Tourism: ఈ దేశాల్లో పర్యటన.. భారతీయులకు చాలా సులువు

ప్రపంచంలో కొన్ని దేశాలు భారతీయులకు ఈ వీసా (e visa), వీసా ఆన్‌ అరైవల్‌ (Visa On Arrival) సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. దీని ద్వారా అత్యంత సులువుగా ఆయా దేశాల్లో పర్యటించేందుకు వీలుంటుంది.

Updated : 28 Mar 2023 16:52 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సరదాగా కొన్ని రోజుల పాటు విదేశాల్లో పర్యటించి వద్దామనుకునే వారికి వీసా అతిపెద్ద సమస్య. అనుకున్న సమయానికి వీసా రాకపోవడం, అది వచ్చేటప్పటికి సమయం కుదరకపోవడం లాంటి సమస్యలతో చాలా మంది ప్రయాణాలను వాయిదా వేసుకుంటూ వస్తారు. అయితే ప్రపంచంలోని కొన్ని దేశాలకు వెళ్లేందుకు భారతీయులకు ప్రత్యేకించి వీసా అక్కర్లేదు. ఆయా దేశాలే మనవాళ్లకు ఈ-వీసాలు, వీసా ఆన్‌ అరైవల్‌ ఏర్పాటు చేస్తున్నాయి. దీనికోసం పర్యాటకులు ట్రావెల్‌ ప్లాన్‌ విషయాలను నమోదు చేస్తూ ఒక దరఖాస్తు నింపితే సరిపోతుంది. మరి ఆ దేశాలేంటో.. వీసాకు ఎంత ఖర్చవుతుందో తెలుసుకుందామా?

1. మాల్దీవులు (Maldives)

కొత్తగా పెళ్లయిన జంటలు విహారయాత్రకు వెళ్లాలనుకుంటే మాల్దీవ్‌లు సరైన ప్రదేశం. అక్కడికి చేరుకున్న వెంటనే 30 రోజుల పాటు ఉండేందుకు వీలుగా అక్కడి ప్రభుత్వం ‘వీసా ఆన్‌ అరైవల్‌’ సమకూరుస్తోంది. ఇక ఈ దేశంలో పర్యటకులు సంతోషంగా గడపడానికి ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. ఎన్నో సాహసోపేతమైన క్రీడల్లోనూ పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా భారతీయులకు ఎలాంటి రుసుము తీసుకోకుండానే  అక్కడి ప్రభుత్వం వీసాలు మంజూరు చేస్తోంది.

2. థాయ్‌లాండ్‌ (Thailand)

థాయ్‌లాండ్‌లో చూడదగ్గ ప్రదేశాల్లో బ్యాంకాక్‌, క్రబి, ఫుకెట్‌,ఫిఫీ దీవులు ముందువరుసలో ఉంటాయి. రకరకాల ఆహార పదార్థాలు, నైట్‌క్లబ్‌లు ఇక్కడి ప్రత్యేకత. థాయ్‌లాండ్‌లో  15 రోజులు పాటు ఉండాలనుకునే వారు కేవలం 35 అమెరికా డాలర్లు చెల్లించి పర్యాటక వీసాను పొందొచ్చు. అంటే దాదాపు రూ.2,864తో 15 రోజులపాటు థాయ్‌లాండ్‌ దీవుల్లో పర్యటించొచ్చన్నమాట.

3. కాంబోడియా (Cambodia)

ప్రకృతిని ఆస్వాదించాలనుకునేవారికి కాంబోడియా సరైన ప్రదేశం. ఇక్కడ దేవాలయాలు, అడవులు.. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రకృతి రమణీయత పర్యాటకులను కట్టిపడేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక్కడి వెళ్లేందుకు ఈ-వీసా పొందాలనుకునే వారు నెలకు రూ.2,970 చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

4. ఇండోనేసియా (Indonesia)

మనోహరమైన బీచ్‌లకు ఇండోనేసియా ప్రసిద్ధి. నోరూరించే ప్రత్యేక వంటకాలకు ఇది నెలవు. బీచ్‌లో సేదతీరుతూ ఎంజాయ్‌ చెయ్యడానికే ఇక్కడికి ఎక్కువ మంది పర్యాటకులు వస్తుంటారు. అంతేకాకుండా పర్యాటకులతో ఇక్కడి ప్రజలు మమేకమయ్యే తీరు అందర్నీ ఆకట్టుకుంటుంది.  ఇండోనేసియా పర్యాటక వీసా కావాలంటే రెండు నెలలకు రూ. 2,400 చెల్లించాల్సి ఉంటుంది.

5. శ్రీలంక (Sri Lanka)

భారతదేశానికి దక్షిణ దిక్కున అతి సమీపంలో ఉన్న శ్రీలంక విభిన్న వృక్షజాతులకు నెలవు. ఇక్కడి బీచ్‌లు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఇక్కడి వెళ్లాలనుకునేవారు ఈ-వీసా కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దీని కోసం రూ.2,475 చెల్లించాల్సి ఉంటుంది.

6. వియత్నాం (Vietnam)

జాతీయ ఉద్యానవనాలు, చారిత్రక ప్రదేశాలు, దేవాలయాలను దర్శించాలనుకునేవారికి ఇది చక్కని ప్రదేశం. ఇక్కడి ఫక్ష, బన్‌చా లాంటి ప్రాంతీయ వంటకాలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. ఉష్ణమండల పర్యాటక ప్రదేశాల్లో వియత్నాం ఒకటి. 30 రోజుల పాటు ఇక్కడ బసచేసేందుకు వీలుగా భారతీయులకు అతితక్కువ ధరకే ఈ వీసాలను మంజూరు చేస్తోంది. అయితే కనిష్ఠంగా 30 రోజులు గరిష్ఠంగా 90 రోజుల పాటు ఇక్కడ బస చేయాల్సి ఉంటుంది. దీని కోసం రూ.7841 చెల్లించాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని