చైనా గొడవ మనతోనే కాదు.. 

గాల్వన్‌ ఘటన.. మరోసారి భారత్‌, చైనా మధ్య సరిహద్దు వివాదాలకు తెరలేపింది. భారత భూభాగాన్ని కైవసం చేసుకోవాలని ఎప్పటికప్పుడు కుట్రలు పన్నే చైనా.. ఇటీవల భారత్‌లోని గాల్వన్‌ లోయలోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేసింది. ఈ ప్రయత్నాన్ని మన జవాన్లు ప్రాణాలు

Updated : 20 Jun 2020 15:24 IST

గాల్వన్‌ ఘటన.. మరోసారి భారత్‌, చైనా మధ్య సరిహద్దు వివాదాలకు తెర లేపింది. భారత భూభాగాన్ని కైవసం చేసుకోవాలని ఎప్పటికప్పుడు కుట్రలు పన్నుతున్న చైనా.. ఇటీవల భారత్‌లోని గాల్వన్‌ లోయలోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేసింది. ఈ ప్రయత్నాన్ని మన జవాన్లు ప్రాణాలు అర్పించి నిలువరించారు. డ్రాగన్ చైనాకు కేవలం మన దేశంతోనే కాదు.. తన సరిహద్దు దేశాలు, సరిహద్దులో లేని దేశాలతోనూ గొడవలకు దిగుతోంది. తనది కాని భూభాగాన్ని దక్కించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో చైనా ఏయే దేశాలతో గొడవలు పడుతుందో చూద్దాం..

భారత్‌తో వైరం

భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగిస్తూనే మరోవైపు ఇక్కడి భూభాగాన్ని స్వాధీనం చేసుకోవాలని చైనా కుతంత్రాలు చేస్తోంది. భారత్‌లోని అరుణాచల్‌ ప్రదేశ్‌ తమదేనంటూ వాదనకు దిగుతోంది. ఇరు దేశాల మధ్య మెక్‌మోహన్‌రేఖ, క్లెయిమ్‌ లైన్‌, వాస్తవ ఆధీన రేఖ  ఉన్నా.. వాటిని దాటి భారత్‌లోకి చొరబడుతోంది. 1914లో భారత్‌లోని బ్రిటన్‌ ప్రభుత్వం నేతృత్వంలో భారత్‌, చైనా, టిబెట్‌ మధ్య సరిహద్దులు ఏర్పాటు అయ్యాయి. అయితే దీన్ని చైనా ఒప్పుకోలేదు. అప్పటి నుంచి అరుణాచల్‌ప్రదేశ్‌ను టిబెట్‌లో భాగంగానే భావిస్తోంది. అలాగే లద్దాఖ్‌లోని అక్సాయ్‌ చిన్‌, దెమ్‌చాక్‌ ప్రాంతాన్ని, చంబూ వ్యాలీని చైనా తమదేనంటోంది. ఈ క్రమంలో భారత్‌, చైనా మధ్య యుద్ధాలు కూడా జరిగాయి.

ఐలాండ్స్‌ కోసం ఆరాటం

తూర్పు చైనా సముద్రంలో జపాన్‌ ఆధీనంలో ఉన్న కొన్ని ఐలాండ్స్‌ సమూహాన్ని కైవసం చేసుకోవాలని 1970 నుంచి చైనా యత్నిస్తోంది. జపాన్‌.. చైనా.. తైవాన్‌ మధ్యలో ఈ ఐలాండ్స్‌ ఉన్నాయి. వీటిని సెంకకు ఐలాండ్స్‌ అని జపాన్‌, డివోయూ ఐలాండ్స్‌ అని చైనా, తియాయూటై అని తైవాన్‌ పిలుస్తున్నాయి. 1945 నుంచి 1972 వరకు అమెరికా పాలనలో ఉన్న ఈ ఐలాండ్స్‌ను ప్రస్తుతం జపాన్‌ ఆధీనంలో ఉన్నాయి. అయితే 1970లో ఈ ఐలాండ్స్‌లో చమురు నిల్వలు, మత్స్య సంపద ఉన్నట్లు గుర్తించారు. సముద్ర మార్గ రవాణాకు మంచి సౌలభ్యం ఉండటంతో చైనా కన్ను ఆ ఐలాండ్స్‌పై పడింది. జపాన్‌ సార్వభౌమత్వాన్ని ప్రశ్నిస్తూ.. వాటిని ఆక్రమించాలని నిర్ణయించింది. అప్పటి నుంచి ఆ  ఐలాండ్స్‌ తమవేనని వాదిస్తోంది. తైవాన్‌ చైనాలో భాగమైనప్పటికి అవి తమకు చెందినవేనని వాదిస్తోంది.

వియత్నాంతో కయ్యం

వియత్నాంపై కూడా చైనా తన దురాక్రమాలను ప్రదర్శించింది. ఆ దేశంలో దాదాపు 50 ప్రాంతాలను స్వాధీనం చేసుకునే యత్నం చేసింది. స్పార్ట్‌లీ ఐలాండ్స్‌ను ఆక్రమిస్తోంది. ఈ క్రమంలో చైనా-వియత్నాం మధ్య 1979 నుంచి 1991 వరకు పలుమార్లు యుద్ధాలు కూడా జరిగాయి. ఈ ఐలాండ్స్‌ తమవేనంటూ తైవాన్‌, ఫిలిప్పిన్స్‌ కూడా వాదనలు వినిపిస్తున్నాయి.

నదీ ప్రాంతంపై నార్త్‌ కొరియాతో..

ఉత్తర కొరియా, చైనా మధ్యలో ఉన్న యాలూ నదీ.. అందులోని ఐలాండ్స్‌పై ఇరు దేశాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ నదీపై సర్వహక్కులను చైనా, ఉత్తర కొరియా సమానంగా పంచుకున్నాయి.

తమవేనంటూ..

దక్షిణ చైనా సముద్రంలో చైనా, ఫిలిప్పిన్స్‌ మధ్య ఉన్న స్కార్‌బేరా మట్టి దిబ్బ విషయంలో ఇరు దేశాలు గొడవలు పడుతున్నాయి. 2012లో ఈ చిన్న మట్టి దిబ్బ వద్దకు చైనాకు చెందిన కొందరు చేపల వేటకు వెళ్లారు. ఫిలిప్పిన్స్‌ నేవీ వారిని అరెస్టు చేయబోతే చైనాకు చెందిన నేవీ వారిని అదుపులోకి తీసుకుంది. అప్పటి నుంచి స్కార్‌బేరా చైనా నియంత్రణలో ఉంటోంది. స్పార్ట్‌లీ ఐలాండ్స్ విషయంలో ఇరు దేశాలు కయ్యానికి కాలు దువ్వుతున్నాయి.

కొండ కోసం దక్షిణ కొరియాతో కొరివి

యెల్లో సముద్రంలో సొకొట్రా అనే కొండ ఉంది. సముద్ర మట్టానికి 15 అడుగుల ఎత్తులో ఉండే ఈ కొండ అంతర్జాతీయ సముద్ర చట్టాల ప్రకారం ఏ దేశానికి చెందదు. కానీ దీనిని దక్కించుకోవాలని దక్షిణ కొరియా, చైనా ప్రయత్నిస్తున్నాయి. ఈ కొండ తమ ఎకానమికల్‌ జోన్‌లోకి వస్తుందంటే కాదు.. కాదు.. మా ఎకానమికల్‌ జోన్‌లోకి వస్తుందని ఇరు దేశాలు వాదిస్తున్నాయి.

భూటాన్‌ను భయపెడుతూ

భారత్‌కు మిత్రదేశమైన భూటాన్‌లో చైనా ఆక్రమణలు కొనసాగుతున్నాయి. టిబెట్‌లోని భూటాన్‌కు చెందిన కొన్ని ప్రాంతాలతోపాటు డొక్లాంలోనూ చొరబడేందుకు డ్రాగన్‌  ప్రయత్నిస్తోంది. 2017లో చైనా.. డొక్లాంలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టింది. దీనిని భూటాన్‌ త్రీవంగా వ్యతిరేకించింది. ఈ విషయం భారత్‌కు తెలియడంతో భారత్‌ బలగాలు డొక్లాంలో చైనా బలగాలను అడ్డుకున్నాయి. 

ఇండోనేషియా ప్రాంతంపై పట్టుకు తైవాన్‌.. చైనా 

తైవాన్‌, చైనాలో భాగమే.. అయినా దక్షిణ చైనా సముద్రంలో ఉన్న స్పార్ట్‌లీ ఐలాండ్స్‌, నాతునా ఐలాండ్స్‌ విషయంలో ఇరు దేశాలు విభేదిస్తున్నాయి. ఆయా ఐలాండ్స్‌ తమవేనంటూ వాదిస్తున్నాయి.

పామిర్‌ పర్వతాల్లో తజికిస్థాన్‌తో తగువులాట

2011లో జరిగిన ఒప్పందం ప్రకారం తజికిస్థాన్‌ పామిర్‌ పర్వతాల్లోని 1,158 స్క్వేర్‌ కిలోమీటర్ల ప్రాంతాన్ని చైనాకు అప్పగించింది. చైనా తజికిస్థాన్‌లోని 73వేల స్క్వేర్‌ కిలోమీటర్ల ప్రాంతంపై తమ అధికారాలను వదిలేసింది. అయితే కొన్నిసార్లు పామిర్‌ పర్వత ప్రాంతంలో చైనా, తజికిస్థాన్‌ సరిహద్దు విషయంలో తజికిస్థాన్‌ ధోరణి ఒక్కోసారి ఒక్కోలా ఉంటుండంతో ఇరు దేశాల మధ్య విభేధాలు తలెత్తుతున్నాయి.

మట్టి దిబ్బ కోసం మలేషియాతో గొడవ

దక్షిణ చైనా సముద్రంలో ఉన్న మలేషియాకు చెందిన జేమ్స్‌ మట్టిదిబ్బను కైవసం చేసుకోవడం కోసం చైనా ప్రయత్నిస్తోంది. ఈ ప్రాంతం తమ పరిధిలోనే ఉందని మలేషియా చెబుతోంది. ఇప్పటికి ఆ ప్రాంతాన్ని తమ పాలనలోనే ఉంచుకున్న మలేషియా చమురు నిలువలు ఉన్నాయోనని పరిశోధిస్తోంది. అయితే చైనాకూ జేమ్స్‌ మట్టిదిబ్బ తమదేనని వాదిస్తోంది. 1981ను నుంచి చైనాకి చెందిన నేవీ పలుమార్లు ఆ ప్రాంతాన్ని సందర్శించిందని, చైనా మెరైన్‌ సర్విలెయన్స్‌ బృందం కూడా వెళ్లి సార్వభౌమాధికారం తమదేనని తెలిపే శిలాఫలకం కూడా ఏర్పాటు చేసిందని చెబుతోంది. 

వీటితోపాటు అఫ్గానిస్థాన్‌, మంగోలియా, కిర్జికిస్థాన్‌, కాంబోడియా, బ్రూనే, లావోస్‌ దేశాలతోనూ భూభాగం విషయంలో వైరం కొనసాగిస్తోంది. కొన్ని ప్రాంతాలు చైనా సరిహద్దుల్లో లేకున్నా.. పూర్వం చైనాకు చెందినవేనంటూ వితండవాదం వినిపిస్తోంది. 

- ఇంటర్నెట్ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని