Tokyo Olympics: ఒలింపిక్స్‌లో పతకాలే కాదు.. మోసాలు కూడా ఉన్నాయి

ఒలింపిక్స్.. ఒక విశ్వక్రీడ. ఇందులో పాల్గొనాలి.. పతకం సాధించి తమ దేశానికి మరింత పేరు తీసుకురావాలని అథ్లెట్లు అందరూ కోరుకుంటారు. కానీ.. విజేత ఒక్కరే ఉంటారు. వారికి మాత్రమే స్వర్ణ పతకం దక్కుతుంది. ఓడిన వారికి రజతం వస్తుంది. ఆ రెండు కుదరకపోతే కనీసం కాంస్య పతకమైన గెలుచుకోవాలని

Updated : 07 Aug 2021 17:32 IST

ఒలింపిక్స్‌లో పాల్గొనాలి.. పతకం సాధించి తమ దేశానికి మరింత పేరు తీసుకురావాలని అథ్లెట్లు అందరూ కోరుకుంటారు. కానీ.. విజేత ఒక్కరే ఉంటారు. వారికి మాత్రమే స్వర్ణ పతకం దక్కుతుంది. ఓడి రెండో స్థానంలో నిలిచిన వారికి రజతం, మూడో స్థానంతో సరిపెట్టుకున్న వారికి కాంస్య లభిస్తుంది. అయితే, ఈ క్రమంలో కొంతమంది అథ్లెట్లు తప్పుడు మార్గాలు ఎంచుకుంటుంటారు. స్టిరాయిడ్లతో బలం పెంచుకొని పోటీలో పాల్గొనే ప్రయత్నం చేస్తారు. అందుకే, క్రీడాకారులకు ముందుగానే డోపింగ్‌ టెస్టులు నిర్వహించి.. అర్హులను మాత్రమే ఎంపిక చేస్తారు. చాలా వరకు క్రీడల్లో మోసం అంటే ఈ స్టిరాయిడ్ల వాడకం మాత్రమే గుర్తొస్తుంది. కానీ.. గతంలో కొన్ని విచిత్రమైన మోసాలు జరిగాయి. అవేంటో తెలుసుకుందామా..!

తొలి ఒలింపిక్స్‌లోనే మోసం

1896లో తొలి ఆధునిక ఒలింపిక్స్‌ను ఎప్పటికీ గుర్తుండిపోయేలా అప్పటి కాలానికి తగినట్టు ఘనంగా నిర్వహించారు. ఈ ఒలింపిక్స్‌లో మారథాన్‌ పోటీలు నిర్వహించగా.. తొలి మూడు స్థానాల్లో గ్రీక్‌కు చెందిన అథ్లెట్లే నిలిచారు. అయితే, మూడోస్థానం దక్కించుకున్న స్పిరిడన్‌ బెలొకాస్‌ అనే అథ్లెట్‌ పోటీలో మోసం చేశాడు. మారథాన్‌లో కొంతదూరం పరుగు తీసి ఆ తర్వాత గుర్రం బండి ఎక్కాడు. లక్ష్యం సమీపంలో ఉండగా దిగి.. మళ్లీ పరిగెత్తాడు. ఇది గమనించిన ఒలింపిక్‌ నిర్వాహకులు అతడిని అనర్హుడిగా ప్రకటించారు.  

మారథాన్‌లో కారెక్కి..

మూడో ఒలింపిక్స్‌ పోటీలు 1904లో మిస్సోరీలోని సెయింట్‌ లూయిస్‌లో జరిగాయి. పోటీలో భాగంగా నిర్వహించిన మారథాన్‌లో అమెరికాకు చెందిన అథ్లెట్‌ ఫ్రెడ్‌ లోర్జ్‌ విజేతగా నిలిచాడు. కానీ, అందులో మోసముంది. పోటీ ప్రారంభం కాగానే ఫ్రెడ్‌ 9మైళ్ల దూరం వరకు పరిగెత్తి ఆ తర్వాత కారులో కొంతదూరం ప్రయాణించాడు. ఫ్రెడ్‌ను విజేతను చేయడం కోసం అతడి కోచ్‌ కారులో వచ్చి 9మైళ్ల వద్ద కారు ఎక్కించుకున్నాడు. అయితే, 19 మైళ్ల వద్ద వారి కారు మొరాయించడంతో ఫ్రెడ్‌ కారు దిగి మిగతా దూరాన్ని పరుగు తీసి పూర్తి చేశాడు. అయితే, పతకం ఇచ్చే సమయంలో ఫ్రెడ్‌ మారథాన్‌ మొత్తం పరుగులు తీయలేదని, మధ్యలో కారు ఎక్కాడని కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో ఫ్రెడ్‌ను అనర్హుడిగా ప్రకటించి రెండోస్థానంలో నిలిచిన మరో అమెరికన్‌ అథ్లెట్‌ థామస్‌ హిక్స్‌కు స్వర్ణ పతకం బహుకరించారు. విచిత్రమేమిటంటే.. హిక్స్‌ కూడా మారథాన్‌ మధ్యలో స్టిరాయిడ్స్‌ ఉపయోగించాడు. అయినా.. అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

ఫెన్సింగ్‌ కత్తిలో మార్పులు చేసి

సోవియేట్‌(రష్యా)కు చెందిన బోరీస్‌ ఒనిషెంకో.. అప్పట్లో అత్యుత్తమ పెంటాథ్లెట్‌. అనేక పెంటాథ్లాన్‌(ఫెన్సింగ్‌, ఫ్రీస్టైల్‌ స్విమ్మింగ్‌, జంపింగ్‌, పిస్టల్‌ షూటింగ్‌, 3,200మీటర్ల క్రాస్‌ కంట్రీ రన్నింగ్‌) పోటీల్లో పాల్గొని ఛాంపియన్‌గా నిలిచాడు. 1972 ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అయితే, 1976లో జరిగిన ఒలింపిక్స్‌లో అతడు చేసిన పనికి సోవియేట్‌ పరువు పోయింది. ఫెన్సింగ్‌ పోటీలో గెలవడం కోసం ప్రత్యర్థిని తాకకముందే పాయింట్లు వచ్చేలా అతడి కత్తిలో కొన్ని మార్పులు చేశాడు. అయితే, ఈ విషయాన్ని బ్రిటన్‌ బట్టబయలు చేసింది. దీంతో అతడిపై అనర్హత వేటు పడింది. పత్రికలు అతడిని ‘బోరీస్‌ ది చీట్‌’ అని శీర్షికలు పెట్టి కథనాలు రాశాయి. దీంతో బోరీస్‌ మళ్లీ క్రీడల్లో పాల్గొనకుండా సోవియేట్‌ జీవితకాలం నిషేధం విధించింది. గతంలో పొందిన పతకాలు, అవార్డులను అధికారులు వెనక్కి తీసుకున్నారు.

కవల సోదరీమణుల కనికట్టు!

ఒకేలా కనిపించే కవల పిల్లలు ఒకరి స్థానంలోకి మరొకరు వెళ్లడం వంటివి సినిమాల్లో చూశాం. కానీ, 1984 ఒలింపిక్స్‌లో నిజంగానే అలాంటి ఘటన జరిగింది. లాస్‌ ఏంజెల్స్‌లో జరిగిన ఒలింపిక్స్  స్విమ్మింగ్‌ పోటీల్లో పాల్గొంటూ ప్యుర్టోరికాకు చెందిన స్విమ్మర్‌ మెడిలైన్‌ లాంగ్‌ జంప్‌ సమయంలో గాయపడింది. అయితే, తదుపరి జరిగే 4X400 పోటీకి తను వెళ్లలేక అచ్చుగుద్దినట్లు తనలాగే ఉండే తన కవల సోదరి మార్గారెట్‌ను పంపించింది. అయితే, ఆ దేశ ఒలింపిక్స్‌ టీమ్‌ చీఫ్‌ కోచ్‌ వీరి మోసాన్ని గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశాడు. తమ దేశానికి చెందిన మొత్తం జట్టును ఒలింపిక్స్‌ నుంచి వెనక్కి తీసుకొచ్చాడు.

రెఫరీ కూడా మోసం చేశాడు!

పోటీల్లో క్రీడాకారులు ఎంత న్యాయంగా ఆడినా.. కొన్ని సార్లు ఇతరుల వల్ల మోసాలు జరుగుతుంటాయి. అలా 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో బాక్సింగ్‌ పోటీలో ఓ బాక్సర్‌ను విజేతను చేయడానికి రిఫరీ తన వంతు సాయం చేశాడు. జపాన్‌కు చెందిన సతోషి షిమిజు, అజర్‌ బైజాన్‌కు చెందిన మగొమెద్‌ మధ్య బాక్సింగ్‌ పోటీ నిర్వహించారు. ఈ క్రమంలో మగొమెద్‌పై సతోషి పిడిగుద్దులు కురిపించాడు.. ఆరుసార్లు కింద పడేశాడు. అయితే, వీటిని రిఫరీ పరిగణనలోకి తీసుకోకుండా.. పాయింట్లు పెరగకుండా జాగ్రత్తపడ్డాడు. పైగా కింద పడ్డ మగొమెద్ పైకి లేవడానికి, తన హెడ్‌గేర్‌ సర్దుకోవడానికి సమయం ఇచ్చాడు. ఆట చూసిన ప్రతి ఒక్కరూ సతోషి గెలుస్తాడని భావించారు. కానీ, అనూహ్యంగా రిఫరీ మగొమెద్‌ను విజేతగా ప్రకటిస్తూ అతడి చేయిని పైకి లేపాడు. అయితే, రిఫరీ తీరుపై జపాన్‌ ఫిర్యాదు చేయడంతో ఫలితాలను మార్చారు.

ఇంటర్నెట్‌ డెస్క్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని