కరోనా వైరస్‌ను మొదట కనిపెట్టింది ఆమేనట!

ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్‌ పుట్టింది చైనాలో గత డిసెంబర్‌లో అన్నది అందరికి తెలిసిన విషయమే. కానీ.. ఇదే కరోనా వైరస్‌ 56 ఏళ్ల క్రితమే వెలుగులోకి వచ్చింది. పెద్దగా చదువుకోని ఓ సాధారణ మహిళ ఈ మహమ్మారి ఉనికిని బయటపెట్టింది. స్కాట్లాండ్‌కు

Updated : 23 Apr 2020 15:13 IST

ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కొవిడ్- 19 వైరస్‌ పుట్టింది చైనాలో అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇది కరోనా వైరస్‌ కుటుంబానికి చెందినది. గతంలోనూ ఈ కుటుంబానికి చెందిన కొన్ని వైరస్‌లు వచ్చాయి. అయితే తొలి కరోనా వైరస్‌ 56 ఏళ్ల క్రితమే వెలుగులోకి వచ్చింది. పెద్దగా చదువుకోని ఓ సాధారణ మహిళ ఈ మహమ్మారి ఉనికిని బయటపెట్టిందంటే నమ్ముతారా? స్కాట్లాండ్‌కు చెందిన జూన్‌ అల్మీదా కనుగొన్న వైరస్‌ను అప్పుడు శాస్త్రవేత్తలు పట్టించుకోలేదు. అంతర్జాతీయ మీడియా సంస్థలు తాజాగా అల్మీదా గురించి కొన్ని కథనాలు రాశాయి. వాటి ప్రకారం... తొలి కరోనా లెక్క ఇదీ!

అల్మీదా.. పదో తరగతి వరకే చదువుకుంది. ఆర్థిక పరిస్థితులు సరిగాలేక లేబొరేటరీ టెక్నీషియన్‌గా చేరి.. మైక్రోస్కోపీపై పట్టు సాధించింది. వైరస్‌ల ఆకృతులు సుస్పష్టంగా కనిపించే విధానాన్ని కనిపెట్టిన అల్మీదా వైరాలజీ విభాగంలో మంచి గుర్తింపు పొందింది. అయితే 1964లో లండన్‌కు వెళ్లి సెయింట్‌ థామస్‌ ఆస్పత్రిలో పనిచేస్తూ.. డేవిడ్‌ టిర్రెల్‌ అనే డాక్టర్‌తో కలిసి సాధారణ జలుబుకు కారణాలపై పరిశోధనలు మొదలుపెట్టింది. ఈ క్రమంలో టెర్రెల్‌ ఓ చిన్నారి ముక్కు నుంచి తీసిన నమూనాలో బీ814 అనే వైరస్‌ను కనుగొన్నారు. ఈ వైరస్‌ను మైక్రోస్కోప్‌లో చూసినప్పుడు సాధారణ ఇన్‌ఫ్ల్యూఎంజాలాగే కనిపించినా కాస్త భిన్నంగా ఉన్నట్లు అల్మీదా గుర్తించింది. మరింత లోతుగా పరిశీలిస్తే.. ఆ వైరస్‌కు కొమ్ములు.. వాటి మీద కిరీటం లాంటి ఆకృతి ఉండటాన్ని గమనించారు.

వైరస్ చూడటానికి కొత్తగా ఉండటంతో అల్మీదా, టిర్రెల్‌‌, మరో వైద్యుడు కలిసి దీనికి.. కరోనా వైరస్‌ అని పేరు పెట్టారు. అంతేకాదు.. ఈ వైరస్‌ చిత్రాలు, వివరాలను మెడికల్‌ జర్నల్స్‌కు పంపితే.. నిర్వాహకులు అల్మీదా కనిపెట్టింది వైరస్‌ కాదంటూ కొట్టిపారేశారు. అది ఇన్‌ఫ్లూఎంజా వైరస్‌లోని ఓ భాగమని.. చిత్రం సరిగా తీయకపోవడంతో అలా కనిపిస్తుందని తేల్చారు. అయితే 1965లో బీ814 వైరస్‌పై జర్నల్స్‌లో ప్రచురించారు. ఆ తర్వాత రెండేళ్లు అల్మీదా తీసిన చిత్రాన్ని వైరాలజీకి సంబంధించిన జర్నల్స్‌లో పెట్టారు. అలా ఈ కరోనా వైరస్‌ గురించి తొలిసారి వైద్యశాస్త్రానికి తెలిసింది. ఆ తర్వాత దాని ఉనికి లేకపోయినా ఇప్పుడు విశ్వరూపం చూపిస్తూ ప్రజల ప్రాణాలను పొట్టనపెట్టుకుంటోంది. 

అల్మీదా కెనడాలోని ఒంటారియా కేన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేస్తున్నప్పుడు కంటికి కనిపించని వైరస్‌లను మైక్రోస్కోపీలో సులభంగా చూడగలిగేలా ‘ఇమ్యూన్‌ ఎలక్ట్రాన్‌ మైక్రోస్కోపీ’ పద్ధతిని రూపొందించారు. ఈ పద్ధతిలో వైరస్‌లను మనిషి లేదా జంతువు యాంటీబాడీలతో కలిపేస్తారు. అప్పుడు వైరస్‌లు మైక్రోస్కోప్‌లో బాగా కనిపిస్తాయి. అలా అల్మీదా అనేక వైరస్‌ల ఆకృతిని ప్రపంచానికి చూపించింది. ఆమె కృషి వల్లే ఇప్పుడు వైరస్‌ ఆకృతులను మనం చూడగలుతున్నాం. అంతేకాదు.. పెద్ద చదువులు లేకున్నా ఎన్నో వైద్యశాస్త్రానికి సంబంధించిన పుస్తకాలకు సహ రచయితగా పనిచేశారు. వాటిలో ఎక్కువగా వైరస్‌ ఆకృతుల గురించే ఉన్నాయి. అల్మీదా రాసిన పుస్తకాలకు గుర్తింపుగా 1970లో డాక్టరేట్‌ ఇచ్చారు. కొంతకాలం మైక్రోస్కోపీలో అధ్యాపకురాలిగా విధులు నిర్వర్తించి ఉద్యోగానికి రిటైర్మెంట్‌ ఇచ్చిన అల్మీదా యోగా శిక్షకురాలిగానూ కొన్నాళ్లు పనిచేసింది. 2007లో గుండెపోటుతో అల్మీదా(77) మరణించారు. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని