Dangerous volcanos : చరిత్రలో భయంకర అగ్ని పర్వతాలు.. వణుకు పుట్టించాయి!

ప్రపంచంలోని అనేక దేశాల్లో అగ్నిపర్వతాలున్నాయి. అవి ఎప్పుడు విస్ఫోటం చెంది భారీ విధ్వంసానికి కారణమయ్యాయో పరిశీలించండి.

Published : 12 Mar 2023 15:56 IST

ఇండోనేసియా(Indonesia)లోని మౌంట్‌ మెరాపి శనివారం విస్ఫోటం చెందింది. దాంతో వేడి వాయువులు, లావా, బూడిద వెలువడుతున్నాయి. ఫలితంగా సమీప పరిసర ప్రాంతాలు సూర్యకాంతికి కూడా నోచుకోలేదు. చరిత్రలో కొన్ని భయంకరమైన అగ్నిపర్వత విస్ఫోటనాలు సంభవించాయి. వాటి కారణంగా అనేక చోట్ల భారీ బిలాలు, సరస్సులు, కొత్త ప్రదేశాలు ఏర్పడ్డాయి. అవేంటో తెలుసుకోండి. 

ఎల్లో స్టోన్-మోంటానా/వ్యోమింగ్/ఇదాహో(6.40లక్షల ఏళ్ల క్రితం)

ప్రపంచంలో విస్ఫోటనం చెందిన ప్రతి అగ్నిపర్వతం గురించి నమోదు చేయడం వీలుకాదు. అలా కొన్ని లక్షల ఏళ్ల క్రితం ఎల్లో స్టోన్ బద్దలైంది. అమెరికా(America)లోని ప్రస్తుత ఎల్లో స్టోన్‌ నేషనల్ పార్క్‌ ఆ పేలుడుకు సాక్ష్యంగా నిలిచింది. అక్కడి భూమిలోపల ఇప్పటికీ చురుగ్గా కదులుతున్న అగ్నిపర్వతం ఉండటంతో అనేక పరిశోధనల్లో ఇది చోటు సంపాదించింది. 

అగ్నిపర్వత పేలుడు సూచికలో తీవ్రత : 8

ఆంబ్రిమ్‌ ఐలాండ్-రిపబ్లిక్‌ ఆఫ్‌ వనౌటు(క్రీస్తు శకం 50)

ఇది పసిఫిక్‌ మహా సముద్రం నైరుతి భాగంలో ఉంటుంది. చిన్న చిన్న దీవులతో ఈ ప్రాంతం నిండిపోయింది. మౌంట్ వెసువియస్‌ విస్ఫోటం చెందిన సమయంలోనే ఇది కూడా జరిగిందని శాస్త్రవేత్తల విశ్లేషణ. ఆంబ్రిమ్‌ ఐలాండ్ అగ్నిపర్వత విస్ఫోటనంతో 7.5 మైళ్ల వెడల్పుతో బిలం ఏర్పడింది. బూడిద, ఇతర వ్యర్థాలు వేల మైళ్ల దూరం వ్యాపించాయి. 1894లో మళ్లీ జరిగిన విస్ఫోటంతో ఆరుగురు మరణించారు. 1979లో యాసిడ్‌ వర్షం కురిసింది. దాంతో స్థానికులు గాయపడ్డారు.  

తీవ్రత : 6+

మౌంట్ వెసువియస్‌-ఇటలీ(క్రీస్తు శకం 79)

ఈ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడంతో పాంపీ, హెర్కులేనియం నగరాలు బూడిద, బురదలో కూరుకుపోయాయి. ఆ విధ్వంసం జరిగే సమయంలో ఏం చేయాలో పాలుపోక జనాలు చూస్తూ ఉండిపోయారు. ఈ ఘటనలో దాదాపు 16వేల మంది మరణించి ఉంటారని ఒక అంచనా.

తీవ్రత : 5

మౌంట్‌ ఇల్లోపాంగో-ఈఎల్ సాల్వెడార్‌(క్రీస్తుశకం 450)

ఈ విస్ఫోటనం కారణంగా కొన్ని నగరాలు తుడిచిపెట్టుకుపోయాయి. అనేక మంది వలస వెళ్లారు. ఈ భారీ పేలుడు కారణంగానే లేక్ ఇల్లోపాంగో ఏర్పడింది. 

తీవ్రత : 6+

బైటౌషన్‌ అగ్నిపర్వతం-చైనా(క్రీస్తు శకం 1000)

ఈ అగ్నిపర్వతాన్ని చాంగ్‌బైషన్‌గా పిలుస్తుంటారు. ఇక్కడ వెలువడిన బూడిద, ఇతర వ్యర్థాలు జపాన్‌ వరకు వెళ్లాయి. మూడు మైళ్ల మేర బిలం ఏర్పడింది. అది అర మైలు లోతుగా ఉంది. నేడు ఆ బిలం టియాంచి లేక్‌గా ప్రసిద్ధి చెందింది. అనేక మంది పర్యాటకులు దీన్ని చూడటానికి వెళ్తుంటారు. 

తీవ్రత : 7+

హుయానాపుటినా-పెరూ(1600 సంవత్సరం)

దక్షిణ పెరూలోని ఈ ఎత్తయిన పీఠభూమి వద్ద భయంకరమైన విస్ఫోటం సంభవించింది. దాని ప్రభావంతో పర్యావరణంలో కూడా మార్పులు చోటు చేసుకున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఆ నష్టం నుంచి కోలుకోవడానికి ఒక శతాబ్దం పట్టిందంటారు.

తీవ్రత : 6

లకి-ఐలాండ్‌(1783)

ఈ అగ్నిపర్వతం రగులుతున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లకాగిర్‌లో చీలిక రావడంతో భయానక విష వాయువులు వెలువడ్డాయి. అది ఎనిమిది నెలలు నిరాటంకంగా కొనసాగింది. దాంతో దాదాపు 9వేల మంది చనిపోయారు. జంతువులు కూడా చనిపోయాయి. ఈ ఘటన తరువాతే ఫ్రెంచ్‌ విప్లపం జరిగిందని చరిత్రకారులు చెబుతున్నారు. 

తీవ్రత : 6

మౌంట్ తంబోరా-ఇండోనేసియా(1815)

మౌంట్‌ తంబోరా ఇప్పటికీ క్రియాశీలకంగా ఉంది. ఈ అగ్నిపర్వత పేలుడు దాదాపు 1200 మైళ్ల దూరం వినిపించిందని చెబుతుంటారు. ఈ అగ్నిపర్వతం కారణంగా  92 వేల మందికి పైగా మరణించారు. 

తీవ్రత : 7

క్రాకటోవా-ఇండోనేసియా(1883)

ఈ అగ్నిపర్వత విస్ఫోటం ధాటికి ఒక ద్వీపం పూర్తిగా ధ్వంసమైంది. సునామీ వచ్చింది. 150 అడుగుల ఎత్తులో అలలు ఎగసిపడ్డాయి. బలమైన తుపాను గాలులు వీచాయి. దాంతో దాదాపు 34వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

తీవ్రత : 6

శాంటా మారియా అగ్నిపర్వతం-గ్వాటెమాల(1902)

20వ శతాబ్దం ప్రారంభంలో జరిగిన విస్ఫోటం ఇది. శాంటా మారియా అగ్నిపర్వతం దక్షిణ భాగం వైపు బద్దలైంది. ఈ విపత్తు కారణంగా సుమారు కిలోమీటరున్నర బిలం ఏర్పడింది. ఈ అగ్నిపర్వతం పలుమార్లు విస్ఫోటం చెందిన కారణంగా ఇప్పటి వరకు దాదాపు 5వేల మంది మరణించారు. 

తీవ్రత : 6

నోవారుప్టా-అలస్కా(1912)

అలస్కా రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌లో ఈ భారీ పేలుడు సంభవించింది. దీని కారణంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో అడుగు మందం మేర బూడిద పేరుకుపోయింది. 

తీవ్రత : 6

మౌంట్‌ పినాటుబో-ఫిలిప్పీన్స్‌(1991)

రాజధాని మనీలా నగరానికి 50 మైళ్ల దూరంలో ఈ అగ్నిపర్వతం ఉంటుంది. దీని నుంచి మిలియన్‌ టన్నుల సల్ఫర్‌ డై ఆక్సైడ్‌ గాల్లో కలిసింది. 350 మంది చనిపోయారు. ఆ మరుసటి ఏడాది ఉష్ణోగ్రత తగ్గినట్లు వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు.

తీవ్రత : 6

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు