కిమ్‌ మిస్టరీ.. మంచికా.. చెడుకా!

కిమ్‌ జోంగ్‌ ఉన్‌.. ఆయనకు సంబంధించిన ఏ వార్త అయినా.. గరమ్‌ మసాలా.. అసలు ఆయన ఏం చేసినా వార్తే.. ఆయన్ను ద్వేషించే అమెరికాలో పత్రికల పతాకశీర్షికల్లో  కూడా కిమ్‌ తరచూ వస్తుంటారు. ఈ యువ నియంత ఉక్కు పిడికిలిలో

Published : 25 Aug 2020 12:51 IST

* అణ్వాయుధాల భద్రతపై ఆందోళన

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

కిమ్‌ జోంగ్‌ ఉన్‌.. ఆయనకు సంబంధించిన ఏ వార్త అయినా.. సంచలనమే. అసలు ఆయన ఏం చేసినా వార్తే.. ఆయన్ను ద్వేషించే అమెరికాలోని పత్రికల పతాక శీర్షికల్లో కూడా కిమ్‌ తరచూ వస్తుంటారు. ఈ యువ నియంత ఉక్కు పిడికిలిలో ఉ.కొరియా విలవిల్లాడిపోతోంది. తాజాగా ఆయన ఏం చేయకుండానే వార్తల్లో నిలిచారు. ఆయన కొన్నాళ్ల నుంచి బయటి ప్రపంచానికి కనిపించడం మానేశారు. దీంతో కిమ్‌ కోమాలోకి వెళ్లిపోయారని వార్తలు గుప్పుమన్నాయి. ఆయన సోదరి కిమ్‌ యో జోంగ్‌ మెల్లిగా అధికార దండాన్ని అందుకొంటున్నారు. ఇటీవల ఉ.కొరియాకు చెందిన విదేశీ వ్యవహారాలను చూసేందుకు ఆమెను నియమించారు. దీంతో అమెరికా, దక్షిణకొరియాతో నేరుగా ఆమే డీల్‌ చేయనుంది. ఇది ఇటీవల ప్రకటించారు కానీ.. గత కొన్ని నెలలుగా ఆమే ఈ వ్యవహారాలు చూస్తున్నారు. గత కొన్ని నెలల క్రితం ద.కొరియా నుంచి గాలి బుడగల్లో సందేశాలను ఉ.కొరియాలోకి వదులుతుండటంపై కిమ్‌ సోదరి మండిపడ్డారు. ‘‘అధినేత, పార్టీ, ప్రభుత్వం నుంచి దఖలుపడ్డ ప్రత్యేక అధికారాలను ఉపయోగించాను. శత్రుదేశం(దక్షిణ కొరియా)పై తీసుకోవాల్సిన తదుపరి చర్యల్ని అమలు చేయాలని సదరు విభాగాధిపతికి ఆదేశిలిచ్చాను. దేశ పౌరుల అసంతృప్తిని చల్లార్చేందుకు త్వరలోనే మా సైన్యం కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నాను. ఆ దిశగా నేను ఎటువంటి సంకేతం ఇచ్చినా ఇక తదుపరి నిర్ణయం ఆర్మీ చీఫ్‌ చేతిలోకి వెళ్లిపోతుంది ’’ అని తన ప్రకటనలో కిమ్‌ యో జోంగ్‌ పేర్కొన్నారు. అలాగే, సరిహద్దులో ఇరు దేశాలకు చెందిన అనుసంధాన కార్యాలయాల్ని మూసివేస్తామని కూడా హెచ్చరించారు. ఈ స్థాయి ఆదేశాలు ఇచ్చారంటే ఆమె చేతిలో అప్పటికే ఎంత అధికారం ఉందో అర్థం చేసుకోవచ్చు.  అప్పటికే కిమ్‌ ఒక సారి అదృశ్యమై.. మళ్లీ బాహ్య ప్రపంచంలోకి వచ్చారు. 

స్థూల కాయంతో అవస్థలు..

కిమ్‌ జోంగ్‌ ఉన్‌ స్థూల కాయం కారణంగా కొన్నేళ్లుగా అవస్థలు పడుతున్నారు. ఆయనకు మద్యం, సిగరెట్ల అలవాటు ఉంది. గుండెకు సంబంధించిన సమస్యలు తలెత్తడంతో శస్త్రచికిత్స చేయించుకొన్నట్లు ఏప్రిల్‌లో వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో మే 2న సన్‌చాన్‌ ప్రాంతంలో ఎరువుల కంపెనీ ప్రారంభం నిమిత్తం ఆయన ప్రజల ముందుకొచ్చినట్లు ఉత్తరకొరియా వార్తా సంస్థ కేసీఎన్‌ఏ పేర్కొంది. అప్పట్లో దానికి సంబంధించి చిత్రాలను కూడా విడుదల చేసింది. తాజాగా దక్షణ కొరియా రాజకీయ వ్యవహారాల శాఖలో ఓ మాజీ ఉన్నతాధికారైన చాంగ్‌ సాంగ్‌ మిన్‌ కిమ్‌ కోమాలో ఉన్నారని బాంబు పేల్చారు. ఇటీవల ప్రజల ముందుకు వచ్చింది కూడా వాస్తవం కాదని.. అవి పాత దృశ్యాలని ఆయన పేర్కొన్నట్లు ‘న్యూయార్క్‌ పోస్టు’ పత్రిక కథనంలో పేర్కొంది.  

అందుకేనా బయట పెట్టంది..?

కిమ్‌ జోంగ్‌ ఉన్‌ వయసు కేవలం 36 సంవత్సరాలు మాత్రమే. దీంతో ఆయన వారసుల ఎంపిక పూర్తి కాలేదు. నియంతలు కొన్నేళ్ల ముందుగానే తమ వారసులు అధికారంపై పట్టు సాధించేలా చేస్తుంటారు. ఉ.కొరియా 72ఏళ్ల చరిత్రలో కిమ్‌ తాత  కిమ్‌ జోంగ్‌ ఇల్‌ తన వారసుడిగా కిమ్‌ జోంగ్‌ ఇల్‌ -2ను 20 ఏళ్ల ముందే సిద్ధం చేశారు. ఆ తర్వాత 1994లో ఆయన అధికారం చేపట్టారు. తాజాగా కిమ్‌ కూడా కొన్నేళ్ల ముందు నుంచే అధికారంపై పట్టు సాధించారు. ఆ తర్వాత 2011లో కిమ్‌ జోంగ్‌ ఇల్‌-2 మరణానంతరం అధికారం చేపట్టారు. కానీ, ఇప్పుడు అలా జరగలేదు. కిమ్‌ ముగ్గురు బిడ్డల్లో ఎవరూ అధికారం చేపట్టే వయసులో లేరు. దీంతో కిమ్‌ చెల్లి యో జోంగ్‌కు చేతికి అధికార పగ్గాలు ఒక్కోటిగా చేరుతున్నాయి. 

పోటీ వస్తారని చంపి..

కిమ్‌ తన తండ్రి వైపు నుంచి వారసత్వానికి అవకాశం ఉన్న వారిని.. పోటీపడతారనే అనుమానంతో మొదట్లోనే అంతమొందించారు. వీరిలో ఆయన సవతి సోదరుడు కిమ్‌ జోంగ్‌ చుల్‌ ఉన్నారు. మలేషియా రాజధానిలోని విమానాశ్రయంలో ప్రాంక్‌ చేస్తున్నామని.. ఇద్దరు మహిళలకు 90 డాలర్లు ఇస్తామని ఆశచూపి రెండు వేర్వేరు రసాయనాలను చుల్‌ ముఖంపై ఒకేసారి వేయించారు. ఆ రెండు కలిసి విషపూరితంగా మారి అతడు మరణించాడు. దీనిని ‘బైనరీ ఫామ్‌’ విధానం అంటారు. ఈ ఘటనతో ప్రపంచం నివ్వెరపోయింది.

ఇక 2013లోనే కిమ్‌ తన అంకుల్‌ చాంగ్‌ సాంగ్‌ థేక్‌ను బహిరంగ సమావేశం నుంచి బలవంతంగా అరెస్టు చేయించాడు. థేక్‌కు సహకరించిన ఇద్దరినీ కూడా ఆయన కళ్ల ముందే యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్‌ గన్‌తో కాల్చి హతమర్చారు. ఆ తర్వాత చాంగ్‌ను కిమ్‌ చంపించి తలను బహిరంగ ప్రదర్శనకు పెట్టారని 2019లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వెల్లడించారు. 

వారసత్వ పోరు తప్పదా..?

ఒక వేళ కిమ్‌ వారసత్వం విషయంలో ఆయన సోదరి, మరో అంకుల్‌ కిమ్‌ ప్యాంగ్‌ ఇల్‌కు మధ్య పోటీ ఉండొచ్చు. కిమ్‌ ఇప్పటికే సోదరిని ముందుకు తీసుకొచ్చాడు. కానీ, ఉ.కొరియా వ్యవస్థాపకుడు కిమ్‌ జోంగ్‌ ఇల్‌ సంతానంలో మిగిలింది కిమ్‌ ప్యాంగ్‌ ఇల్‌ -2 మాత్రమే. 40 ఏళ్లపాటు ఆయన వివిధ దేశాల్లో దౌత్యవేత్తగా పనిచేసి ఇటీవలే ఉ.కొరియాకు తిరిగి వచ్చారు. కిమ్‌కు సలహాదారుగా ఉన్నారు. వారసత్వ అవకాశం ఆయనకు కూడా ఉంది. కానీ, ఆయన కిమ్‌ సోదరికి పోటీగా వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. 

ప్రపంచానికి అణ్వాయుధాలే తలనొప్పి..

కిమ్‌ వంటి నియంత హఠాత్తుగా చనిపోతే రాజ్యాధికారం కోసం సైనిక తిరుగుబాటులు.. అంతర్యుద్ధాలు జరిగే ప్రమాదం ఉంది. ముఖ్యంగా పురషాధిపత్యం ఉన్న ఉ.కొరియా సమాజంలో కిమ్‌ సోదరి అధికారం చేపడితే ఇటువంటి పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని విశ్లేషకుడు సుమీ టెర్రి వాషింగ్టన్‌ పోస్టుకు రాసిన వ్యాసంలో అభిప్రాయపడ్డారు. ఆయన సెంటర్‌ ఫర్‌ స్ట్రాటజిక్‌  అండ్‌ ఇంటర్నేషనల్‌ స్టడీస్‌ సీనియర్‌ సీఐఏ విశ్లేషకుడిగా పనిచేస్తున్నారు. ఇదే జరిగితే ఉ.కొరియా వద్ద ఉన్న అణుబాంబులు ప్రమాదకరమైన శక్తుల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉంది. ఉ.కొరియాలో భారీ సంఖ్యలో రసాయన, జీవ ఆయుధాలు కూడా ఉన్నాయి. దీంతో అక్కడి రాజకీయ అస్థిరత ప్రపంచానికి పెనుప్రమాదమే తెచ్చిపెడుతుంది.  అక్కడి నుంచి ఆ పోరు ఎటువంటి రూపైనా తీసుకోవచ్చు. ఈ క్రమంలో అగ్రదేశాలు జోక్యం చేసుకొనే అవకాశం ఉంది. ఇప్పటికైతే కిమ్‌ సోదరి రాజకీయంగా క్రమంగా శక్తిమంతురాలిగా మారుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని