లు. భారత్‌లో కూడా శిక్షణకు 2015 లెక్కల ప్రకారం రూ.13 కోట్లు ఖర్చవుతుంది. ఇప్పుడు ఆ విలువ ఇంకా పెరిగి ఉంటుంది. అన్నిటికీ మించి పైలట్‌కు సొంతమయ్యే అనుభవం అత్యంత విలువైనది. దీనికి వెలకట్టలేం. తాజాగా ఆచూకీ గల్లంతైన నిషాంత్‌ పైలట్లకు శిక్షకుడు. అంటే నౌకాదళ నష్టం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 

కాగ్‌ ఎప్పుడో హెచ్చరించింది..

భారత నౌకాదళంలో విమాన వాహక నౌకలపై మిగ్‌-29కెలను వినియోగించడాన్ని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ ఎప్పుడో తప్పుపట్టింది. 2016 జులైలో విడుదల చేసిన నివేదిక ప్రకారం ఈ విమానాల్లో చాలా సమస్యలు ఉన్నాయని పేర్కొంది. ఈ నేవల్‌ ఫైటర్‌ జెట్‌ ఎయిర్‌ ఫ్రేమ్‌లో చిక్కులు ఉన్నాయని తెలిపింది. దీంతోపాటు దీనిలో వినియోగించే ఆర్‌డీ-33 ఎంకే ఇంజిన్‌, ఫ్లైబై వైర్‌ వ్యవస్థలో ఇబ్బందులు ఉన్నాయని తెలిపింది. ఈ విమానంలో రెండు ఇంజిన్లు ఉంటాయి. 2016 నాటికి ఒక ఇంజిన్‌ మోరాయించడంతో.. మిగిలి ఇంజిన్‌తోనే తంటాలుపడి ల్యాండ్‌ అయిన ఘటనలు 10 చోటు చేసుకొన్నాయని పేర్కొంది. ఈ ఇంజిన్‌ జీవిత కాలం కూడా తక్కువగా ఉంటోంది. 

నిషాంత్‌కు ఏం జరిగి ఉంటుంది..

యుద్ధ విమానాలు కూలిపోతాయి అని తెలిసినప్పుడు పైలట్‌ దానిని ల్యాండ్‌ చేయడానికి చివరి వరకు ప్రయత్నిస్తారు. ఇక తప్పదు అనుకున్నప్పుడు విమానం నుంచి ఎజెక్ట్‌ (బయటకు వచ్చేయడం) అవుతారు. దీనికి పైలట్‌ సీటు కింద రాకెట్‌ ఇంజిన్‌ వంటి ఓ వ్యవస్థ ఉంటుంది. తొలుత పైలట్‌ పైన ఉన్న గ్లాస్‌ను తొలగిస్తారు. అనంతరం ఆ రాకెట్‌ వ్యవస్థ పనిచేసి పైలట్‌ అత్యంత వేగంతో గాల్లోకి ఎగిరిపోతారు. ఆ తర్వాత అతడి నుంచి సీటు వేర్పడిపోతుంది. అతనికి ఉన్న పారాచూట్‌ తెరుచుకొని కిందకు దిగుతాడు. ఈ పక్రియ అత్యంత వేగంగా జరిగిపోవాలి. ఏ మాత్రం ఆలస్యమైనా.. గాల్లో ప్రయాణిస్తున్న ఆ యుద్ధ విమానం తోకభాగం పైలట్‌ శరీరాన్ని తాకుతుంది. దీంతోపాటు తగినంత ఎత్తులో ఎజెక్ట్‌ కాకపోతే పారచూట్‌ తెరుచుకునే సమయం లభించక నీటిలో లేదా  నేలపై  పడిపోతాడు. మరో విషయం ఏంటంటే పైలట్‌ సీటు రాకెట్‌ వేగంతో గాల్లోకి లేవడంతో ఆతని వెన్ను పూస దెబ్బతినడం, లేదా తాత్కాలికంగా స్పృహ కోల్పోవడం జరుగుతుంది. అప్పుడు నీటిలో పడినా వెంటనే ఈదలేక ప్రాణాలు కోల్పోతారు. వారి ఆచుకీ తెలుసుకొనేందుకు సూట్‌లో ఓ లొకేటర్‌ ఉంటుంది. అది నీటిలోపడితే పనిచేయదు. దీంతో ఆచుకీ కనుగొనడం కష్టంగా మారుతుంది. ఒక వేళ పైలట్‌ ప్రాణాలతో ఉంటే అతనికి కొంతకాలానికి సరిపడా అత్యంత శక్తిమంతమైన ఆహారం కూడా వారి సూట్‌లో ఉంటుంది. ఇక నిషాంత్‌ విషయంలో ఏం జరిగిందో ఇప్పటికీ స్పష్టతలేదు. అతను క్షేమంగా తిరిగిరావాలని కోరుకుందాం.

ఇవీ చదవండి

చైనా తిమింగలాల వేట ఇలా ..!

నిశ్శబ్ద యుద్ధానికి భారత్‌ సిద్ధం..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని