BJP: 2022 ఫలితాలతో భాజపాకు మరింత శక్తి..!

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాల్లో వివిధ పార్టీల పరిస్థితిని మరోసారి కళ్లకు కట్టాయి. ఫలితాలను విశ్లేషించుకొని 2024కు సిద్ధం కావాల్సిన పరిస్థితిని తెలియజేస్తున్నాయి. ఈ ఎన్నికలు మొత్తంలో ఒక్క విషయం మాత్రం స్పష్టమైంది.. అదేంటంటే బ్రాండ్‌...

Published : 11 Mar 2022 01:30 IST

బ్రాండ్‌ మోదీ పదిలమన్న సందేశం

ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాల్లో వివిధ పార్టీల పరిస్థితిని మరోసారి కళ్లకు కట్టాయి. ఫలితాలను విశ్లేషించుకొని 2024కు సిద్ధం కావాల్సిన పరిస్థితిని తెలియజేస్తున్నాయి. ఈ ఎన్నికల మొత్తంలో ఒక్క విషయం మాత్రం స్పష్టమైంది.. అదేంటంటే ‘బ్రాండ్‌ మోదీ’ ఇంకా పదిలంగానే ఉందని. సుదీర్ఘ రైతు ఉద్యమాలు.. కరోనా వ్యాప్తి.. ఆర్థిక సంక్షోభాలను తట్టుకొని స్వల్ప నష్టాలతోనే భాజపా బయటపడింది. దీంతో 2024లో మోదీ-షా ద్వయాన్ని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలు చమటోడ్చాల్సి వచ్చే అవకాశం ఉంది.

రాష్ట్రపతి ఎన్నికకు భాజపాకు మార్గం సుగమం..

ఈ ఏడాది జులై 24తో రాష్ట్రపతి పదవీ కాలం ముగియనుంది. దీంతో భాజపా అభ్యర్థిని రాష్ట్రపతి ఎన్నికల్లో గెలిపించేందుకు అవసరమైన ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లు సమకూర్చుకోవడంలో యూపీ కీలక పాత్ర పోషించనుంది. ఇక్కడి ఎమ్మెల్యే ఓటు విలువ దేశంలోనే అత్యధికం. తాజాగా గతంలో కంటే ఇక్కడ మెజార్టీ తగ్గినా.. అధికారంలోకి రావడం భాజపాకు సానుకూలాంశం. దీంతోపాటు ఉత్తరాఖండ్‌, మణిపూర్‌లలో కూడా భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. మరోపక్క గోవాలో కూడా సగం సీట్లను సాధించింది. రాష్ట్రపతి ఎన్నికల్లో  ఏపీ, ఒడిశాలల్లో అధికార పక్షాల నుంచి సహాయ సహకారాలు అందే అవకాశాలున్నాయి. దీనిపై మాజీ లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ పి.శ్రీధరన్‌ పీటీఐతో మాట్లాడుతూ ‘ఈ ఎన్నికల ఫలితాలు ఎన్డీఏ కూటమికి లాభిస్తాయి’ అని పేర్కొన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో అనుకొన్నన్ని కఠిన సవాళ్లు ఎదురుకాకపోవచ్చనే అభిప్రాయలు ఉన్నాయి.

ఉత్తరప్రదేశే కీలకం..

2024 లోక్‌సభ ఎన్నికల్లో అధికారం నిలబెట్టుకోవడానికి  ఉత్తరప్రదేశ్‌ చాల కీలకం. గతంలో ఇక్కడ భాజపా 62 సీట్లు గెలుచుకొంది. తాజా రాష్ట్ర ఎన్నికల్లో ఫలితాల లెక్కన చూస్తే అక్కడ భవిష్యత్తులో ఎస్పీ, భాజపా మధ్యే ప్రధాన పోరు ఉండనుంది. కాంగ్రెస్‌ దాదాపు అదృశ్యమైపోయింది. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కేవలం రెండు సీట్లు వచ్చాయి. గతంలో ఎస్పీకి ఇక్కడ అయిదు ఎంపీ సీట్లు వచ్చాయి. ఈ సారి గణనీయంగా పుంజుకొనే అవకాశం ఉండటంతో 2024 ఎన్నికల్లో హోరాహోరీ పోరు ఉండొచ్చు. ముఖ్యంగా మోదీకి ప్రత్యర్థిగా నిలిచే ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరనే దాని ఆధారంగానే ఇది ఉండే అవకాశం ఉంది.

జాతీయ పార్టీగా ‘ఆప్‌’..

పంజాబ్‌లో విజయంతో ఆప్‌ జాతీయ పార్టీగా అవతరించే అవకాశం ఉంది. దిల్లీ, పంజాబ్‌ వంటి కీలక రాష్ట్రాల్లో అధికారం చేపట్టడంతో ప్రాంతీయ పార్టీల కూటమిలో కీలకంగా మారనుంది. ఇప్పటికే ఆప్‌ను దేశ వ్యాప్తంగా విస్తరిస్తామని ఆ పార్టీ నేత అరవింద్‌ కేజ్రీవాల్‌ వెల్లడించారు. ఈ నేపథ్యంలో గుజరాత్‌, హిమాచల్‌ ఎన్నికల్లో ఈ పార్టీ బరిలోకి దిగే అవకాశాలున్నాయి.

ప్రత్యేక కూటమి వైపు ప్రాంతీయ పార్టీలు?

ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర పరాజయం చవిచూడటంతో.. పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీపై ప్రాంతీయ పార్టీలు ఆధారపడే అవకాశాలు తక్కువ. దేశంలో అత్యధిక లోక్‌సభ స్థానాలున్న రాష్ట్రంలోనే కాంగ్రెస్‌ ప్రభావం ఏ మాత్రం లేకపోవడంతో.. ఆ పార్టీతో కలిసి పనిచేయడం ద్వారా ఒనగూరే ప్రయోజనం స్థానిక పార్టీలకు కనిపించక పోవచ్చు! ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ రహిత తృతీయ కూటమి జీవం పోసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇందులో ఆప్‌, టీఎంసీ, డీఎంకేలు కీలక పాత్ర పోషించవచ్చు. ప్రధాని పదవికి పోటీపడే నేత జాతీయ స్థాయిలో ప్రభావం చూపగలిగేవారై ఉండాలి. కానీ, కాంగ్రెస్‌ నుంచి ఎవరూ లేకపోవడంతో.. ప్రాంతీయ పార్టీల కూటమి అనివార్యమవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని