వ్యాక్సిన్‌ సరే.. పంపిణీ ఎలా..?

ప్రపంచమంతా ఇప్పుడు కరోనా టీకా తయారీ కోసం పరుగులు పెడుతోంది. ప్రపంచ దేశాలు ఒకర్ని మించి మరొకరు సమర్థంగా తయారు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నాయి.

Published : 19 Sep 2020 00:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ప్రపంచమంతా ఇప్పుడు కరోనా టీకా తయారీ కోసం పరుగులు పెడుతోంది. ప్రపంచ దేశాలు ఒకదానికి మించి మరొకటి సమర్థంగా తయారు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నాయి. రష్యా ఇప్పటికే టీకా అందుబాటులోకి తెచ్చింది. ఈ రేసులో గెలిచేందుకు మిగతా దేశాలూ పోటీ పడుతున్నాయి. ఇక్కడి వరకు బాగానే ఉంది. అసలు ఇన్ని కోట్ల మంది జనాభాకు వ్యాక్సిన్‌ ఎలా అందుబాటులోకి తీసుకొస్తారన్నది స్పష్టత లేదు. ఇంతమందికి టీకాలు వేయడం ఎలా అన్నది ఇప్పుడు ప్రభుత్వాల ముందున్న సవాల్‌. ఇప్పటి వరకు దానికంటూ నిర్దిష్టమైన విధానమేంటన్నది ప్రభుత్వాలు వెల్లడించలేదు. టీకా ప్రయోగాలు సత్ఫలితాలనిచ్చినా.. ఉత్పత్తి నుంచి రవాణా వరకు ఉన్న సవాళ్లన్నీ దాటుకుంటూ ప్రజలకు వ్యాక్సిన్ ఎప్పుడు  చేరుతుందనేది అంతుబట్టడం లేదు. ఇప్పటికే కొన్ని దేశాలు వ్యాక్సిన్‌ పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలు పూర్తి కాకుండానే పెద్ద ఎత్తున వ్యాక్సిన్‌ డోసులను కొనుగోలు చేసేస్తున్నాయి. దీంతో అందరికీ వ్యాక్సిన్‌ అందుతుందా? సామాన్యుడికి అందుబాటు ధరల్లో టీకా చేరువవుతుందా? అసలు ఏ ప్రాతిపదికన పంపిణీ చేస్తారనే అంశాలపై చర్చలు జరుగుతున్నాయి.

ఆ దేశాలకు కష్టమే..
ప్రపంచ జనాభా 780 కోట్లకు పైనే. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న టీకాలు సత్ఫలితాలనిస్తే ముందస్తు కొనుగోలు ఒప్పందాలు కుదిరి, ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలు నిధులు సమకూర్చి.. నియంత్రణ సంస్థల అనుమతులు రాగానే ఉత్పత్తి మొదలవుతుంది. ఇవన్నీ జరిగినా ఇంతమంది జనాభాకు అందించడం సంక్లిష్టమైన వ్యవహారం. పైగా ఖర్చు కూడా ఎక్కువే. కరోనా ప్రభావంతో చాలా దేశాలు ఆర్థికంగా చాలా నష్టపోయాయి. ఇలాంటి తరుణంలో పూర్తిగా సొంత ఖర్చుతో టీకాల తయారీ, పంపిణీ అంటే కష్టతరమే. ఇంత వ్యయం భరించడం అధికాదాయ దేశాలకు సాధ్యపడినా.. పేద, మధ్యతరగతి దేశాలకు మాత్రం ఇది అదనపు భారమే. దీంతో ఆయా దేశాలకు టీకాలు అందుబాటులోకి వస్తాయా? అనేది మరో ప్రశ్న. 

యునిసెఫ్‌దే బాధ్యత..
ఐక్యరాజ్యసమితి బాలల సంరక్షణ సంస్థ (యునిసెఫ్‌) ఏటా ప్రపంచంలోని సగం మంది బాలలకు టీకాలు వేస్తోంది. ధనుర్వాతం, పోలియో, తట్టు, ఎల్లో ఫీవర్‌, కోరింత దగ్గు వంటి టీకాలను ఏటా 200 కోట్ల డోసుల టీకాలను కొనుగోలు చేసి 100 దేశాల్లో బాలబాలికలను కాపాడుతోంది. ప్రపంచంలో అతిపెద్ద టీకాల కొనుగోలుదారు యునిసెఫ్‌ సంస్థే. ఇప్పుడు పేద, అల్పాదాయ దేశాలను దృష్టిలో ఉంచుకుని కరోనా టీకా బాధ్యతనూ తీసుకుంది. ప్రపంచమంతటా కొవిడ్‌ టీకాలు వేయడానికి ఉద్దేశించిన ‘కొవాక్స్‌’ కార్యక్రమంలో భాగంగా కొవిడ్‌ టీకాలను సేకరించి అల్పాదాయ దేశాలకు అందించే బాధ్యతను నెరవేర్చనుంది.

విమానాల్లో రవాణా.. అంత ఈజీ కాదు

మొత్తం 10 దేశాల్లో 28 సంస్థలు కొవిడ్‌-19 టీకా ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నాయి. వందల కోట్ల డోసులు సిద్ధం చేయడం ఒకెత్తయితే.. వాటిని సరైన విధంగా రవాణా చేయడం మరో సమస్య. ప్రభుత్వాలు, పరిశ్రమలు ఇందుకోసం ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలు పెట్టాలని అంతర్జాతీయ విమాన రవాణాదారుల సంఘం (ఐఏటీఏ) అప్రమత్తం చేస్తోంది. విమానాల ద్వారా టీకా రవాణా అంత సులువేమీ కాదని గుర్తుచేస్తోంది. 780 కోట్ల జనాభాకు మనిషికి ఒక టీకా డోసు చొప్పున అందించడానికి 8వేల బోయింగ్‌ జంబో విమానాలు అవసరమవుతాయనేది ఒక అంచనా. అదే రెండు డోసులు వేయాలంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. స్థానిక టీకా ఉత్పత్తి కేంద్రాలు ఉన్న సంపన్న దేశాల్లోనైతే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి శీతలీకరణ వాహనాల్లో రవాణా చేయొచ్చు. అంతర్జాతీయ తరలింపునకు అయితే విమానాలు కావాల్సిందే. అదే పేద దేశాల్లో అయితే మాత్రం రోడ్డు మార్గంలో ప్రజలకు టీకా చేరవేయడం పెద్ద సవాలు. ఈ దేశాల్లో రహదారి వ్యవస్థ, శీతలీకరణ సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం కారణం. దీన్ని అధిగమించేందుకు ప్రభుత్వాలు, రవాణా సంస్థలతో యునిసెఫ్‌ కలిసి పనిచేస్తోంది.

మరికొన్ని సవాళ్లివీ..

టీకాను ఉత్పత్తి చేసిన తర్వాత అన్ని అనుమతులూ పొంది నిర్దేశిత ఉష్ణోగ్రతలో టీకా డోసులను ప్రపంచం నలుమూలల్లోని గమ్యాలకు చేర్చాలి. ఎక్కడా ఏ పొరపాటు జరిగినా టీకా సామర్థ్యం తగ్గిపోతుంది. కొత్త కోల్డ్‌ స్టోరేజీలు ఏర్పాటుచేయడం, పాత గిడ్డంగులకు మార్పులు చేర్పులు చేయడం లాంటి పనులు ఇప్పటి నుంచే ప్రారంభం అవ్వాల్సి ఉంది. అంతేకాదు టీకాను ఎంతసేపు శీతలీకరణలో ఉంచాలో తెలిసిన సిబ్బందిని అందుబాటులో ఉంచాలి. ఈ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా టీకా పనిచేయకుండా పోయే ప్రమాదం ఉంది. ఈ సవాళ్లన్నీ అధిగమిస్తే తప్ప వ్యాక్సిన్‌ను ప్రపంచంలో అందరికీ అందుబాటులోకి తీసుకురావడం కష్టం. అంతే కాదు డబ్బున్న వారు కొనుగోలు చేయడం, లేని వారు ఆగిపోవడం అన్నది కాకుండా ప్రజలందరికీ అందేవిధంగా ప్రభుత్వం ద్వారానే ఈ వ్యాక్సిన్‌ పంపిణీ జరగాలని అంటున్నారు నిపుణులు.

ముఖ్యంగా వ్యాక్సిన్‌ విషయంలో డబ్ల్యూహెచ్‌వో కూడా ప్రత్యేక చొరవచూపుతోంది. స్వల్ప ఆదాయ దేశాలకు వ్యాక్సిన్‌ అందించేందుకు చర్యలు చేపడుతోంది. ‘కొవాక్స్‌’ కార్యక్రమాన్ని డబ్ల్యూహెచ్‌వోనే ప్రారంభించింది. టీకా తయారు చేసుకోలేని, కొనలేని దాదాపు 100 దిగువ, మధ్యతరగతి దేశాలకు వ్యాక్సిన్‌ అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ కార్యక్రమంలో భారత్‌ను భాగస్వామ్యం చేసుకునేందుకు డబ్ల్యూహెచ్‌వో చర్చలు జరుపుతోంది. ఈ కార్యక్రమంలో చేరాలని అమెరికా ఇది వరకే సూచించింది. ఏ దేశానికా దేశం వ్యాక్సిన్లు తయారు చేసుకుని, పౌరులకు అందుబాటులోకి తీసుకురావడం కాకుండా, ప్రపంచం నలుమూలలకూ వైరస్‌ ప్రభావం, ఆర్థిక స్థోమత ఆధారంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని డబ్ల్యూహెచ్‌వో సూచిస్తోంది. పరిమిత దేశాల్లో అందరికీ వ్యాక్సిన్‌ కన్నా.. అన్ని దేశాల్లో కొందరికైనా వ్యాక్సిన్‌ అందించడం సరైన విధానం అని చెబుతోంది. టీకా జాతీయవాదం కారణంగా ఈ మహమ్మారి నుంచి బయటపడడం మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది. ఏ దేశం వ్యాక్సిన్‌ అందుబాటులోకి తీసుకొచ్చినా ప్రపంచం అంతటా అందజేసేందుకు ఆ దేశం చొరవ చూపాలంటోంది. ఇప్పటికే అధిక, మధ్యాదాయ దేశాలు కొవాక్స్‌ కార్యక్రమ నిర్వహణకు నిధులు సమీకరిస్తున్నాయని డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది. 170 దేశాలు ఇందులో చేరాయి. ప్రపంచ జనాభాలో 70 శాతం మందికి వ్యాక్సిన్‌ అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నాయి.

ముందుగా వారికే..

ముందుగా అల్పాదాయ దేశాలకు వ్యాక్సిన్‌ అందుబాటులోకి తేవాల్సి ఉంటుంది. ఆయా దేశాల్లో ప్రభావిత వర్గాల ఆధారంగా, సమానత్వ హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా వ్యాక్సిన్‌ అందించాలని డబ్ల్యూహెచ్‌వో సూచిస్తోంది. భారత్‌ విషయానికొస్తే కరోనా వ్యాక్సిన్‌ టీకా 2021 మొదటి త్రైమాసికంలోకి అందుబాటులోకి వస్తుందని కేంద్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ముందుగా ఆరోగ్యకార్యకర్తలు, వృద్ధులకు అందజేస్తామని, ఆ తర్వాత అత్యవసరం ఉన్న అందరికీ ఖర్చుతో సంబంధం లేకుండా టీకా వేస్తామని ఆ శాఖ చెబుతోంది. పంపిణీకి సంబంధించి ఇప్పటికే ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్‌ సమావేశామైనా ఇంత వరకు అధికారికంగా మార్గదర్శకాలు జారీ చేయలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని