Beggars: ఈ స్వచ్ఛంద సంస్థ.. యాచకులను వ్యాపారులను చేస్తోంది!

‘యాచకులకు దానం చేయకండి.. వారి నైపుణ్యాలను గుర్తించి వారిపై పెట్టుబడి పెట్టండి’’అంటోంది.. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చెందిన ‘కామన్‌మ్యాన్‌ ట్రస్ట్‌’ అనే స్వచ్ఛంద సంస్థ. ఎవరూ పుట్టుకతోనే యాచకులు కారని, వారిని సరైన మార్గంలో నడిపిస్తే వ్యాపారవేత్తలుగా ఎదుగుతారని

Updated : 13 Jan 2022 05:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘యాచకులకు దానం చేయకండి.. వారి నైపుణ్యాలను గుర్తించి వారిపై పెట్టుబడి పెట్టండి’’ అంటోంది.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసికి చెందిన ‘కామన్‌మ్యాన్‌ ట్రస్ట్‌’ అనే స్వచ్ఛంద సంస్థ. ఎవరూ పుట్టుకతోనే యాచకులు కారని, వారిని సరైన మార్గంలో నడిపిస్తే వ్యాపారవేత్తలుగా ఎదుగుతారని చెబుతోంది. చెప్పడమే కాదు.. యాచకులకు నైపుణ్య శిక్షణ ఇప్పించి స్వయం ఉపాధి కల్పిస్తూ వారిని వ్యాపారులుగా మారుస్తోంది.

‘కామన్‌మ్యాన్‌ ట్రస్ట్‌’ను నిర్వహిస్తున్న సామాజిక కార్యకర్త చంద్ర మిశ్ర.. యాచకులను ప్రయోజకులుగా మార్చడమే లక్ష్యంగా గతేడాది ‘బెగ్గర్‌ కార్పొరేషన్‌’ పేరుతో స్టార్టప్‌ను ప్రారంభించారు. ప్రయోగాత్మకంగా వారణాసిలోని 12 యాచక కుటుంబాల నుంచి 55 మందిని ఎంచుకొని వారికి వివిధ అంశాల్లో నైపుణ్య శిక్షణ ఇప్పించారు. వారిలో కొందరు వస్త్రం, కాగితాలతో బ్యాగులు తయారు చేయడం నేర్చుకున్నారు. దీంతో వారిని స్వయం సహాయక బృందంగా మార్చి బ్యాగుల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయించారు. వారి ఉత్పత్తులు మార్కెట్లో బాగానే అమ్ముడవుతుండటంతో మిశ్రకు తన ఆలోచనపై నమ్మకం పెరిగింది. దీంతో యాచకులందరినీ ఇదే బాటలో నడిపించాలని సంకల్పించారు.

ఓ నివేదిక ప్రకారం భారతీయులు ఏటా రూ.34వేల కోట్లు యాచకులకు దానంగా ఇస్తున్నారట. దానం చేయడం ద్వారా పుణ్యం లభిస్తుందని భావించే ఈ విధంగా చేస్తుంటారని, అలా కాకుండా వారిపై పెట్టుబడి పెడితే యాచకుల జీవితాలే మారుతాయని మిశ్ర చెప్పుకొచ్చారు. 

ప్రయోగత్మాకంగా ఏర్పాటు చేసిన ‘బెగ్గర్‌ కార్పొరేషన్‌’కు ఆదరణ లభిస్తుండటంతో దానిని ఆదాయ వనరున్న కంపెనీగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రూ. 2.5కోట్ల పెట్టుబడులు సేకరించేందుకు మిశ్ర ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రభుత్వం తమకు అనుమతిస్తే.. యాచకులను గుర్తించి.. పిల్లల్ని, వృద్ధుల్ని పునరావాస కేంద్రాలకు పంపించి, 18-45ఏళ్ల వయస్కులకు మూడు నెలలు శిక్షణ ఇచ్చి, రుణాలు ఇప్పించి వ్యాపారం ప్రారంభించేలా చేస్తామని ‘కామన్‌మ్యాన్‌ ట్రస్ట్‌’ నిర్వహకులు అంటున్నారు. 

అంతేకాదు, యాచకుల పిల్లలు చదువుకునేందుకు వారణాసిలోనే ‘స్కూల్‌ ఆఫ్‌ లైఫ్‌’ పేరుతో ఓ పాఠశాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో 32 మంది చిన్నారులు విద్యనభ్యసిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని