కరోనా రహిత లక్షద్వీప్‌.. ఎలా సాధ్యమైంది?

కరోనా వైరస్‌ ప్రపంచదేశాలను వణికిస్తోంది. మన దేశంలోనూ అన్ని రాష్ట్రాలకు.. కేంద్ర పాలిత ప్రాంతాలకు వ్యాప్తి చెంది లక్షల మందిని బాధితులుగా చేసింది. ఒక్క లక్షద్వీప్‌ ఐలాండ్స్‌ మినహా.. భారత్‌కు చెందిన దాదాపు అన్ని ఐలాండ్స్‌ల్లోనూ కరోనా

Published : 20 Jun 2020 16:20 IST

కరోనా వైరస్‌ ప్రపంచదేశాలను వణికిస్తోంది. మన దేశంలోనూ అన్ని రాష్ట్రాలకు.. కేంద్ర పాలిత ప్రాంతాలకు వ్యాప్తి చెంది లక్షల మందిని బాధితులుగా చేసింది. ఒక్క లక్షద్వీప్‌ ఐలాండ్స్‌ మినహా.. భారత్‌కు చెందిన దాదాపు అన్ని ద్వీపాల్లోనూ కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటి వరకు లక్షద్వీప్‌ ఒక్కటే జీరో కరోనా జోన్‌గానే ఉంది. అదెలా సాధ్యమైంది?

పది నివాసయోగ్యమైన ఐలాండ్స్‌ సహా 36 ఐలాండ్స్‌ సమూహం లక్షద్వీప్‌. ఇక్కడ దాదాపు 65వేల మంది నివసిస్తున్నారు. చేపల వేట.. వాణిజ్య వ్యాపారాల్లో భాగంగా విదేశాలకు వెళ్లే భారీ ఓడల్లో పనిచేయడమే వీరికి తెలిసింది. ఏవైనా వస్తువులు కొనాలనుకుంటే కేరళకు రావాల్సి ఉంటుంది. అందుకే నిత్యం లక్షద్వీప్‌ ప్రజలు కేరళలోని కొచ్చి.. బేపొర్‌ ప్రాంతాలకు వస్తూ పోతూ ఉంటారు. దేశంలోనే తొలి కరోనా కేసు నమోదైన రాష్ట్రం కేరళ, ఇతర దేశాలకు నిత్యం రాకపోకలు సాగిస్తున్న ఈ ఐలాండ్స్‌కి చెందిన ప్రజల్లో ఒక్కరికి కూడా కరోనా రాకపోవడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. అయితే వారి ప్రాంతానికి కరోనా రాకుండా అధికారులు తీసుకున్న చర్యలు.. అక్కడి ప్రజల సహకారమే లక్షద్వీప్‌ను జీరో కరోనా ప్రాంతంగా నిలిపిందట.

కరోనా తొలినాళ్లలో ఏం జరిగింది?

మార్చి 16న ఎప్పటిలాగే కేరళకు వెళ్లిన 3,500 మంది స్థానికులు పలు ఓడల్లో తిరిగి లక్షద్వీప్‌కు చేరుకున్నారు. అప్పటికే భారత్‌లో కరోనా కేసులు వంద వరకు నమోదయ్యాయి. దీంతో కేరళకు వెళ్లి వచ్చిన వారందరినీ మార్చి 20న క్వారంటైన్‌లో ఉండాలని స్థానిక అధికారులు ఆదేశించారు. లాక్‌డౌన్‌కి ముందే విదేశీ పర్యాటకుల రాకపై నిషేధం విధించారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రధాని మోదీ లాక్‌డౌన్‌ ప్రకటించడంతో లక్షద్వీప్‌లోనూ అమలు చేశారు. ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్న ఇక్కడి స్థానిక ప్రజలను కేరళలోని కొచ్చి, మంగళూరులలో కరోనా పరీక్షలు నిర్వహించారు. వారికి కరోనా సోకలేదని నిర్ధారణ అయిన తర్వాతే లక్షద్వీప్‌కు తరలించారు. ఆ పరీక్షల్లో లక్షద్వీప్‌వాసుల్లో ఒక్కరికి కూడా కరోనా పాజిటివ్‌ రాలేదు. మరోవైపు లక్షద్వీప్‌లో చిక్కుకున్న ఇతర ప్రాంతాల పర్యాటకులను కొచ్చికి పంపించి అక్కడ 14 రోజుల పాటు క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉంచారు.

అవగాహన కార్యక్రమాలు.. పరీక్షలు

స్థానికులంతా స్వస్థలాలకు.. పర్యాటకులు కేరళకు వెళ్లాక లక్షద్వీప్‌లో అధికారులు ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపట్టారు. ఆశా వర్కర్లు, అంగన్‌వాడీల సహకారంతో ఇంటింటికి వెళ్లి.. కరోనాపై అవగాహన కల్పించారు. జ్వరం, దగ్గులాంటి కరోనా లక్షణాలు ఉన్న వారి నుంచి శాంపిల్స్‌ సేకరించారు. లక్షద్వీప్‌లో కరోనా పరీక్షలు నిర్వహించే సదుపాయం లేకపోవడంతో కేరళకు పంపించి పరీక్షలు నిర్వహించారు. లక్షణాలు ఉంటే అధికారులను సంప్రదించడానికి హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. ప్రజలు కూడా అధికారులకు సహకారం అందించారు. లక్షణాలు కనిపిస్తే స్వయంగా ముందుకొచ్చి పరీక్షలకు శాంపిల్స్‌ ఇచ్చారు. అయితే అన్నింట్లోనూ కరోనా నెగటివ్‌ రావడంతో లక్షద్వీప్‌నకు కాస్త ఊరట లభించింది.

ముందస్తు జాగ్రత్తలు

స్థానికుల కరోనా పరీక్షల్లో నెగటివ్‌ వచ్చినా అధికారులు అక్కడితో ఆగలేదు.. ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఏప్రిల్‌ మొదటి వారంలోనే లక్షద్వీప్‌ రాజధాని కవరత్తిలోని ఇందిరా గాంధీ ఆస్పత్రిని పూర్తిగా కొవిడ్‌ ప్రత్యేక ఆస్పత్రిగా మార్చారు. భారత ప్రభుత్వం సహకారంతో ఐసోలేషన్‌ బెడ్స్‌, ఐసీయూ బెడ్స్‌, వెంటిలేటర్లు,  ప్రజలు నివసిస్తున్న 10 ఐలాండ్స్‌లో క్వారంటైన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అనుమానిత వ్యక్తులకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగటివ్‌ వచ్చినా వారిని, వాళ్ల కుటుంబసభ్యులను 14 రోజులపాటు క్వారంటైన్‌ కేంద్రాల్లోనే ఉంచారు. ఇలా దేశంలో కేంద్ర ప్రభుత్వం కరోనా కట్టడి చర్యలు ప్రారంభించక ముందే.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం, ముఖ్యంగా పర్యాటకులపై ఆంక్షలు విధించడం, స్థానికుల్లో అనుమానితులకు కరోనా పరీక్షలు చేయించడం, భౌగోళిక స్వరూపం.. ఇవన్నీ కలిసిరావడంతో లక్షద్వీప్‌ కరోనాను దరిచేరనీయకుండా అడ్డుకోగలిగింది.

లాక్‌డౌన్‌ సడలింపులు.. రాకపోకలపై ఆంక్షలు

లాక్‌డౌన్‌ సడలింపుతో స్థానిక ప్రజలు కేరళకు వెళ్లిరావడానికి లక్షద్వీప్‌ అధికారులు ఆంక్షలతో కూడిన అనుమతులు ఇచ్చారు. కరోనా కాకుండా ఏదైనా అనారోగ్యం వస్తే ఓడల ద్వారా కేరళకు తరలిస్తున్నారు. తీవ్రమైన అనారోగ్యమైతే కేరళ ఆస్పత్రికి తరలించేందుకు చాపర్‌ సిద్ధం చేశారు. ముఖ్యమైన పనుల నిమిత్తం వెళ్లాలంటే స్థానిక ఈ-పాస్‌ పోర్టల్‌ ‘ఈ-జాగ్రత్త’ నుంచి పాస్‌లు పొందాల్సి ఉంటుంది. కేరళలో ఈ-పాస్‌ పొందిన వారు లక్షద్వీప్‌కి రావొచ్చు. అయితే ఎవరు ఎటు వెళ్లి వచ్చినా.. లక్షద్వీప్‌కు వచ్చే ముందు కరోనా పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. పరీక్షలో కరోనా నెగటివ్‌ అని తేలితేనే ఐలాండ్స్‌లోకి అనుమతిస్తున్నారు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని