తొలి వ్యాక్సిన్‌కు తొలి ప్రచారకర్త మన మైసూరు మహారాణే!

కొత్తగా ఏ వ్యాధి ప్రబలినా.. దాన్ని నివారించేందుకు వైద్యశాస్త్రవేత్తలు ముందుగా వ్యాక్సిన్‌ను కనిపెడుతుంటారు. ఇప్పుడు న్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్‌ను ఎదుర్కొవడానికి కూడా శాస్త్రవేత్తలు వ్యాక్సిన్‌ కనిపెట్టారు. దీంతో అన్ని దేశాలు వ్యాక్సినేషన్‌ ప్రక్రియను చేపట్టాయి. అయితే, ఈ వ్యాక్సిన్‌పై ప్రతి

Updated : 15 Aug 2021 18:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొత్తగా ఏ వ్యాధి ప్రబలినా.. దాన్ని నివారించేందుకు వైద్యశాస్త్రవేత్తలు ముందుగా వ్యాక్సిన్‌ను కనిపెడుతుంటారు. ఇప్పుడు ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్‌ను ఎదుర్కొవడానికి కూడా శాస్త్రవేత్తలు వ్యాక్సిన్‌ కనిపెట్టారు. దీంతో అన్ని దేశాలు వ్యాక్సినేషన్‌ ప్రక్రియను చేపట్టాయి. అయితే, ఈ వ్యాక్సిన్‌పై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగేలా.. వ్యాక్సిన్‌ వేయించుకునేలా విస్తృత ప్రచారం అవసరం. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వాలతోపాటు ప్రజాదారణ ఎక్కువగా ఉండే సినీతారలు సైతం ప్రచారకర్తలుగా మారి వ్యాక్సిన్‌ వేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. మరి ప్రపంచంలోనే తొలి వ్యాక్సిన్‌కు తొలిసారి ప్రచారకర్తగా వ్యవహరించింది ఎవరో తెలుసా?మైసూరు మహారాణి దేవజమ్మని. ఈ విషయాన్ని కేంబ్రిడ్జి యూనివర్సిటీకి చెందిన చరిత్రకారుడు నైజెల్‌ ఛాన్సలర్‌ వెల్లడించారు.

మశూచి(స్మాల్‌పాక్స్‌).. ఇదో అంటువ్యాధి. 3వేల సంవత్సరాల క్రితం నుంచి ఈ వ్యాధి ఉందని వైద్యనిపుణులు చెబుతున్నారు. అయితే, దీనికి వ్యాక్సిన్ కనిపెట్టింది మాత్రం 1796వ సంవత్సరంలోనే. బ్రిటన్‌కు చెందిన డాక్టర్‌ ఎడ్వర్డ్‌ జెన్నర్‌ మశూచికి వ్యాక్సిన్‌ కనిపెట్టారు. ఒక వ్యాధికి అడ్డుకట్ట వేయడానికి తయారు చేసిన తొలి వ్యాక్సిన్ ఇదే‌. దీని వల్లే మశూచి మరణాలు గణనీయంగా తగ్గాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడంతో 1980నాటికి మశూచి అంతమైనట్లు అప్పటి వరల్డ్‌ హెల్త్‌ అసెంబ్లీ ప్రకటించింది.

19వ శతాబ్దం ప్రారంభంలో భారతదేశంలో మశూచి వ్యాధి తీవ్రత అప్పుడప్పుడే పెరుగుతోంది. అంటువ్యాధి కావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అప్పటికే భారత్‌పై బ్రిటీష్‌ ఆధిపత్యం కొనసాగుతోంది. కాగా.. భారత ప్రజలను మశూచి నుంచి కాపాడేందుకు బ్రిటీష్‌ అధికారులు ఎడ్వర్డ్‌ జెన్నర్‌ కనిపెట్టిన మశూచి వ్యాక్సిన్‌ను 1802లో దిగుమతి చేశారు. అయితే, అది బ్రిటన్‌కు చెందిన వ్యక్తి కనిపెట్టిన వ్యాక్సిన్‌ కావడంతో దాని వల్ల హాని జరిగే అవకాశముందని భారతీయులు అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్‌ వేసుకోవడానికి విముఖత చూపారు. 

అయినా, బ్రిటీష్‌ పాలకులు భారత్‌లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను కొనసాగించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. భారతీయ వైద్యులు, వ్యాపారవేత్తలు, రాజవంశీయులను వ్యాక్సినేషన్‌లో సహకరించాలని కోరారు. అదే సమయంలో అంటే 1805లో మైసూర్‌ మహారాజు కృష్ణరాజ వడియార్‌ IIIని వివాహం చేసుకునేందుకు మహారాణి దేవజమ్మని మైసూరుకు వచ్చారు. అప్పుడు వారిద్దరి వయసు 12 ఏళ్లేనట. కృష్ణరాజ వడియార్‌ III తండ్రి చామరాజ వడియార్‌ IX 1796లో మశూచితోనే మరణించడం, టిప్పు సుల్తాన్‌ను ఓడించి, తిరిగి మైసూరు సామ్రాజ్యాన్ని స్థాపించడంలో బ్రిటీష్‌ అధికారులు సహకారం అందించడంతో మైసూరు రాజవంశీయులు బ్రిటీష్‌ వారి మశూచి వ్యాక్సిన్‌ను ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే దేవజమ్మని వ్యాక్సిన్‌కు ప్రచారకర్తగా మారి ప్రజలకు అవగాహన కల్పించారట. 


(Photo: sothebys.com)

వ్యాక్సినేషన్‌ ప్రచారంలో భాగంగా ఈస్ట్‌ ఇండియా కంపెనీ ఓ పెయింటింగ్‌ను రూపొందించింది. ఆ పెయింటింగ్‌లో ముగ్గురు మహిళలు నిలబడి ఉన్నారు. దీన్ని థామస్‌ హికీ అనే చిత్రకారుడు గీశాడు. మైసూర్‌ రాజవంశీయుల చిత్రాలు గీసే చిత్రకారుడిగా అతనికి పేరుంది. అయితే, 2007లో ఆ ముగ్గురు మహిళలు ఉన్న చిత్రపటం వేలంలో అమ్ముడుపోయింది. మొదట్లో ఆ చిత్రాన్ని చూసి చాలా మంది నర్తకీమణులు అయి ఉంటారని భావించారట. కానీ, చిత్రం వెనుకన్న అసలు కథను నైజెల్‌ ఛాన్సలర్‌ బయటపెట్టారు. ఆ చిత్రంలో మహిళల వేషధారణ, చిత్రం గీసిన తేదీ, ఆ సమయంలో జరిగిన ఘటనలను అంచనా వేశారు. తెల్లచీర కట్టుకున్న మహిళ దేవజమ్మని అని, ఆమె మశూచి వ్యాక్సిన్‌ తీసుకున్నట్లు తెలిసేలా ఎడమ చేతిని చూపిస్తున్నట్లుగా చిత్రకారుడు చిత్తరువును గీసినట్లు వెల్లడించారు. ఆమె కల్పించిన విస్తృత ప్రచారం వల్ల మైసూర్ సామ్రాజ్యంలో ప్రజలు వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు ముందుకు వచ్చినట్లు ఛాన్సలర్‌ పేర్కొన్నారు. అలా వ్యాక్సిన్‌కు తొలి ప్రచారకర్తగా దేవజమ్మని నిలిచారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని