నిద్రలేమి.. ఎన్ని రోజులకు ఏమవుతుందో తెలుసా?

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు కనీసం 8 గంటల నిద్ర ఉండాలి. కానీ, ఉద్యోగం.. పనులు.. మానసిక ఇబ్బందుల వల్ల కొంతమందికి నిద్ర సరిగా ఉండదు. ఈ మధ్య యువత రాత్రుళ్లు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చూసుకుంటూ నిద్ర పాడుచేసుకుంటున్నారు. ఇలా నిద్రలేమితో జీవితాన్ని కొనసాగిస్తే

Updated : 21 Jul 2021 17:54 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు కనీసం 8 గంటల నిద్ర ఉండాలి. కానీ, ఉద్యోగం.. పనులు.. మానసిక ఇబ్బందుల వల్ల కొంతమందికి నిద్ర సరిగా ఉండదు. ఈ మధ్య యువత రాత్రుళ్లు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చూసుకుంటూ నిద్ర పాడుచేసుకుంటున్నారు. ఇలా నిద్రలేమితో జీవితాన్ని కొనసాగిస్తే కొన్ని రోజుల్లోనే ఆరోగ్యం పూర్తిగా క్షీణిస్తుందని వైద్య నిపుణులు పదే పదే హెచ్చరిస్తున్నారు. అయితే తాజాగా ఒట్టి అనే మ్యాట్రసెస్‌ సంస్థ.. మెడిసిన్‌ డైరెక్ట్‌ అనే సంస్థతో కలిసి ఓ పరిశోధన నిర్వహించింది. నిద్రలేమితో ఉంటే శరీరంలో ఎన్ని రోజులకు ఎలాంటి మార్పులు కనిపిస్తాయో వెల్లడిస్తూ ఓ నివేదిక రూపొందించింది. అందులో ఏముందంటే..

24 గంటల తర్వాత..

24 గంటలకు మించి నిద్రలేమితో ఉన్నవారికి కాస్త మగతగా అనిపిస్తుందట. మెదడు పనితీరు మందగించడంతోపాటు ఏకాగ్రత దెబ్బతింటుంది. చిన్న విషయానికి కూడా చిరాకు పడుతుంటారు. మానసిక స్థితి స్థిరంగా ఉండదు. కళ్లు ఉబ్బినట్లుగా కనిపిస్తాయి. శరీరంలో నాడీవ్యవస్థలో సమతుల్యం దెబ్బతింటుంది. కండరాల నొప్పి మొదలవుతుంది. అప్పుడప్పుడు పని ఒత్తిళ్లతో రాత్రుళ్లు నిద్రపోని వారికి ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయట.

మూడు రోజులు

మూడురోజులకు మించి నిద్రలేమితో ఉంటే.. అలాంటివారిలో మెదడు తీవ్ర ఒత్తిడికి లోనై భ్రాంతులకు గురవుతుంది. దిగాలుగా ఉండటం, మతి స్థిమితంగా లేకపోవడం, జ్ఞానేంద్రియాలపై నియంత్రణ కోల్పోతున్నట్లుగా అనిపిస్తుంటుంది. చర్మం పాలిపోవడం, చూపు మందగించడంతోపాటు కళ్ల నొప్పులు వస్తాయి. కండరాలు సంకోచించినట్లుగా అనిపిస్తుందని వైద్య నిపుణులు తెలిపారు.

వారం రోజులు

నిద్రలేమి వారానికి మించిందంటే మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుందట. నిద్రలేమితో మనిషి ఏదో కోల్పోతున్న భావనలోకి వెళ్లిపోతారు. శరీరంలో తేమశాతం తగ్గి.. చర్మం పొడిబారిపోతుందని ఆ తర్వాత ముడతలు కూడా మొదలవుతాయి. శరీరంలో పీహెచ్‌ సమతుల్యం కూడా దెబ్బతింటుందని నిపుణులు పేర్కొన్నారు. 

నెల దాటితే..

నిద్ర సరిగా లేకుండా నెలరోజులు గడిపితే మనిషి మానసిక స్థితి పూర్తిగా దెబ్బతింటుంది. తీవ్రమైన ఒత్తిడికి గురవుతారు. కొన్ని సందర్భాల్లో భయాందోళనతో వణికిపోతారు. భ్రాంతులు కొనసాగుతాయి. ఏది నిజమో.. ఏది భ్రాంతో తేల్చుకోలేని స్థితికి చేరుకుంటారు. వారి మెదడులో వారికి తెలియకుండానే ఏవేవో ఆలోచనలు వస్తుంటాయి. చమటలు పట్టడం, తొందరగా బరువు తగ్గడం, మహిళల్లో అయితే హార్మోన్లలో సమతుల్యం దెబ్బతినడం.. కొన్ని సందర్భాల్లో ఆకస్మాత్తుగా మోనోపాజ్‌ స్థితికి చేరడం వంటివి జరుగుతాయని ఒట్టి, మెడిసిన్‌ డైరెక్ట్‌ సంస్థలు నిర్వహించిన పరిశోధనలో తేలింది. కాబట్టి.. నిద్రలేమితో వచ్చే ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకొని.. నిద్రకు తగినంత సమయం కేటాయించాలని సంస్థలు సూచిస్తున్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని