వర్క్‌‌‌ ఫ్రమ్‌ జర్నీ: ముంబయి టు కన్యాకుమారి

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అనేక సంస్థలు తమ ఉద్యోగులను వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేయాలని సూచించాయి. కరోనా భయంతో కొంతమంది ఇంట్లో నుంచి.. మరికొంతమంది ఏకంగా సిటీ వదిలీ స్వగ్రామం నుంచి పని చేయడం మొదలుపెట్టారు. ఇంకొదరైతే పరిస్థితులు

Updated : 22 Jan 2021 13:57 IST

ముగ్గురు స్నేహితుల సాహసయాత్ర

(ఫొటో: బాక్సెన్‌ జార్జ్‌ ఇన్‌స్టా)

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అనేక సంస్థలు తమ ఉద్యోగులను వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేయాలని సూచించాయి. దీంతో కొంతమంది ఇంటి నుంచి.. మరికొంతమంది సిటీ వదిలి స్వగ్రామం నుంచి పని చేయడం మొదలుపెట్టారు. ఇంకొందరైతే పరిస్థితులు చక్కబడే వరకు ఏకంగా ఉద్యోగానికి సెలవు పెట్టేశారు. కానీ, ఓ ముగ్గురు స్నేహితులు మాత్రం ఈ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ వెసులుబాటును సాహసయాత్రగా మలుచుకున్నారు. ఉద్యోగం చేస్తూనే సైకిల్‌పై ముంబయి నుంచి కన్యాకుమారి వరకు వెళ్లారు.

ముంబయికి చెందిన బాక్సెన్‌ జార్జ్‌, అల్విన్‌ జోసెఫ్‌, రతీశ్‌ భాలేరావ్‌ ముగ్గురు రెండు దశాబ్దాలుగా మంచి స్నేహితులు. కరోనా కారణంగా వారి సంస్థలు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఇవ్వడంతో బాక్సెన్‌ జార్జ్‌కి ఒక ఆలోచన వచ్చింది. ఎలాగూ ఆఫీస్‌కు వెళ్లాల్సిన పని లేదు.. అలాంటప్పుడు పనిచేస్తూ ఎక్కడికైనా సైకిల్‌పై విహార యాత్రకు వెళ్తే బాగుంటుందని అనుకున్నాడు. బాక్సెన్‌కు గతంలో సైకిల్‌యాత్రలు చేసిన అనుభవం ఉంది. అందుకే ఈ సారి ఉద్యోగం చేస్తూనే కన్యాకుమారి వరకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. తన ఆలోచనను అల్విన్‌, రతీశ్‌కు చెప్పడంతో వాళ్లూ యాత్రకు సిద్ధమయ్యారు. 

దాబాలు.. హోటళ్లే ఆఫీసులు

ముగ్గురు స్నేహితుల సైకిల్‌ ప్రయాణం ముంబయి నుంచి నవంబర్‌ చివరి వారంలో మొదలైంది. ల్యాప్‌టాప్‌, మొబైల్‌ఫోన్లు, ఇతర గ్యాడ్జెట్లు వెంటపెట్టుకున్నారు. తెల్లవారుజామునే సైకిల్ తొక్కడం మొదలుపెట్టి ఉదయం 11 గంటల వరకు ప్రయాణించి దారి మధ్యలో ఏదైనా దాబా లేదా హోటల్‌ వద్ద ఆగేవారు. అక్కడ ఆఫీస్‌ విధుల కోసం ల్యాప్‌టాప్‌లో లాగిఇన్‌ అయి.. సాయంత్రం వరకు అక్కడే పనిచేసుకునేవారు. ఆఫీస్‌ సమయం పూర్తి కాగానే తిరిగి సైకిల్‌ ప్రయాణం మొదలయ్యేది. అలా రోజుకు సరాసరి 80కి.మీ దూరం సైకిల్‌ తొక్కుతూ.. 24 రోజుల్లో 1,687కి.మీ ప్రయాణించి కన్యాకుమారి చేరుకున్నారు. 

ఎంత ఖర్చయిందంటే..

ఈ యాత్రలో మొదట్లో కాస్త కష్టంగా అనిపించినా.. తర్వాత ఇబ్బంది లేకుండా ప్రయాణించామని ముగ్గురు స్నేహితులు చెబుతున్నారు. యాత్రకు సంబంధించిన విషయాలను వీరు ఎప్పటికప్పుడు సోషల్‌మీడియాలో పంచుకున్నారు. యాత్ర పూర్తయ్యే సరికి ఆఫీసు పని నిమిత్తం హోటళ్లో ఉండటానికి, తినడానికి ఒక్కొక్కరికి రూ.25వేలు ఖర్చయ్యాయట. కరోనా సమయంలో ఏర్పడ్డ భయాలు, ఆందోళనలు తొలగించుకోవడానికి, సానుకూల దృక్పథం ఏర్పడటం కోసం ఈ సాహస ‘సైకిల్‌’ యాత్ర చేపట్టామని తెలిపారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వివరాలు వెల్లడించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని