డబ్బులున్నా ఆకలితో చనిపోయిన శాస్త్రవేత్త

కుర్ట్‌ గాడెల్‌.. ఓ గణిత శాస్త్రవేత్త.. గొప్ప తత్వవేత్త కూడా. చాలా మంది ఆయన్ను అరిస్టాటిల్‌తో పోల్చారు. 20వ శతాబ్దంలో ఎన్నో ఆవిష్కరణలను ఆయన ఆలోచనలు, విశ్లేషణలు ఉపయోగపడ్డాయి. ఆస్ట్రియా-హంగేరీకి చెందిన కుర్ట్‌ 1906 ఏప్రిల్‌ 28న జన్మించారు. గణితంలో మాస్టర్‌ డిగ్రీ

Published : 26 Oct 2020 08:00 IST


(Photo: Institute for Advanced Study youtube video screenshot)

ఇంటర్నెట్‌ డెస్క్‌: కుర్ట్‌ గాడెల్‌.. ఓ గణిత శాస్త్రవేత్త.. గొప్ప తత్వవేత్త కూడా. చాలా మంది ఆయన్ను అరిస్టాటిల్‌తో పోల్చారు. 20వ శతాబ్దంలో ఎన్నో ఆవిష్కరణలకు ఆయన ఆలోచనలు, విశ్లేషణలు ఉపయోగపడ్డాయి. ఆస్ట్రియా-హంగేరీకి చెందిన కుర్ట్‌ 1906 ఏప్రిల్‌ 28న జన్మించారు. గణితంలో మాస్టర్‌ డిగ్రీ సంపాదించిన ఆయన అమెరికాలో వివిధ యూనిర్సిటీల్లో పనిచేశారు. అమెరికా పౌరసత్వం సంపాదించుకొని అక్కడే స్థిరపడ్డారు. గణితశాస్త్రంలో ఆయన చేసిన కృషికిగాను ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఆయన పేరుపైనే థియరట్రికల్‌ కంప్యూటర్‌ సైన్స్‌లో విశేష కృషి చేసిన వారికి ఏటా గాడెల్‌ ప్రైజ్‌ ఇస్తున్నారు. 70 ఏళ్లు వచ్చినా ఎంతో ఆరోగ్యంగా, చలాకీగా ఉన్న కుర్ట్‌ కడుపు మాడ్చుకొని కన్నుమూశాడు. తినడానికి డబ్బులు లేక కాదండోయ్‌.. వడ్డించే వారిపై నమ్మకం లేక.

కుర్ట్‌ గాడెల్‌కు వయసు మీద పడుతున్న కొద్దీ మానసిక ఇబ్బందులు అధికమయ్యాయి. ఎవరైనా తనకు విషం పెట్టి చంపేస్తారేమోనని భయపడేవారు. దీంతో వీధుల్లో అమ్మే ఆహార పదార్థాలు తినడం మానేశారు. హోటళ్లు, బంధువుల ఇళ్లలో కూడా ఒక్క ముద్ద కూడా తినేవారు కాదు. కేవలం ఆయన భార్య అడెలె చేసిన వంట.. ఆమె చేతులతో వడ్డిస్తేనే తినేవారు. అలా కొన్నాళ్లు సాగింది. 1977లో అడెలె అనారోగ్యానికి గురైంది. ఆరు నెలలపాటు ఆస్పత్రిలో చికిత్స పొందాల్సి వచ్చింది. ఆమె వంట చేసే స్థితిలో లేకపోవడంతో కుర్ట్‌ భోజనం చేయడం మానేశారు. బంధువులు, పనివాళ్లు వండిపెట్టినా కుర్ట్‌ తినడానికి నిరాకరించారు. చివరకు బాగా నీరసించి ఆకలి చావు కొనితెచ్చుకున్నారు. 1978 జనవరి 14న ప్రిన్స్‌టన్‌ ఆస్పత్రిలో చేరి కన్నుమూశారు. మృతి చెందినప్పుడు ఆయన వయసు 71 ఏళ్లు కాగా.. బరువు కేవలం 25కిలోలు మాత్రమే. ఆయన భార్య అడెలె అనారోగ్యం నుంచి కోలుకున్నా.. మూడేళ్లకే ఆమె కూడా మృతి చెందింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని