olympics: ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవం.. గతమెంతో ఘనం!

ఒలింపిక్స్‌ మహాక్రీడోత్సవం ప్రారంభమైంది. కానీ.. ప్రతిసారి అంగరంగవైభంగా జరిగే ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవ వేడుక.. కరోనా మహమ్మారి కారణంగా సాదాసీదాగా జరిగిపోయింది. గతేడాదే నిర్వహించాల్సిన ఒలింపిక్స్‌ క్రీడలు కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. మహమ్మారి వ్యాప్తితో అసలు ఈ క్రీడలు

Updated : 23 Jul 2021 18:04 IST

ఒలింపిక్స్‌ క్రీడా మహోత్సవం ప్రారంభమైంది. కానీ.. ప్రతిసారి అంగరంగవైభవంగా జరిగే ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవ వేడుక.. కరోనా మహమ్మారి కారణంగా సాదాసీదాగా జరిగిపోయింది. గతేడాదే నిర్వహించాల్సిన ఒలింపిక్స్‌ క్రీడలు కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. మహమ్మారి వ్యాప్తితో అసలు ఈ క్రీడలు జరుగుతాయా? అనే సందేహాలు కలిగాయి. జపాన్‌ ప్రజలే ఒలింపిక్స్‌ను నిర్వహించొద్దని వ్యతిరేకించారు. అయినా.. కరోనా నిబంధనలు పాటిస్తూ ఒలింపిక్స్‌ను నిర్వహించేందుకు ఆ దేశం ముందుకొచ్చింది. ఈ క్రమంలోనే ఒలింపిక్స్‌లో భాగమైన ప్రారంభోత్సవాన్ని ఉండిలేనట్టుగా నిర్వహించేసింది. క్రీడాభిమానుల కేరింతలు లేవు.. సినీతారల సందడి లేదు. కొద్దిమంది ప్రేక్షకులు, అతిథుల మధ్య అలా అలా కానిచ్చేశారు. అయితే, గత ఒలింపిక్స్‌ క్రీడల్లో జరిగిన కొన్ని గొప్ప ప్రారంభోత్సవాలు, విశేషాలపై ఓ లుక్కేద్దాం..!

టోక్యో, జపాన్‌ - 1964 

ప్రస్తుతం ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిస్తోన్న జపాన్‌.. 1964లోనూ ఈ మహాక్రీడలను నిర్వహించింది. ఆసియాలో ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చిన తొలిదేశం కూడా జపానే. క్రీడలను శాటిలైట్‌ ద్వారా ప్రత్యక్షప్రసారం చేయడం కూడా టోక్యో ఒలింపిక్స్‌ నుంచే ప్రారంభమైంది. ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవంలో భాగంగా వేలకొద్ది బెలూన్లను, 8వేల పావురాలను గాల్లోకి ఎగరవేశారు. ఐదు జెట్‌రాకెట్లు గాల్లో గింగిరాలు తిరుగుతూ ఒలింపిక్స్ రింగులను గీయడం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మరో విశేషమేమిటంటే.. ప్రారంభోత్సవంలో ఒలింపిక్‌ జ్యోతిని హిరోషిమా బేబీగా గుర్తింపు పొందిన యోషినోరి సాకాయ్‌ వెలిగించాడు. హిరోషిమాపై అణుబాంబు పడిన రోజునే యోషినోరి జన్మించాడు. అందుకే అతడిని హిరోషిమా బేబి అని పిలుస్తుంటారు.


మాస్కో, రష్యా - 1980 

1980లో రష్యా-అమెరికా మధ్య కోల్డ్‌వార్‌ జరుగుతుండటంతో మాస్కోలో జరిగిన  ఒలింపిక్స్‌ను అమెరికా నిషేధించింది. ఈ నేపథ్యంలో అమెరికాకు కన్నుకుట్టే విధంగా ఒలింపిక్స్‌ ప్రారంభోత్స వేడుకను ఘనంగా నిర్వహించింది. మైదానం మధ్యలో కొందరు పిరమిడ్‌ ఆకారంలో ఒకరిపై ఒకరు నిల్చోడం అందరి దృష్టిని ఆకర్షించింది. అలాగే, స్టేడియం కార్డులను పరిచయం చేసిన ఘనత రష్యాకే చెందుతుంది. మైదానంలో ఒలింపిక్‌ జ్యోతిని వెలిగించిన వెంటనే అక్కడ ఉన్న ప్రేక్షకులంతా కలిసి కార్డులతో నినాదాలు.. ఒలింపిక్స్‌ రింగులను ప్రదర్శించడం వేడుకలో హైలైట్‌గా నిలిచింది.


లాస్‌ ఏంజిలెస్‌, అమెరికా - 1984 

అగ్రరాజ్యం అమెరికా 1984లో ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చింది. లాస్‌ ఏంజిలెస్‌ మెమోరియల్‌ కోలిజియం వేదికగా ప్రారంభోత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా 800 మంది మ్యూజిషియన్లు సంగీతం వాయిస్తూ క్రీడాకారులతోపాటు మార్చ్‌ చేశారు. 410 మంది బ్యాలెట్‌ డాన్స్‌ చేశారు. మ్యూజిషియన్లు 84 అతిపెద్ద పియానోలను వాయించారు. 300 మంది గాయకులు కలిసి పాట పాడారు. ఈ వేడుకలో ఓ వ్యక్తి జెట్‌ ప్యాకెట్‌ వేసుకొని గాల్లో ఎగురుతూ వచ్చి మైదానం మధ్యలో ల్యాండ్‌ కావడం ప్రారంభోత్సవ వేడుకలో మరుపురాని ఘట్టంగా చెబుతుంటారు. 


బార్సిలోనా, స్పెయిన్‌ - 1992 

స్పెయిన్‌లోని బార్సిలోనాలో జరిగిన ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవ వేడుక  ఎంతో వైవిధ్యంగా నిర్వహించారనడంలో సందేహం లేదు. 67వేల మంది ప్రేక్షకుల మధ్య భారీ పప్పెట్స్‌(తోలుబొమ్మలు) సందడి చేశాయి. వందలాది కళాకారులు నీలి రంగు దుస్తులు వేసుకొని స్టేడియాన్ని సముద్రంగా మార్చగా.. అందులో భారీ ఓడను నడుపుతున్నట్లు చేసిన విన్యాసం అబ్బురపర్చింది. వేడుక చివర్లో పారాఒలింపిక్‌ ఆర్చర్‌ ఆంటోనియో రొబెల్లో బాణం ఎక్కుపెట్టి ఒలింపిక్ జ్యోతిని వెలిగించడం విశేషం.


సిడ్నీ, ఆస్ట్రేలియా - 2000 

సిడ్నీ వేదికగా జరిగిన ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవంలో కళాకారులు మంటలతో భారీ ప్రదర్శన ఇచ్చారు. ప్రేక్షకులంతా చేతికి ఎరుపు రంగు టార్చ్ బ్యాండ్‌తో స్టేడియమంతా వెలుగులు నింపారు. ఆ తర్వాత రంగురంగు సీతాకోకచిలుకల వేషధారణతో మరికొంత మంది చేసిన నృత్యప్రదర్శన కనులవిందుగా సాగింది. దేశాల వారీగా అథ్లెట్ల మార్చ్‌, ప్రారంభోత్సవ ప్రసంగం తర్వాత ఒలింపిక్స్‌ జ్యోతి వెలిగించే సమయంలో నీరు.. నిప్పుతో చేసిన విన్యాసం ప్రేక్షకులను కట్టిపడేసింది. 


ఏథేన్స్‌, గ్రీస్‌ - 2004

గ్రీస్‌లోని ఏథేన్స్‌లో ఒలింపిక్స్‌-2004 ప్రారంభోత్స వేడుక జరిగింది. గ్రీస్‌ అంటేనే అత్యంత ప్రాచీన చరిత్ర కలిగిన నగరం. అందుకే ఆ దేశ చరిత్ర, అక్కడి ప్రజల సంస్కృతిని తెలిపే విధంగా పలు ప్రదర్శనలు ఇచ్చారు. ఆ తర్వాత అథ్లెట్ల మార్చ్‌.. ప్రారంభోత్సవ ప్రసంగం.. ఒలింపిక్స్‌ జ్యోతి ప్రజ్వలన జరిగాయి. 


బీజింగ్‌, చైనా - 2008

చైనాలోని జీబింగ్‌ నేషనల్‌ స్టేడియంలో నిర్వహించిన ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవంలో కనివినీ ఎరుగని విధంగా 2008 మంది డ్రమ్మర్స్‌ స్టేడియంలో డ్రమ్స్‌ వాయిస్తూ.. పాట పాడారు. ఆ దృశ్యం.. డ్రమ్స్‌ శబ్దాలు ప్రేక్షకుల్లో రోమాలు నిక్కపోడిచాయంటే అతిశయోక్తి కాదు. ఆ తర్వాత అరవై అడుగుల ఎత్తులో రూపొందించిన గోళాకారపు వస్తువు చుట్టూ రోపుల సాయంతో కళాకారులు విన్యాసాలు చేశారు. చివర్లో ఒలింపిక్స్‌ జ్యోతి ఓ వ్యక్తి గాల్లో ఎగురుతూ(రోప్‌ సాయంతో) వచ్చి వెలిగించడం ఆకట్టుకుంటుంది. 


లండన్‌, యూకే - 2012

లండన్‌ ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవ వేడుకలో బ్రిటన్‌ పారిశ్రామిక విప్లవం నుంచి చరిత్రలో నిలిచిపోయిన అనేక ఘట్టాలను ప్రదర్శించారు. లండన్‌ సింఫనీ ఆర్కేస్ట్రా బృందం సంగీత కచేరీ చేస్తుండగా.. మిస్టర్‌ బీన్‌(రోవన్‌ అట్కిన్సన్‌‌) వచ్చి చేసిన సందడి ఆద్యంతం నవ్వులు పూయించింది. క్రీడల నేపథ్యంలోనే మిస్టర్‌ బీన్‌ నటించిన హాస్యభరిత లఘుచిత్రాన్ని ప్రదర్శించారు. జేమ్స్‌బాండ్‌ పాత్రధారి డానియల్‌ క్రెగ్‌తో కలిసి బ్రిటన్‌ రాణి ఎలిజెబెత్‌ హెలికాప్టర్‌లో వచ్చి స్టేడియంలో స్కైడైవింగ్‌ చేస్తూ దిగడం విశేషం.(నిజానికి ఆమె అసలైన ఎలిజబెత్‌ కాదు. ఆమె పాత్రలో మరో వ్యక్తి నటించారు). ఆ తర్వాత అసలైన ఎలిజెబెత్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ ప్రదర్శనలకు స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌ చిత్ర దర్శకుడు డ్యానీ బోయల్‌ దర్శకత్వం వహించారు. 


రియో, బ్రెజిల్‌ - 2016

రియోలోని మారకానా స్టేడియంలో ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవ వేడుకలు జరిగాయి. దేశ ఆర్థిక పరిస్థితుల, రాజకీయ సంక్షోభం నేపథ్యంలో తక్కువ ఖర్చుతో.. ఉన్నంతలో గొప్పగా నిర్వహించాలని వేడుక నిర్వహకులు భావించారు. ఈ క్రమంలో అమెజాన్‌ అడవులు.. గిరిజన సంప్రదాయాలు ఉట్టిపడేలా నృత్య ప్రదర్శనలు, గాయకుల సంగీత కచేరీలు జరిగాయి. బ్రెజిల్‌లో ప్రముఖ మోడల్‌ గిసెలె బుడ్చెన్‌.. స్థానిక గాయకుడు డానియల్‌ జోబిమ్‌ పాట పాడుతుండగా ర్యాంప్‌ వాక్‌ చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే, ప్రారంభోత్సవ కార్యక్రమం ముగింపులో ఒలింపిక్స్‌ జ్యోతి ప్రజ్వలన మాత్రం ఒక్కో ఆతిథ్య దేశం విభిన్నంగా ఏర్పాటు చేసి ప్రత్యేకతను చాటుకున్నాయి.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు