జీవితంలో లాక్‌డౌన్‌ తెచ్చిన మార్పులు గమనించారా?

కరోనా మహమ్మారి దెబ్బకి ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కట్టడిలో భాగంగా మన దేశంలో లాక్‌డౌన్‌ విధించారు. అత్యవసర సేవలు మినహా సమస్తం మూతపడటంతో ఉపాధి లేక సామాన్య ప్రజలు ఆర్థికంగా చితికిపోతున్నారు. వాణిజ్యం కుదేలయింది. ప్రజల జీవితాలు

Updated : 14 May 2020 12:49 IST

‘‘అయ్య బాబోయ్‌ ఇంకా ఎన్ని రోజులు ఇలా ఇంట్లోనే ఉండాలి? ఖాళీగా కూర్చుంటే బోర్‌ కొడుతోంది. ఆర్థికంగానూ ఇబ్బందిగా ఉంది. త్వరగా లాక్‌డౌన్‌ ఎత్తేస్తే బయటకెళ్లి పనులు చేసుకుంటాం’’ ఇది.. దేశంలో లాక్‌డౌన్‌పై చాలా మంది మనసులో ఉన్న అభిప్రాయం. 

ఇది నాణానికి ఒకవైపు... మరోవైపు చూస్తే... 

లాక్‌డౌన్‌ వల్ల వ్యక్తిగతంగా మన జీవితాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. మొన్నటివరకు పోటీ ప్రపంచంలో పరిగెడుతూ అలసిపోయిన వారికి ఈ లాక్‌డౌన్‌ విశ్రాంతినిచ్చింది. కుటుంబ, బంధాల విలువలు తెలిసేలా చేసింది. చిన్ననాటి రోజులను తిరిగిచ్చింది. అంతేనా.. ఈ లాక్‌డౌన్‌ రోజుల్లో ఒకసారి ప్రజల జీవితాల్ని గమనిస్తే..

కుటుంబసభ్యులతో భోజనం

ఇన్నాళ్లూ పగలూ రాత్రి... ఆఫీసు, వ్యాపారం, చదువులంటూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండేవాళ్లు. లాక్‌డౌన్‌ వేళ అందరూ ఇంటికే పరిమితమయ్యారు. కుటుంబసభ్యులంతా కలసి కూర్చొని భోజనం చేస్తున్నారు. ఇలా అందరూ కలిసి భోజనం చేయాలని ఇంట్లో తల్లి, భార్య ఎంతకాలం నుంచి ఎదురుచూస్తున్నారో.. ఇప్పటికి వారి కల నెరవేరిందనే చెప్పాలి. ఇలా ఒక్కచోట కూర్చొని భోజనం చేస్తూ మాట్లాడుకుంటుంటే కుటుంబసభ్యుల మధ్య బంధం మరింత బలపడుతుందనడంలో సందేహం లేదు.


సరదా ముచ్చట్లు

ఉద్యోగాలతో తల్లిదండ్రులు.. చదువులతో పిల్లలు తీరక లేకుండా గడిపేవాళ్లు. ఇప్పుడు బోలెడంతా ఖాళీ సమయం దొరికింది. పిల్లలతో తల్లిదండ్రులు సరదాగా ముచ్చటిస్తున్నారు. చదువు, భవిష్యత్తు, స్నేహితులు వ్యక్తిగత విషయాలు ఇలా అన్ని తల్లిదండ్రులతో పంచుకునే అవకాశం పిల్లలకు లభించింది. ఈ క్రమంలో కుటుంబాన్ని అర్థం చేసుకునే అవకాశం కుటుంబ పెద్దకూ లభించింది. 


బర్గర్‌లు, పిజ్జాలు బంద్‌.. ఇంటి ఫుడ్‌ పసంద్‌

ఇంట్లో ఆడవాళ్లు.. భోజనం చేసి వెళ్లమంటే చాలా మంది బయట తింటాంలే అనే వాళ్లు. ఇప్పుడా అవకాశమే లేదు. లాక్‌డౌన్‌తో రెస్టారెంట్లు, బేకరీలు అన్ని మూసేశారు. పిజ్జాలు, బర్గర్‌ వంటి జంక్‌ ఫుడ్‌ తినేవారికి ఇప్పుడు ఇంటి భోజనం రుచి తెలిసొస్తోంది. ఇంట్లో వండే ఆహారంలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇకపై జంక్‌ ఫుడ్‌ మానేసి ఇంటి భోజనం తినడం అలవాటు చేసుకోండి. ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు ఎప్పటినుంచో చెబుతున్నారు కూడా. 


ఆన్‌లైన్‌ నుంచి చిన్నప్పటి ఆటల వైపు

టెక్నాలజీ యుగంలో ఖాళీ సమయం దొరికితే చిన్న పెద్దా తేడా లేకుండా మొబైల్‌ గేమ్స్‌ ఆడుతున్నారు. లాక్‌డౌన్‌లో రోజంతా ఆన్‌లైన్‌లో ఆడాలంటే బోర్‌ కొడుతుంది కదా.. అందుకే ఇప్పుడంతా చిన్నప్పుడు ఆడుకున్న ఆటలవైపు మొగ్గు చూపుతున్నారు. ఇంట్లో వాళ్లతో క్యారెమ్స్‌, అష్టాచమ్మా, హౌసీ వంటి ఆటలు ఆడుతున్నారు. ఇలా కుటుంబ సభ్యులతో ఆడుతుంటే చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకురాకుండా ఉంటాయా?


అప్పటి హిట్‌ సీరియల్స్‌ మరోసారి మన ముందుకు

చిన్నప్పుడు మీరో, మీ పెద్దలో చూసిన ఒకే ఒక ఛానెల్‌ దూరదర్శన్‌. అందులో ప్రసారమైన రామాయణ్‌, మహాభారత్‌, శక్తిమాన్‌ సీరియల్స్‌ ఇప్పటికీ చాలామంది మనస్సుల్లో ఉండిపోయాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రభుత్వం ఆ సీరియల్స్‌ను పునఃప్రసారం చేస్తున్నాయి. ఇప్పుడు వాటిని చూస్తూ చిన్నతనం గుర్తుకు తెచ్చుకోవడమే కాదు.. నేటి తరానికి ఇతిహాసాల గురించి తెలిపే అవకాశం వచ్చింది. 


ఆవేశం లేదు.. ఆలోచన ఒక్కటే

ఆఫీస్‌ ఒత్తిళ్లు లేవు.. ఇతరులతో గొడవలు, వివాదాలు లేవు. ఎవరికి వారు ఇంట్లో కుటుంబసభ్యులతో ప్రశాంతంగా ఉంటున్నారు. దీంతో చాలా మందికి కోపం కూడా తగ్గే ఉంటుంది. కుటుంబ సభ్యులపై పెద్దగా కోప్పడలేం కాబట్టి.. ఎదుటివాళ్లు చెప్పే విషయాలను అర్థం చేసుకునే వీలు కలిగింది. కుటుంబం కోసమే తామున్నది.. రాబోయే రోజుల్లో వారిని కష్టపెట్టకుండా ఎలా చూసుకోవాలన్నదే ఇప్పుడు ఇంటి పెద్దలకున్న ఆలోచన.


ఇంటిపని ఆడవాళ్లదే కాదు.. మగవారి బాధ్యత కూడా

మగవారికి విధుల నుంచి విశ్రాంతి దొరికినా.. మహిళలకు మాత్రం ఇంట్లో పని మరింత పెరిగింది. అందుకే ఈ లాక్‌డౌన్‌ సమయంలో ఇంటి పనుల్లో ఆడవాళ్లకు మగవాళ్లు సాయంగా నిలుస్తున్నారు. కలిసి ఇంటిని చక్కదిద్దుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంటి పనుల్లో ఆడవాళ్లకు సాయంగా నిలవమంటూ టాలీవుడ్‌లో ‘బీ ది రియల్‌మ్యాన్‌’ అనే ఛాలెంజ్‌ వైరల్‌గా మారింది. సినీ దర్శకుడు సందీప్‌ వంగా ప్రారంభించిన ఈ ఛాలెంజ్‌ను పలువురు సినీ ప్రముఖులు స్వీకరించి ఇంటి పనులు చేసి చూపించారు.


ఇల్లే పబ్‌.. ఇంట్లోనే పార్టీ

వీకెండ్‌ వస్తే చాలు.. పబ్‌లు పార్టీలంటూ తిరిగే యువత ఇప్పుడు ఇంట్లోనే కుటుంబ సభ్యులతో ఎంజాయ్‌ చేస్తున్నారు. ఆటపాటలతో సరదాగా గడుపుతున్నారు. ఇంట్లో చేసే పసందైన వంటకాలతో పార్టీలు చేసుకుంటున్నారు. ఇంటినే పబ్‌గా మార్చేసి... కుటుంబసభ్యులు, బంధువులతో సరదాగా గడుపుతున్నారు. 


సిగరెట్ అలవాటు.. మానేసేటట్టు

ప్రతిరోజు సిగరెట్‌ తాగేవాళ్లు.. ఇంట్లో వాళ్లకు తెలియకుండా అప్పుడప్పుడు సిగరెట్‌ తాగే వాళ్లకి ఇది కష్టకాలమే. లాక్‌డౌన్‌తో బయటకు వెళ్లే పరిస్థితి లేదు. ఏం చేయలేని స్థితిలో సిగరెట్‌ తాగే అలవాటు తగ్గిపోయి ఉంటుంది. దానిని అలాగే కొనసాగిస్తే.. సిగరెట్‌ తాగడం పూర్తిగా మానేసే అవకాశముంది. 


పెంపుడు జంతువులకు మరింత చేరువగా

ఇదివరకు పెంపుడు జంతువులను ఉదయం, సాయంత్రం వాకింగ్‌ తీసుకెళ్లడం మాత్రమే చేసేవారు. ఇప్పుడు వాటితో ఎక్కువ సమయం గడిపే అవకాశం వచ్చింది. జంతువులను అర్థం చేసుకోవడానికి, వాటి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి ఈ లాక్‌డౌన్‌ సమయాన్ని ఉపయోగిస్తున్నారు. 


ప్రకృతి ఒడిలో సేద

లాక్‌డౌన్‌ వల్ల వాహనాలు ఎక్కువగా రోడ్లపైకి రావట్లేదు. ఫ్యాక్టరీలు మూత పడటంతో గాలిలో కాలుష్యం తగ్గింది. నీలాకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే ఇల్లు దాటి బయటకు రాలేకున్నా.. ఇంటి బాల్కనీలోనో.. ఇంటి ముందో కూర్చొని స్వచ్ఛమైన గాలి పీలుస్తున్నారు.. ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు.


స్నేహితులతో పిచ్చాపాటి మాటలు

ఫోన్‌లోనూ నిత్యం సహోద్యుగులు, ఉన్నతాధికారులతో మాట్లాడే మీకు ఇప్పుడు విరామం లభించింది. అందుకే చాలామంది తమ చిన్ననాటి స్నేహితులు, బంధువులను ఫోన్‌లో పలకరిస్తున్నారు. యోగక్షేమాలు వాకబు చేస్తూ పిచ్చాపాటిగా మాట్లాడి నాటి రోజులు గుర్తు చేసుకుంటున్నారు. 


యోగా.. వ్యాయామం అలవాటైపోవాలి

ఉదయం లేచి పరుగు పరుగున ఆఫీస్‌కి వెళ్లడం.. ఏ రాత్రో ఇంటికి రావడం.. ఇన్నాళ్లు ఇలాగే సాగిపోయింది. ఇప్పుడు చాలా తీరిక ఉంది. కాబట్టి శరీర ధారుఢ్యంపై శ్రద్ధ పెడుతున్నారు. మానవ సైకాలజీ ప్రకారం ఏదైనా 21 రోజులు చేస్తే అది మనకు అలవాటైపోతుందట. కాబట్టి ఈ లాక్‌డౌన్‌లో ఇప్పటికే యోగా, వ్యాయమం మొదలు పెట్టినవాళ్లు దానిని కొనసాగిస్తే సరి. 


కొత్తవి నేర్చుకుంటున్నారు.. మరి మీరు?

సంగీతం నేర్చుకోవాలనో.. పెయింటింగ్స్‌ వేయాలనో చాలా మందికి కొన్ని కోరికలు ఉంటాయి. వాటిని ఈ లాక్‌డౌన్‌ సమయంలో తీర్చుకుంటున్నారు. ఆన్‌లైన్‌ కోర్సులు ద్వారా కొత్త కొత్త అంశాలపై పట్టు సాధిస్తున్నారు. చాలా మంది మహిళలు యూట్యూబ్‌లో చూసి కొత్త రకం వంటలు చేస్తున్నారట.


మీ గురించి మీరు ఆలోచించే సమయం

ముఖ్యంగా ఈ లాక్‌డౌన్‌లో మన గురించి మనం ఆలోచించుకునే సమయం లభించింది. నాలోని ప్రతికూలతలు ఏంటి? ప్రతిభ ఏంటి? ఎలా ప్రవర్తిస్తున్నాను. భవిష్యత్తు ప్రణాళికలు, లక్ష్యాలు, లక్ష్య చేధన మార్గాలు ఇలా అన్ని అంశాలపై పరిశీలన.. ఆత్మపరిశీలన చేసుకుటున్నారు. మీరు కూడా ఇలాంటివే చేస్తున్నారనే అనుకుంటున్నాం. ఒకవేళ మీరు చేయకుంటే ఇకపై మీ గురించి మీరు ఆలోచించండి. సరైన నిర్ణయాలు తీసుకోండి. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని