అప్పట్లోనే చైనా వణికింది..

చైనా అంటే భారీ సైనిక, ఆర్థిక పాటవమున్న దేశమని, అమెరికాతో సైతం పోటీపడుతోందని కొందరు వూదరగొడుతుంటారు.  అయితే భారత్‌ మాత్రం...

Updated : 19 Jun 2020 10:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం : చైనా అంటే భారీ సైనిక, ఆర్థిక పాటవమున్న దేశమని, అమెరికాతో సైతం పోటీపడుతోందని కొందరు వూదరగొడుతుంటారు.  అయితే భారత్‌ మాత్రం  1962 యుద్ధంలో వెనుకడుగు వేసినా అనేక సందర్భాల్లో భారత్‌ పైచేయి సాధించడం విశేషం. 1967లో సిక్కింసెక్టార్‌లో భారత్‌-చైనాల మధ్య కొద్దిరోజులు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో చైనా తీవ్రంగా నష్టపోయింది.

1987లో...

అరుణాచల్‌ప్రదేశ్‌ భారత్‌లో అంతర్భాగం. అయితే చైనా ఇది తమదేనని వాదిస్తున్న విషయం తెలిసిందే. 1986లో అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ సారథ్యంలోని కేంద్రం అరుణాచల్‌ప్రదేశ్‌కు రాష్ట్రహోదాను ఇచ్చింది. ఇది బీజింగ్‌కు కంటగింపుగా మారింది. ఎలాగైనా అరుణాచల్‌ప్రదేశ్‌ను వివాదాస్పదం చేయాలని కుయుక్తులు పన్నింది. రోజూ గస్తీలో భాగంగా విధులు నిర్వహిస్తున్న భారత సైనికులకు సమ్‌దురాంగ్‌ ప్రాంతంలో చైనీయుల గుడారాలు కనిపించాయి. నిశితంగా పరిశీలించగా భారత ప్రాదేశికభూభాగంలోకి చైనా సైన్యం వచ్చి తిష్టవేసినట్టుగా అర్థమైంది. వెంటనే వారు తమ ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. ఆర్మీ జనరల్‌గా కె. సుందర్జీ ఉన్నారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న మేజర్‌ జనరల్‌ జేఎం సింగ్‌ వెంటనే సుందర్జీతో సమావేశమయ్యారు. చైనీయులు తమ పరిధిలో లేని ప్రాంతాల్లో గుడారాలు వేయడం కచ్చితంగా రెండుదేశాల మధ్య ఉన్న ఒప్పందాలను ఉల్లంఘించినట్టేనని  గుర్తించారు. కీలకంగా ఈ ప్రాంతం సున్నితమైనది. అక్కడ వాంగ్‌డుంగ్‌ రెండు సైన్యాల మధ్య సన్నాహాలకు వేదికగా నిలిచింది.  సమీపంలోని నాంకా చు లోయలో 1962లో చైనీయులు భారత్‌పై ఆధిపత్యం వహించిన ప్రాంతం కావడంతో భారతసైన్యం దీన్ని తీవ్రంగా పరిగణించింది. 

ఆపరేషన్‌ ఫాల్కన్‌

జనరల్‌ సుందర్జీ వెంటనే ఆపరేషన్‌ ఫాల్కన్‌ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సమ్‌దురాంగ్‌ లోయ ఆక్రమణలోకి వెళితే అరుణాచల్‌ప్రదేశ్‌కి ప్రమాదం. దీంతో యుద్ధ ప్రాతిపదికన భారత సైన్యాల మోహరింపు ప్రారంభమైంది. తేజ్‌పూర్‌ కమాండింగ్‌ అధికారి లెఫ్టినెంట్ జనరల్‌ ఎన్‌.ఎస్‌. నరహరి కూడా రంగంలోకి దిగారు. అప్పట్లో పర్వతప్రాంతాల్లో సైనిక సామగ్రి రవాణాకు కంచరగాడిదలను ఉపయోగించేవారు. తమకు వీటిని కేటాయించాలని కోరారు. అందుకు సుందర్జీ మీరు ఏకాలంలో ఉన్నారు అంటూ హెలికాప్టర్లను రంగంలోకి దించారు. దీంతో సైనిక బలగాలను త్వరితంగా చైనా సైన్యానికి ఎదురుగా తరలించారు.

ఆపరేషన్‌ చెకర్‌బోర్డ్‌

దాదాపు పదినెలల పాటు ఇరుదేశాలసైన్యాలు ఎదురెదురుగా నిలిచాయి. జనరల్‌ సుందర్జీ కొత్తవ్యూహం పన్నారు. ఆపరేషన్‌ చెకర్‌ బోర్డ్‌ పేరుతో సైనిక విన్యాసాలు ప్రారంభించారు. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని చైనాతో సరిహద్దు కలిగిన ప్రాంతాల్లో ఈ విన్యాసాలు జరిగాయి. భారత సైన్యానికి చెందిన 10 డివిజన్లు, వాయుసేన ఇందులో పాల్గొన్నాయి. భారతసైనిక దళాలు చైనాపై దాడికి సిద్ధంగా ఉన్నాయి. అప్పటి కేంద్ర విదేశాంగశాఖమంత్రి  ఎన్డీ తివారి విదేశీపర్యటనకు వెళుతూ మార్గమధ్యంలో బీజింగ్‌లో కాసేపు ఆగారు. భారత్‌లోకి చొచ్చుకు వచ్చిన చైనా సైన్యం వెనక్కువెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు. దీంతో మల్లగుల్లాలు పడ్డ చైనా అధినాయకత్వం చివరకు యథాతథ స్థితిని నెలకొల్పాలని సూచించింది. సమ్‌దురాంగ్‌ నుంచి వారి సైన్యం వెనక్కు మళ్లింది. భారతసైన్యం కూడా తిరిగి బ్యారెక్స్‌లకు చేరడంతో ఉద్రిక్తతలు చల్లారాయి.

భారత్‌కు భారీ విజయమే..

ఈ ప్రతిష్టంభన నెలల పాటు కొనసాగింది. ఒక్క తుపాకీ గుండు కూడా పేలలేదు. కానీ ఇది మన దేశానికి పెద్దవిజయమే అని రక్షణనిపుణులు విశ్లేషించారు. చైనాను అప్పుడు నిలువరించకుంటే నియంత్రణరేఖను దాటి ఏకంగా అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌లో తిష్టవేసివుండేది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని