ఈ శతాబ్దపు స్వతంత్ర  దేశాలివీ..! 

భారతదేశానికి బ్రిటీష్‌ వారి నుంచి 1947లో స్వతంత్రం వచ్చింది. మన దేశమే కాదు, 20వ శతాబ్దంలో చాలా దేశాలు తమపై ఇతర దేశాలు చెలాయిస్తున్న ఆధిపత్యాన్ని, దౌర్జన్యాలను అణిచివేసి స్వాతంత్ర్యాన్ని సంపాదించుకున్నాయి. అయితే 21వ శతాబ్దంలో కూడా కొన్ని దేశాలు

Published : 07 Mar 2021 19:10 IST

భారతదేశానికి బ్రిటీష్‌ వారి నుంచి 1947లో స్వాతంత్ర్యం వచ్చింది. మన దేశమే కాదు, 20వ శతాబ్దంలో చాలా దేశాలు తమపై ఇతర దేశాల ఆధిపత్యాన్ని, దౌర్జన్యాలను ఎదురించి స్వేచ్ఛావాయువు పీల్చుకున్నాయి. అయితే 21వ శతాబ్దంలో కూడా కొన్ని దేశాలు స్వాతంత్ర్యం పొందాయి. ప్రస్తుతం అవే ప్రపంచంలో అత్యంత యువ దేశాలుగా నిలుస్తున్నాయి. మరి ఆ దేశాలేవీ? ఎప్పుడు స్వతంత్ర దేశాలుగా మారాయో చూద్దామా..!

ఈస్ట్‌ టైమోర్‌(టైమోర్‌-లెస్టే)

ఈస్ట్‌ టైమోర్‌ను అధికారికంగా ‘ది డెమొక్రాటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ టైమోర్‌-లెస్టే’ అని పిలుస్తారు. ఆసియా ఆగ్నేయ దేశాల్లో ఒకటైన ఈ ఈస్ట్‌ టైమోర్‌ దేశాన్ని 18వ శతాబ్దంలో పోర్చుగీస్‌ దేశస్థులు ఆక్రమించుకొని స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. అక్కడే నగరాలు నిర్మించుకొని దేశాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. 1975లో ఈస్ట్‌ టైమోర్‌పై ఇండోనేషియా కన్నుపడింది. ఇండోనేషియా ఆక్రమణలో ఎన్నో హింసాత్మక ఘటనలు జరిగాయి. ఇండోనేషియా ఆధిపత్యం.. ఈస్ట్‌ టైమోర్‌ దేశస్థుల తిరుగుబాటు వంటి ఘర్షణలతో 1975-1999 మధ్య ఆ దేశంలో దాదాపు 2లక్షల మంది మరణించారని చరిత్రకారులు చెబుతున్నారు. 1998లో అప్పటి ఇండోనేషియా అధ్యక్షుడు సుహర్టో రాజీనామా, ఆర్థిక సంక్షోభం తదితర కారణాలతో ఇండోనేషియా కష్టాల్లో పడింది. 

ఈ నేపథ్యంలో ఈస్ట్‌ టైమోర్‌కు స్వతంత్రం ఇచ్చే ప్రతిపాదనలు వచ్చాయి. ఇండోనేషియా, పోర్చ్‌గీస్‌ దేశాల మధ్య ఉన్న ఒప్పందాలతో ఐక్యరాజ్యసమితి ఈస్ట్‌ టైమోర్‌కు స్వాతంత్ర్యం ఇవ్వడంపై 1999 ఆగస్టులో రెఫరెండం పెట్టింది. ఫలితాలు ఈస్ట్‌ టైమోర్‌కు అనుకూలంగా రావడంతో ఇండోనేషియాకు చెందిన బలగాలు భారీగా విధ్వంసం సృష్టించాయి. వీరిని నియంత్రించడం కోసం ఐక్యరాజ్యసమితి తమ బలగాలను దింపింది. దీంతో ఇండోనేషియా ఈ దేశంపై అధికారాలను వదులుకుంది. ఐక్యరాజ్యసమితే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి దేశంలో పరిపాలన కొనసాగించింది. 2001 ఆగస్టు30న ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఈస్ట్‌ టైమోర్‌లో ఎన్నికలు జరిగాయి. 2002 మార్చి 22న ఆ దేశ ప్రత్యేక రాజ్యాంగానికి ఆమోదం లభించింది. అదే ఏడాది మే 20న రాజ్యాంగం అమలు కావడంతోపాటు.. ఈస్ట్‌ టైమోర్‌ ప్రత్యేక దేశంగా అవతరించింది.


మొంటెనెగ్రో - సెర్బియా

1991లో యూగోస్లేవియా దేశం విచ్ఛిన్నమైన సమయంలో ఆ దేశంలో భాగంగా మారిన సెర్బియా, మొంటెనెగ్రో దేశాలు ఒకటిగా ఉండేవి. 2003 వరకు ఇరు దేశాలను కలిపి ఫెడరల్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ యూగోస్లేవిగానే పిలిచేవారు. 2003లో దాన్ని స్టేట్‌ యూనియన్‌ ఆఫ్‌ సెర్బియా అండ్‌ మొంటెనెగ్రోగా పేరు మార్చారు. అయితే 2006 మేలో ఇరు దేశాలు విడిపోవడానికి రెఫరెండం నిర్వహించారు. విడిపోవాలనే 55.5శాతం ఓట్లు పడ్డాయి. దీంతో జూన్‌ 3న మొంటెనెగ్రో విడిపోయి స్వతంత్ర దేశంగా ఏర్పడింది. మొంటెనెగ్రో స్వతంత్ర దేశంగా ప్రకటించిన రెండ్రోజుల తర్వాత అంటే జూన్‌ 5న సెర్బియా కూడా తమది స్వతంత్ర దేశమని ప్రకటించుకుంది. 


కొసొవో

మొదటి ప్రపంచయుద్ధానికి ముందు కొసొవో.. సెర్బియా ఆధీనంలో ఉండేది. ఆ తర్వాత కొసొవో, మొంటెనెగ్రో దేశాలు యూగోస్లేవియాలో కలిశాయి. ఆ తర్వాత కసొవోలో తిరుగుబాటుదారులు దాడులకు పాల్పడటంతో కొసొవో యుద్ధానికి దారితీసింది. 1999లో జరిగిన ఈ యుద్ధం తర్వాత ఐక్యరాజ్య సమితి కొసొవో పరిపాలన బాధ్యతలు తీసుకుంది. ఈ దేశానికి స్వాతంత్ర్యం ఇచ్చే ప్రక్రియను 2005లో ప్రారంభించారు. అయితే 2008 ఫిబ్రవరి 17న సెర్బియా నుంచి కొసొవో స్వాతంత్ర్యం పొందినట్లు ప్రకటించారు. ఐక్యరాజ్యసమితి కొసొవోను ఒక స్వతంత్ర దేశంగా గుర్తించింది.


సౌత్‌ సుడాన్‌

ఆఫ్రికా ఖండంలోని సుడాన్‌ నుంచి 2011 జులై 9న సౌత్‌ సుడాన్‌ స్వాతంత్ర్యం పొందింది. కొన్ని దశాబ్దాలుగా జరిగిన అంతర్యుద్ధం 2005లో సామరస్య ఒప్పందంతో ముగిసింది. సౌత్‌ సుడాన్‌ స్వతంత్ర దేశంగా మారడంపై రెఫరెండం నిర్వహించారు. అత్యధిక మంది జుబా నగరం రాజధానిగా సౌత్‌ సుడాన్‌ ప్రత్యేక దేశంగా ఉండాలని కోరుకున్నారు. రెఫరెండం ఫలితాలు వచ్చిన ఐదు రోజుల తర్వాత సౌత్‌ సుడాన్‌ ప్రత్యేక స్వతంత్ర దేశంగా ఏర్పాటైంది. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని