చైనా పెట్టుబడులున్న దేశీయ యాప్స్ ఇవీ!‌

చైనాతో వివాదం నేపథ్యంలో ఆ దేశానికి గట్టి దెబ్బ కొట్టాలని భారత ప్రభుత్వం చైనాకు చెందిన 59 యాప్‌లను నిషేధించిన విషయం తెలిసిందే. దీని వల్ల దాదాపు రూ. 80వేల కోట్లు చైనా నష్టపోయిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనా యాప్స్‌ నిషేధం మంచి నిర్ణయమే. కానీ చైనాను పూర్తిగా

Updated : 03 Jul 2020 18:47 IST

చైనాతో వివాదం నేపథ్యంలో ఆ దేశానికి గట్టి దెబ్బ కొట్టాలని భారత ప్రభుత్వం చైనాకు చెందిన 59 యాప్‌లను నిషేధించిన విషయం తెలిసిందే. దీని వల్ల దాదాపు రూ. 80వేల కోట్లు చైనా నష్టపోయిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనా యాప్స్‌ నిషేధం మంచి నిర్ణయమే. కానీ చైనాను పూర్తిగా మన దేశం నుంచి పారదోలే అవకాశాలు తక్కువే. ఎందుకంటే.. డ్రాగన్‌ యాప్స్‌ను నిషేధించినా.. అక్కడి పెట్టుబడుదారులు మన దేశీయ ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ రంగాల్లో పెట్టుబడులు పెట్టిన విషయం చాలా మందికి తెలియదు. మన దేశంలో ప్రజలు ఎక్కువగా ఉపయోగిస్తున్న కొన్ని యాప్స్‌లో చైనా వ్యాపార సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. వాటిని ఒకసారి గమనిస్తే..

పేటీఎం

ఆన్‌లైన్‌ మొబైల్‌ రీఛార్జ్‌.. బిల్లుల పేమెంట్‌ కోసం ‘పేటీఎం’ను విజయ్‌ శేఖర్ శర్మ  2010లో ప్రారంభించారు. సుమారు రూ. 15 కోట్లతో ప్రారంభమైన ‘పేటీఎం’ అనతి కాలంలోనే ప్రజలకు చేరువైంది. ఇటీవల పేటీఎం బ్యాంకును సైతం ప్రారంభించింది.  అయితే పేటీఎం సంస్థలో యజమాని విజయ్‌కి ప్రస్తుతం 20శాతం వాటానే ఉంది. చైనా దిగ్గజ వ్యాపార సంస్థ అలీ బాబా 40శాతం వాటా, మరో చైనా సంస్థ సైఫ్‌ పార్టనర్స్‌ 20శాతం వాటా కలిగి ఉన్నాయి. అంటే దాదాపు 60శాతం వాటా చైనాకు చెందిన సంస్థలవే.  ప్రస్తుతం పేటీఎంలో అలీబాబా వాటా విలువ రూ. 4,670 కోట్లుగా ఉంది. 


ఓలా

భవీశ్‌ అగర్వాల్‌, అంకిత్‌ భాటి అనే ఇద్దరు యువ వ్యాపారవేత్తలు 2010లో క్యాబ్‌ సర్వీస్‌ ‘ఓలా’ను ప్రారంభించారు. అయితే 2014లో ఈ సంస్థలో చైనాకు చెందిన స్టీడ్‌వ్యూ క్యాపిటల్‌ పెట్టుబడులు పెట్టింది. 2018లో డ్రాగన్ దేశానికి చెందిన టెన్సెంట్ హోల్డింగ్స్‌.. సాఫ్ట్‌బ్యాంక్‌, ఆర్‌ఎన్‌టీ క్యాపిటల్‌తో కలిసి దాదాపు రూ. 8వేల కోట్లకుపైగా పెట్టుబడుల్ని ‘ఓలా’లో పెట్టాయి. ప్రస్తుతం ఓలాలో వీరి వాటా 10.4శాతం.


స్విగ్గీ

భోజనప్రియుల మొబైల్‌లో కచ్చితంగా ఉండే యాప్‌ స్విగ్గీ. కూర్చున్న చోటుకే నచ్చిన ఆహారాన్ని.. నచ్చిన రెస్టరెంట్ల నుంచి డెలివరీ చేసే స్విగ్గీని 2014లో శ్రీహర్ష మజెటీ, నందన్‌ రెడ్డి, రాహుల్‌ జైమిని సంయుక్తంగా రూపొందించారు. 2015లో సైఫ్‌ పార్ట్‌నర్స్‌.. అమెరికాకు చెందిన యాక్సెల్‌తో కలిసి స్విగ్గీలో రూ. 15కోట్లు పెట్టుబడి పెట్టింది. ఆ తర్వాత వరసపెట్టి చైనాకు చెందిన మితుయాన్‌-డియన్‌పింగ్‌, టెన్సెంట్‌ హోల్డింగ్స్‌, హిల్‌హౌస్‌ క్యాపిటల్‌ గ్రూప్‌ పెట్టుబడులు పెట్టాయి. వాటి విలువ రూ. 3.7వేలకోట్లకుపైనే. ఇప్పటి వరకు స్విగ్గీ పెట్టుబడుల రూపంలో రూ. 11వేల కోట్లకుపైగా సమకూర్చుకుంది.


హైక్‌ మెసెంజర్‌

వాట్సాప్‌కు పోటీగా వచ్చిన హైక్‌ మెసెంజర్‌ అంతగా పాపులర్‌ కాకపోయినా, విజయవంతంగా నడుస్తోంది. ఈ సంస్థలో చైనాకు చెందిన టెన్సెంట్‌ హోల్డింగ్స్‌, ఫాక్స్‌కాన్‌ టెక్నాలజీ గ్రూప్‌లు భారీగానే పెట్టుబడులు పెట్టాయి. సంస్థ విలువ రూ. 10వేల కోట్లకుపైగా ఉండగా.. పెట్టుబడుల రూపంలో హైక్‌.. మొత్తం రూ. 1900 కోట్లు సేకరించింది.


బిగ్‌ బాస్కెట్‌

భారత్‌లోనే అతిపెద్ద ఫుడ్‌ అండ్‌ అండ్‌ గ్రాసరీ ఆన్‌లైన్‌ స్టోర్‌ బిగ్‌ బాస్కెట్‌. అభినయ్‌ చౌదరి, హరి మీనన్‌, విపుల్‌ పరేక్‌, వీఎస్‌ సుధాకర్‌ కలిసి దీనిని 2011లో ప్రారంభించారు. ఇప్పటి వరకు ఈ సంస్థ రూ. 7.4వేల కోట్ల పెట్టుబడులను సేకరించింది. అందులో ఎక్కువగా విదేశీ పెట్టుబడులే ఉన్నాయి. ముఖ్యంగా చైనాకు చెందిన అలీ బాబా సంస్థ బిగ్‌ బాస్కెట్లో రూ. 2.2వేల కోట్లు పెట్టుబడులు పెట్టింది. ప్రస్తుతం ఈ సంస్థలో అలీబాబా వాటా 26.26శాతం.


జొమాటో

ఇదీ ఫుడ్‌ డెలివరీ సంస్థే. 2008లో దీపిందర్‌ గోయల్‌, పంకజ్‌ చద్దా సంయుక్తగా ఈ యాప్‌ను ప్రారంభించారు. దీనికి భారత్‌కు చెందిన ఇన్ఫో ఎడ్జ్‌ నిధులు సమకూర్చింది. అయితే 2018లో అలీ బాబా గ్రూప్‌కు చెందిన ఆంట్‌ ఫైనాన్షియల్‌ రూ. 3వేల కోట్లు పెట్టుబడి పెట్టి వాటాదారుగా మారింది. జొమాటో మొత్తం రూ. 6.8వేల కోట్లను పెట్టుబడుల రూపంలో సమీకరించింది.


ఓయో

హోటల్‌ గదులను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే వెసులుబాటు కల్పిస్తూ వచ్చిన యాప్‌ ఓయో. 18ఏళ్ల కుర్రాడు 2012లో దీనిని ప్రారంభించాడు. ఇందులో చైనాకు చెందిన డీడీ టెక్నాలజీ సహ పలు విదేశీ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. ఈ సంస్థలకు మొత్తంగా 48శాతం వాటా ఉంది.


ఫ్లిప్‌కార్ట్‌

దేశీయ ఆన్‌లైన్‌ స్టోర్‌ ఫ్లిప్‌కార్ట్‌ వాల్‌మార్ట్‌ చేతుల్లోకి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఇందులో వాల్‌మార్ట్‌కు దాదాపు 81శాతం వాటా ఉంది. దీనిని ప్రారంభించిన వారిలో ఒకరైన బిన్ని బన్సాల్‌కు 4.2 శాతం వాటా ఉండగా.. చైనాకు చెందిన టెన్సెంట్, స్టీవ్‌వ్యూ క్యాపిటల్‌ సంస్థలకు కూడా కొంతమేర వాటా ఉంది.


మేక్‌ మై ట్రిప్‌

ఇది భారత్‌లో అతిపెద్ద ఆన్‌లైన్‌ ట్రావెల్‌ కంపెనీ. ఇటీవల ఐబీబో గ్రూప్‌ను ఈ సంస్థ కొనుగోలు చేసింది. అయితే ఐబీబోలో చైనా సంస్థ టెన్సెంట్‌కు 9శాతం వాటా ఉంది. ఇవే కాదు.. భారత్‌కు చెందిన పలు చిన్నా పెద్ద సంస్థల్లో చైనాకు చెందిన పలు సంస్థలు పెట్టుబడులు పెడుతూనే ఉన్నాయి. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని