వీరంతా.. ప్రేమ కోసం రాచరికాన్ని వదులుకున్నారు!

ప్రిన్స్‌ హ్యారీ.. బ్రిటీష్‌ రాజ్యంలో జన్మించిన రాజకుమారుడతడు. ఆయన వివాహం చేసుకోవాలనకుంటే ప్రపంచంలోని ఎన్నో రాజకుటుంబాలు, సంపన్న కుటుంబాలు సంబంధం కలుపుకోవడానికి సిద్ధంగా ఉండేవి. కానీ, ఆయన అమెరికన్‌ మోడల్‌, నటి మేఘన్‌ మార్కెల్‌ను ఇష్టపడి 2018లో వివాహం చేసుకున్నారు. ఎన్నో ఆశలతో

Updated : 11 Mar 2021 12:04 IST

ప్రిన్స్‌ హ్యారీ.. బ్రిటిష్‌ రాజవంశంలో జన్మించిన రాజకుమారుడతడు. ఆయన వివాహం చేసుకోవాలనుకుంటే ప్రపంచంలోని ఎన్నో రాజకుటుంబాలు, సంపన్న కుటుంబాలు సంబంధం కలుపుకోవడానికి సిద్ధంగా ఉండేవి. కానీ, ఆయన అమెరికన్‌ మోడల్‌, నటి మేఘన్‌ మార్కెల్‌ను ఇష్టపడి 2018లో వివాహం చేసుకున్నారు. ఎన్నో ఆశలతో రాజకుటుంబంలో అడుగుపెట్టిన మేఘన్‌కు నిరాశే ఎదురైంది. రాజభోగాలు అనుభవిస్తున్నా.. అంతఃపుర ఆంక్షలు, నిబంధనల మధ్య ఇమడలేకపోయింది. దాదాపు అలాంటి అనుభవాలే ప్రిన్స్‌ హ్యారీకి ఎదురుయ్యాయి. దీంతో గతేడాది రాజ్యాన్ని.. రాచరికాన్ని వదిలేసి.. సామాన్య వ్యక్తుల్లా అమెరికాలో స్థిరపడ్డారు. తాజాగా ఓ టీవీషోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రిన్స్‌ హ్యారీ మాట్లాడుతూ.. తను ప్రేమించే భార్య, బిడ్డల భవిష్యత్తు కోసం బయటకు వచ్చానని చెప్పాడు. ఆయన ఒక్కడే కాదు.. తమ ప్రేమను బతికించుకోవడం కోసం భోగభాగ్యాలను తృణప్రాయంగా వదిలేసిన కొందరు రాకుమారులు/రాకుమార్తెలు ఉన్నారు. వాళ్లలో హ్యారీ కుటుంబీకులూ ఉండటం విశేషం. మరి వారెవరో చూద్దామా..!

కింగ్‌ ఎడ్వర్డ్‌ VIII

యునైటెడ్‌ కింగ్‌డమ్‌ చక్రవర్తి కింగ్‌ జార్జ్‌ V, క్వీన్‌ మేరీకి 1894 జూన్‌లో 23న కింగ్‌ ఎడ్వర్డ్‌ VIII జన్మించాడు. పెద్దకుమారుడైన ఎడ్వర్డ్‌ వారసత్వంగా 1936 జనవరి 20న బ్రిటీష్‌ రాజ్యానికి చక్రవర్తిగా సింహాసనం అధిష్ఠించాడు. అదే సమయంలో ఎడ్వర్డ్‌ అమెరికా పౌరురాలైన వాలీస్‌ సిమ్సన్‌తో ప్రేమలో పడ్డాడు. ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకొని అదే విషయాన్ని తల్లిదండ్రులకు వెల్లడించాడు. అయితే, ఎడ్వర్డ్‌ ప్రతిపాదనకు రాజకుటుంబంతోపాటు అనేక వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే వాలీస్‌ సిమ్సన్‌కు అప్పటికే రెండు సార్లు వివాహమై.. విడాకులు తీసుకుంది. అలాంటి విడాకులు తీసుకున్న మహిళను వివాహం చేసుకోవడానికి పెద్దలు అనుమతించలేదు. ఆమెను వదిలేయాలని రాజకుటుంబీకులు కోరగా.. వదిలేసే ప్రసక్తే లేదని, ఆమెనే వివాహం చేసుకుంటానని పట్టుబట్టారు. ఒకవేళ, సిమ్సన్‌ను వివాహం చేసుకుంటే సింహాసనంపై కూర్చునే అర్హత ఉండదని రాజకుటుంబం స్పష్టం చేసింది. దీంతో ఎడ్వర్డ్‌.. మహారాజు స్థానాన్ని వదులుకోవడానికి సిద్ధపడ్డాడు. చక్రవర్తి అయి ఏడాది కూడా కాకముందే 1936 డిసెంబర్‌లో రాజభోగాలు, డ్యూక్‌ ఆఫ్‌ విండ్సర్‌ టైటిల్‌ను వదిలేశాడు. సాధారణ వ్యక్తిగా మారి సిమ్సన్‌ను వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత ఎడ్వర్డ్‌ సోదరుడు జార్జ్‌ VI బ్రిటన్‌కు రాజయ్యాడు. ఆయన కుమార్తె ప్రస్తుత బ్రిటన్‌ క్వీన్‌ ఎలిజబెత్‌-II.


ప్రిన్స్‌ ఫిలిప్‌

ప్రస్తుత బ్రిటన్‌ క్వీన్‌ ఎలిజబెత్‌ II భర్త.. ప్రిన్స్‌ హ్యారీ తాత అయిన ప్రిన్స్‌ ఫిలిప్‌ కూడా ఎలిజబెత్‌ను వివాహం చేసుకోవడం కోసం తన రాజ్యాన్ని వదిలేసుకున్నాడు. ఫిలిప్‌ గ్రీస్‌.. డెన్మార్క్‌ చక్రవర్తి ప్రిన్స్‌ ఆండ్రూ.. ప్రిన్సెస్‌ అలీస్‌కు జన్మించాడు. ఫ్రాన్స్‌, జర్మనీ, యూకే దేశాల్లో చదువుకున్న ఫిలిప్‌ 1939లో రాయల్‌ నేవీలో చేరాడు. అతడి పనితీరును మెచ్చిన జార్జ్‌ VI తన కుమార్తె ఎలిజబెత్‌ IIను ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించాడు. అయితే, ఆమెను మనువాడాలంటే ఫిలిప్‌ బ్రిటన్‌ పౌరుడుగా మారాలి. అందుకే, ఆయన తన గ్రీస్‌, డెన్మార్క్‌ రాచరిక వారసత్వాన్ని వదులుకున్నాడు. 1947లో ఎలిజబెత్‌ IIను పెళ్లి చేసుకొని రాయల్‌ కుటుంబంలో చేరి రాణి ఎలిజబెత్‌కు భర్తగా మిగిలిపోయారు. ఆయనకు నైట్‌ ఆఫ్‌ ది గార్టర్‌, బారాన్‌ గ్రీన్‌విచ్‌, ఎర్ల్‌ ఆఫ్‌ మెరియనెత్‌, డ్యూక్‌ ఆఫ్‌ ఎడిన్‌బర్గ్‌ టైటిల్స్‌ ఇచ్చారు.


కార్ల్‌ జోహన్‌ బెర్నాడోట్‌

స్వీడన్‌ చక్రవర్తి కింగ్‌ గుస్తఫ్‌ VI అడాల్ఫ్‌ నాలుగో సంతానమైన కార్ల్‌ జోహన్‌.. జర్నలిస్టుగా పనిచేస్తున్న ఒక సాధారణ యువతి ఎలిన్‌ కెర్స్‌టిన్‌ మార్గరెటాను ప్రేమించాడు. అయితే, వీరి ప్రేమకు రాజకుటుంబం అడ్డుచెప్పింది. దీంతో 1946లో కార్ల్‌.. రాజకుమారుడి హోదా, వారసత్వ హక్కులను వదులుకొని బయటకు వచ్చి ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్నాళ్లు న్యూయార్క్‌లో ఓ ట్రేడింగ్‌ కంపెనీలో పనిచేశారు. అయితే, 1987లో కెర్స్‌టిన్‌ మరణించడంతో మరుసటి ఏడాది స్వీడన్‌కు చెందిన గున్నిలా మార్టా లూయిస్‌ను రెండో పెళ్లి చేసుకున్నాడు.


ప్రిన్స్‌ ఫ్రిసో

ప్రిన్స్‌ ఫ్రిసో.. నెదర్లాండ్స్‌ చక్రవర్తి కింగ్‌ విలియమ్‌-అలెగ్జాండర్‌ సోదరుడు. డచ్‌ రాయల్‌ కుటుంబంలో సభ్యుడు. ఆయన 2004లో సామాన్య మహిళ.. మానవ హక్కుల కార్యకర్త మాబెల్‌ విస్సే స్మిత్‌ను వివాహమాడాడు. దీంతో రాజ్య చట్టాల ప్రకారం స్థాయికి తగ్గ మహిళను వివాహం చేసుకోనందుకుగానూ ఆయనను రాజకుటుంబం నుంచి వేరు చేశారు. ప్రేమ కోసం ఆయన రాజ్య వారసత్వ హక్కులను వదులుకొని సాధారణ జీవితం మొదలుపెట్టాడు. అయితే, 2012లో ఆస్ట్రియాలోని లెచ్‌ వద్ద స్కీయింగ్‌ చేస్తుండగా.. హిమపాతంలో ఆయన ఇరుక్కుపోయారు. మెదడుకు తీవ్ర గాయాలు కావడంతో కోమాలోకి వెళ్లారు. చివరికి 2013ఆగస్టు 12న ప్రాణాలు విడిచారు. 


జపాన్‌లో యువరాణులు..

రాకుమార్తె అత్సుకో

జపాన్‌ చక్రవర్తి హిరోహిటో కుమార్తె అత్సుకో 1952లో పాడిరైతు టాకామసా ఇక్డాను ప్రేమ వివాహం చేసుకుంది. రాజకుటుంబీకులు సామాన్య వ్యక్తుల్ని పెళ్లి చేసుకుంటే.. వారు కుటుంబంలో స్థానం కోల్పోతారు. వారసత్వంగా ఎలాంటి హక్కులు, ఆస్తులు పొందలేరు. దీంతో అత్సుకో రాజకుటుంబాన్ని వీడాల్సి వచ్చింది. 


రాకుమారి సయాకో

జపాన్‌ ప్రస్తుత చక్రవర్తి అకిహిటో - రాణి మిచికో ఏకైక కుమార్తె సయాకో. ఆమె సోదరుడు ఫుమిహిటో ప్రస్తుత యువరాజు. ఎంతో అల్లారుముద్దుగా పెరిగిన ఆమె.. తండ్రి వారసత్వంలో భాగం కావాల్సిన సమయంలో ఓ సాధారణ ఉద్యోగి, అర్బన్‌ ప్లానర్‌ అయిన యోషికి కురోడాని ప్రేమించింది. వారి ప్రేమకు పెద్దలు అభ్యంతరం తెలిపారు. ఒక రాకుమారి.. తమ స్థాయి కాని వ్యక్తిని వివాహం చేసుకోవడం తగదన్నారు. దీంతో 2005లో సయాకో తన రాజకుటుంబాన్ని.. యువరాణి హోదాను వదిలేసి ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకొని వెళ్లిపోయింది.


యువరాణి అయాకో 

జపాన్‌లోని మరో రాజకుటుంబంలోనూ ప్రేమ వివాహం జరిగింది. రాజకుమారుడు నోరిహిటో-హిసాకో దంపతుల గారాల పట్టి అయాకో షిప్పింగ్‌ కంపెనీలో పనిచేసే కే మోరియాను ప్రేమించింది. దీనికి వారి తల్లిదండ్రులు మొదట ఒప్పుకున్నారు. దీంతో 2018లో అంగరంగవైభవంగా వారిద్దరికి వివాహం జరిపించారు. అయితే, ఇతర రాజకుటుంబీకులు వీరి ప్రేమవివాహాన్ని వ్యతిరేకించారు. అయాకోను బహిష్కరించాలని బలవంతం చేశారు. దీంతో ఆమె కుటుంబాన్ని వదిలి బయటకు రావాల్సి వచ్చింది.


మేనత్తలాగే.. రాకుమారి మేకో

ప్రేమ కోసం రాజ్యాన్ని వదిలేసుకున్న జపాన్‌ రాకుమారి సయాకో మేనకోడలు, ప్రస్తుత యువరాజు ఫుమిహిటో కుమార్తె మేకో కూడా ప్రేమ వివాహామే చేసుకోబోతుంది. ఇంటర్నేషనల్‌ క్రిస్టియన్‌ యూనివర్సిటీ విద్యార్థి కే కొమురోను మేకో ప్రేమించింది. వీరి వివాహానికి పెద్దలు అంగీకరించారు. 2017లో నిశ్చితార్థం కూడా జరిపించారు. అయితే.. రాజ చట్టాల ప్రకారం వివాహామైన తర్వాత మేకో రాజకుటుంబంలో స్థానం కోల్పోవాల్సి ఉంటుందట.


యువరాణి బోల్‌రత్నా రాజకన్యా

థాయ్‌లాండ్‌ చక్రవర్తి భూమిబోల్‌ అదుల్యదేజ్‌ కుమార్తె అయిన బోల్‌రత్నా రాజకన్యా 1972లో అమెరికాలోని మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూ్ట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో చదువుకుంటున్న రోజుల్లో పీటర్‌ లాడ్‌ జెన్సెన్‌కు మనసిచ్చింది. ఆయనతోనే జీవితం పంచుకోవాలని ఆశపడింది. అదే విషయం తండ్రికి చెప్పగా.. ఆయన ఒప్పుకోలేదు. దీంతో కుటుంబసభ్యులను కాదని బోల్‌రత్నా పీటర్‌ను పెళ్లి చేసుకుంది. ఆగ్రహించిన తండ్రి.. ఆమెను రాజకుటుంబంలో నుంచి బహిష్కరించారు. దీంతో ఆమె తన వారసత్వ హక్కులను వదులుకొని అమెరికాకు వచ్చేసింది. అయితే, ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత భర్తతో మనస్పర్థలు రావడంతో 1998లో పీటర్‌కు బోల్‌రత్నా విడాకులు ఇచ్చింది.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని