చైనా.. అంతమంది చనిపోతే అబద్ధాలు చెబుతావా?

చైనా.. ఏదైనా నిజమని చెబుతోందంటే అందులో కచ్చితంగా వంచన ఉంటుందన్నది జగమెరిగిన సత్యం. ప్రపంచంలోని ఒక వర్గం తప్ప వారి మాటలనెవ్వరూ విశ్వసించరు. ప్రస్తుతం భూమండలాన్ని తన గుప్పిట బంధించిన నావెల్‌ కరోనా వైరస్‌ జన్మస్థానం వుహాన్‌. ఈ సూక్ష్మక్రిమి సోకి ప్రపంచ వ్యాప్తంగా వేలమంది ప్రాణాలు కోల్పోతున్నారు. చైనాలో మాత్రం 3305 మరణాలే చోటుచేసుకున్నాయి....

Updated : 31 Mar 2020 15:41 IST

వుహాన్‌ శ్మశాన వాటికల్లో వేలకొద్దీ చితాభస్మ కుండలు

చైనా మరణాల రేటుపై స్థానికుల్లోనే అవిశ్వాసం

చైనా.. ఏదైనా నిజమని చెబుతోందంటే అందులో కచ్చితంగా వంచన ఉంటుందన్నది జగమెరిగిన సత్యం. ప్రపంచంలోని ఒక వర్గం తప్ప వారి మాటలనెవ్వరూ విశ్వసించరు. ప్రస్తుతం భూమండలాన్ని తన గుప్పిట బంధించిన నావెల్‌ కరోనా వైరస్‌ జన్మస్థానం వుహాన్‌. ఈ సూక్ష్మక్రిమి సోకి ప్రపంచ వ్యాప్తంగా వేలమంది ప్రాణాలు కోల్పోతున్నారు. చైనాలో మాత్రం 3305 మరణాలే చోటుచేసుకున్నాయి.

ఇటలీ, స్పెయిన్‌, అమెరికా, ఇరాన్‌ను పరిస్థితిని చూసిన వారెవ్వరూ చైనా మరణాల సంఖ్యను నమ్మడం లేదు. ఇప్పుడు సొంత దేశస్థులు సైతం విశ్వసించడం లేదు! ఎందుకంటే వుహాన్‌ నగరంలోని విద్యుత్‌ శ్మశాన వాటికల్లో వేల సంఖ్యలో చితాభస్మం కుండలు (URNs) దర్శనమిస్తున్నాయి. వాటిని బట్టి అక్కడ సాగిన మరణ మృదంగాన్ని స్థానికులు ఏ విధంగా అంచనా వేస్తున్నారంటే!?


ఎవ్వర్నీ వదలని కరోనా

ఐరోపా, మధ్య ఆసియా, అమెరికా దేశాల్లో కొవిడ్‌-19 పేరు చెబితేనే వణుకు వచ్చేస్తోంది. ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుందనో, ఎన్నికల్లో ఓడిపోతామోననో, మతంలో ఇవన్నీ సాగవనో, ప్రభుత్వ నిబంధనలను పౌరులు ఖాతరు చేయకపోవడం వల్లో అక్కడ మృత్యుకేళి సాగుతోంది. చాలాదేశాలు చేతులు కాల్చుకున్నాక లాక్‌డౌన్లు పెడుతున్నాయి. వారి భయానక, దీన స్థితిని కళ్లారా చూసిన భారత్‌ ముందుగానే లాక్‌డౌన్‌ పెట్టింది. సమూహ వ్యాప్తి దశను దాదాపుగా అడ్డుకుంది. మరో రెండు వారాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి వైద్యపరమైన మౌలిక సదుపాయాలు, పనిముట్లు, వెంటిలేటర్లు, మాస్క్‌లు, రక్షణ సూట్ల తయారీపై దృష్టిసారించింది. అజాగ్రత్తగా ఉంటే, ఆదమరిస్తే, మనను ఏం చేయలేదులే అనుకుంటే మాత్రం ఊరుకోనని కరోనా ప్రత్యక్షంగా చూపిస్తోంది.


మొదటే వైఫల్యం

నిజానికి నావెల్‌ కరోనా ఉనికిని గతేడాది డిసెంబర్లోనే చైనా గుర్తిస్తే ప్రపంచానికి ఇంత హాని జరిగేదే కాదని నిపుణుల మాట. అప్పుడే లాక్‌డౌన్‌ పెట్టి వైద్యసేవలు అందించి ఉంటే 75శాతం వ్యాప్తిని అడ్డుకొనేవారని విశ్లేషిస్తున్నారు. కానీ అది చైనా కదా. అలా చేస్తుందనుకోవడం అత్యాశే అవుతుంది. సార్స్‌ ప్రబళినప్పుడే అలాంటి అంటువ్యాధి, మహమ్మారి మరోసారి తలెత్తితే వెంటనే చర్యలు చేపట్టేందుకు చైనా ఓ ప్రభుత్వ వ్యవస్థను రూపొందించింది. ఏ రాష్ట్రంలోనైనా కొత్త వ్యాధి లక్షణాలు కనిపిస్తే నేరుగా కేంద్ర ప్రభుత్వ వైద్యశాఖ వ్యవస్థలో నమోదు చేయాలి. ఓ కంటి వైద్యుడు కొత్త వైరస్‌ సంగతి చెప్పగానే హుబెయ్‌ ప్రభుత్వం అతడిని అదుపులోకి తీసుకొని మందలించింది. వైరస్‌ సోకి వందల మంది ఆస్పత్రులకు వచ్చినా పట్టించుకోలేదు. కేంద్రానికి చెప్పలేదు. పరిస్థితి విషమించాక మీడియా ద్వారానే ఈ విషయం జిన్‌పింగ్‌కు తెలిసింది. అంటే వారి సొంత వ్యవస్థే ముందుగా దీనిని గుర్తించేందుకు నిరాకరించింది. మొదట ఇక్కడే చైనా దెబ్బతిన్నది.


అధానోమ్‌, జిన్‌పింగ్‌పై అనుమానం

ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ, దాని అధిపతి టెడ్రోస్‌ అధానోమ్‌, జిన్‌పింగ్‌ పాత్రలపై సర్వత్రా అనుమానమే ఉంది. గతేడాది నవంబర్లో వైరస్‌ ప్రబలితే జనవరి 10న మొదటి రోగికి చికిత్స అందించినట్టు రికార్డుల్లో రాసుకోవడం చైనా వంచనకు ఉదాహరణ. ముందు ఇది జంతువుల నుంచి సంక్రమిస్తుందని ఆ దేశం చెప్పింది. దానినే అధానోమ్‌ వల్లెవేశారు. మనుషుల నుంచి మనుషులకు వచ్చినట్టు ఆధారాలే లేవని మరోసారి పేర్కొన్నారు. అంతర్జాతీయ విమాన సేవలను నిలిపివేయాల్సిన అవసరం లేదని నమ్మబలికారు. చైనాలో లాక్‌డౌన్‌ పెట్టగానే మనుషుల నుంచి మనుషులకు వస్తుందని అంటువ్యాధిగా ప్రకటించారు. మహమ్మారిగా ప్రకటించేందుకు ఆలస్యం చేశారు. చివరికీ ప్రకటించారు. అధానోమ్‌ స్వదేశమైన ఈజిప్టులో చైనా పెట్టుబడులు పెట్టింది. అసలు అధానోమ్‌ ఎంపిక వెనక చైనా ఉందని తెలుస్తోంది. అందుకే ఆయన దాని మాటలకు లొంగి సత్యాన్ని దాచారని అనిపిస్తోంది. ఇప్పుడిక మరణాలు, కేసుల నమోదులోనూ చైనా పచ్చి అబద్ధాలు చెప్పిందని బయటపడుతోంది.


చైనాను నమ్మేదెవరు?

నావెల్‌ కరోనా వైరస్‌ జన్మస్థానం ఏంటి? వుహాన్‌ అని మీ అందరికీ తెలుసు. మరి అమెరికా, ఇటలీ, స్పెయిన్‌లో మరణాలు చైనా కన్నా ఎందుకు ఎక్కువగా ఉన్నాయి? ఎందుకంటే అది నిజం చెప్పలేదు కాబట్టేనని ప్రపంచమంతా నమ్ముతోంది. ఇప్పుడు వుహాన్‌ శ్మశానాల్లో చితాభస్మం కుండల చిత్రాలు సోషల్‌ మీడియాలో వైరల కావడంతో సొంత పౌరుల్లోనే అనుమానాలు మొదలయ్యాయి. మార్చి 31 మధ్యాహ్నానికి చైనాలో మరణాలు 3,305. కానీ ఆ కుండల ద్వారా తెలుస్తున్నది ఏమిటంటే కనీసం 40వేల మంది మృత్యువాత పడ్డారని. వుహాన్‌లో 50వేలకు పైగా కేసులు నమోదైతే 2,535 మంది మాత్రమే చనిపోయారని చైనా అధికారికంగా చెబుతోంది. కానీ బుధ, గురువారాల్లో వుహాన్‌లోని ఎనిమిది శ్మశాన వాటికలకు 2,500 చొప్పున మొత్తం 5,000 కుండలు వచ్చాయి. కానీ ఒక శ్మశాన వాటికలో 3500 కుండలున్న చిత్రం ఇప్పుడు బయటకు రావడం అనుమానాస్పదంగా మారింది. అంటే వుహాన్‌లో కొవిడ్‌-19తో మరణించినవారి సంఖ్య కన్నా ఒకే వాటికలో ఎక్కువ కుండలు ఉన్నాయి.


26-40వేల మరణాలు!

పై ఉదాహరణను బట్టి వుహాన్‌లో కనీసం 26-40 వేల మంది మరణించి ఉంటారని స్థానికులు అంచనా వేస్తున్నారు. ఇక ఆ నగరంలోని ఏడు శ్మశాన వాటికలు మార్చి 23 నుంచి ఏప్రిల్‌ 4 మధ్య సగటున 3500 చితాభస్మం కుండలను పంపిణీ చేస్తాయని అంచనా. ఎందుకంటే చనిపోయిన వారి స్మారకార్థం అక్కడ కింగ్‌మింగ్‌ అనే పండుగ జరుపుకొంటారు. అంటే ఈ 12 రోజుల కాలంలో దాదాపు 42వేల కుండలను పంపిణీ చేస్తారు. చైనాలో ఏటా మరణాల రేటు ప్రకారం లెక్కిస్తే గత రెండున్నర నెలల్లో వుహాన్‌లో 16,000 మంది చనిపోతారని అంచనా. మొత్తం 42,000ల్లో ఈ సంఖ్యను తీసేస్తే 26,000. అంటే చిన్న తర్కంతోనే ఇంతమంది కొవిడ్‌-19తో చనిపోయారని తెలుస్తోంది. అక్కడి ప్రజలైతే ఇంకా ఎక్కువమంది చనిపోయారని అంటున్నారు.


స్థానికుల మాటిది

‘ఈ వారం మొదలైందో లేదో నగరంలోని ఏడు శ్మశాన వాటికలు 500 చొప్పున చితాభస్మం కుండలు పంపిణీ చేశాయి. ఆ వాటికలు కొన్ని రోజులుగా పగలూ రాత్రి పనిచేస్తున్నాయి. దీనిని బట్టి మరణాల సంఖ్య ఎంతగా వుంటుందో ఊహించుకోవచ్చు’ అని ఓ స్థానికుడు రేడియో ఫ్రీ ఏసియా (ఆర్‌ఎఫ్‌ఏ)తో అన్నారు. కేవలం వుహాన్‌లోనే 40వేల మంది చనిపోయి ఉంటారని హుబెయ్‌ ప్రావిన్స్‌ ప్రజలు భావిస్తున్నారని మరొకరు తెలిపారు. అసలు చికిత్సే జరగకుండా, పరీక్షలే చేయించుకోకుండా ఇళ్లల్లోనే  ఎంతో మంది చనిపోయారని ప్రభుత్వ అధికారి ఒకరు రేడియోతో స్వయంగా చెప్పారని సమాచారం. ‘బహుశా.. పరోక్షంగానో, ప్రత్యక్షంగానో అధికార వర్గాలు మెల్లగా అసలైన గణాంకాలు చెబుతారేమో. పరిస్థితిని అర్థం చేసుకోవాలని భావిస్తున్నారేమో’ అని మావో పేరున్న  ఓ వ్యక్తి ఆర్‌ఎఫ్‌ఏకు చెప్పడం గమనార్హం. వీటన్నిటినీ బట్టి అక్కడ పరిస్థితి ఏంటో, మరణాల రేటు ఏంటో, ప్రపంచానికి చైనా ఎంత నిజం చెబుతుందో ఎవరికి వారే అర్థం చేసుకుంటే మంచిది!? ఇక భారత్‌లో ఎంత పక్కాగా లాక్‌డౌన్‌ పాటించాలో తెలుసుకుంటే ఇంకా మంచిది.

- ఇంటర్నెట్‌డెస్క్‌, హైదరాబాద్‌

చదవండి: కరోనా నిజం.. కఠిన పాఠం..!

చదవండి:  భారత్‌లో మాంద్యం ఉండకపోవచ్చు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని