కరోనా: సెకండ్‌ హ్యాండ్‌ వస్తువులను కొనొచ్చా?

కరోనా వైరస్‌కు ముందు వీకెండ్‌ షాపింగ్‌లు, ఆన్‌లైన్‌ కొనుగోళ్లు జోరుగా కొనసాగేవి. అవసరం ఉన్నా.. లేకున్నా పడి ఉంటాయిలే అని తెగ కొనేసేవారు. అవసరమున్న వస్తువుల ఖరీదు ఎక్కువగా ఉంటే ఓఎల్‌ఎక్స్‌, క్వికర్‌ వంటి ఆన్‌లైన్‌ పొర్టల్స్‌.. కొన్ని దుకాణాల్లో సెకండ్‌ హ్యాండ్‌లో కొనేవారు. అయితే కరోనా విసిరిన

Updated : 16 Jun 2020 12:57 IST

కరోనా(కొవిడ్‌-19) వైరస్‌ వ్యాప్తి.. లాక్‌డౌన్‌తో గత మూడు నెలలుగా జనజీవనం.. ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయాయి. ఇటీవల దేశంలో అన్‌లాక్‌ 1.0 అమలు చేయడంతో దాదాపు అన్ని కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే లాక్‌డౌన్‌కు ముందు ఏవేవో వస్తువులు కొనుగోలు చేయాలని భావించిన వారు.. ఇప్పుడు ఆర్థికంగా చితికిపోయారు. కనీసం అవసరమైన వస్తువులను సెకండ్‌ హ్యాండ్‌లోనైనా కొనుగోలు చేయాలని కొందరు.. అనవసరమైన వస్తువులను అమ్మేస్తే చేతి ఖర్చులకైనా వస్తాయని మరి కొందరు భావిస్తున్నారు. కానీ వైరస్‌ వ్యాప్తి విస్తృతమవుతున్న నేపథ్యంలో అసలు సెకండ్‌ హ్యాండ్‌ వస్తువుల కొనుగోళ్లు, విక్రయాలు మంచిదేనా? ఒకవేళ క్రయవిక్రయాలు చేస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

కరోనా వైరస్‌ రాక ముందు వీకెండ్‌ షాపింగ్‌లు, ఆన్‌లైన్‌ కొనుగోళ్లు జోరుగా కొనసాగేవి. అవసరం ఉన్నా.. లేకున్నా పడి ఉంటాయిలే అని తెగ కొనేసేవారు. అవసరమున్న వస్తువుల ఖరీదు ఎక్కువగా ఉంటే ఓఎల్‌ఎక్స్‌, క్వికర్‌ వంటి ఆన్‌లైన్‌ పోర్టల్స్‌.. కొన్ని దుకాణాల్లో సెకండ్‌ హ్యాండ్‌లో కొనేవారు. అయితే కరోనా విసిరిన పంజాకి అన్ని దేశాలు వణికిపోతున్నాయి. కరోనా కట్టడిలో భాగంగా లాక్‌డౌన్‌ విధించడంతో అనేక మంది ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులో పడ్డారు. ఇప్పుడిప్పుడే ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోతున్నారు. ఈ క్రమంలో అవసరమైన వస్తువులను కొనుగోలు చేసేందుకు డబ్బు సరిపోక సెకండ్‌ హ్యాండ్‌లో  కొనాలనుకునేవారి సంఖ్య పెరుగుతోంది. అయితే.. తాము కొనుగోలు చేసిన వస్తువు యజమానులకు కరోనా ఉంటే.. తమకు సోకుతుందేమోనని చాలా మంది భయపడుతున్నారు. ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కొనుగోళ్లు చేసుకుంటే ఏ సమస్య ఉండదని పలువురు వ్యాపారవేత్తలు, నిపుణులు చెబుతున్నారు. 

ఏదైనా వస్తువును అమ్మాలన్నా.. కొనాలన్నా దుకాణాలకు వెళ్లకుండా ఉండటం మంచిది. అక్కడికి కరోనా సోకిన వ్యక్తి వచ్చినట్లయితే కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆన్‌లైన్‌ పోర్టళ్ల పిక్‌అప్‌, డెలివరీకి ప్రాధాన్యమివ్వండి. దీని ద్వారా ఒక్క మనిషితో మాత్రమే కాంటాక్ట్‌ ఉంటుంది. రిస్క్‌ తక్కువగా ఉంటుంది. వస్తువుల మార్పిడి జరిగిన వెంటనే చేతులను సబ్బు లేదా శానిటైజర్‌తో శుభ్రంగా కడగండి. కరెన్సీ నోట్ల బదులు ఆన్‌లైన్‌ పేమెంట్‌ చేయడం ఉత్తమం. అవసరమైతేనే వస్తువులను కొనండి లేదా అమ్మండి.

ది న్యూ ఇంగ్లాండ్‌‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ నివేదిక ప్రకారం అట్టపెట్టెలపై కరనా వైరస్‌ 24 గంటలపాటు జీవించి ఉంటుందట. ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ ఇచ్చే ఏ వస్తువులైనా అట్ట పెట్టెల్లోనే వస్తాయి. కాబట్టి వాటిని తీసుకోగానే తెరవకుండా 24 గంటల పాటు దూరంగా పెట్టండి. వెంటనే చేతులను శుభ్రంగా కడుక్కోండి. 24 గంటల తర్వాతే దానిని తెరవండి. లోపల ఉండే వస్తువులను శానిటైజ్‌ చేయండి. శుభ్రం చేయడానికి వీలులేని వస్తువులను కొనుగోలు చేయకండి. ఒకవేళ మీరు దుస్తులను ఆర్డర్‌ ఇచ్చినట్లయితే.. వాటిని తీసుకున్న తర్వాత వేడినీళ్లతో ఉతకండి. హ్యాండ్‌బ్యాగ్స్‌, పర్స్‌లాంటివి కొనుగోలు చేస్తే.. వాటిని క్రిమిసంహారక రసాయనాలతో శుభ్రం చేయండి. ఎన్‌ఈజేఎం నివేదిక ప్రకారం.. వైరస్‌ ప్లాస్టిక్‌ వస్తువులపై 72 గంటలు, స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ వస్తువులపై  48 గంటలు, అట్టపెట్టెలపై 24 గంటలు, రాగి వస్తువులపై 4 గంటలు జీవిస్తుందట. కాబట్టి ఆయా వస్తువులను బట్టి కొంత సమయం వాటిని దూరంగా పెట్టి ఆ తర్వాత వాడటం మంచిది. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని