Flavour Graveyard : ఐస్‌క్రీమ్‌ ఫ్లేవర్లకు సమాధులు.. ఎందుకో తెలుసా? 

మనుషులు చనిపోతే వారికి సమాధులు నిర్మిస్తాం. పెంపుడు జంతువులు మృతి చెందినా.. వాటి జ్ఞాపకార్థం కొందరు సమాధులు నిర్మించడం గురించి విన్నాం. కానీ, యూఎస్‌లోని ఓ ఐస్‌క్రీమ్‌ పార్లర్‌.. ఐస్‌క్రీమ్‌ ఫ్లేవర్లకు సమాధులు ఏర్పాటు చేస్తోంది. ఫ్లేవర్లకు

Updated : 29 Oct 2021 12:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మనుషులు చనిపోతే వారికి సమాధులు నిర్మిస్తాం. పెంపుడు జంతువులు మృతి చెందినా.. వాటి జ్ఞాపకార్థం కొందరు సమాధులు నిర్మించడం గురించి విన్నాం. కానీ, యూఎస్‌లోని ఓ ఐస్‌క్రీమ్‌ పార్లర్‌.. ఐస్‌క్రీమ్‌ ఫ్లేవర్లకు సమాధులు ఏర్పాటు చేస్తోంది. ఫ్లేవర్లకు సమాధులేంటని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఇది చదివేయండి..

వెర్మంట్‌లోని వాటర్‌బర్నీ అనే గ్రామంలో బెన్‌ అండ్‌ జెర్రీ అనే ఫేమస్‌ ఐస్‌క్రీమ్‌ పార్లర్‌ ఉంది. 1978లో దీన్ని  ప్రారంభించారు. అనేక రకాల ఫ్లేవర్లను సృష్టించి విక్రయించడం ఈ ఐస్‌క్రీమ్‌ పార్లర్‌ ప్రత్యేకత. అందుకే నగరాల నుంచి ఎంతో మంది కేవలం ఈ ఐస్‌క్రీమ్‌ తినడానికి ఇక్కడికి వచ్చేవారు. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా శాఖలు కూడా ఏర్పాటయ్యాయి.. అయితే, ప్రతి దానికి ఒక ప్రారంభం, ముగింపు ఉన్నట్లే.. వీరు తయారు చేసే ఐస్‌క్రీమ్‌కు కూడా ఎక్స్‌పైరీ డేట్‌ ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త రకం ఫ్లేవర్లను పరిచయం చేసే ఈ సంస్థ.. వాటిని కస్టమర్లు ఇష్టపడకపోతే తయారు చేయడం మానేస్తుంటుంది. అలా తయారు చేయడం మానేసిన ఐస్‌క్రీమ్‌ ఫ్లేవర్లకు బెన్‌ అండ్‌ జెర్రీ సంస్థ సమాధులు ఏర్పాటు చేస్తోంది. 

కస్టమర్లకు నచ్చని ఐస్‌క్రీమ్‌ ఫ్లేవర్‌ను భూమిలో పాతిపెట్టి మనుషులకు అంత్యక్రియలు జరిపించినట్లుగానే జరిపిస్తోందీ సంస్థ. ఆ తర్వాత ఆ ఫ్లేవర్‌ ఫొటో.. దాని ప్రత్యేకత, ఏ కాలంలో ప్రజలకు అందుబాటులో ఉన్న వివరాలను శిలాఫలకంపై చెక్కి.. సమాధి నిర్మిస్తుంటుంది. అలా ఇప్పటి వరకు పదుల సంఖ్యలో ఐస్‌క్రీమ్‌ ఫ్లేవర్లకు ఈ ఐస్‌క్రీమ్‌ పార్లర్‌ సమాధులు కట్టించింది. ఆ సమాధుల ఫొటోలను సంస్థ తమ అధికారిక వెబ్‌సైట్‌లోని ‘ఫ్లేవర్‌ గ్రేవ్‌యార్డ్‌’ విభాగంలో ఉంచింది. సమాధులుగా మారిన ఐస్‌క్రీమ్‌ ఫ్లేవర్లలో దేన్నైనా ఎక్కువ మంది కస్టమర్లు కోరితే.. దాన్ని తిరిగి తయారు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఈ సంస్థ చెబుతోంది. భలే వింతయిన ఆలోచన కదా..!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని