stress relief: ఒత్తిడికి గురవుతున్నారా..? ఇలా చేసి చూడండి!

ఈ ఆధునిక కాలంలో.. పోటీ ప్రపంచంలో మనిషులు ఏదో విధంగా ఒత్తడికి గురవుతున్నారు. ఉద్యోగం, వ్యాపారం, వ్యక్తిగతం, కుటుంబం ఇలా జీవితంలో భాగమైన ఎన్నో విషయాల గురించి ఆలోచిస్తూ మానసికంగా నలిగిపోతున్నారు. కరోనా మహమ్మరి కారణంగా ఒత్తిళ్లు మరింత పెరిగాయి

Updated : 30 Jul 2021 12:36 IST

ఈ ఆధునిక.. పోటీ ప్రపంచంలో మనుషులు ఏదో విధంగా ఒత్తిడికి గురవుతున్నారు. ఉద్యోగం, వ్యాపారం, వ్యక్తిగతం, కుటుంబం ఇలా జీవితంలో భాగమైన ఎన్నో విషయాల గురించి ఆలోచిస్తూ మానసికంగా నలిగిపోతున్నారు. కరోనా మహమ్మరి కారణంగా ఒత్తిళ్లు మరింత పెరిగాయి. వైరస్‌ వ్యాప్తి, అనారోగ్యం, ఉద్యోగం-వ్యాపారంలో అభద్రత, భవిష్యత్‌పై ఆలోచనలు వంటివి మనిషిని మరింత కుంగదీస్తున్నాయి. దీంతో మెదడుకు ప్రశాంతత కరవవుతోంది. మానసిక క్షోభతో ఆరోగ్యం దెబ్బతింటుంది. ఒత్తిడిలో ఉన్నప్పుడు అనాలోచితంగా నిర్ణయాలు తీసుకుంటే జీవితం ప్రమాదంలో పడిపోతుంది. ఇలా ఒత్తిళ్ల కారణంగా ఎన్నో సమస్యలు పుట్టుకొస్తాయి. అందుకే, మనలోని ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే మనసు ప్రశాంతంగా ఉంటుంది. సరైన నిర్ణయాలు, సరైన ఆలోచనలు మెదడుకు తడతాయి. మరి ఒత్తిళ్లను తగ్గించుకోవాలంటే ఎలా? వాటికి కొన్ని మార్గాలు ఉన్నాయి.. అవేంటో తెలుసుకొని ఫాలో అయిపోండి..

వ్యాయామం అలవాటు చేసుకోండి

వ్యాయామం శారీరక ఆరోగ్యానికే కాదు.. మానసిక ఆరోగ్యానికి కూడా ఎంతో అవసరం. వ్యాయామం చేయడం వల్ల శరీరంలో ఎండొర్ఫిన్‌ విడుదలవుతుంది. ఇది మనలోని ఒత్తిడిని తగ్గించి సంతోషాన్ని కలిగిస్తుంది. శరీర భాగాలకు రక్త సరఫరా సక్రమంగా జరుగుతుంది. కానీ, కొంత మంది వ్యాయామం చేయడానికి బద్దకిస్తుంటారు. మొదట్లో కాస్త కష్టంగా అనిపించినా.. వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి. కొన్ని రోజులు చేస్తూపోతే అదే అలవాటుగా మారుతుంది. వ్యాయామం కుదరనప్పుడు నడక, సైక్లింగ్‌, యోగా చేయొచ్చు. అవీ కుదరకపోతే.. కాసేపు చక్కగా కూర్చొని శ్వాస తీసుకోని వదులుతూ ఉండండి. ధ్యానం చేయండి. ఇవి చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.


రోజుకు వీలైనంత ఎక్కువ నీరు తాగండి

బయటకు వెళ్లినప్పుడు, పనిలో పడి చాలా మంది నీరు తాగడం మర్చిపోతారు. దీని వల్ల శరీరం నిర్జలీకరణమై తొందరగా నీరసం వచ్చేస్తుంది. దీంతో ఒత్తిడి కూడా పెరుగుతుంది. అందుకే, రోజులో వీలైనంత ఎక్కువ నీరు తాగండి. నీరు తాగినప్పుడు శరీరానికి కొత్త ఉత్సాహం వస్తుంది. ఆఫీసులో పనిచేస్తున్నట్లయితే వాటర్‌ బాటిల్‌ మీకు కనబడేలా డెస్క్‌పై పెట్టుకోండి. పనిలో విరామం తీసుకున్న ప్రతిసారి నీరు తాగండి.


తీపికి దూరం

తీపి పదార్థాలు తినని వారు ఎవరుంటారు చెప్పండి. ప్రతి ఒక్కరు తీపి పదార్థాలను ఎంతో ఇష్టంగా తింటారు. కానీ, అతిగా తినడం వల్ల లావు అవడం, మధుమేహం, బీపీ, పంటి నొప్పులు వస్తాయి. అంతేకాదు ఒత్తిడి కూడా పెరుగుతుందట. తీపి పదార్థాల్లో ఉండే చక్కర మెదడులో రసాయనాలపై ప్రభావం చూపిస్తుంది. దీంతో ఆలోచనాశక్తి మందగించే అవకాశముంది. అందుకే, మీరు ఏదైనా పని ప్రారంభించే ముందు ఎక్కవ తీపి తినకుండా ఉండండి.


ఫోన్‌ని పక్కన పెట్టండి

ఈ కాలంలో మొబైల్‌ ఫోన్‌ లేకపోతే ఏమీ తోచదు. 24 గంటలు ఫోన్‌ పట్టుకొనే ఉంటుంటారు. అయితే, మొబైల్‌ ఫోన్‌లో ఉండే నీలికాంతి వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రుళ్లు గదిలో లైట్లు ఆఫ్‌ చేసి మొబైల్‌ వాడుతున్నప్పుడు ఆ నీలికాంతి ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. అందుకే ఉదయం పూట తప్పదు కాబట్టి మొబైల్‌ వాడినా.. రాత్రుళ్లు వీలైనంత వరకు ఫోన్‌ను దూరంగా పెట్టి తొందరగా నిద్రకు ఉపక్రమించండి. 


ప్రియమైన వారితో ఒక ఆలింగనం

ఒత్తిడికి గురైనప్పుడు మీ ప్రియమైన వ్యక్తుల వద్దకు వెళ్లి వారిని ఆలింగనం చేసుకోండి. వారితో కాసేపు ముచ్చటించండి. వారి స్పర్శ, మాట మీకెంతో మనశ్శాంతిని ఇస్తుంది. ఇష్టమైన వ్యక్తుల స్పర్శ తగిలినప్పుడు, ఆలింగనం చేసుకున్నప్పుడు శరీరంలో ఆక్సిటోసిన్‌ విడుదలవుతుంది. అది మనలోని ఒత్తిడిని తగ్గించి.. సంతోషాన్ని కలిగిస్తుంది.

వీటితోపాటు పౌష్టికాహారం తినడం, కంటికి సరిపడ నిద్రపోవడం, చెడు అలవాట్లకు దూరంగా ఉండటం, సానుకూల ఆలోచనలు చేయడం, కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం వంటివి చేయడం వల్ల కూడా ఒత్తిడి తగ్గుతుంది. మీరూ ఒత్తిడితో సతమతమవుతన్నట్లయితే.. పైన పేర్కొన్నట్లు ప్రయత్నించి చూడండి.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని