ఇండియన్‌ టిక్‌టాక్‌ ‘మిత్రోన్’ కహానీ

కరోనా సంక్షోభం కారణంగా ప్రజలు సినిమాలు, వినోదం, పర్యాటకానికి దూరమయ్యారు. అదే సమయంలో చిన్న నిడివి గల వీడియో షేరింగ్ యాప్‌ ‘టిక్‌ టాక్‌’కు బాగా ఆకర్షితులయ్యారు. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో ఉన్న సినిమాలను చూసేయడం

Published : 05 Jun 2020 09:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా సంక్షోభం కారణంగా ప్రజలు సినిమాలు, వినోదం, పర్యాటకానికి దూరమయ్యారు. అదే సమయంలో చిన్న నిడివి గల వీడియో షేరింగ్ యాప్‌ ‘టిక్‌ టాక్‌’కు బాగా ఆకర్షితులయ్యారు. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో ఉన్న సినిమాలను చూసేయడం.. కొత్త సినిమాలు రాకపోవడంతో చాలా మంది టిక్‌టాక్‌ వీడియోలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. సామాన్యుల నుంచి మొదలుకొని సెలబ్రిటీల వరకూ టిక్‌టాక్‌ వీడియోలు చేయడంలో మునిగి తేలిపోతున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఇటీవల టిక్‌టాక్‌కు భారత్‌లో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. దీనికి ఒక కారణం టిక్‌టాక్‌ చైనాకు చెందిన యాప్ కావడం. భారత్ -చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం, స్వదేశీ వస్తువులను వాడేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు వంటివి మరో కారణాలు. ఇదే సమయంలో టిక్‌టాక్‌ను పోలిన ‘మిత్రోన్‌’ అనే యాప్‌ తెరమీదకొచ్చింది. యాప్‌నకు యూజర్లు క్రమంగా పెరుగుతున్నారు. అంతలోనే ‘మిత్రోన్‌’ గూగుల్ ప్లేస్టోర్‌లో మాయమైంది. ఈ నేపథ్యంలో ‘మిత్రోన్‌’ కహానీ గురించి చర్చ మొదలైంది.

టిక్‌టాక్‌కు డూప్లికేట్‌లా ‘మిత్రోన్‌’

గత కొన్ని రోజులుగా మిత్రోన్‌ యాప్‌నకు గూగుల్ ప్లేస్టోర్ నుంచి విపరీతంగా డౌన్‌లోడ్‌లు పెరిగాయి. దీనికి కారణం మిత్రోన్‌ను ఒక ఐఐటీ విద్యార్థి అభివృద్ధి చేశాడని తెలియడం. అయితే దీని వెనుక చాలా స్టోరీనే ఉంది. మిత్రోన్‌ యాప్‌లో వాడే సోర్స్‌ కోడ్‌ పాకిస్థాన్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ కంపెనీ క్యూబాక్స్ చెందినది. ఈ కంపెనీ అచ్చం టిక్‌టాక్‌ను పోలిన యాప్ ‘టిక్‌టిక్‌’ను అభివృద్ధి చేసింది. అనంతరం టిక్‌టిక్‌ యాప్‌లో ఉపయోగించిన సోర్స్‌ కోడ్‌ను అమ్మకానికి పెట్టింది. దీంతో ఆ ఐఐటీ విద్యార్థి సోర్స్ కోడ్‌ను కొని ‘మిత్రోన్‌’ అనే పేరుతో యాప్‌ను అభివృద్ధి చేశాడు. ఇది సేమ్‌ టిక్‌టాక్‌ యాప్‌నకు డూప్లికేట్‌లా ఉండడం.. అవే ఫీచర్స్‌, యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ ఇందులోనూ ఉండడంతో యువతను ఇట్టే ఆకర్షించింది. దీనికి తోడు స్వదేశీ ఉత్పత్తులను వాడాలని మోదీ కోరడం.. చైనాపై వ్యతిరేకత కారణంగా అనతికాలంలోనే మిత్రోన్‌ పేరు మారుమోగింది.

యాప్ ప్రైవసీలో లోటుపాట్లు

టిక్‌టాక్‌కు ప్రత్యామ్నాయంగా దూసుకుపోతున్న మిత్రోన్‌కు ఆదిలోనే చిక్కులు ఎదురయ్యాయి. యాప్‌నకు సంబంధించి సోర్స్ కోడ్ పాకిస్థాన్‌లో అభివృద్ధి కావడం.. యాప్‌ ప్రైవసీలో లొసుగులు ఉండడం ప్రతికూలంగా మారాయి. దీనికి తోడు మిత్రోన్‌ యాప్‌ ద్వారా భారతీయుల వ్యక్తిగత సమాచారం దొంగిలించే వీలుందని పలువురు అభ్యంతరం వ్యక్తం చేయడంతో యూజర్లు డైలమాలో పడ్డారు. ఫలితంగా ఫుల్‌ స్వింగ్‌లో ఉన్న మిత్రోన్‌కు ఓ స్పీడ్ బ్రేకర్‌ బ్రేక్‌ వేసినట్లయింది. టిక్‌టాక్‌తో పోలిస్తే మిత్రోన్‌లో భద్రతా పరమైన అంశాలు సరిగా లేవని తేలడంతో లోపాన్ని సరిదిద్దుకునేందుకు మిత్రోన్‌ చర్యలు మొదలుపెట్టింది.

అంతలోనే ప్లేస్టోర్‌లో మాయం

మిత్రోన్‌ తన లోటుపాట్లను సరిచేసుకునే క్రమంలో గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి మాయమైంది. టిక్‌టాక్‌కు ప్రత్యామ్నాయంగా వచ్చిన మిత్రోన్‌ ప్లేస్టోర్‌లో లేకపోవడంతో యూజర్లు ఒకింత షాక్‌కు గురయ్యారు. మళ్లీ టిక్‌టాక్‌కు యూజర్లు రూటు మార్చుకున్నారు. తన రూల్స్‌కు వ్యతిరేకంగా మిత్రోన్‌ యాప్‌ ఉందంటూ దీన్ని ప్లేస్టోర్‌ నుంచి తొలగిస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. దీంతో ఓ వెలుగు వెలుగుపోతుందనుకున్న మిత్రోన్‌ కథ అంతలోనే ముగిసిపోయింది. మరోవైపు కరోనా వైరస్‌కు కారణం చైనా అంటూ ప్రపంచమంతా కోడై కూయడం, ఇండియన్‌ మేడ్‌ వస్తువులను వాడాలంటూ ప్రచారం జోరుగా సాగతున్న తరుణంలో ‘రిమూవ్‌ చైనా యాప్స్‌’ పేరిట మరో యాప్‌ పుట్టుకొచ్చింది. దీంతో ఈ యాప్‌కు కూడా విపరీతంగా డౌన్‌లోడ్లు పెరిగాయి. మళ్లీ తన పాలసీకి ‘రిమూవ్‌ చైనా యాప్స్‌’ అప్లికేషన్‌ విరుద్ధంగా ఉందంటూ ప్లేస్టోర్‌ నుంచి గూగుల్‌ డిలీట్ చేసేసింది. అలా ‘మిత్రోన్‌’, ‘రిమూవ్ చైనా యాప్స్‌’ అప్లికేషన్ల కథ కంచికి చేరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని