గత శతాబ్దంలో కనిపెట్టిన వ్యాక్సిన్లు ఇవి!

కరోనా వైరస్‌ ఇప్పట్లో అంతమయ్యే అవకాశాలే కనిపించట్లేదు. వైరస్‌ను కట్టడి చేసేందుకు ఎంత ప్రయత్నించినా కేసులు రోజుకురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా భారత్‌ కరోనా నివారణకు మందు కనిపెట్టింది. అది అందరికి అందుబాటులోకి వస్తే.. బాధితులకు భారీ ఊరట లభించినట్లే. కానీ కరోనా సోకకుండా

Published : 04 Jul 2020 10:15 IST

కరోనా వైరస్‌ ఇప్పట్లో అంతమయ్యే అవకాశాలు కనిపించట్లేదు. వైరస్‌ను కట్టడి చేసేందుకు ఎంత ప్రయత్నించినా కేసులు రోజుకురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం అందరు వ్యాక్సిన్‌ కోసం ఎదురుచూస్తున్నారు. దీన్ని తయారు చేయడానికి శాస్త్రవేత్తలు ఎంతో కృషి చేస్తున్నారు. ప్రస్తుతం అన్నీ ప్రయోగదశలో ఉన్నాయి. త్వరలో వినియోగంలోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో గత శతాబ్ద కాలంలో వైద్య రంగం అభివృద్ధి చేసిన కొన్ని వ్యాక్సిన్ల గురించి తెలుసుకుందాం..

హెచ్‌ఐబీ

హిమోఫిలియస్‌ ఇన్‌ఫ్లూయెంజా టైప్‌ బి.. ఈ బ్యాక్టీరియా ఎక్కువగా చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. నోటి తుంపర్లు, దగ్గు, తుమ్ముల ద్వారా ఇతరులకు సోకే ఈ బ్యాక్టీరియా వెన్నెముక, మెదడులో ఉండే కణజాలలను నాశనం చేసి కొన్ని సార్లు ప్రాణాలు కూడా తీస్తుంది. ఈ వ్యాధి సోకిన వారిలో 5శాతం మంది చనిపోతే మిగతవారు మెదడు దెబ్బతినడం లేదా వినికిడి శక్తి కోల్పోతారట. ఇలాంటి వ్యాధికి వైద్య శాస్త్రవేత్తలు 1977లో తొలిసారి హెచ్‌ఐబీ వ్యాక్సిన్‌ను తయారు చేశారు. 1990లో మరింత శక్తిమంతంగా అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్‌ను 184 దేశాల్లో వినియోగిస్తున్నారు. ఈ వ్యాక్సిన్‌తో హిమోఫిలియస్‌ ఇన్‌ఫ్లూయెంజా టైప్‌బీ 90శాతం తగ్గింది.


హెపటైటిస్‌ బి

హెపటైటిస్‌ బి వైరస్‌ కాలేయంపై దాడి చేస్తుంది. ఇది కాలేయ క్యాన్సర్‌కు దారి తీయొచ్చు. ఏటా ఏడు లక్షల మందికిపైగా హెపటైటిస్‌ బి వైరస్‌ బారిన పడుతుంటారని అంచనా. రక్తం ద్వారా ఇతరులకు సోకే ఈ వైరస్‌ గర్భం సమయంలో తల్లి నుంచి బిడ్డకు వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధికి చికిత్స లేదు.. కానీ వ్యాక్సిన్‌ ఉంది. 1981లో యూఎస్‌ ఈ వ్యాక్సిన్‌ను ఆమోదించి వినియోగంలోకి తీసుకొచ్చింది. దీనిని ముఖ్యంగా అప్పుడే పుట్టిన శిశువుకు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న, హెచ్‌ఐవీ సోకిన వారికి ఇస్తుంటారు. వారితోపాటు హెల్త్‌ వర్కర్లు కూడా ఈ వ్యాక్సిన్‌ను తీసుకుంటుంటారు. ఈ వ్యాక్సిన్‌ 95 శాతం హెపటైటిస్‌ బి నుంచి రక్షిస్తుందట.


మంప్స్‌ (గవద బిళ్లలు)

చెంపలు, దవడల వద్ద వాపు రావడం ఈ వ్యాధి లక్షణం. మంప్స్‌ వైరస్‌ కారణంగా గవద బిళ్లలు వస్తాయి. చెంపలు, దవడం ఉబ్బడంతోపాటు వినికిడి శక్తి కోల్పోవడం, మెదడు దెబ్బతినడం వంటి తీవ్ర పరిణామాలు ఏర్పడతాయి. ఈ వైరస్‌ ఉమ్ము, దగ్గు, తుమ్ముల ద్వారా ఇతరులకు సోకే ప్రమాదముంది. దీనికి 1948లో మంప్స్‌ వ్యాక్సిన్‌ను కనిపెట్టారు. అయితే అది స్వల్పకాలమే పనిచేసేది. దానిని మరింత శక్తిమంతంగా అభివృద్ధి చేసి 1960లో పూర్తిస్థాయి వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఈ వ్యాక్సిన్‌ను రెండు దఫాలుగా ఇవ్వాల్సి ఉంటుంది. తొలిసారి 12 నుంచి 18 నెలల వయసు ఉన్నప్పుడు.. రెండోది 2 నుంచి 6ఏళ్ల వయస్సు మధ్యలో ఇవ్వాలి.


టెటానస్‌ (ధనుర్వాతం)

ఆడుతున్నప్పుడు లేదా ఇతర సందర్భాల్లో దెబ్బలు తగలడం సాధారణం. చర్మం తెగి రక్తం ధారలా కారుతుంటే ఈ టెటానస్‌ వ్యాక్సిన్‌ తప్పనిసరిగా తీసుకోవాలి. లేకపోతే మట్టిలో ఉండే బ్యాక్టీరియా శరీరంలోకి చేరి విషపూరితంగా మారుతుంది. దీని వల్ల మెడపట్టేయడం, విపరీతమైన నొప్పులు, మింగడంలో ఇబ్బంది, కడుపు నొప్పి వంటివి కలుగుతాయి. కొన్నిసార్లు మరణం కూడా సంభవించొచ్చు. వీటి నుంచి కాపాడటానికి 1890లో ఒక వ్యాక్సిన్‌ తయారు చేశారు. అయితే అది పెద్దగా ఫలితమివ్వలేదు. దీంతో మరింత లోతుగా పరిశోధనలు చేసి 1924లో టెటానస్‌ వ్యాక్సిన్‌ను కనిపెట్టారు. అయితే ఈ వ్యాక్సిన్‌ను ఎక్కువగా రెండో ప్రపంచ యుద్ధంలో గాయపడ్డ సైనికులకు ఇచ్చారట. దీంతో 95శాతం మంది టెటానస్‌ బారి నుంచి బయటపడ్డారు. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా అందరికి అందుబాటులోకి వచ్చింది. దీనిని బాల్యంలో ఐదు డోసులుగా ఇస్తారు. ఆ తర్వాత ప్రతి పదేళ్లకోసారి ఈ వ్యాక్సిన్‌ను తీసుకోవడం ద్వారా రోగనిరోధకశక్తి పెరిగి టెటానస్‌ బారిన పడకుండా ఉంటాం.


రుబెల్లా (పొంగు)

రుబెల్లా వైరస్‌ వల్ల చర్మంపై ఎర్రటి దద్దుర్లు వస్తాయి. మొదట ముఖంపై వచ్చి.. శరీరమంతా వ్యాపిస్తాయి. ఆ తర్వాత ఒళ్లు నొప్పులు, జ్వరం కూడా రావొచ్చు. చాలా మంది ఈ వైరస్‌ తమకు సోకినా గుర్తించలేరు. ఇది గర్భిణిలకు ప్రమాదకరం. గర్భిణికి ఈ వైరస్‌ సోకితే.. వారి ద్వారా కడుపులో ఉండే శిశువుకూ వ్యాప్తి చెందుతుంది. ఈ క్రమంలో గర్భస్రావం కావడం లేదా పుట్టిన బిడ్డ చనిపోవడం వంటివి జరుగుతుంటాయి. రుబెల్లాకు 1969లో వ్యాక్సిన్‌ను కనిపెట్టారు. 2009 నుంచి 130కిపైగా దేశాల్లో సాధారణ వ్యాక్సిన్‌లా దీనికి ఉపయోగిస్తున్నారు. 2015 నుంచి రుబెల్లా వైరస్‌ ప్రబలడం దాదాపు పూర్తిగా తగ్గిపోయింది. 


చికెన్‌పాక్స్‌ (ఆటలమ్మ)

చికెన్‌పాక్స్‌ వరిసెల్లా జోస్టర్‌ వైరస్‌ వల్ల వస్తుంది. ఈ వ్యాధి సోకితే శరీరమంతా పొక్కులు వస్తాయి. ప్రాణాంతకం కాదు కానీ జ్వరం, నీరసం, తలనొప్పి వస్తాయి. ఈ వ్యాధి వారం రోజుల్లో తగ్గిపోతుంది. ఒకవేళ తగ్గకపోతే మాత్రం న్యూమోనియా, మెదడు.. చర్మసంబంధిత వ్యాధులకు దారితీస్తుంది. ఇది చిన్నారుల కంటే పెద్దలకే ఎక్కువగా సోకుతుంటుంది. ఈ వ్యాధికి వ్యాక్సిన్‌ 1984లో అందుబాటులోకి వచ్చింది. దీనికి చిన్నపిల్లలకు రెండు డోసులు ఇవ్వాలని సీడీసీ సిఫార్సు చేస్తోంది.


పోలియో

పోలియో వ్యాక్సిన్‌ రాకముందు ఏడాదికి పది వేల మంది చిన్నారులు ఈ వ్యాధి బారిన పడేవారు. పోలియో వైరస్‌ ద్వారా సంక్రమించే ఈ వ్యాధి వల్ల మనుషుల్లో కండరాలు బలహీనపడతాయి. ఎక్కువగా కాళ్లపై ఈ వైరస్‌ ప్రభావం చూపుతుంది. తద్వారా కాళ్లు చచ్చుపడిపోయి పక్షవాతానికి గురవుతుంటారు. 20వ శాతబ్దంలో చిన్నారులకు సోకిన వ్యాధుల్లో ఇది ప్రమాదకరమైన వ్యాధిగా చెబుతుంటారు. అయితే 1950లో జోన్స్‌ సాక్‌ అనే శాస్త్రవేత్త పోలియో వ్యాక్సిన్‌ అభివృద్ధి చేశారు. ఆ తర్వాత మరో శాస్త్రవేత్త ఓరల్‌ వ్యాక్సిన్‌ను కనుగొన్నారు. ఇంజక్షన్‌, నోటి ద్వారా వేసుకునే రెండు రకాల వ్యాక్సిన్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. చిన్నారులు పోలియో బారిన పడకుండా రెండుసార్లు ఈ పోలియో వ్యాక్సిన్‌ వేయాలని డబ్ల్యూహెచ్‌వో సూచిస్తోంది.


వూపింగ్‌ కాఫ్‌ (కోరింత దగ్గు)

బార్డెటెల్లా పెర్ట్యుసెస్‌ బ్యాక్టీరియా వల్ల మొదట ముక్కు కారడం, చిన్నపాటి దగ్గుతో మొదలై తీవ్రంగా మారుతుంది. చిన్నారుల్లో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడతాయి. మూర్ఛ రావడం.. తినడంలో ఇబ్బంది కలుగుతాయి. దగ్గడం, తుమ్మడం ద్వారా ఇతరులకు సోకే ఈ బ్యాక్టీరియను అడ్డుకునేందుకు వ్యాక్సిన్‌ను 1926లో కనిపెట్టారు. రెండు రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నా.. ఇవి కేవలం 70 శాతం నుంచి 85శాతం వరకే కోరింత దగ్గును నివారించగలవట. 


ఇన్‌ఫ్లూయెంజా

ఫ్లూగా పిలిచే ఈ వ్యాధి తీవ్రత ఎలాగుంటుందో చెప్పలేం. కొన్నిసార్లు ప్రమాదకరం కాకపోవచ్చు. కొనిసార్లు ప్రాణాలే తీయొచ్చు. ఫ్లూ సోకిన వారికి ముక్కు కారడం, గొంతు, కండరాల నొప్పులు, తలనొప్పి, దగ్గు, నీరసం వస్తాయి. చిన్నారులకు వాంతులు, విరేచనాలు అవుతాయి. 1930లో దీనికి వ్యాక్సిన్‌ కనిపెట్టగా 1945నాటికి అమెరికాలో.. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. అయితే ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. దాన్ని బట్టి వ్యాక్సిన్‌ కూడా మారుతోంది. దీంతో ఏటా రెండు రకాల వ్యాక్సిన్లను వైద్య శాస్త్రవేత్తలు ఆవిష్కరిస్తుంటారు. 


మీసెల్స్‌ (తట్టు)

దగ్గు, తుమ్ముల ద్వారా మీసెల్స్‌ వైరస్‌ చాలా వేగంగా ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుంటుంది. ముక్కు కారడం, కళ్లు మండటం, నోట్లో తెల్లని పొక్కులు రావడం, దగ్గు వంటివి ఈ వ్యాధి లక్షణాలు. ఈ వైరస్‌ వల్ల చర్మంపై ఎర్రటి దద్దుర్లు కూడా వస్తాయి. డయేరియా, న్యూమోనియా వంటివి వచ్చే అవకాశమూ ఉంది. కొన్నిసార్లు మూర్ఛ, కళ్లు కనిపించడకపోవడం, మెదడు సంబంధిత వ్యాధులు రావొచ్చు. 1963లో తొలిసారి మీసెల్స్‌కు వ్యాక్సిన్‌ను ఆవిష్కరించారు. ఒక్కసారి ఈ వ్యాక్సిన్‌ వేస్తే చాలా కాలం పాటు మనల్ని మీసెల్స్‌ నుంచి రక్షిస్తుంది. మీసెల్స్‌తోపాటు మంప్స్‌, రుబెల్లాతో కలిపి ‘ఎంఎంఆర్’ వ్యాక్సిన్‌ కూడా ఇస్తుంటారు. ‌ఈ వ్యాక్సిన్లను ప్రపంచ ఆరోగ్య సంస్థ.. అత్యవసర ఔషధాల జాబితాలో చేర్చడంతోపాటు అందరికి అందుబాటులో ఉండేలా చూస్తోంది. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని