ఆ ఒక్కడే లేకపోతే..మూడో ప్రపంచయుద్ధమే!

ఒక్కోసారి పొరపాటున తీసుకున్న నిర్ణయాలు తీవ్ర నష్టాన్ని మిగుల్చుతాయ్‌. రెండు దేశాల మధ్య స్నేహం నశించి.. శత్రువులుగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఓ స్థాయిలో ఉన్న వ్యక్తి తప్పుడు నిర్ణయం తీసుకుంటే ప్రపంచ భవిష్యత్తే అగమ్యగోచరమయ్యే ప్రమాదముందనడానికి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన...

Updated : 26 Jul 2021 10:55 IST

ఒక్కోసారి దూకుడుగా తీసుకొనే నిర్ణయాలు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. అందుకే నిర్ణయాలు తీసుకొనే ముందు ఆచీతూచీ వ్యవహరించమని చెబుతారు. ఓ స్థాయిలో ఉన్న వ్యక్తి తప్పుడు నిర్ణయం తీసుకుంటే ప్రపంచ భవిష్యత్తే అగమ్యగోచరమయ్యే ప్రమాదముందనడానికి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన ఓ ఘటనే ఉదాహరణ..! 

రెండో ప్రపంచం యుద్ధం మొదట్లో అమెరికా తటస్థంగా ఉండిపోయింది. కానీ చివర్లో ఇంగ్లాండ్‌, సోవియట్‌యూనియన్... తదితర దేశాలతో కలిసి అక్షకూటమిపై పోరాడింది. 1945లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత సోవియట్‌ యూనియన్‌, అమెరికాల మధ్య దూరం పెరిగింది. ఈ రెండు దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం మొదలైంది. ఈ క్రమంలో అమెరికా సమీపంలో ఉన్న క్యూబాపై పట్టు సాధించాలని రెండు అగ్రరాజ్యాలూ ప్రయత్నిస్తుండేవి. అయితే క్యూబా కమ్యూనిస్టుల ఏలుబడిలో ఉండేది.

అది 1962 అక్టోబర్‌ 27.. సోవియట్‌ యూనియన్‌కు చెందిన బి-29 జలాంతర్గామి క్యూబాకు సమీపంలోకి వెళ్లింది. అందులో సీనియర్‌ ఆఫీసర్‌గా అలెగ్జాండ్రోవిచ్‌ అర్కిపోవ్‌ విధులు నిర్వర్తిస్తున్నారు. జలాంతర్గామి క్యూబాకు సమీపంలోకి వచ్చిందన్న విషయం అమెరికా సేనలకు తెలిసింది. దానిని నీటి తరంగాల ఒత్తిడికి గురిచేసి ఉపరితలంపైకి తెప్పించేందుకు డెప్త్‌ఛార్జర్లు (హైడ్రాలిక్‌ షాక్‌ సృష్టించేవి) వేసి బెదిరించడం మొదలుపెట్టారు. అంతే.. అందులో ఉన్న అలెగ్జాండ్రోవిచ్‌ అర్కిపోవ్‌, మరోసీనియర్‌ అధికారి వేలింటిన్‌ సావింట్‌స్కై, జలాంతర్గామి కెప్టెన్‌ ముగ్గురూ అప్రమత్తమయ్యారు. అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలాంటి అనుమతులు లేకుండా ఎదురుదాడికి దిగొచ్చని సోవియట్‌ ప్రభుత్వం ముందస్తు ఆదేశాలు కూడా జారీ చేసింది.

దీంతో అందులో ఉన్న ఇద్దరు అధికారులు ఎదురుదాడికి సిద్ధమైపోయారు. మూడో ప్రపంచయుద్ధం తమతోనే మొదలవుతుందని భావించారు. కానీ, వాళ్లతో సమాన హోదాలో ఉన్న అలెగ్జాండ్రోవిచ్‌ అర్కిపోవ్‌ మాత్రం ఇందుకు నిరాకరించాడు. ముగ్గురి మధ్య ఏకాభిప్రాయం కుదరనిదే ఆపరేషన్‌లో ముందుకెళ్లడం సాధ్యంకాదు. దీంతో జలాంతర్గామి కెప్టెన్‌ వెనక్కి తగ్గాడు. ఆ క్లిష్ట పరిస్థితుల్లో అర్కిపోవ్‌ ఎంతో ఉన్నతంగా ఆలోచించాడు. ఒక వేళ ఆ రోజు  అమెరికా సేనలపై ఎదురుదాడి జరిగితే.. ప్రపంచ పరిణామాలు మారిపోయేవి. ఎందుకంటే అందులో పది కిలోటన్నుల విస్ఫోటం సృష్టించే న్యూక్లియర్‌ టార్పెడో ఉంది. ఒక్క బటన్‌ నొక్కితే చాలు అది అమెరికా సేనలు ఉన్నచోట సముద్రంలో సునామీ సృష్టిస్తుంది. దాని రేడియేషన్‌ ప్రభావం భవిష్యత్ తరతరాల వారిపైనా పడుతుంది. అమెరికా  వెంటనే ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. దీంతో మూడో ప్రపంచ యుద్ధం అనివార్యమే. అయితే,  ఆ జలాంతర్గామిలో న్యూక్లియర్‌ టార్పెడో ఉందన్న విషయం అమెరికా సేనలకు అప్పటికి తెలియదు. ఆ తర్వాత తెలుసుకొని ఖంగుతిన్నాయి.

అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రపంచ భవిష్యత్‌ గురించి ఆలోచించి ఉన్నత నిర్ణయం తీసుకున్న అర్కిపోవ్‌ వయస్సు అప్పుడెంతో తెలుసా.. కేవలం 34 సంవత్సరాలు. ఆ వయస్సులో చాలా మంది దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటారు. కానీ, అప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల  మూడో ప్రపంచ యుద్ధమే ఆగిందని తెలిసినవారు చెబుతుంటారు. అర్కిపోవ్‌ 72 ఏళ్ల వయస్సులో 1998లో మరణించారు. ఆయన సేవలను  అభినందిస్తూ అమెరికాకు చెందిన సంస్థ 2017లో ‘‘ ఫ్యూచర్‌ ఆఫ్‌ లైఫ్‌ అవార్డు’’ తో సత్కరించింది. అప్పటికే ఆయన మరణించడంతో అర్కిపోవ్‌ మనవడు సెర్గేయ్‌కు 50 వేల డాలర్ల నగదును అందించారు.

-ఇంటర్నెట్‌డెస్క్

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని