టెలిఫోన్‌ బూత్‌లాగే.. ఈ టెలిక్యూబ్‌లు!

ఇప్పుడంటే అందరి చేతుల్లో మొబైల్‌ ఫోన్‌లు ఉన్నాయి. కానీ, ఒకప్పుడు ఇతర ప్రాంతాల్లో ఉండేవారితో మాట్లాడాలనుకుంటే టెలిఫోన్‌ బూత్‌కు వెళ్లేవారు. ఒకరు నిలబడగలిగేంత విస్తీర్ణంలో చిన్న గదిలాగా ఉంటుంది ఆ బూత్‌. అందులో నిలబడి ఫోన్‌ చేసుకునేవారు. బస్‌స్టాప్‌, రైల్వే స్టేషన్‌

Updated : 12 Feb 2021 20:45 IST


(ఫొటో: వీక్యూబ్‌ వెబ్‌సైట్‌)

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇప్పుడంటే అందరి చేతుల్లో మొబైల్‌ ఫోన్‌లు ఉన్నాయి. కానీ, ఒకప్పుడు ఇతర ప్రాంతాల్లో ఉండేవారితో మాట్లాడాలనుకుంటే టెలిఫోన్‌ బూత్‌కు వెళ్లేవారు. ఒకరు నిలబడగలిగేంత విస్తీర్ణంలో చిన్న గదిలాగా ఉండేది ఆ బూత్‌. అందులో నిలబడి ఫోన్‌ చేసుకునేవారు. బస్‌స్టాప్‌, రైల్వే స్టేషన్‌ ఇలా జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇవి కనిపించేవి. కాలక్రమంలో ఈ టెలిఫోన్‌ బూత్‌లు కనుమరుగయ్యాయి. అయితే, ఇటీవల ఈ బూత్‌లు రూపాంతరం చెంది టెలీక్యూబ్‌లుగా ప్రత్యక్షమయ్యాయి. జపాన్‌లో ప్రజలు వీటిని బాగా ఆదరిస్తున్నారు. ఇంతకీ ఏమిటీ టెలిక్యూబ్‌లు..?

కరోనా సంక్షోభం కారణంగా కంపెనీల్లో వర్క్‌ ఫ్రమ్‌ హోం కల్చర్‌ బాగా పెరిగింది. పని అంతా ల్యాప్‌టాప్‌లోనే జరిగిపోవడం, ఆఫీస్‌కు వెళ్లాల్సిన అవసరం లేకపోవడంతో ఉద్యోగులు నచ్చిన ప్రదేశాలకు వెళ్తూ అక్కడి నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే, ఉద్యోగులు బయటకు వెళ్లినప్పుడు.. ప్రయాణాలు చేస్తున్నప్పుడు అత్యవసరంగా ఆఫీసు పని చేయాల్సి వచ్చినా, ఫోన్‌ లేదా వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడాల్సి వచ్చినా ఇబ్బంది ఎదురవుతోంది. జనాల మధ్య పనిచేసుకునే వీలు ఉండదు. చుట్టూ ఉండే మనుషుల మాటలు, వాహనాల శబ్దాలు చిరాకు తెప్పిస్తాయి. ముఖ్యంగా పని వేళల్లో బయటకు వెళ్లారని తెలిస్తే సంస్థ యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేయొచ్చు. ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా పలు సంస్థలు ఈ టెలీక్యూబ్‌లను రూపొందించాయి. 

చిన్నపాటి గదిలా ఉండే టెలీక్యూబ్‌లను బస్‌స్టేషన్‌, రైల్వేస్టేషన్‌, ఎయిర్‌పోర్టు ఇతర జనసంచార ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో టెలీక్యూబ్‌లో ఒకటి నుంచి నాలుగు గదులుంటాయి. ఒక్కో గదిలో ఒక కుర్చి/ సోఫా.. ల్యాప్‌టాప్‌ పెట్టుకోవడానికి వీలుగా డెస్క్‌.. ల్యాప్‌ట్యాప్‌ను కనెక్ట్‌ చేసుకునేందుకు మానిటర్‌ ఉంటాయి. ఛార్జింగ్‌ పెట్టుకోవడానికి విద్యుత్‌ సరఫరా కూడా ఉంటుంది. ఒక గది నుంచి మరో గదికి శబ్దాలు వినపడకుండా సౌండ్‌ప్రూఫ్‌ మెటీరియల్‌ను గోడలుగా ఉపయోగించారు. దీంతో బయట శబ్దాలు లోపలికి వినిపించవు.. లోపలి శబ్దాలు బయటకు వినిపించవు. ఎవరూ అంతరాయం కలిగించకుండా ప్రైవసీ ఉంటుంది.

నిజానికి ఈ టెలీ క్యూ‌బ్‌లను 2018లోనే మిత్సుబుషి కంపెనీ ప్రైవేటుగా సంస్థలకు, వ్యక్తులకు అద్దెకిచ్చేది. 2019లో బహిరంగ ప్రదేశాల్లో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసింది. కానీ, గతేడాది కరోనా వ్యాప్తి నేపథ్యంలో వీటి డిమాండ్‌ భారీగా పెరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వందకు పైగా ఈ టెలీక్యూబ్‌లున్నాయి. త్వరలో వెయ్యికిపైగా ఏర్పాటు చేసేందుకు వివిధ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని