Olive ridley : ఆలివ్‌ రిడ్లీల ‘అమ్మ ఒడి’శా!

ఒడిశాలోని (Odisha) గంజాం జిల్లాలో రుషికుల్యా సముద్ర తీరంలో (Sea coast) తాజాగా ఆలివ్‌ రిడ్లీ (Olive ridley) తాబేళ్ల పిల్లలను సముద్రంలోకి వదిలారు. ఏటా నవంబరు, డిసెంబరు మాసాల్లో ఆలివ్‌ రిడ్లీ తాబేళ్లు ఈ తీరానికి వస్తాయి. ఇక్కడ గుడ్లు పెడతాయి. ఆ గుడ్లే ఇప్పుడు పిల్లలై కడలి బాట పట్టాయి.

Published : 19 Apr 2023 12:37 IST

అరుదైన ఆలివ్‌ రిడ్లీ (సముద్ర తాబేళ్ల)లకు (Olive ridley) అమ్మ ఒడిలా ఆత్మీయత పంచుతోంది ఒడిశా (Odisha) రాష్ట్రం. ప్రపంచ నలుమూలల నుంచి ఏటా వేలాది ఆలివ్‌ రిడ్లీ తాబేళ్లు ఇక్కడకు వస్తున్నాయి. తీరంలో గుడ్లు (Eggs) పెట్టి తిరిగి సముద్రంలోకి పయనమవుతున్నాయి. ఒడిశా అటవీ అధికారులు అవి వదిలి వెళ్లిన గుడ్లను అపురూపంగా సంరక్షిస్తున్నారు. అవి పిల్లలుగా మారిన తరువాత సముద్రంలోకి వదులుతున్నారు. ఆలివ్‌ రిడ్లీల పునరుత్పత్తికి ప్రపంచంలోనే అతి పెద్ద కేంద్రాలు ఒడిశాలో ఉన్నాయి. ఆ రాష్ట్రంలోని గహీర్‌మఠ (కేంద్రపడ జిల్లా), రుషికుల్యా ముఖద్వారం (గంజాం జిల్లా), దేవీ ముఖద్వారం (పూరీ జిల్లా) తాబేళ్ల పునరుత్పత్తికి ప్రధాన కేంద్రాలు. 

రక్షణ చర్యలు భేష్‌

వేల కి.మీ. దూరం ప్రయాణించి పునరుత్పత్తి కోసం తాబేళ్లు ఒడిశా తీరాలకు వస్తుంటాయి. ఏటా నవంబరు నుంచి మే వరకూ వీటి పునరుత్పత్తి ప్రక్రియ జరుగుతుందని స్థానిక అటవీ అధికారులు చెబుతున్నారు. తాబేళ్ల పునరుత్పత్తి ప్రక్రియ సజావుగా జరిగేందుకు భద్రతా శిబిరాలు, తీరాన ఇనుప జాలీలతో రక్షణ ఏర్పాటు చేస్తున్నారు. ఆలివ్‌ రిడ్లీలు గుడ్లు పెట్టే తీరాన్ని శుభ్రపరుస్తున్నారు. ఒక్కో శిబిరంలో ముగ్గురు చొప్పున సిబ్బందిని నియమించి గస్తీ నిర్వహిస్తున్నారు. ఇసుక లోపల ఉన్న వీటి గుడ్లను వీధి కుక్కలు, నక్కలు తినేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గుడ్లు పొదిగి పిల్లలుగా మారిన తరువాత ఆలివ్‌ రిడ్లేలు సముద్రంలో ఎంతదూరం వెళుతున్నాయి? మళ్లీ ఎప్పుడు తీరానికి వస్తున్నాయి? అనేది తెలుసుకునేందుకు వాటిలో కొన్నింటికి జియో ట్యాగ్‌లు అమర్చుతున్నారు. పరిశోధనలకు ఆ చర్య ఉపయుక్తం కానుంది. 

ఏమిటీ ఆలివ్‌ రిడ్లీలు?

సముద్ర తాబేళ్లలో ఎక్కువగా కన్పించేవి ఆలివ్‌ రిడ్లీ. ఇవి చూడటానికి ఆలివ్‌ గ్రీన్‌ కలర్‌లో ఉంటాయి. అందుకే వీటికి ఈ పేరు వచ్చింది. పుట్టిన వెంటనే ఇవి బూడిద రంగులో ఉన్నప్పటికీ యుక్త వయసు వచ్చేసరికి పూర్తిగా ఆలివ్‌ వర్ణంలోకి మారిపోతాయి. వీటిపై రక్షణ పొర హృదయాకారంలో ఉంటుంది. పశ్చిమ అట్లాంటిక్‌ తీరంలో నివసించే ఆలివ్‌ రిడ్లీలు తూర్పు పసిఫిక్‌ ఆలివ్‌ రిడ్లీల కంటే ముదురు రంగులో ఉంటాయి. యుక్త వయసు వచ్చినా వీటి పరిమాణం 2 నుంచి 2.5 అడుగులు మాత్రమే పెరుగుతుంది. ఒక్కొక్కటి 36 నుంచి 49 కిలోల బరువుంటాయి. వీటిలో అతిపెద్దగా కన్పించే జాతి మెక్సికోలోని పసిఫిక్ తీరంలో ఉంది.

ఏయే ప్రాంతాల్లో ఉన్నాయి?

ఆలివ్ రిడ్లీలు సాధారణంగా ఉష్ణమండల ప్రాంతాల్లో జీవించేందుకు ఇష్టపడతాయి. పసిఫిక్‌, అంట్లాంటిక్‌, హిందూ మహాసముద్ర తీరాల్లో ఇవి ఎక్కువగా సంచరిస్తుంటాయి. ఇక మన దేశం చుట్టూ ఉన్న హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం తీరాల్లో ఆలివ్‌ రిడ్లీల సంతతి అత్యధికంగా ఉంటుంది. శ్రీలంకలోనూ ఇవి కన్పిస్తాయి. మిగతా ప్రాంతాలతో పోలిస్తే పశ్చిమ అట్లాంటిక్‌ మహాసముద్రంలో వీటి సంతతి గణనీయంగా క్షీణిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఏం తింటాయి?

ఆలివ్‌ రిడ్లీలు సర్వభక్షకాలు. అంటే ఇవి మొక్కలను తింటాయి.. అలాగే జంతువులను కూడా భుజిస్తాయి. ఎక్కువగా తీరంలో దొరికే ఆల్గే, ఎండ్రకాయలు, పీతలు, రొయ్యలు, చేపలు వంటి వాటిని ఆహారంగా తీసుకుంటాయి. కొన్నిసార్లు ఆలివ్‌ రిడ్లీలు తమ ఆహార వేటలో భాగంగా సముద్రంలో 500 అడుగుల లోతుకు కూడా వెళ్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక ఈ ఆలివ్‌ రిడ్లీలు తమ జీవితాంతం ఎలా ప్రవర్తిస్తాయనే విషయంపై ఇంకా అధ్యయనాలు జరుగుతున్నాయి. అయితే, చల్లని నీటి నుంచి తప్పించుకోవడానికి ఇవి సమూహంగా ఏర్పడతాయి. ఎండలో అలా గుంపులుగా నిల్చొని పరస్పరం తోసుకుంటూ కన్పిస్తాయి.

ఉష్ణోగ్రత ఆధారంగా లింగం

ఈ సముద్ర తాబేళ్లు తీరంలో ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతాయి. ఇవి ఏడాది కాలంలో కొన్ని వందల, వేల మైళ్లు సునాయాసంగా ప్రయాణిస్తాయి. అలా వచ్చినవన్నీ ఒక చోట గూడు కట్టుకునే ప్రాంతాన్ని ‘అర్రిబడాస్‌’ అని అంటారు. ఇక్కడే ఆడ తాబేళ్లు సంవత్సరంలో మూడు సార్లు.. వందల సంఖ్యలో గుడ్లు పెడతాయి. వాటిని పొదగడానికి రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుంది. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే బయటి ఉష్ణోగ్రత ఆధారంగా గుడ్డులోని తాబేలు ఆడ లేదా మగా అనేది నిర్ణయమవుతుంది. ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్‌ కన్నా ఎక్కువుంటే.. అధికంగా ఆడ తాబేళ్లు జన్మిస్తాయి. ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్‌ లోపు ఉంటే మగ, ఆడ రెండూ జన్మించే అవకాశం ఉంటుంది.

అంతరించిపోతున్నాయట!

అనేక కారణాల వల్ల ఆలివ్‌ రిడ్లీ జాతి తాబేళ్లు అంతరించిపోతున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సముద్ర కాలుష్యం, చేపల వేట వలలకు చిక్కడం, వీటి గుడ్లను అపహరించడం, పడవలు గుడ్లపై ఎక్కడం, మాంసం కోసం తాబేళ్లను వధించడం వంటి చర్యల కారణంగా వీటి సంఖ్య పడిపోతోంది. అందుకే వీటిని రక్షించడం కోసం కొన్ని దేశాల్లో ప్రత్యేకంగా చట్టాలు చేశారు. భారత వన్యప్రాణుల సంరక్షణ చట్టం-1972 ప్రకారం ఆలివ్‌రిడ్లీ తాబేళ్లు అరుదైన జీవజాతుల జాబితాలో ఉన్నాయి. వీటిని పెంచుకోవడం, వేటాడటం, అక్రమంగా తరలించడం, వ్యాపారాలు నిర్వహించడం చట్ట ప్రకారం నిషేధం. వీటిని సంరక్షించే బాధ్యతలను ప్రభుత్వాలు తీసుకున్నాయి. ఇందులో భాగంగా ఒడిశా రాష్ట్ర అటవీశాఖ కూడా చర్యలు చేపడుతోంది.

-ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని