కొబ్బరి నీళ్లు.. తాగితే ఎంతో మేలు

మాంచి ఎండ.. గొంతు తడారిపోతోంది.. అలాంటప్పుడు ఠక్కున గుర్తుకొచ్చేవి కూల్‌ డ్రింక్స్‌. థమ్స్‌అప్, పెప్సీ, కోకాకోలా, లిమ్కా  వంటి పానీయాలు వైపే మొగ్గు చూపుతాం. కానీ అవి..

Updated : 02 Sep 2020 19:03 IST

డైట్‌లో భాగం చేసుకోవాలంటున్న నిపుణులు

నేడు వరల్డ్‌ కోకోనట్‌ డే

 ఎండ.. గొంతు తడారిపోతోంది.. అలాంటప్పుడు ఠక్కున గుర్తుకొచ్చేవి కూల్‌ డ్రింక్స్‌. థమ్స్‌అప్, పెప్సీ, కోకాకోలా, లిమ్కా  వంటి పానీయాలు వైపే మొగ్గు చూపుతాం. కానీ అవి తాగినప్పుడు బాగానే ఉన్నా మళ్లీ కాసేపటికే దప్పిక వేస్తుంది. కూల్‌డ్రింక్స్‌లా కాకుండా సహజసిద్ధంగా దొరికే పానీయాల్లో కొబ్బరి బోండాం నీళ్లు ఎంతో శ్రేష్ఠమైనవి. ఎలాంటి రసాయనాలు లేకుండా ఉండటంతో ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఒక్క కొబ్బరి బోండాం తాగితే పొట్టలో ఎంత హాయిగా ఉంటుందో మరి. ఇటు ఆరోగ్యం అందించడంతోపాటు ఎలాంటి దుష్ప్రభాలు కలిగించని ఏకైక పానీయం కొబ్బరి నీళ్లు. మన దేశంలో కొబ్బరి బోండాలకు ఉన్న గిరాకీ మరెక్కడా ఉండదేమో.. అసలే ఇవాళ (సెప్టెంబరు 2) వరల్డ్‌ కోకోనట్‌ డే. మరి అటువంటి అద్భుతమైన పానీయం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకోవాలిగా.. 

కొబ్బరి బోండాం నీటిలో అత్యధికంగా కేలరీలు, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్‌లు ఉంటాయి. కాపర్‌ వంటి మినరల్స్‌ ఉండటంతో గుండెకు ఎంతో మంచిది. అంతేకాకుండా కొబ్బరి నీళ్లలో ఉన్న మాంగనీస్ కొవ్వు మెటబాలిజమ్‌, ఎంజైమ్‌ పనితీరు సరిగ్గా ఉండేటట్లు చేస్తుంది. మీ డైట్‌లో కొబ్బరి నీళ్లను భాగం చేసుకుంటే శారీరకంగా ఎంతో దృఢంగా, నాజూకుగా తయారు కావచ్చని నిపుణులు అంటున్నారు. కొబ్బరి నీళ్లను తాగడం వల్ల పొట్ట నిండిన భావన కలిగి అతిగా తినడం మానేస్తాం. ఇందులో ఉండే ఫైబర్‌ బరువు తగ్గేందుకు సాయమవుతుంది. కొలెస్ట్రాల్‌ స్థాయిని కొబ్బరి నీళ్లలోని పోషకాలు అదుపులో ఉంచుతాయి. గుండె జబ్బులకు కారణమైన బెల్లీ ఫ్యాట్‌ తగ్గాలంటే స్వచ్ఛమైన కొబ్బరి నూనె వాడటం మేలని నిపుణులు సూచించారు. తాజా కొబ్బరి నీళ్లను తాగడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. శరీరంలో ఇన్సులిన్‌ ఉత్పత్తి సరిగ్గా కావాలంటే కొబ్బరినీళ్లలోని అమినో యాసిడ్‌ తోడ్పాటు ఇస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అందుకే మన ఆహార పద్దతుల్లో కొబ్బరి నీళ్లకు చోటు కల్పిస్తే అనారోగ్యం పాలిట నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని